
సమైక్య ముసుగులో విభజనకు సీఎం సహకారం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాద ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మండిపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని, అసెంబ్లీని ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే వెంటనే రాష్ట్ర విభజన ఆగుతుందని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని గుర్నాథరెడ్డి విమర్శించారు.
కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గుర్నాథరెడ్డి నేతృత్వంలో అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో సోనియాగాంధీ దిష్టిబొమ్మను తోపుడుబండిపై పెట్టుకుని శవయాత్ర చేసి, అనంతరం ఆ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే క్లాక్ టవర్ వద్ద కూడా కొందరు సమైక్యవాదులు నిరసన తెలిపారు. టవర్ క్లాక్పై నల్లజెండా కప్పి ఎగరేశారు.