కర్నూలు, న్యూస్లైన్: రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జైలులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు జిల్లాలో జనం వెల్లువలా సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు మండలాల వారీగా రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు.ఆదోనిలో చంద్రకాంత్రెడ్డి, మధుసూధన్ ఖాద్రి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఆళ్లగడ్డలో బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
చాగలమర్రిలో నిజాముద్దీన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారు. శిరివెళ్ల మండలం వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో వెంకటాపురం వద్ద హైవే దిగ్బంధం చేపట్టారు. హాలహర్వి, దేవనకొండ మండలాల్లో అర్జున్, లుమాంబి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
బనగానపల్లెలో ఎర్రబోతుల వెంకటరెడ్డి, బేతంచెర్లలో డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయ కర్త ఐజయ్య ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్, సంజీవయ్య నగర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
మహానంది సమీపంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయకళాశాల ప్రాంగణంలో సోమవారం విద్యార్థినీ, విద్యార్థులు రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు.
పాణ్యం బస్టాండ్ సమీపంలో మండల వైఎస్ఆర్సీపీ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని గౌరు చరితారెడ్డి సందర్శించి మద్దతు ప్రకటించారు.
దీక్ష చేయడం భారతీయ పౌరునిగా జగన్ హక్కు డాక్టర్ బి. శంకరశర్మ, ఐఎంఏ
కర్నూలు శాఖ అధ్యక్షులు
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో నిరాహార దీక్ష చేయడం భారతీయ పౌరునిగా ఆయకున్న హక్కు. ఈ విషయం గురించి విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదు. ఆయనపై విమర్శలు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. ఆయన స్వప్రయోజనాలకు ఈ దీక్ష చేయడం లేదు. జగన్ దీక్షకు వైద్యులు సంఘీభావం తెలుపుతున్నారు.
జైలులో ఉన్నంత మాత్రాన దీక్ష చేయకూడదా..? డాక్టర్ బాలమద్దయ్య,
ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఆరోపణల వల్లే జైలులో ఉన్నారు. ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. ఆయన తన మనోభావాలను వ్యక్తపరిచేందుకు హక్కు ఉంది. ఆయన ఒక పార్టీకి అధినాయకుడు. ఆ బాధ్యతనూ ఆయన నిర్వర్తించాల్సి ఉంది. కాబట్టి సమైక్యాంద్ర కోసం ఆయన దీక్ష చేస్తున్నారు. దీనిని అందరూ స్వాగతించాలి.
జననేతకు సంఘీభావం
Published Tue, Aug 27 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement
Advertisement