
చిరంజీవికి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి: సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కలి్పంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆయన చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సినీ పరిశ్రమకు ఏది కావాలన్నా తానెప్పుడూ ముందుంటానని వైఎస్ జగన్ చెప్పారన్నారు. ఏది కావాలన్నా అడగడానికి ఏ మాత్రం సంకోచించవద్దని అన్నారన్నారు. ఆయన సహాయం చేసే గుణానికి తనకు చాలా సంతోషమేసిందన్నారు. కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. సైరాను త్వరలోనే తప్పకుండా చూస్తానని చెప్పారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీపై చిరంజీవి ఏమన్నారంటే..
ఆయనను అభినందించే అవకాశం సైరా ద్వారా కలిగింది
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను కలవాలనుకున్నాను. కానీ సైరా షూటింగ్ వల్ల కుదరలేదు. అందుకే ఇపుడు ‘సైరా’ సినిమా చూడాలని వ్యక్తిగతంగా ఆయన్ని ఆహా్వనిద్దాం అని అనుకున్నాను. ‘మీరు సతీసమేతంగా రావాలి, మధ్యాహ్నం మాతో కొంత సమయం గడపాలి’ అని వైఎస్ జగన్ కోరారు. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఐ ఫీల్ ఇట్స్ ఏ హానర్. ఎంతో ప్రేమతో, సోదర వాత్సల్యంతో వైఎస్ భారతి కూడా మమ్మల్ని ఆహ్వానించారు. కుటుంబ సభ్యుల మధ్య గడిపిన అనుభూతి కలిగింది. వారిద్దరికీ ప్రత్యేకించి అభినందనలు. నేను సీఎంను కోరింది ఏంటంటే.. రాయలసీమకు సంబంధించిన ప్రథమ స్వాతం త్య్ర సమరయోధుడి చరిత్ర పై రామ్చరణ్ ‘సైరా’ సినిమా తీశాడు. దానిని మీరు తప్పకుండా చూడాలి అని అడిగాను. ఆయన త్వరలోనే ఈ సినిమా చూస్తానని చెప్పారు.
సినీ పరిశ్రమకు వైఎస్ జగన్ సహాయ సహకారాలు కావాలి
ముఖ్యంగా సినిమా పరిశ్రమకు మీ సహాయ సహకారాలు, ప్రోత్సాహం కావాలి అని వైఎస్ జగన్ను కోరగానే సినీ పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతోమందికి ఆదరువు కావాలని, ఉపాధి కలి్పంచాలని ఆయన ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అలాగే సినీ పరిశ్రమకు ఏదైనా చేయాల్సి వస్తే తానెప్పుడూ ముందుంటానని, అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దని వైఎస్ జగన్ అన్నారు.
గత ప్రభుత్వం రెండేళ్లుగా నంది అవార్డులను ప్రకటిస్తున్నా వాటిని అందించలేదని ప్రస్తావించగా వెంటనే ఫంక్షన్ నిర్వహించేలా తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్ అన్నా కచి్చతంగా అందర్నీ కలుస్తాను. సమయం తీసుకొని ఏర్పాటు చేయండి’ అని వైఎస్ జగన్ చెప్పారు.
సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి భేటీ
►సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి దంపతులు
►గంటపాటు సాగిన ఆతీ్మయ కలయిక
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సినీనటుడు చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణి సురేఖతో కలిసి వచ్చిన చిరంజీవి ఉ.11.30 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పటమటలోని తన సోదరుడు పవన్కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉన్న తరువాత తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి కలిసి చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించారు.
చిరంజీవి పుష్పగుచ్ఛాన్ని ముఖ్యమంత్రి జగన్కు అందజేసి శాలువతో సత్కరించారు. సురేఖ తాను స్వయంగా వైఎస్ భారతికి చీరను బహూకరించారు. అనంతరం వైఎస్ జగన్ కూడా చిరంజీవికి శాలువ కప్పి వెండి వీణను జ్ఞాపికగా బహూకరించారు. ఆ తర్వాత సీఎం ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ అక్కడ ఉన్నారు. తరువాత జగన్ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు.