మున్సిపాలిటీలకు రూ.48 కోట్లు | Municipal Rs 48 crore | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలకు రూ.48 కోట్లు

Nov 29 2013 3:06 AM | Updated on Sep 2 2017 1:04 AM

రాయలసీమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్‌ఎఫ్‌సీ) నిధులు రూ.48 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ తెలిపారు.

మదనపల్లె, న్యూస్‌లైన్ :  రాయలసీమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్‌ఎఫ్‌సీ) నిధులు రూ.48 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ తెలిపారు. గురువారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం  స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌సీ నిధులతో మున్సిపాలిటీలకు విద్యుత్‌బిల్లులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇందులో ఒక్కో మునిసిపాలిటీకి రూ.60 లక్షల నుంచి రూ.రెండు కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. రీజనల్ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎస్సీ,ఎస్టీ కాలనీల అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 42 శాతం ఆస్తిపన్నులు వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి 90 శాతం పన్నులు వసూలు చేసేలా కమిషనర్లు, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు.

చెత్తపై కొత్త సమరం కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిపై జనవరి 28, 29, 30 తేదీల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని బాగా అమలు చేసిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ కమిషనర్ తులసీరామ్, డీఈ నీలకంఠనాయుడు, మేనేజర్ రాంబాబులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement