
కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం/విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగిపై బెదిరింపులకు దిగిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్టుకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు రంగం సిద్ధం చేశారు. మండల అభివృద్ధి అధికారి అల్తాడు దామోదరరావు ఫిర్యాదు మేరకు రవికుమార్పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 353, 427, 506 ప్రకారం మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, నందివాడ గోవిందరావు, పల్లి సురేశ్, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు, గుర్రాల చినబాబు, ఊడవల్లి రామకృష్ణ, అంబళ్ల రాంబాబు, బాన్న గురువులుపై కేసు పెట్టారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
కూన రవికుమార్ అరెస్ట్ చేయాలి: ఏపీఎన్జీవో
కూన రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలను ఏపీఎన్జీవో నేతలు ఖండించారు. టీడీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని చెట్టుకు కట్టేసి కొడతాననడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కూన రవి వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే కూన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. (చదవండి: చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు)