ఐదేళ్ల లోపు ఉండే ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఎం.జానకి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
నెల్లూరు(అర్బన్): ఐదేళ్ల లోపు ఉండే ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఎం.జానకి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. రెండో విడత పల్స్పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆమె నగరంలోని భక్తవత్సల్నగర్లో ఉన్న కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల్లో ప్రారంభించారు. పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్స్పోలియో కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలు కూడా తోడ్పాటు అందించాలని కోరారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం 0-5 ఏళ్ల లోపు పిల్లలు 3,29,304 మంది ఉన్నారన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 2,37,435 మంది, అర్బన్ పరిధిలో 91,869 మంది ఉన్నారని తెలిపారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకు రూరల్ ప్రాంతాల్లో 2554 బూత్లు, అర్బన్ పరిధిలో 488 బూత్లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ఏరియాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 88 మొబైల్ బూత్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం ఎలా జరుగుతోంది? ఏమైనా ఇబ్బందులున్నాయా ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ బొల్లినేని శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజు 92.73 శాతం నమోదు
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భారతీరెడ్డి నెల్లూరు, మనుబోలు, కోట తదితర ప్రాంతాల్లో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమాన్ని తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 92.73 పల్స్పోలియో శాతం నమోదైందని తెలిపారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించామన్నారు. కడప ఆర్డీ, జిల్లా పల్స్పోలియో పరిశీలకులు డాక్టర్ దశరథరామయ్య ఇరుకళల పరమేశ్వరి దేశస్థానం ప్రాంతంలో పోలియో చుక్కల కేంద్రాన్ని పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్బారావు నగరంలోని డీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, మెటర్నటీ, రేబాల చిన్న పిల్లల ఆసుపత్రుల్లో పల్స్పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు.