
సాక్షి, అమరావతి: లాక్డౌన్ను మే చివరి వరకు పొడిగించామని, ఈ నేపథ్యంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ ఏమన్నారంటే..
► జాతీయ రహదారుల వెంట వలస కూలీలు ఎవరూ నడిచి వెళ్లకుండా నివారించాలి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి.
► ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి.
► రాష్ట్ర, అంతర్రాష్ట్ర పరిధిలో వాహనాల రవాణాపై రాష్ట్రాలు ఆయా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలి.
► ప్రతిచోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి.
► రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలి.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.