రాష్ట్ర విభజనలో అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.. తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని,
వైఎస్సార్సీపీ సమర దీక్ష
Published Thu, Oct 3 2013 3:07 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనలో అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.. తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని చెబుతూ వైఎస్సార్సీపీ నాయకులు జిల్లాలో బుధవారం సమైక్య నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు నిరాహార దీక్షలతో సమైక్య వాణిని హోరెత్తిస్తున్నారు. ఈ దీక్షలకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు వివిధ వర్గాల నాయకులు, ప్రజలు మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, అభినందిస్తున్నారు. మొదటి రోజు జిల్లాలో 1247 మంది నేతలు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులోనే ఎంపీ పదవికి రాజీనామా చేశారని, ఆమరణ దీక్ష చేసి సమైక్య వాణి వినిపించారని పేర్కొన్నారు.
తమ పార్టీ విభజనకు వ్యతిరేకమని, రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పోరాటం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు విభజనను వ్యతిరేకిస్తూనే అధిష్టానం ఎదుట తమ వ్యతిరేకతను వ్యక్తం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.రాయదుర్గంలో.. స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు మద్దతుగా రాయదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట మండలాల కన్వీనర్లు మల్లికార్జున, ఆలూరు తిప్పన్న, శ్రీకాంత్రెడ్డి, అశ్వర్థరెడ్డి, పార్టీ నాయకులు పేర్ని బాలాజి, బొజ్జిరెడ్డి, కేశవరెడ్డి, పీఎస్ మహేష్, బోనబాగి శర్మ, అరుణ, అనూరాధ, కోఫియా రిలే దీక్షలు చేపట్టారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్, మహాత్మాగాంధీ, అంబేద్కర్, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హిందూపురంలో.. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈయనకు మద్దతుగా చిలమత్తూరు నాయకులు మగ్బూల్సాహెబ్, టేకలూరు సర్పంచ్ జబీఉల్లా, నాయకులు పీఎస్ వేణుగోపాల్రెడ్డి, దాదాపీర్, అమీర్ఖాన్, సయ్యద్ అన్వర్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్నారాయణ, సమన్వయకర్తలు చౌళురు రామకృష్ణారెడ్డి, ఇనయతుల్లా, నాయకులు డాక్టర్ మదన్మోహన్రెడ్డి, మండలాల కన్వీనర్లు అంజన్రెడ్డి,
రాజారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.అనంతపురంలో... స్థానిక సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ నాయకులు బోయ తిరుపాలు, చింతకుంట మధు, మారుతీ నాయుడు, కొర్రపాడు హుసేన్పీరా, వేమల నదీం, డాక్టర్ వైడి వర్మ 36 గంటల దీక్ష చేపట్టారు. మరో 40 మంది పార్టీ కార్యకర్తలు రిలే దీక్ష చేశారు. దీక్షకు ముందు ఎమ్మెల్యే అరవింద్నగర్లోని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో తెలుగుతల్లి, మహానేత వైఎస్, అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉరవకొండలో.. క్లాక్టవర్ సర్కిల్లో సీఈసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా ఉరవకొండ, బెళుగుప్ప, కూడేరు, విడపనకల్లు మండలాల కన్వీనర్లు సుంకన్న, రామాంజినేయులు, రామచంద్ర, హనుమంతు 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 750 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కదిరిలో.. స్థానిక మారుతీ సర్కిల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎస్ఎండీ ఇస్మాయిల్, మహమ్మద్ షాకీర్ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా పట్టణ, రూరల్ కన్వీనర్లు చాంద్బాషా, లోకేశ్వరెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడు సుధాకర్రెడ్డి, కేఎం సాలార్ బాషా, జేకే జాఫర్ఖాన్,
నూర్ మహమ్మద్, జిలాన్ బాషా 36 గంటల దీక్ష చేపట్టారు. అంతకుముందు పట్టణంలో పార్టీ శ్రేణులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. గుంతకల్లులో.. స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు 150 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు వెంకట్రామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలసి హనుమేష్ నగర్లోని పార్టీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. బుడగ జంగాల నాయకులు సంఘీభావం తెలిపి, జానపద గీతాలు పాడారు.
కళ్యాణదుర్గంలో.. స్థానిక గాంధీ సర్కిల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పేస్వామి 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కుందుర్పి మండలాల కన్వీనర్లు తిరుమల వెంకటేసులు, చెన్నమల్లప్ప, ఎస్కే అంజనేయులు, మరో 50 మంది 36 గంటల దీక్ష చేపట్టారు. అంతకు ముందు పార్టీ శ్రేణులతో కలసి తిప్పేస్వామి భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరికి ఉద్యోగ జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఓడీ చెరువులో.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువులో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, బయపురెడ్డి, తిప్పేపల్లి పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణరెడ్డి, ఓడీసీ సింగిల్విండో ఉపాధ్యక్షుడు మధుసూదన్నాయుడు, పార్టీ మైనార్టీ కన్వీనర్ వెల్డింగ్ బాషా, జేకేపల్లి సర్పంచ్ రాజప్ప,
నాయకుడు బయప్పరెడ్డి 36 గంటల దీక్ష చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్రెడ్డి రిలే దీక్ష చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో.. స్థానిక వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీకి చెందిన 23 మంది కార్యకర్తలు రిలే దీక్ష చేశారు. దీక్షకు సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్య, కళ్యాణదుర్గం నియోజకవవర్గ సమన్వయకర్త ఎల్ఎం మోహన్రెడ్డి సంఘీభావం తెలిపారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
పెనుకొండలో.. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ 30 గంటల దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీ నాయకులు దాదూ, సరస్వతమ్మ, సుశీలమ్మ, మల్లిక, గజేంద్ర, గోవిందు, అమీర్ 30 గంటల దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్నారాయణ సంఘీభావం తెలిపారు. శింగనమలలో.. స్థానిక రామాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నల గడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి 36 గంటల దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీ నాయకులు 23 మంది 36 గంటల దీక్ష చేపట్టారు. అంతకుముందు శింగనమలలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మవరంలో.. స్థానిక కాలేజీ సర్కిల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు సుమారు 35 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మడకశిరలో.. వైఎస్సార్ సర్కిల్లో పార్టీ నాయకులు వైటీ ప్రభాకర్రెడ్డి, వైటీ గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు, మండల కన్వీనర్లు రిలే దీక్ష చేశారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Advertisement
Advertisement