samai kayandhara
-
చివరి 5 గంటలు...సమైక్యాంధ్ర సీఎస్గా కృష్ణారావు
ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలు స్వీకరణ నేడు ఆంధ్రప్రదేశ్ సీఎస్గా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జె.వి.రాముడు నియామకం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బయ్యారపు ప్రసాదరావు హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సీ బ్లాకులో పదవీ విరమణ చేయనున్న సీఎస్ మహంతి నుంచి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్గా కొనసాగిరికార్డు సృష్టించినట్లైంది. ఒక రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్గా పనిచేసిన చరిత్ర ఇప్పటివరకూ ఎక్కడా లేదు. 1979 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు సీసీఎల్ఏ కమిషనర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహంతి ఆదివారం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటంతో.. కృష్ణారావుకు సమైక్యాంధ్రప్రదేశ్ సీఎస్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావును నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారమే మరో ఉత్తర్వును జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఐ.వై.ఆర్.కృష్ణారావు నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన సీఎస్గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు నెలల కిందటే సీఎస్ కావాల్సింది... సీఎస్గా మహంతి పదవీ కాలం మూడు నెలల కిందటే ముగిసింది. అప్పుడే కృష్ణారావు సీఎస్ అవుతారని అందరూ భావించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలనాపరమైన కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం మహంతినే మరో నాలుగు నెలలు సీఎస్గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడే కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహంతి ఈ నెలాఖరు వరకు సీఎస్గా కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో నెల రోజుల ముందుగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. దీంతో కృష్ణారావుకు రాష్ట్రం విడిపోవటానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్రప్రదేశ్కు సీఎస్గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా రాముడు రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1981 బ్యాచ్కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా ఉన్న డాక్టర్ బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి టి.పి.దాస్ను ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డెరైక్టర్ జనరల్గా, ఆర్.పి.ఠాకూర్ను ఆ విభాగం అదనపు డెరైక్టర్ జనరల్గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ ప్రసాదరావుకు విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. సాధారణంగా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కొత్తగా ఆ పోస్టులోకి వచ్చిన వారికి లేదా మరో డీజీ స్థాయి/అదనపు డీజీ స్థాయి వారికి అప్పగించి రిలీవ్ అవుతుంటారు. ప్రసాదరావు విషయం దీనికి పూర్తి భిన్నంగా ఉండనుంది. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డీజీపీ కావడంతో ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తాత్కాలిక డీజీపీలుగా నియమితులైన జె.వి.రాముడు, అనురాగ్ శర్మలకు బాధ్యతలు అప్పగించనున్నారు. పోలీసు విభాగంలో హెచ్ఓడీలుగా (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) వ్యవహరించే వారంతా ఈ రకంగానే బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. ఐదుగురు ఐపీఎస్ల డెప్యుటేషన్ పొడిగింపు రాష్ట్రంలో డెప్యుటేషన్పై పని చేస్తున్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న జె.అజయ్కుమార్ (1997), డి.కల్పననాయక్ (1998), మహేందర్కుమార్రాథోడ్ (2001), ఎస్.గోపాల్రెడ్డి (1985), బి.బాలనాగదేవి (1995) డెప్యుటేషన్ కాలం ముగుస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. -
నేడు జిల్లా బంద్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ దూకుడుకు నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక గురువారం బంద్కు పిలుపునిచ్చింది. విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. బంద్ను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలన్నీ బంద్లో భాగంగా మూతపడనున్నాయన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా చేపడుతున్న బంద్కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం తిరుగనివ్వబోమన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. -
సమైక్యవాదుల కన్నెర్ర
వైవీయూ, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే ఏపీఎన్జీఓలు సమ్మెబాట పట్టడంతో పలు చోట్ల కార్యాలయాలు మూతపడ్డాయి. కడప నగరంలోని ఎన్జీఓల ఆధ్వర్యంలో ఇర్కాన్సర్కిల్లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించి రహదారిపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ర్టపతి వ్యతి రేకించకుండా పార్లమెంట్క పంపడం దారుణమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలా గే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కడప డిపో ఆవరణంలో ధర్నా చేపట్టారు. రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం మాట్లాడుతూ అవసరమైతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజంపేటలో తెలంగాణ లాయర్లు జయప్రకాష్నారాయణపై ఏపీభవన్లో వ్యవహరించిన తీరుపై రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్కుమార్ ఆధ్వర్యంలో మెయిన్రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బైపాస్రోడ్డులో ఎన్జీఓలు రహదారి దిగ్బంధన కార్యక్రమం కొనసాగించారు. ప్రొద్దుటూరులో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పుట్టపర్తి సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో అరవింద్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహిం చారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దముడియం మండలం కాండపాంపల్లె గ్రామస్థులు దీక్షలో బైఠాయించారు. వీరికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో సైతం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో సమావేశం నిర్వహిం చి ఉద్యమానికి సంఘీభావంగా తాము సైతం ఉద్యమబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నేడు జిల్లా బంద్కు పిలుపు.. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు వివిధ రాజ కీయ పార్టీలు ప్రకటించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యచరణను గురువారం సమావేశంలో ప్రకటించనున్నట్లు లాయర్ల జేఏసీ అధ్యక్షుడు రాజేష్కుమార్రెడ్డి తెలిపారు. నేడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కడప కార్పొరేషన్, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రబుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ బంద్లో పాల్గొనాలని కోరారు. ప్రజల మనోభావాలు పట్టవా..! వైవీయూ: ఆంధ్రుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి తగదని ఏపీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం నగర శివారులోని ఇర్కాన్సర్కిల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. వీరికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీఓ నాయకులు గోపాల్రెడ్డి, చిన్నయ్య, రమేష్, చంద్రశేఖరరెడ్డి, జేఏసీ నాయకులు అమీర్బాబు, పీరయ్య, జోగిరామిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దద్దమ్మలు వీళ్లు
సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దద్దమ్మలుగా మారిపోయారని ఏపీ ఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఫొటోలున్న ఫ్లెక్సీలను శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సోనియాగాంధీతో పాటు మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, చిందంబరం, షిండే, జైరాం రమేష్ తదితరుల ఫొటోలు కల్గిన ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. విభజనను అడ్డుకునేందుకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఉద్యోగులు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసేందుకు జాక్టో ముందుకు వచ్చి కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై చర్చించాయి. ఆదివారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చే సేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా 9వ తే దీన నల్ల బ్యాడ్జీలతో నిరసన, 10వ తేదీ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ర్యాలీలు, 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో జాక్టో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరోసారి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలగకుండా, ఉద్యమ తీవ్రత తగ్గకుండా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆందోళనలో భాగంగా మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయంలో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చే శారు. జీతాలు రాకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఉద్యోగులు రెండు నెలలకుపైగా ఉద్యమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని విమర్శించారు. హిందూపురంలో ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్జీఓలు విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను తగులబెట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. మడకశిర , పెనుకొండ, గోరంట్లలో ఆందోళనలు చేపట్టారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ 160వ రోజూ దీక్ష కొనసాగించారు. -
నేటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యశంఖారావం
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్మోహన్రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు. రాత్రి గూడూరులో బస చేస్తారు. రెండోరోజు యాత్ర వివరాలు శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు. -
రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఈ మూడు రోజులూ పల్లెలు సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. కొలువుల కోసం పల్లెలు విడిచి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెలోగిళ్లలో చేరిపోతారు. రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి అంటూ సంక్రాంతిని స్వాగతించాల్సిన పల్లెల్లో ప్రస్తుతం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఏరోజుకారోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. చాలీ చాలని వేతనాలు.. కరువు.. కాటకాలు.. ఇలా రకరకాల కారణాలతో నేడు పల్లెసీమలు సంక్రాంతి శోభను సంతరించుకోలేకపోతున్నాయి. అయినా ఉన్నంతలో తృప్తిగా.. సంతోషంగా జరుపుకునేందుకు కొందరు సిద్ధమవుతుంటే.. మరికొందరు ఏం పండగో ఏమో అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకల తీరుతెన్నులపై న్యూస్లైన్ ప్రత్యేక కథనం. కడప కల్చరల్, న్యూస్లైన్ : సంక్రాంతిని తెలుగునాట పెద్ద పండుగగా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. పండుగ అంటే ఎవరికైనా సంతోషమే. అందులోనూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఆశించినమేరకు పండుగ సందడి కనిపించడం లేదు. అకాల వర్షాలతో అందివచ్చిన పంటలు దెబ్బతిని రైతు దిగాలుగా ఉన్నాడు. ధరలు చుక్కలను చూపుతున్నాయి. వ్యాపారుల పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా దెబ్బతినడంతో ఆ వర్గాల్లో సైతం నిరాశ నెలకొని ఉంది. పెరిగిన ధరల స్థాయిలో జీతాలు పెరగక ఉద్యోగుల పరిస్థితి కటకటగానే ఉంది. అయినా తప్పదు : ధరల బరువుతో ఎగువ మధ్యతరగతి స్థాయి ప్రజల్లో కూడా పండుగ ఉత్సాహం కనిపించడం లేదు. అయినా పిల్లల ఉత్సాహంపై నీళ్లు చల్లలేక, నలుగురిలో చిన్నతనంగా ఉంటుందని భావించి అప్పోసప్పో చేసైనా ప్రజలు పండుగకు సిద్ధమయ్యారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో ఉంటున్న జిల్లా వాసులు ఆదివారానికే స్వగ్రామాలకు చేరారు. ప్రైవేటు బస్సుల సంఖ్య బాగా తగ్గడంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇన్స్టంట్ పేడరంగు సంక్రాంతి అంటేనే ఇంటి ముంగిళ్లను శుభ్రపరిచి కల్లాపి (పేడ) చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను లక్ష్మిదేవికి ప్రతిరూపమని చెబుతారు. అందుకే శుభప్రదంగా పండుగల సమయంలో సిరిని ఆహ్వానించేందుకు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఆవు పేడ దొరకడమే కష్టంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇన్స్టంట్ పేడ రంగు అందుబాటులోకి వచ్చింది. ప్యాకెట్ ఖరీదు రూ.5. దీనిని నీటిలో కలిపి నేలపై చల్లితే అచ్చం కల్లాపి చల్లినట్లుగా ఉంటుందని విక్రయదారులు చెబుతున్నారు. ఈ రంగును కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. - న్యూస్లైన్, సింహాద్రిపురం పల్లెకు పోదాం. చలో చలో సంక్రాంతి సెలవులొచ్చాయి. ఊరికెళ్లాలి. అంతే.. అది బస్సయితేనేం.. ఆటో అయితేనేం.. అంటూ పట్నం నుంచి పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ పాటికే ఊర్లకు చేరుకున్నారు. మిగిలిన వారు కూడా భోగి పండుగ నాటికంతా ఇంట్లో ఉండాలని ఏ వాహనం దొరికితే దాన్ని పట్టుకుని ఇలా చాపాడు మండల కేంద్రం నుంచి గ్రామాలకు పయనమయ్యారు. - చాపాడు, న్యూస్లైన్ పిండి వంటలకు ప్రిపరేషన్ సంక్రాంతి అంటూనే నోరూరించే పిండి వంటలే గుర్తుకొస్తాయి. ఒకప్పుడైతే బియ్యాన్ని రోటిలో పోసి దంచి పిండి వంటలకు వాడేవారు. క్రమక్రమంగా రోళ్లు మాయం కావడంతో ఇప్పుడంతా పిండి మిషన్లపై ఆధారపడుతున్నారు. రాయచోటిలో ఆదివారం ఇలా ఓ పిండి మిషన్ వద్ద మహిళలు తమ టిఫిన్ బాక్సులను ఇలా వరుసగా పెట్టారు. పిండి మిషన్ యజమానులకు ఇప్పుడు పండగే పండగ. - న్యూస్లైన్, రాయచోటిటౌన్ సకల భోగాల భోగి.. సకల భోగాలతో ప్రజలు సంతోషంగా ఉండే కాలాన్ని భోగిగా పిలుచుకుంటారు. భోగి పండుగ రోజు భోగి మంటలు కాలుస్తారు. అందులో పాత పనికిరాని వస్తువులు వేసి చెడు తొలగి మంచి చేకూరాలని వేడుకుంటారు. ఇదేరోజు పిల్లలకు భోగి పండ్లు కోస్తారు. ఇలా చేయడం ద్వారా ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం. పతంగుల సందడి.. సంక్రాంతి వేడుకల్లో పతంగుల సందడి మరువలేనిది. చిన్నా, పెద్దా తారతమ్య భేదం లేకుండా గాలి పటాలను ఎగురవేస్తారు. సంక్రాంతి వేడుకల్లో బాహ్యంగా కనిపించే సంబరాలకు ప్రతీకగా గాలిపటాలు నిలుస్తాయి. పండగకు వారం రోజు ల ముందు నుంచే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ప్రధానంగా చిన్న పిల్లలు గాలిపటాల ఎగురవేతతో ఈ పండుగ రాకను తెలియజేస్తుంది. లక్ష్మీదేవికి ఆహ్వానం.. సంక్రాంతి పండుగకు, రైతుకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఏ పండుగకు ఇంట్లో చేరకపోయినా సంక్రాంతికి మాత్రం పంటలు చేతికంది ధాన్యరాసులు కళకళలాడుతుంటాయి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట ఇంటికి చేరిన తర్వాత చూసి రైతు కళ్లల్లో ఆనందం పొంగిప్రవహిస్తుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా రైతు కుటుంబం సంక్రాంతి రోజు ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఇంటి ముందు పెట్టి భూమాత రుణం తీర్చుకుంటుంది. ఆ రూపేణా ధాన్యలక్ష్మీ, పుష్పలక్ష్మీలను ఇంటిలోకి ఆహ్వానిస్తారు. రైతుల పండుగ కనుమ.. సంక్రాంతి మరునాడు రోజును కనుమ అంటారు. కనుమ రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రైతులందరికీ చేతినిండా పనిఉంటుంది. అందుకే కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేస్తారు. కల్లాపి చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. అందులో గొబ్బెమ్మలను పెడుతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులు, వ్యవసాయంలో తమకెంతగానో ఉపయోగపడే ఎడ్లను శుభ్రంగా కడుగుతారు. పశులకు దిష్టి తీసి గుమ్మడికాయ పగులగొట్టి గజ్జెలు, పట్టెడలు, పూలదండలు వేసి చక్కగా అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. పొంగళి, పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో చల్లుతారు. గంగిరెద్దుల విన్యాసాలు.. సంక్రాంతి వేడుక ఆరంభమైందంటే చాలు గంగిరెద్దు ఆటలు మొదలవుతా యి. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు... ఇంటిళ్లిపాదిని సల్లంగ చూడు అంటూ డూడూ బసవన్నలను ఆడిస్తా రు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రా లను ఎద్దులకు అలంకరించి గంగిరెద్దులను తయారు చేస్తారు. నేలపై పడుకొని గంగిరెద్దును ఆమాంతం పైకి ఎక్కించుకోవడం, గంగిరెద్దు నోట్లో తలపెట్టడం వంటి విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. రై తులు ఆనందంగా తోచిన రీతిలో గంగి రెద్దుల వారికి సమర్పించుకుంటారు. ఎద్దుల శ్రమను రైతుకు గుర్తు చేయడానికి పండుగ రోజు గంగిరెద్దులను ఇళ్లముందుకు తీసుకొస్తారు. డూడూ బసవన్నా.. ఎన్నాళ్లకొచ్చావయ్యా! గ్రామాలలో సంక్రాంతి సందడి మొదలైందంటే చాలు రకరకాల వేషధారణలో భిక్షగాళ్లు వస్తుంటారు. ఇలాంటి వారిలో డూడూ బసవన్నలు ఒకరు. వీరు ఏడాదిలో రెండు మూడు సార్లుగా గ్రామాలలో పర్యటించి గంగిరెద్దులను ఆటాడించి వినోదాన్ని పంచి గ్రామీణులు ఇచ్చే చిరుకానులన తీసుకెళుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ మొదలు కాగానే డూడూబసవన్నలు వచ్చేశారు. రాత్రివేళల్లో రాముడు - సీత పేర్లతో శ్రీరామచంద్రుడి కథను నాటక రూపంలో ప్రదర్శించి పురాణాలు గుర్తుకుతెస్తున్నారు. వీరిని చూసిన గ్రామీణులు అరే డూడూ బసవన్నా ఎన్నాళ్లకు వచ్చావు.. అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. - న్యూస్లైన్, సంబేపల్లె ‘పుంజు’కోనున్న పందేలు సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో మొదలైంది. పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సత్తా ఉన్న కోడిపుంజులను వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్ద కోళ్లు సమరానికి సై అంటూ రె‘ఢీ’గా ఉన్నాయి. - న్యూస్లైన్, చిన్నమండెం కొత్త కళ వచ్చేసింది గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించు కొంది. మహిళలు కొత్త ఉత్సాహంతో లోగిళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఇళ్లముందు అందమైన ముగ్గులు వేస్తున్నారు. గాజులు విక్రయించే మహిళలు పల్లెల్లో దర్శనమిస్తున్నారు. చేతులకు మట్టి గాజులు తొడిగించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. వచ్చేసింది సంక్రాంతి అంటూ ఆనందంగా గడుపుతున్నారు. - న్యూస్లైన్, దువ్వూరు పెద్ద పండుగ చిన్నబోయింది.. అతివృష్టి, అనావృష్టితో పైరు ఎత్తిపోయింది.. ధాన్యం లేక గాదె బావురుమంటోంది.. రైతన్నకు తిండిగింజల దిగులు పట్టుకుంది.. కిటకిటలాడాల్సిన దుకాణాలు వెలవెలబోయాయి.. వ్యాపారం లేక వర్తకులు దివాలా తీశారు.. ఉద్యోగులకు ‘సమైక్య’ ఉద్యమం నిరాశను మిగిల్చింది.. వేతనాలందక అడ్వాన్సులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కర్మాగారాలు నడవ లేదు.. కార్యాలయాలు పనిచేయ లేదు.. పనుల్లేక కార్మికుల పరిస్థితి అప్పుచేసి పప్పుకూడు తిన్నట్టైంది... సగటు మనిషిలో సంతోషం ఆవిరైంది. కొత్త బట్టలు.. పిండి వంటల మాటే లేదు.. గంగిరెద్దులు.. డూడూ బసవన్నల సందడీ లేదు... కొత్త అల్లుళ్ల జాడ లేదు.. పండుగ పూట ‘పెద్ద’ సందడి లేదు.. బక్కచిక్కిన బడుగుజీవి సంక్రాంతి లక్ష్మిని పిలువ లేక పిలుపు లేక పెద్ద పండుగ చిన్నబోయింది.. -న్యూస్లైన్, కమలాపురం పండుగ చేసు‘కొన’లేం పులివెందులలో ఆదివారం సంక్రాంతి పండుగ సందడి కనిపించలేదు. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి. పూలు అమ్ముడుపోక నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మూర రూ.30లు అమ్మాల్సిన పూలు రూ.10లకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. వస్త్ర, రంగు పొడుల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. -న్యూస్లైన్, పులివెందుల టౌన్ -
సమైక్యంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ముత్తుకూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య దీవెనయాత్రలో భాగంగా శుక్రవారం ముత్తుకూరులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త దళితవాడ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంటే విభజన నిర్ణయంపై రాష్ట్రపతి పునరాలోచించేవారని కాకాణి అభిప్రాయపడ్డారు. తీర్మానం చేయకుండా, ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం ద్వారా సమైక్యవాదానికి తూట్లు పొడిచారన్నారు. తీర్మానానికి పట్టుబట్టిన వైఎస్సార్సీపీ శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరించడంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు బయటపడిందన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, బలవంతంగా వ్యానులో తరలించడం వెనుక ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ ఉదంతం ద్వారా సమైక్యంపై ముఖ్యమంత్రి కిరణ్రెడ్డి డ్రామాలాడుతున్న విషయం స్పష్టమైపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాదం బట్టబయలయిందన్నారు. మొహం చూపని ఎమ్మెల్యే ఆదాల ఓట్లేసిన ప్రజలకు మొహం చూపని ఎమ్మెల్యేల్లో ఆదాల ప్రభాకరరెడ్డి ప్రముఖులని కాకాణి ఎద్దేవా చేశారు. పనుల కోసం ఎవరైనా వెళ్లి అడిగితే ‘నేనిచ్చిన నోటు, మీరేసిన ఓటుకు చెల్లు’ అంటూ హేళన చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్దనరెడ్డి, నాయకులు దాసరి భాస్కర్గౌడ్, దువ్వూరు విజయభాస్కర్రెడ్డి, మారు సుధాకర్రెడ్డి, నంగా చెంగారెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, సర్పంచ్ పల్లంరెడ్డి జనార్దనరెడ్డి, దువ్వూరు గోపాలరెడ్డి, సన్నారెడ్డి రమణారెడ్డి, కారంచేటి ప్రసాద్శర్మ, సుమంత్రెడ్డి, జవహర్, టీ రాజ పాల్గొన్నారు. -
సమైక్య దీక్షలు
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పది నియోజకవర్గాల సమన్వయకర్త ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహరదీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలకు దిగారు. ఈ దీక్షలకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిలేదీక్షలు కొనసాగనున్నాయి. వెంకటగిరిలో వెఎస్సార్సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీభవానీ సెంటర్లో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు స్థానిక బస్టాండు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మండల కన్వీనర్ పెద్దమల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూ ళ్లూరుపేట బస్టాండు సెంటర్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. -
‘ఇండియాటుడే’ తీయబోతున్నా
ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సూళ్లూరుపేట, న్యూస్లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాల నేపథ్యంలో నేతల స్వార్థ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు జయం మూవీస్ పతాకంపై ‘ఇండియాటుడే’ సినిమా తీయనున్నట్టు ప్రముఖ నిర్మాత, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలి పారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సూళ్లూరుపేటలో చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 500 మందికి జగదీశ్వరరెడ్డి అన్నదానం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనది సొంత జిల్లా నెల్లూరే అన్నారు. సొంత బ్యానర్పై స్వీయ దర్శకత్వలో ఇండియాటుడే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి చెప్పారు. ఇందులో అందరూ కొత్త నటులే నటిస్తారన్నారు. అన్యాయాన్ని ఎదిరించే జర్నలిస్టు పాత్రను సినిమాలో ప్రధానంగా చిత్రీకరించనున్నట్టు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇది వరకు జయం, నిజం, జై, అందరం, కేక సినిమాలతో పాటు ఎన్నో ఇంగ్లిష్ సినిమాలను డబ్బింగ్ చేసినట్టు కేతిరెడ్డి తెలిపారు. గత ఏడాది శ్రీలంకలో తమిళులు పడుతున్న బాధల ఇతివృత్తంగా తీసిన ‘రావణదేశం’ సినిమాను తమిళ రాజకీయ నేతలు వైగో, విజయ్కాంత్ లాంటి వారు చూసి తాము చేయలేని పనిని తెలుగువాడివైన నీవు చేశావని తనను ప్రశంసించారన్నారు. రాజకీయ జీవితంలో గత 35 ఏళ్లుగా మహానేత వైఎస్సార్ అభిమానినన్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానిగా ఉంటున్నానని చెప్పారు. ఇండియాటుడే సినిమాను వీలైనంత త్వరలో ప్రారంభించి దక్షిణాదిలో అన్ని భాషల్లో విడుదల చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్ పాల్గొన్నారు. -
ఉద్యమ దండు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్య మం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమ దండులా ముందుకు కదిలి సమైక్యవాణి వినిపించాయి. అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు భారీ ఎత్తున సాగాయి. పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బుజబుజనెల్లూరులో ర్యాలీ చేశారు. గూ డూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీ వయ్య సూళ్లూరుపేటలో ర్యాలీ నిర్వహించారు. కావలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్రెడ్డి మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు, తిరిగి మర్రిపాడు వ రకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరిలో ర్యాలీ జరిగింది. -
కడపలో క్రీడా సందడి
కడప స్పోర్ట్స్, న్యూస్లైన్ : కడప గడపలో ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత అక్టోబర్లో నిర్వహించాల్సిన ఈ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టోర్నమెంట్ నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దీంతో మరో 30 రోజుల్లో జిల్లాలో క్రీడాసందడి నెలకొననుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి శనివారం కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంను సందర్శించారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులను సూచించారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు టోర్నమెంట్ నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వివరించారు. దాదాపు 700 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యే ఈ టోర్నమెంట్కు ఏర్పాట్లను చక్కగా చేయాలని చెప్పారు. అనంతరం అక్కడే బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చిన ఎస్పీ జి.వి.జి. అశోక్కుమార్, డీఎస్డీఓ బాషామొహిద్దీన్లను కలిసి టోర్నమెంట్పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి జిలానీబాషా, కోశాధికారి నాగరాజు, సభ్యులు మారుతీమోహన్రెడ్డి, రెడ్డిప్రసాద్, మునికుమార్రెడ్డి, రవిశంకర్రెడ్డి, సుదర్శన్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీల సంపూర్ణ సహకారం.. జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు సహకరించాలని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జి.వి.జి. అశోక్కుమార్, ఏజేసీ సుదర్శన్రెడ్డిలను వేర్వేరుగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ కడపలో నిర్వహించే టోర్నమెంట్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
సమైక్యోద్యమం
ఓట్లు, సీట్లు.. అధికారమే పరమావధిగా రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు జూలై 30న విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో పురుడుపోసుక్ను సమైక్య ఉద్యమం తమ మనోభిప్రాయాలను ‘అధికారం’ కోసం తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టీడీపీలను చీదరించుకుంటోన్న జనం మనోభీష్టాల మేరకు సమైక్యాంధ్ర ఉద్యమ బావుటా ఎగరవేసిన వైఎస్సార్సీపీకీ జైకొడుతున్న ప్రజాసైన్యం విశాలాంధ్ర ప్రజారాజ్యమన్న సీపీఐ విభజనకు జైకొట్టిన వైనం.. సమైక్యాంధ్రకే కట్టుబడిన సీపీఎం తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీసేందుకు సిద్ధమైన కమలనాథులపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం జనంతిరగబడటంతో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రణాళికపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్,టీడీపీ అగ్రనేతలు 2013లో ‘అనంత’ రాజకీయ ప్రస్థానం ఇదీ..! సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభిప్రాయాలను గౌరవించని రాజకీయపార్టీలకు మనుగడ ఉండదన్నది చరిత్ర చెబుతోన్న సత్యం. రాష్ట్ర విభజన ప్రక్రియలో అది మరో సారి నిరూపితమైంది. ఓట్లు, సీట్లే ప్రాతిపదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేశాయి. అధికారం కోసం ప్రజల మనోభిప్రాయాలను తాకట్టు పెట్టాయి. తమ మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్, టీడీపీలను జనం చీదరించుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ‘అనంత’లో పురుడుపోసుకున్న ‘సమైక్య’ ఉద్యమం సీమాంధ్రకు దావానలంలా వ్యాపించి.. మహోద్యమంగా రూపాంతరం చెందింది. ప్రజల మనోభీష్టాల మేరకు సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వెంట ‘అనంత’ జనం కదంతొక్కుతున్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమన్న నినాదాన్ని ఆరు దశాబ్దాలపాటు ప్రతిధ్వనింపజేసిన సీపీఐ ప్లేటు ఫిరాయించి.. వేర్పాటువాదం ఎత్తుకుంది. ప్రజల మనోభిప్రాయాల మేరకు సీపీఎం సమైక్యాంధ్రకే కట్టుబడింది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసేందుకు సహకరిస్తామంటోన్న కమలనాథులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ‘అనంత’ రాజకీయాలను 2013 ఓ కుదుపు కుదిపేసింది. ఏడాది ఆరంభంలోనే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 30, ఫిబ్రవరి 4న రెండు విడతలుగా నిర్వహించిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని రాజకీయశక్తిగా వైఎస్సార్సీపీ అవతరించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ(డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురువేస్తుందనే సాకుతో ఫిబ్రవరి 17న జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయించింది. అధికారం కోసం సహకార వ్యవస్థను నీరుగార్చుతోంది. పంచాయతీల్లోనూ కుమ్మక్కు పర్వం సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి రచించిన ప్రణాళికను రైతులు ఛీ కొట్టారు. అయినా.. ఆ రెండు పార్టీలు తీరు మార్చుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే సూత్రాన్ని అమలుచేశాయి. జూలై 23, 27, 30 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్కు పోటీగా అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించలేదు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ కూడా అభ్యర్థులను పోటీకి దించకుండా ముందస్తుగా కుదుర్చుకున్న అవగాహనను అమలుచేశాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులను చావుదెబ్బతీయాలన్న కుట్రను ప్రజలు చీదరించుకున్నారు. సింహభాగం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారు. ప్రజాభిమానంతో వైఎస్సార్సీపీ కదం తొక్కుతుండటంతో కాంగ్రెస్, టీడీపీలు వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక రచించాయి. ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారు. విశాలాంధ్రలోనే ప్రజారాజ్యమన్న నినాదంతో ఆరు దశాబ్దాలపాటూ నడచిన సీపీఐ వేర్పాటువాదంతో జతకట్టింది. సీపీఎం మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడింది. సీట్లే లక్ష్యంగా కమలనాథులు తెలుగుజాతిని రెండు మక్కలు చేయడానికి సహకరిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగా కాంగ్రెస్ ఏపీ విభజనకు కుట్ర పన్నింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంలోని యూపీఏ పక్షాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ జూలై 30న తీర్మానం చేశాయి. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర సమైక్య ఉద్యమంతో రాజకీయ మనుగడ ఉండదని కాంగ్రె స్, టీడీపీ నేతలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విడదీసి.. తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా బలంగా ముందుకు తెచ్చారు. సమైక్య ఉద్యమంలో ముసుగువీరుడైన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెరచాటుగా జేసీతో చేతులు కలిపి.. రాయలతెలంగానం చేశారు. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రపై ‘అనంత’ ప్రజానీకం తిరగబడ్డారు. ప్రజాసైన్యం తిరగబడటంతో రాయలతెలంగానం ప్రతిపాదనను పక్కనపెట్టారు. ‘రాయల తెలంగాణపై నన్ను ముందుకు తోసి.. ఆ తర్వాత అంతా తప్పుకున్నారు’ అంటూ జేసీ దివాకర్రెడ్డి ఇటీవల ప్రకటించడమే అందుకు తార్కాణం. ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానలంలా వ్యాపించింది. సమైక్య ఉద్యమంలో సీమాంధ్రకు ‘అనంత’ మార్గనిర్దేశనం చేసింది. వేర్పాటువాదం చేసిన టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ అడ్టుకుంటూ ఛీకొట్టారు. ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సెప్టెంబరు 4న సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కదిరి, హిందూపురం, అనంతపురంలో నిర్వహించిన సభలకు జనం భారీ ఎత్తున హాజరై, మద్దతు ప్రకటించారు. విభజన తీర్మానానికి నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సారి.. టీనోట్పై కేంద్ర మండలి ఆమోదముద్ర వేయడానికి నిరసనగా మరొక సారి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో అక్టోబరు 26న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ హైదరాబాద్లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు ‘అనంత’ ప్రజానీకం భారీ ఎత్తున తరలివెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలుగుతారని జనం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ రెండు పార్టీల నేతలు జంకుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం. -
చివరి వరకు పోరాటం
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్బాబు తెలిపారు. గడపగడపన సమైక్య నినాదం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సురేష్బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్కాంగ్రెస్పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు. వైఎస్ కృషి వల్ల జిల్లాకు ఎంతో మేలు జరిగిందన్నారు. జైలులో సైతం సమైక్యాంధ్ర కోసం దీక్ష చేసిన ఘనత జగన్దేనని తెలిపారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ర్టం కోసం ఎక్కడా లేని విధంగా నాలుగు నెలలుగా ప్రొద్దుటూరులో దీక్షలు చేపడుతున్నారన్నారు. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని, రైతులకు సాగు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతుందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తెలుగుజాతిని నిలువునా చీల్చే ప్రయత్నాన్ని సోనియా గాంధీ చేస్తున్నారన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్మోహన్రెడ్డి దేశమంతా తిరిగి శ్రమిస్తున్నారన్నారు. తెలుగు సంస్కృతిపై ఏమాత్రం అవగాహన లేని ఇటలీ మహిళ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిచెందాలంటే హైదరాబాద్పై వచ్చే పన్నులే ఆధారమని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు, తెలంగాణాలో మరో 30 శాతం సీట్లను వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం ఉందన్నారు. డబ్బు ఇచ్చి రాజ్యసభ సీటును కొనుక్కున్న సీఎం రమేష్నాయుడుకు జగన్ను విమర్శించే హక్కు లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవ్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం పదవి కోసం కక్కుర్తి పడుతున్న కిరణ్కుమార్రెడ్డి, రాజకీయ అవకాశవాది చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ద్వారా రాష్ట్ర విభజనను సులువుగా ఆపవచ్చన్నారు. కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్ బాషా మాట్లాడుతూ తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై సమైక్యాంధ్ర అనకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఈవీ సుధాకర్రెడ్డి, పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గోపికృష్ణ విద్యా సంస్థల అధినేత కేవీ రమణారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్రెడ్డి, మాధవ్ రెసిడెన్సీ మాధవరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి నరసింహారెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవి తదితరులు ప్రసంగించారు. జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నేతలు వేదికపైనే కేక్ కట్ చేశారు. -
రోడ్ల దిగ్బంధం
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు, సమైక్యవాదులు రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఎన్హెచ్-5 జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను అంగీకరించేది లేదంటూ పార్టీశ్రేణులు నినదించాయి. ఆందోళనలను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. ఆత్మకూరులో జరిగిన ఆందోళనల్లో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. సర్వేపల్లి సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిపై మనుబోలు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. వందలసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి. అనీల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చింతారెడ్డిపాళెం హైవేపై రాస్తారోకో నిర్వహించింది. ఈ రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ విద్యార్థి విభాగం నాయకులు ఎన్హెచ్-5 కనుపర్తిపాడు సెంటర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఎస్యూపీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుజాతిని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సెంటర్ వద్ద గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు. దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల వద్ద కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బం ధించారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కోట క్రాస్రోడ్డు వద్ద జాతీయరహదారిపై గూడూరు సమన్వయకర్త బాలచెన్నయ్య ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకోలను నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండు సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. సూళ్లూరుపేట నియోజక వర్గంలోని నాయుడుపేట-శ్రీకాళహస్తి జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి రాస్తారోకో నిర్వహించారు. -
దేశ సంస్కృతి సోనియాకేం తెలుసు
ఉదయగిరి, న్యూస్లైన్: భారతదేశ సమైక్యత, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం విదేశీయురాలైన సోని యాకు ఏం తెలుసని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉదయగిరిలో బుధవారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్వప్రయోజనాల కోసమే ఆమె తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలను నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోనియాగాంధీ తెలుగువారి ఉసురుపోసుకోక తప్పదన్నారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో ఎవరూ విభజనను కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలోని కొందరు రాజకీయ బికారులు మాత్రమే విభజనను కోరుకుంటుంటే, వారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితమిస్తుందనే నమ్మకముం దన్నారు. ఆర్టికల్ 3ను రద్దు చేయాలనే డిమాండ్కు అందరూ మద్దతు పలకడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని, మరో అవకాశం తమకు కల్పిస్తే మరిం త అభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. మొదట ఆయన రైతు వేషధారణలో ట్రాక్టర్ను స్వయంగా నడుపుతూ మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ముందుకుసాగారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కల్లూరి రమణారెడ్డి, అక్కుల్రెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఆనందరావు, గడియాల్చి ఎస్ధాని, ఖిల్జీ సలీం, ఏడుకొండలు, ముర్తుజా హుస్సేన్, పెద్దిరెడ్డి, సోమిరెడ్డి, అశోక్కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, గుంటుపల్లి నాగభూషణం, పాణెం రమణయ్య పాల్గొన్నారు. -
గీన్ సిగ్నల్పై ‘అనంతా’గ్రహం
ఏదైతే కాకూడదనుకున్నారో అదే అయ్యింది. సమైక్య వాదులు అలుపెరుగకుండా 129 రోజుల పాటు సాగించిన ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు ఇసుమంతైనా పట్టించుకోలేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపిందంటూ ప్రకటించడంతో అనంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థి లోకం భగ్గుమంది. ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం అర్ధరాత్రి దాటినా నిరసన కొనసాగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేటి బంద్ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగు ప్రజల మనోభావాలకన్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి జన్మదినోత్సవ కానుక ఇవ్వడానికే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపడంపై ‘అనంత’ ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. 129 రోజులుగా సాగుతోన్న సమైక్యాంధ్ర మహోద్యమాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు నిరశించారు. ఎస్కేయూ వద్ద విద్యార్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకొచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం బంద్కు పిలుపునిచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాలతో కలిసి సమైక్యాంధ్ర మహోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు పూనుకుంది. అధిక శాతం మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంను కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా జీవోఎంను కోరారు. సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం ఒకానొక దశలో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. రాయలసీమను నిలువునా చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసేందుకు పూనుకుంది. జీవోఎం కూడా రాయల తెలంగాణకే ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్కు ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రాయలసీమ విభజనపై సీమ ప్రజానీకం భగ్గుమనడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికపై కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలీసు బలగాలతో భారీ ఎత్తున కవాతు నిర్వహించి.. ప్రజలను భయోత్పాతానికి గురిచేసే యత్నం చేయడం గమనార్హం. కాగా కేంద్ర ప్రకటనపై ఉరవకొండ, కదిరి, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు. -
ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దందా!
సాక్షి ప్రతినిధి, న్యూస్లైన్: ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా.. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా.. అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకుల వుతున్నా.. ఆర్టీఏ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు. కళ్లముందే అదనపు ప్రయాణికులతో పాటు ప్రమాద కరమైన లగేజీని బస్సులో తరలిస్తుంటే రూ.500 తీసుకుని రైట్ చెబుతున్నారు. ఈ శాఖ అవినీతికి పునాది రాయిలా నిలిచిందని జిల్లా వాసులు నెత్తి నోరు బాదుకున్నా.. దాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోరు. నెల వస్తే ఎవరి వాటా వారి ఇళ్లకు చేరాల్సిందే. పైసా తగ్గినా సహించరట! కింది స్థాయి సిబ్బందినీ ఉపేక్షించరట! తాజాగా మూడు నెలల పాటు సమైకాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగితే ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది కూడా అందులో పాల్గొన్నారు. కాగా తిరిగి విధులకు హాజరైన సిబ్బంది పనిదినాల్లో వచ్చిన అక్రమ సొమ్మును పంచుకుని ఓ ఉన్నతాధికారికి ఆయన వాటా ముట్టజెప్పేందుకు వెళ్లారు. అక్రమ సొమ్మును లెక్కపెట్టుకున్న అధికారి డబ్బును విసిరి కొట్టినట్లు తెలిసింది. ఇదేంది లెక్క తగ్గిందని సిబ్బందిపై హుకుం జారీ చేసినట్లు సమాచారం. కాగా సిబ్బంది రెండు నెలల పాటు ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనకు అదంతా సంబంధం లేదని అధికారి తేల్చి చెప్పారట! ప్రతి నెలా తనకు చెందాల్సిన సొమ్ము పక్కాగా ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో మీ ఇష్టం అని చెప్పడంతో సిబ్బంది వారి వాటాల్లో తగ్గించుకుని మిగిలిన సొత్తు పోగేసి ఇచ్చినట్లు తెలిసింది. చెక్పోస్ట్ నుంచి రూ.2 లక్షలు పెనుకొండ చెక్పోస్ట్ నుంచి రూ.2 లక్షల నగదు ప్రతి నెలా జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారికి ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. కాగా ఆ డబ్బును వసూలు చేయాలంటే అక్కడి సిబ్బంది వాహనాలు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నా.. వదిలి పెట్టాల్సిందే. కాక పోతే వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. మాట వినక పోతే వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు హజరు పరుస్తూ వస్తారు. అధికారుల ఒత్తిడితోనే తాజాగా ఓ టూరిస్ట్ బస్సును కూడా రూ.500 లంచంగా తీసుకుని వదిలిపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ విషయం బహిర్గతం కావడంతో చెక్ పోస్ట్కు ఆఫీస్ సబార్డినేటర్లను వేయకుండా వారిని కేవలం కార్యాలయం విధులకు నియమించినట్లు తెలిసింది. చెక్పోస్ట్లో ప్రెవేట్ వ్యక్తులను నియమించి వారి ద్వారానే డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. మహాబూబ్నగర్ ఘటనతో కురుస్తున్న ధనం మహబూబ్నగర్ జిల్లా పాల్యం వద్ద ఓల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల అధికారులకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బస్సులను కట్టడి చేయాలని సూచించింది. దీంతో ఆర్టీఏ అధికారుల జేబుల్లో ధన వర్షం కురుస్తోంది. అర్ధ రాత్రిళ్లు 44వ జాతీయ రహదారిపై వందలాది బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఓ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఒకే నెంబరుతో తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు స్పందించడం లేదని కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి పర్వానికి తెర వేయాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఏ అధికారుల అవినీతి బాగోతాలపై అసలు నిజాలను వెలికి తీసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
పక్కాగా ‘పది’
సాక్షి, కర్నూలు: ‘‘ జిల్లాలో గత మూడేళ్లుగా పదోతరగతి ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయి. గతేడాది జిల్లా చరిత్రలోనే అత్యధికంగా 91.06 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ప్రస్తుతం దీనిని కాపాడుకోవడం కత్తిమీద సాములాంటిదే. అయినా పక్కా ప్రణాళికతో ఇంతకంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తాం.’’ అని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో 33 పనిదినాలను నష్టంపోయామని, ఇందుకు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. విద్యాసంవత్సరం సాఫీగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. డిసెంబర్1 నుంచి త్రైమాసిక పరీక్షలు సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సమ్మె చేసిన ఉపాధ్యాయులు వచ్చే ఏడాది మార్చి 18 వరకు వచ్చే అన్ని రెండో శనివారాలు, ఆదివారాలు పనిచేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సిలబస్ పూర్తవుతుందనే నమ్మకం ఏర్పడింది. పదోతరగతి సహా అన్ని తరగతులకు డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు త్రైమాసిక, జనవరి మొదటి వారంలో అర్థసంవత్సర పరీక్షలను నిర్వహిస్తాం. సంక్రాంతికి ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. విద్యార్థులకు గ్రేడ్లు.. పదోతగరతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల మొదటివారం హాఫ్యర్లీ పరీక్షలు ముగిశాక విద్యార్థుల స్థాయిని ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రేడులుగా విభజిస్తాం. ఆ తరువాత సీ, డీ కేటడిరీ విద్యార్థులను కొంతమంది ఉపాధ్యాయులకు దత్తత ఇస్తాం. వీరిని మార్చి నాటికి మెరుగుపడేలా చూస్తాం. సీ, డీ గ్రేడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబోతున్న స్టడీ మెటీరియల్ను అన్ని పాఠశాలలకు తర్వలో అందజేస్తాం. తక్కువ ఉత్తీర్ణత ఉన్న పాఠశాలలను మండల విద్యాశాఖాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 150 పాఠశాలల్లో అదనపు గదులు ఎనిమిదో తరగతి వరకు మౌలిక సదుపాయాలన్నింటినీ రాజీవ్ విద్యామిషన్ చూస్తుంది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విడుదలవుతున్న నిధులను వినియోగిస్తున్నారు. ఇటీవలే ఆర్ఎంఎస్ ద్వారా 150 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నాం. సైన్స్ ల్యాబ్లను కడుతున్నారు. మరో 125 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టారు. లేబొరేటరీల ఏర్పాటుకు చర్యలు పదోతరగతి విద్యార్థుల కోసమైతే సైన్స్ లేబొరేటరీలు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలల్లో లేవు. గదులు లేకపోవడమే ఇందుకు కారణం. అయినా విద్యార్థుల కోసం నమూనా పరికరాలను ఉంచి బోధిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి గదులు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి సైన్స్ లేబొరేటరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘ప్రైవేట్’లో పనివేళల నియంత్రణ ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపునిచ్చిన సమయంలోనే అన్ని ప్రభుత్వ నిబంధనలకు, మార్గదర్శక సూత్రాలకు బద్ధులమై ఉంటామని డిక్లరేషన్ను తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. దీనిని ఉల్లంఘించిన ఆయా యాజమాన్యాలపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు హైకోర్టు కూడా ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జీవనోపాధి’పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
కోవెలకుంట్ల, న్యూస్లైన్ : నిరుద్యోగుల జీవనోపాధి కోసం కేటాయించిన యూనిట్లు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్ సూచించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ మండలాలకు చెందిన బ్యాంక ర్లు, ఎంపీడీఓలు, ఐకేపీ ఏపీఎం, సీసీలతో మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీడీ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన జేఎంఎల్బీసీ సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఐదు నెలలుగా నిర్వహించడం లేదన్నారు. దీంతో ఎక్కడి పనులు నిలిచిపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల కింద 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన జీవనోపాధి యూనిట్లను త్వరిత గతిన మంజూరు చేసి వాటిని ప్రారంభించాలని సూచించారు. ఆయా బ్యాంకుల అధికారులు, ఎంపీడీఓలు యూనిట్ల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కోవెలకుంట్ల స్టేట్బ్యాంక్ పరిధిలో 41, ఎస్బీహెచ్ పరిధిలో 19, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో 38, గోస్పాడు పరిధిలో 21 యూనిట్లను కేటాయించగా ఇప్పటి వరకు ఒక్కయూనిట్ కూడా ప్రారంభం కాకపోవడంపై పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వరమే చర్యలు తీసుకుని అర్హులైన వారికి లబ్ధీ చేకూర్చాలన్నారు. డిసెంబర్లో ఆయా బ్యాంకులకు కేటాయించిన యూనిట్లన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెల రెండో వారంలో జేఎంఎల్బీసీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీఎం ఆండవార్, బ్యాంకు ఉన్నతాధికారులు చంద్రశేఖర్రెడ్డి, ఫణికుమార్, తహశీల్దార్ సుధాకర్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎంపీడీఓలు, ఏపీజీబీ మేనేజర్లు సుజాతమ్మ, శ్రీలత, కేవీసుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ఇందిరకాంత్రిపథం ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
పోలీసుల హెచ్చరికల మధ్య ‘రచ్చబండ’
మచిలీపట్నం, న్యూస్లైన్ : సమస్యలపై, సమైక్యాంధ్రపై ప్రశ్నించినా, సభలో కార్యక్రమంలో గలాటా సృష్టించాలని చూసినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు చేసిన హెచ్చరికల మధ్య జిల్లాలోని గంపలగూడెం, గుడివాడ, చాట్రాయి, ముసునూరు మండలాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాలకు మారిన రచ్చబండ కార్యక్రమాన్ని మరింత కుదించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చాట్రాయి సభకే ముసునూరు మండల లబ్ధిదారులను రప్పించి కార్యక్రమం అయ్యిందనిపించారు. చాట్రాయిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చాట్రాయి మండల నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసి, సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు విమర్శించారు. దీంతో మంత్రి సారథి రాజకీయాలను చొప్పించి ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని, రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలని చెబుతున్న చంద్రబాబునాయుడిని టీడీపీ నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆపార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. చాట్రాయిలో వంద మందికి పైగా పోలీసులు, ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించడం గమనార్హం. గంపలగూడెం సభలో తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పాల్గొన్నారు. తడిచిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. ఎ.కొం డూరు మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడివాడ మండలంలో జరిగిన రచ్చబండలో ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాల్సి ఉండగా సందేశం పేపరు లభ్యంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని తటివర్రు సర్పంచి కె.రాజారెడ్డి అధికారులను నిలదీశారు. గతంలో గ్రామస్థాయిలో రచ్చబండ జరిగేదని ఇప్పుడు మండల కేంద్రాలకు కుదించి ఏ సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. సమావేశంలో చాలినన్ని కుర్చీలు లేక పలువురు సర్పంచులు నిలబడే ఉన్నారు. -
మంత్రి రఘువీరాకు సమైక్య సెగ
కళ్యాణదుర్గం టౌన్, న్యూస్లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి మరోసారి ‘సమైక్య’ సెగ తగిలింది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు ఆదివారం కళ్యాణదుర్గంలోని రఘువీరా ఇంటిని ముట్టడించారు. మంత్రి కళ్యాణదుర్గానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జేఏసీ నాయకులు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంట పాటు అక్కడే బైఠాయించారు. మంత్రి బయటకు రావాలని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మంత్రి స్పందించలేదు. దీనికి ఆగ్రహించిన జేఏసీ నాయకులు.. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు మంత్రి రఘువీరా జేఏసీ నాయకుల వద్దకు వచ్చారు. ఆయన రాగానే ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మరింత హోరెత్తించారు. ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని పట్టుబట్టారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి మాత్రం గంట పాటు మౌనం వీడలేదు. చివరకు ఇలా నినాదాలు చేస్తే ఫలితం లేదని, అందరం కూర్చుని సమస్యపై చర్చించుకుందామని జేఏసీ నాయకులను కోరారు. అనంతరం మంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాయల్ వెంకటేశులు, కన్వీనర్ మాధవ్, కో-కన్వీనర్లు జె.నాగరాజు, పోతుల రాధాకృష్ణ, మల్లారెడ్డి, చల్లా కిశోర్, అశోక్, ఈశ్వరయ్య, నరసింహులు, మోరేపల్లి నారాయణ, పాల్గుణప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజులకు పైగా సమైక్య ఉద్యమం సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మీరు ఇక్కడి స్థితిగతులను పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని అన్నారు. దీంతో ఉద్యమకారులు శాంతించారు. రాజీనామాలతో సాధించేదేమీ లేదు ‘మా రాజీనామాలతో సాధించేదేమీ లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికీ కృషి చేస్తున్నాం. అసెంబ్లీకి తీర్మానం వస్తే మా అభిమతం వ్యక్తం చేస్తాం. విభజన జరిగితే మేం శిక్షార్హులం. ప్రజలు ఏ శిక్ష విధించినా శిరసావహిస్తాం. పదవుల కోసం డ్రామాలాడాల్సిన దౌర్భాగ్యస్థితిలో నేను లేన’ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గం వైపు మూడు నెలలకుపైగా కన్నెత్తి చూడని మంత్రి రఘువీరా ఆదివారం ఇక్కడికి వచ్చారు. ఆయనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. -
పన్ను వసూళ్లకు ‘సమైక్య’ పోటు
సాక్షి, కడప: ప్రజలపై సమైక్య భారం పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలు మొదటి విడతగా చెల్లించే ఇంటి, నీటి పన్నును సకాలంలో చెల్లించలేకపోయారు. ప్రస్తుతం దీనికి అధికారులు వడ్డీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. వసూళ్ల కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి, నీటి పన్ను ఏప్రిల్-సెప్టెంబర్, అక్టోబర్-మార్చి వరకు రెండు విడతలుగా వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే మొదటి విడత గడువు దాటి నెలరోజులైంది. 50 శాతం లోపే వసూళ్లు : జిలా ్లవ్యాప్తంగా కడప కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీలలో 50శాతం లోపే వసూళ్లు జరిగినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఉదాహరణకు కడప కార్పొరేషన్ను పరిశీలిస్తే నగరంలో 78,656 గృహాలు, 1094 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అయితే దీనికి ఏప్రిల్-సెప్టెంబర్ మొదటి విడతకు ఇంటిపన్ను మొత్తం 8 కోట్ల 55 లక్షల 57 వేల రూపాయలు. కాగా, కేవలం వసూలైంది 4 కోట్ల 23 లక్షల 95 వేల రూపాయలు. అంటే వసూలైన మొత్తం 50 శాతం లోపే ఉంది. 33,413 మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉండగా, వీటికి 3 కోట్ల 72 లక్షల 66 వేల రూపాయలు పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ. 51.12 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పరిశీలిస్తే కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయి. అధికారులు మాత్రం.. మొదటి విడత, రెండో విడత బకాయిలను మార్చి లోపల వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్ణీత సమయంలో ఇంటిపన్ను చెల్లించని వారికి నెలకు 2శాతం అదనంగా వడ్డిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ఇంటిపన్ను, నీటిపన్నుతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత భారం కానుంది. సమైక్య సమ్మె నేపథ్యంలో కార్యాలయాలు లేకపోవడంతో తాము పన్నులు చెల్లించలేకపోయామని, ఇప్పుడు ప్రభుత్వం అదనంగా రెండు శాతం చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం సమ్మెకాలంలో సైతం మీసేవ కేంద్రాలు పనిచేశాయి. కాబట్టి ఆన్లైన్లో చెల్లింపులు చేసే అవకాశమున్నందున పన్ను కట్టుకోవాల్సి ఉందని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వసూళ్లను వేగవంతం చేశాం : కార్పొరేషన్ పరిధిలో నిలిచిపోయిన ఇంటి, నీటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేశాం. మొదటి విడత ఏప్రిల్-సెప్టెంబరుకు సంబంధించి 50శాతం లోపు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పన్నులు సకాలంలో చెల్లించని వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనంగా రెండు శాతం వడ్డీని చెల్లించాల్సిందే. - చంద్రమౌళీశ్వరరెడ్డి, కమిషనర్, కడప నగర పాలక సంస్థ. నోటీసులు జారీ చే స్తున్న అధికారులు మార్చిలో పన్నులు చెల్లిస్తే గతంలో మాదిరి వడ్డీ మాఫీ జరిగే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు కట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం రెండు శాతం వడ్డీ తప్పక కట్టాల్సిందేనని, మాఫీ కాదని అధికారులు పేర్కొంటున్నారు. కడప కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీలలో ఇంటి, నీటి పన్ను వసూళ్లకు సంబంధించి డిమాండ్ నోటీసులను జారీచేస్తున్నారు. -
దారులన్నీ బంద్
సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా, జీవోఎంకు నిరసనగా వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల జాతీయరహదారుల దిగ్బంధం రెండోరోజు గురువారం కొనసాగింది. కడపలో రాజంపేట వైఎస్సార్ సర్కిల్లో జిల్లా కన్వీనర్ సురేష్బాబు ఆధ్వర్యంలో, ఇర్కాన్సర్కిల్లో నగరసమన్వయకర్త అంజాద్బాషా ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ర హ దారులను దిగ్బంధించారు. ఇర్కాన్సర్కిల్లో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. కళాకారులు సమైక్యాంధ్ర పాటలు పాడి ఉద్యమకారులను అలరించారు. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు, చిన్నపిల్లల తల్లులు రోడ్లపక్కన చెట్లకింద సేదతీరారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దారులను దిగ్బంధించారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలను రోడ్లకు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. రోజంతా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లలేకపోయారు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారు. రోడ్లలో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పొలీసులు మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టు చేశారు. అయితే కార్యకర్తలు సాయంత్రం వరకూ దిగ్బంధనాన్ని కొనసాగించారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ ర హదారులను దిగ్బంధించారు. రోడ్లపై ట్రాక్టర్లు, బస్సులు అడ్డుగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్లపై వంటావార్పు చేసి, సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అందరినీ అరెస్టు చేశారు. పులివెందులలో యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి, వైసీపీ జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6నుంచి సాయంత్రం 5గంటల వరకూ రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొండూరులో రోడ్డుపై టెంటు ఏర్పాటు చేసి వంటావార్పు చేపట్టారు. మైదుకూరులో క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్చార్జ్ శెట్టిపల్లి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నాలుగరోడ్ల కూడలిని దిగ్బంధించారు. టెంటు ఏర్పాటు చేసి వంటవార్పు చేపట్టారు. రైల్వేకోడూరులో రాఘవరాజుపురం వద్ద రోడ్డుపై ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా కంప, మొద్దులు వేశారు. మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం 3.30గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల, అట్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి మూడుచోట్లా పాల్గొన్నారు. అట్లూరులో గోవిందరెడ్డిని అరెస్టుచేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6.30-11గంటల వరకూ రహదారులను దిగ్బంధించారు. రోడ్డుపై టెంట్లు వేసి కార్యకర్తలు బైఠాయించారు. వాహనాల రాకపోకలను మళ్లించేందుకు పోలీసులు యత్నించగా ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 11 గంటలకు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కమలాపురంలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. -
సమ్మె పేరుతో చేతివాటం
అక్రమార్కులు సమైక్యాంధ్ర సమ్మెనూ వదల్లేదు. ఆ పేరుతో సొమ్ము చేసుకున్నారు. ఎంచక్కా రేషన్ బియ్యం, కిరోసిన్లను డీలర్లు అక్రమంగా నల్లబజారులో అమ్ముకున్నారు. కంచే చేనుమేసినట్లుగా.. అడ్డుకోవాల్సిన అధికారులే దగ్గరుండి సహకరించారు. అక్టోబర్ కోటా సరుకుల కోసం చౌకదుకాణాల వద్దకు వెళ్లిన నిరుపేదలను పలు గ్రామాల్లో ‘సమ్మె వల్ల ఈ నెల సరుకు రాలేదు’ అంటూ డీలర్లు వెనక్కు పంపారు. కొండాపురం, న్యూస్లైన్ : నిరుపేదలను రేషన్డీలర్లు, అధికారులు ఏమార్చారు. కొండాపురం మండలంలోని పలు రేషన్దుకాణాల్లో అక్టోబర్ నెలకు సంబంధించి బియ్యం, కిరోసిన్ పేదలకు అందలేదు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై పక్కదారి పట్టించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లపల్లి, లింగనపాలెం, కొమ్మి-1, సత్యవోలు, కుంకువారిపాలెం, అగ్రహారం గ్రామాల్లోని రేషన్షాపుల పరిధిలో ఇలా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఆరు దుకాణాల్లో కలిపి 1610 కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా 17,308 కిలోల పీడీఎస్ బియ్యం, అంత్యోదయ లబ్ధిదారులకు 3,080కిలోల బియ్యం, 3145 లీటర్ల కిరోసిన్ ఇస్తారు. వింజమూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరకులు ఆయా షాపులకు వెళ్తాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఈ ఆరు దుకాణాల సురుకులను అధికారులు, డీలర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై గ్రామాల్లో డీలర్లను ప్రజలు ప్రశ్నిస్తే తుపాను, సమైక్యాంధ్ర సమ్మెల వల్ల సరుకులు రాలేదని జవాబు ఇస్తూ తప్పించుకుంటున్నారు. సహకరించని దుకాణాలపై దాడులు మండలంలో 34 రేషన్షాపులు ఉన్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సరుకులు నల్లబజారులో అమ్ముకోవాలని, అందుకుగాను షాపునకు రూ.పదివేలు చొప్పున తమకు ఇవ్వాలని మండలానికి చెందిన ఓ అధికారి డీలర్లను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారికి భయపడిన ఆరుగురు డీలర్లు సరుకులను పక్కదారి పట్టించినట్లు సమాచారం. అతడి మాట వినని డీలర్ల షాపులపై దాడులు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా గొట్టిగొండాల-2 షాపుపై దాడిచేసి సొమ్ముచేసుకోవడం ఈ కోవకే చెందినదని సమాచారం. అధికారి మాట విననందుకు తమ షాపులపై దాడులు చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. -
సమైక్యం కోసం..
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్సీపీ రహదారుల దిగ్బంధం తొలిరోజు విజయవంతమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు బుధవారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పార్టీ సమన్వయకర్తలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై మరోమారు రాస్తారోకో చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త పి.అనిల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అనిల్తో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్కుమార్, బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, సీనియర్ నాయకుడు నేదరుమల్లి పద్మనాభరెడ్డి, బత్తిన విజయ్కుమార్ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పోలీస్స్టేషన్కు వెళ్లి అరెస్టయ్యారు. ఉదయగిరిలో ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో కార్యకర్తలు అరగంటపాటు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వింజమూరు బంగ్లా సెంటర్లో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. కలిగిరిలోని కలిగరమ్మ దేవాలయం వద్ద జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పావులూరి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. జలదంకి బస్టాండ్లో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో కావలిరూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ప్రతాప్కుమార్రెడ్డితో సహా 30 మందిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం కూడలి వద్ద మండల కన్వీనర్ ఇందూరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచి పోయాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం జాతీయ రహదారిపై పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో రోడ్డును దిగ్బంధించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కాకాణితో సహా 26 మందిని అరెస్ట్చేశారు. సూళ్లూరుపేలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. తడలో పార్టీ కార్యకర్తలు ఆర్కే సుందరంరెడ్డి, గండవరం సురేష్రెడ్డి ఆధ్వర్యంలో తడ చెక్పోస్టు వద్ద రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నెలబల్లి, అక్కరపాక వద్ద జాతీయ రహదారుల దిగ్భంధం జరిగింది. నాయుడుపేటలో వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేణుంబాక విజయశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మల్లాం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేట-శ్రీకాళహస్తి రోడ్డులో జాతీయ రహదారులను దిగ్బంధించారు. వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు కూడలి వద్ద రహదారులను దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. కలువాయిలో మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. సైదాపురంలో మండల కన్వీనర్ కష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. కోవూరు నియోజక వర్గంలోని కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రహదారుల దిగ్బంధం జరిగింది. కోవూరులో ములుముడి వినోద్రెడ్డి, ఇందుకూరుపేటలో మావులూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ నాయకులు ముంబయి రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
మళ్లీ తెరపైకి రాయల తెలంగానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర మహోద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. బయట సమైక్యాంధ్ర గానం చేస్తూ.. లోపల వేర్పాటువాదాన్ని బలంగా చాటిచెబుతోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఉద్యమాన్ని తప్పుదోవపట్టించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దించారు. ఆది నుంచి జేసీ కుటుంబంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ వస్తోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే.. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి జేసీతో కలిసి ముందుకు సాగుతున్నారు. ‘రాయల తెలంగాణ’కు అనుకూలంగా జేసీ దివాకర్రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో బహిరంగంగా సంతకాల సేకరణ చేస్తోంటే.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో రహస్యంగా సంతకాలను సేకరిస్తూ మద్దతు కూడగడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన నిమిషాల్లోనే ‘అనంత’ నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానంలా వ్యాపించి.. మహోగ్ర రూపం సంతరించుకుంది. 99 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతోన్న ఉద్యమమే అందుకు తార్కాణం. ఓట్లు, సీట్లే లక్ష్యంగా కుమ్మక్కై రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు.. ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆది నుంచి పావులు కదుపుతూ వచ్చాయి. రాయలసీమను నిట్టనిలువున చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చాలని కుట్రపన్నాయి. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను రైల్వేశాఖ సహాయ మంత్రి, కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అప్పగించారు. ఆ మేరకు ఆగస్టు 5న కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏరాసు ప్రతాప్రెడ్డి, టీజీ వెంకటేశ్, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామిలతో కలిసి సోనియాను కోట్ల కలిశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను సీమ నుంచి చీల్చి తెలంగాణలో కలిపి.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి తనను కలిసే బాధ్యతను సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డికి అప్పట్లోనే సోనియా అప్పగించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో ‘రాయల తెలంగానం’ చేయించే బాధ్యతను తాను సమైక్యవాదిగానే ప్రకటించుకునే ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేకు చంద్రబాబు అప్పగించారు. కానీ.. కోట్ల ప్రతిపాదనపై సీమలో, ప్రధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్ధృతి కాస్త తగ్గిందని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది. సోనియా కనుసైగల మేరకు జేసీ దివాకర్రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలతో రాయల తెలంగాణకు మద్దతుగా సంతకాలు సేకరించి.. అధిష్టానానికి పంపారు. మిగతా ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తరహాలోనే ప్రతినిధి బృందంతో కలిసి సోనియాతో సమావేశమయ్యేందుకు జేసీ దివాకర్రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో రాయల తెలంగాణకు అనుకూలంగా రహస్యంగా సంతకాలు సేకరిస్తోన్న ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే.. వాటిని జీవోఎంకు పంపడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కుట్ర గుట్టు బహిర్గతం కాకుండా చూసేందుకు సమైక్యాంధ్రగానం వడిని మరింత పెంచి విన్పిస్తున్నారు. ముందే రచించిన ప్రణాళిక మేరకు ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్రావుతో తనపై విమర్శలు చేయించుకుంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సమైక్యవాదుల కన్నుగప్పేయత్నం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. అధిష్టానాల ఆదేశాల మేరకు రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కోట్ల, జేసీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నేతృత్వంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు జీవోఎంను కలిసి తమ వాదనను విన్పించడానికి సిద్ధమయ్యారని ఇరు పక్షాల నేతలూ అంగీకరిస్తుండటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచే కాంగ్రెస్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల వైఖరిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. -
దిగ్బంధం
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జీవోఎంకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయరహదారులను ఎక్కడికక్కడ దిగ్బంధించారు. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు రహదారులపైకి వచ్చి బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. దీంతో ప్రతి రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. కడపలో జిల్లా కన్వీనర్ సురేష్బాబు ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్లో, నగర సమన్వయకర్త అంజాద్బాషా, మాసీమబాబు ఆధ్వర్యంలో ఇర్కాన్ సర్కిల్లో కార్యకర్తలు ఉదయం 6 గంటలకు బైఠాయించి రాకపోకలు అడ్డుకున్నారు. అలాగే చింతకొమ్మదిన్నె వైఎస్సార్ సర్కిల్లో కూడా కడప-రాయచోటి రహదారిపై వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. ఉదయం 10.45 గంటలకు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చెన్నూరు, రిమ్స్ పోలీస్స్టేషన్ లకు తరలించారు. దీంతో పదినిమిషాల వ్యవధిలో మళ్లీ అఫ్జల్ఖాన్తో పాటు పలువురు కార్యకర్తలు బైపాస్లో బైఠాయించారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పులివెందులలో ఉదయం 6 గంటలకే పులివెందుల- కదిరి, అనంతపురం, కడప, వీరపునాయునిపల్లి, జమ్మలమడుగు రహదారులను దిగ్బంధించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డితో పాటు పలువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ బైఠాయించారు. ఆపై పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. గౌరీ అనే మహిళ చేతికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టుకు నిరసనగా వైఎస్ అవినాష్రెడ్డి గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు మాత్రం అరెస్టులకు బెదరకుండా సాయంత్రం వరకూ దిగ్బంధం కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కడప-రేణిగుంట హైవే దిగ్బంధించారు. 1.30 గంటలకు డీఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర కోసమే వైఎస్సార్సీపీ ఉద్యమం చేస్తోందని, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు-మైదుకూరుతో పాటు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, చాగలమర్రి రహదారులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ దిగ్బంధించారు. ఆపై డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వీరిని అరెస్టు చేశారు. జమ్మలమడుగులో తెల్లవారుజామున 4.30 గంటలకే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు నిలిపేశారు. మధ్యాహ్నం డీఎస్పీ జాన్మనోహర్ వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సమైక్యం కోసం పోరాడుతున్న జగన్కు పేరు వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్పార్టీ నేతలు అరెస్టులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. ఎర్రగుంట్లలో పార్టీ నేతలు రహదారులను దిగ్బంధించారు. పులివెందుల, రాయచోటి, కడప జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరులో వంటా వార్పు నిర్వహించారు. ప్రొద్దుటూరు, వేములలో రహదారిపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి బైఠాయించారు. బద్వేలు, పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు-నెల్లూరుతో పాటు పలు రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి-12 గంటల వరకు రహదారులను దిగ్బంధించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ప్రజలు వందరోజులుగా ఉద్యమిస్తుంటే మరో వైపు జీవోఎం ఏర్పాటు చే సి విభజన ప్రక్రియను వేగవంతం చేసేదిశగా కేంద్రం అడుగులు వేయడం దారుణమని శ్రీకాంత్రెడ్డి అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజంపేట-తిరుపతి రహదారిపై బైఠాయించారు. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తర్వాత సాయంత్రం 4.30-5గంటల వరకు మళ్లీ బైఠాయించారు. దీంతో పోలీసులు మళ్లీ వారిని అరెస్టు చేశారు. తమ అరెస్టులతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుకోలేరని, జగన్ సారథ్యంలో సమైక్యాంధ్రను సాధించుకుంటామని కొరముట్ల అన్నారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్చార్జ్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్పీ చల్లా ప్రవీణ్కుమార్రెడ్డి వారిని అరెస్టు చేశారు. నేటితో ఉద్యమానికి వందరోజులు సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం వందరోజులకు చేరనుంది. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు రిలేదీక్షలు సాగిస్తున్నారు. బుధవారం బాలవికాస్ ఇంగ్లీషుమీడియం పాఠశాల డెరైక్టర్ గంగయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశనాయకుల వేషధారణలతో వినూత్నంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు నాగమునిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలులో మహేశ్వరరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో పెద్దదండ్లూరు రైతులు దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
వైఎస్సార్ సీపీ రోడ్ల దిగ్బంధం సక్సెస్
సాక్షి, గుంటూరు : సమైక్యంపై కేంద్రానికి, జీవోఎం(గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్)కు కనువిప్పు కలిగించడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్భంధం మొదటి రోజు విజయవంతమైంది. సమైక్య రాష్ట్రమే కావాలనే ప్రజల బలీయమైన ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పేందుకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజైన బుధవారం జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పలు చోట్ల హైవేలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కి నిరసన తెలియజేశాయి. పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదాన్ని కాంక్షించే వారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పలు చోట్ల పోలీసులు ఓవరాక్షన్ చేసి జులుం ప్రదర్శించారు. చిలకలూరిపేటలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయరహదారి దిగ్బంధం జరిగింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి, యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద చెన్నై- కోల్కతా జాతీయ రహదారి, చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెంలో రాష్ట్ర రహదారిపై ఈ కార్యక్రమం జరిగింది. రోడ్లపైనే వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. మంగళగిరి వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ నియోజకవర్గ కేంద్రం మంగళగిరిలో జాతీయ రహదారిపై కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో తెనాలి జంక్షన్ వద్ద కార్యకర్తలు ఉదయం 10 గంటలకు చేరుకుని రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఆర్కే సహా 28 మంది కార్యకర్తలను అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద గుంటూరు-మాచర్ల రహదారిని దిగ్బంధించారు. ట్రాక్టర్లు అడ్డుపెట్టి ధర్నా చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద మాచర్ల-గుంటూరు ప్రధాన రహదారిపై వంటావార్పు చేశారు. పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసి పిడుగురాళ్ల స్టేషన్కు తరలించారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో అద్దంకి-నార్కెట్పల్లి హైవేను పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్బంధం చేశారు. దాచేపల్లి మండలం నడికుడి పంచాయతీలోని ఆర్అండ్బీ బంగ్లా వద్ద పార్టీ కేంద్రపాలక మండలిసభ్యులు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి రాస్తారోకోలో పాల్గొన్నారు. మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించిన తరువాత జంగాతో పాటు మరికొంతమంది నాయకులను పోలీస్లు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు శ్రీనగర్, పొందుగల గ్రామాల్లో హైవేను దిగ్బంధం చేశారు. పిడుగురాళ్లలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పోలీసుల ఓవరాక్షన్ పొన్నూరు నియోజకవర్గంలో రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పెదకాకాని వద్ద చెన్నై జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్బంధిం చాయి. పోలీసులు ఓవరాక్షన్తో డీఎస్పీ మధుసూదనరావు వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని దూషించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇదేంటని ప్రశ్నించిన రావి వెంకటరమణతోనూ డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ తీరుపై పార్టీ నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బాపట్లలో దిగమర్రు జాతీయరహదారిపై సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్, వెదుళ్లపల్లి, కర్లపాలెం మండల కేంద్రం, పిట్టలవానిపాలెంలో చందోలు వద్ద రహదారులపై ఆందోళన చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద గుంటూరు-హైదరాబాద్ హైవేపై నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1.30 గంటల సమయంలో పోలీసులు బలవంతంగా నాయకులను స్టేషన్కు తరలించారు. ఆయా మండలాల కన్వీనర్లు షేక్ మస్తాన్, మీరయ్య, కోటేశ్వరరావు, మర్రి ప్రసాదరెడ్డిలు సత్తెనపల్లి-మాదిపాడు, అమరావతి-బెల్లంకొండ రోడ్లను దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాచర్ల , విజయపురిసౌత్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. రెంటచింతల రహదారి పై రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేటలో సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు వినుకొండలో సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో చీకటీగలపాలెం వద్ద రహదారులను దిగ్బంధం చేశారు. సుమారు 2గంటలు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు- కర్నూలు రాష్ట్ర రహదారిపై వాహనాలు అధిక సంఖ్యలో నిలిచి పోయాయి. డాక్టర్ సుధతో పాటు డాక్టర్ లతీష్రెడ్డి, మండల కన్వీనర్ అనుమాల నాసర్రెడ్డి, నూజెండ్ల మండల కన్వీనర్ తుమ్మా వెంకటరెడ్డి, తిప్పిశెట్టి కోటేశ్వరరావుతో పాటు నాయకులు, కర్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగి ంది. రైతు విభాగం నాయకులు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నందివెలుగు రోడ్డులో గళ్లా చందు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయసారధి ఆధ్వర్యంలో పాత మద్రాసు రోడ్డులో రహదారులను దిగ్బంధించారు. తాడికొండలో సమన్వయకర్త మందపాటి శేషగిరిరావు, మేడికొండూరులో కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఫిరంగి పురంలో ఈపూరు అనూప్ల ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రహదారులను దిగ్భంధం చేశారు. రేపల్లెలో మోపిదేవి హరనాథబాబు ఆధ్వర్యంలో పెనుమూడి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుంటూరు నగరంలో.. గుంటూరులో పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన నేతలు అంకిరెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు షౌకత్, నసీర్ అహ్మద్లు కూడా దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించి పలువురిని అరెస్ట్ చేసి తాలూకా స్టేషన్కు తరలించారు. పార్టీ యూత్ విభాగం కన్వీనర్ కావటి మనోహర్నాయుడు నేతృత్వంలో ఏటుకూరు రోడ్డులో హైవేను దిగ్బం ధించారు. రాష్ట్ర పార్టీ యువజన విభాగం నేతలు మారూరి రామలింగారెడ్డి, దాది మురళి, గుంటూరు రూరల్ మండల కన్వీనర్ ఆళ్ల రవిదేవరాజు నాయుడు పాల్గొన్నారు. -
సమైక్య జోరు
సాక్షి,కడప : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కడప నగరంలో నాగార్జున మోడల్స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో సమైక్య నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఒంటిమిట్ట మండల ఉపాధ్యాయులు దీక్షల్లో కూర్చొన్నారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ సర్పంచ్ రమణయ్య నేతృత్వంలో 12మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో విజయ్కుమార్ సర్కిల్లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ నేత, దొమ్మరనంద్యాల మాజీ సర్పంచ్ బుసిరెడ్డి ఆధ్వర్యంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కుండా రామయ్య సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ కార్యకర్తలు ఖాజావలీ నేతృత్వంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డిలు సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ ఛెర్మైన్ ఓబులేసు ఆధ్వర్యంలో పాతబస్టాండు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. రాయచోటిలో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మైదుకూరులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. -
6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం
అనంతపురం అర్బన్, న్యూస్లైన్ : పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటల పాటు చేపట్టనున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి పోరాటం కొనసాగిస్తోందని గుర్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా 900 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయించినట్లు తెలిపారు. మిగిలిన పంచాయతీల్లోనూ మరో రెండు రోజుల్లో తీర్మానాలు చేస్తారన్నారు. వీటిని మంత్రుల బృందానికి(జీఓఎం)కు పంపుతామన్నారు. ర హదారుల దిగ్బంధం కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు, ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7న జరిగే జీఓఎం సమావేశంలో అన్ని పార్టీలు అభిప్రాయాలను చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన జరిగితే సీమాంధ్రులు ఎంతో నష్టపోతారని మేధావులు, రాజకీయవేత్తలు చెబుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షను కూడా లెక్క చేయకుండా విభజన వైపు అడుగులు వేయడం దారుణమన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కొర్రపాడు హుసేన్పీరా, రంగంపేట గోపాల్ రెడ్డి, బండి పరశురాం, మారుతీ ప్రకాష్, మారుతీనాయుడు, జేఎం బాషా పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రకు ఎందుకు జై కొట్టవు ?
నెల్లూరు(బారకాసు), న్యూస్లైన్ : సీమాంధ్రలో పుట్టి, తొమ్మిదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి సమైక్యాంధ్రకు ఎందుకు జైకొట్టరని చంద్రబాబు నాయుడిని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులోని కేవీఆర్ పెట్రోలు బంక్ సెంటర్లో ఆదివారం నరకాసురుడితో పాటు సోనియాగాంధీ, కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ చిత్రపటాలు తగిలించిన 15 అడుగుల ఎత్తై దిష్టిబొమ్మను టపాసులు కట్టి దహనం చేశారు. రాష్ట్రాన్ని విభజించాలనే దుర్మార్గపు నిర్ణయం వచ్చినప్పటి నుంచి కోట్లాది మంది ప్రజలు జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని తెలిపారు. వీరందరికి బాసటగా, సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని చెప్పారు. సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజల పాలిట రాక్షసిలా మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రజలను మోసం చేస్తూ సోనియా డెరైక్షన్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ను వేరుచేస్తుంటే సీమాంధ్రకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావు, కె.వి.రాఘవరెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మందా బాబ్జీ, నరసింహయ్య ముదిరాజ్, బిరుదవోలు శ్రీకాంత్రెడ్డి, బత్తల వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యుడు చిం తంరెడ్డి జనార్దన్రెడ్డి, పురుషోత్తం యా దవ్, జానా శివప్రసాద్, మస్తాన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, తో టకూర అశోక్నాయుడు, జి.నరేష్, మ హేష్, హజరత్నాయుడు, మందా పెద్దబాబు, పట్రంగి అజయ్, రమమ్మ, హ సీనా, సుజిత, సరళ, విద్యార్థి విభాగ రూరల్ అధ్యక్షుడు అశోక్కుమార్, గగ న్, హరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధరలు ఢాం..ఢాం
నిత్యావసర వస్తువుల ధరలు ఢాం..ఢాం అంటూ పేలుతుంటే సంబరాల దీపావళి చిన్నబోనుంది. ఉప్పు నుంచి పప్పు వరకు.. ఆకుకూరల నుంచి కూరగాయల వరకు ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. తలుచుకుంటేనే కంట నీరు తెప్పిస్తోంది ఉల్లి. అదే దారిలో పయనిస్తోంది టమాట. ఈ రెండూ లేనిదే ఏ కూరా సిద్ధం కాదు. బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల భారాన్ని మోయలేక మోస్తున్న సామాన్యుడు దీపావళి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడు ఈ ఏడాది దిపావళిని సంబరంగా జరుపుకునేందుకు వెనకడుగు వేస్తున్నాడు. సటపాసుల విక్రయాలకు అనుమతులు పొందేందుకు అడిగినంతా ఇచ్చుకుని..లెసైన్స్లు పొందిన విక్రయదారులు గిట్టుబాటు పేరుతో ఈ ఏడాది ధరలు పెంచనున్నారు. ఈ భారమంతా కొనుగోలుదారుల మీదే పడుతోంది. వీటిని కొని పండుగ చేసుకోవాలా..వద్దా అన్న సందిగ్దంలో పడిన సామాన్యుడు.. పిల్లల సరదా తీర్చేదెట్టా అన్న ఆవేదనలో ఉన్నాడు. ఎంత వెచ్చించినా.. కాసింతైనా సంతృప్తికరంగా సరంజామా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, కార్మికులు సమైక్య ఉద్యమం కారణంగా వేతనాలు కోల్పోయారు. ఈ నెలలో పూర్తి వేతనం రానందున ప్రభుత్వం ఇచ్చిన రుణంతో గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదో పండుగా చేశామంటే చాశామన్నట్లు జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. కొత్త దుస్తులు కొనడం ఈసారి వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరిగా కొనలాంటే అప్పు చేయాల్సిందే. దీపావళికి పిండి వంటలు చేసుకోవడం మామూలే. ఇందుకు చక్కెర, బెల్లం, పప్పులు, శనగపప్పు, శనగపిండి, నూనె, ఉద్దిపప్పు తదితరాలు తప్పనిసరి. వీటి ధరలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి. కూరగాయల ధరలైతే ఇక చెప్పక్కరలేదు. పేదలు పచ్చడి కూడా చేసుకోలేక బతుకీడుస్తున్నారు. ఈ పరిస్థితిలో జిల్లాలో ఈ ఏడాది టపాకాయలు విక్రయాలు అంతగా ఆశాజనకంగా ఉండక పోవచ్చని వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో దాదాపు 250 మంది లెసైన్స్ దారులు ఉండగా..ఒక్క అనంతపురం నగరంలోనే 47 మంది ఉన్నారు. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా రూ.27 నుంచి రూ.30 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుండగా ఒక్క అనంతపురం నగరంలోనే రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. మొత్తం జీరో వ్యాపారం కావడంతో ఈ విక్రయాల్లో వ్యాపారులకు 80-90 శాతం వరకు లాభాలు సమకూరుతాయి. అయితే ఈ ఏడాది అధికారులకు మామూళ్లు కూడా పెరగడంతో ఆ ప్రభావం టపాకాయల ధరలపై పడటం ఖాయం. -
సమైక్యమే లక్ష్యం
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యమబాట వీడబోమంటూ తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో పర్యటించేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు ఆనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని సమైక్య వాదుల్లో రెట్టించిన ఉత్సాహం కన్పిస్తోంది. ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో 92వ రోజు బుధవారం కూడా జిల్లా అంతటా నిరసనలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్క్లాక్ సర్కిల్లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలి పారు. ఎస్కేయూలో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ధర్మవరం, గుంతకల్లులో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్మవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు పొట్టిశ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. గుంతకల్లులో డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. గుత్తిలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో దిగ్విజయ్సింగ్ ది ష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు కలసి ర్యాలీ చే శారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. పభు త్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేతబట్టుకుని..అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అమరాపురంలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాయదుర్గంలో విద్యార్థులు, జే ఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నది వైఎస్సార్సీపీ మాత్రమేనని ఆయన అన్నారు. -
సమైక్య హోరు
సాక్షి, అనంతపురం : జిల్లాలో ‘సమైక్య’ ఉద్యమ కెరటం ఎగిసిపడుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరాలన్న దృఢ సంకల్పం ఉద్యమకారుల్లో బలంగా కన్పిస్తోంది. అందుకే వారు రోజులు గడుస్తున్నా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం 91వ రోజు జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమించారు. అనంతపురం నగరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ చేశారు. స్థానిక టవర్క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. ఎస్కేయూలో విద్యార్థి నాయకులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగాయి. ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంతకల్లులో రిలేదీక్షలు కొనసాగాయి. పామిడిలో మౌనదీక్ష చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘శాడిస్టు సోనియా, యూపీఏ డౌన్డౌన్’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కదిరిలో ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక వేమారెడ్డి కూడలిలో మానవహారం నిర్మించి... సమైక్య నినాదాలు చేశారు. ఉద్యమం 91 రోజులకు చేరుకున్న సందర్భంగా విద్యార్థులు 91 ఆకారంలో కూర్చున్నారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు పాఠశాల ఆటస్థలాన్ని శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో జేఏసీ నాయకులు, విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. -
ఇదేం న్యాయం
సాక్షి ప్రతినిధి, కడప : ‘ఇంట్లోవాడే కంట్లో పుల్ల పెట్టాడు’ అన్న చందంగా తయారయ్యారు మన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి. ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఉత్తుత్తి మాటలతో ఉపాధ్యాయుల సమ్మె విరమింపజేసిన ముఖ్యమంత్రి వారి జీతాల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నాడు సకల జనుల సమ్మె ముగిసిన 10 రోజులకే తెలంగాణా అయ్యవార్లకు సమ్మెకాలపు జీతాలు ఇవ్వాలంటూ జీఓ విడుదల చేసిన కిరణ్ సర్కారు..నేడు సీమాంధ్ర ఉపాధ్యాయులు సమ్మె విరమించి మూడు వారాలు దాటుతున్నా జీఓ ఊసే ఎత్తకుండా కాలం వెల్లబుచ్చుతున్నారు. ఇదేం పక్షపాత పాలన అంటూ ఇక్కడి అయ్యవార్లు శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణా టీచర్ల విషయంలో... సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణా అయ్యవార్లు 2011 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సమ్మెలో పాల్గొన్నారు. ఈ 32రోజుల సమ్మె కాలంలో 16 రోజులు పనిదినాలు కావడంతో ఆ 16 రోజులు అదనంగా పని చేయాలని నాటి కిరణ్ సర్కార్ అక్టోబర్ 21వ తేదీన ఓ మెమో జారీచేసింది. అంతేకాకుండా సమ్మెకాలంలోని రోజులకు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు జీతాలు బిల్లులు చేసుకోవాలని జీఓ నంబర్ 151ని అదేనెల 28వ తేదీన విడుదల చేసింది. అంటే సమ్మె ముగిసిన 10 రోజులకే తెలంగాణా అయ్యవార్లకు సమ్మెకాలపు జీతాలు అందజేసిందన్నమాట. అదే కిరణ్ సర్కారు నేడు సీమాంధ్ర అయ్యవార్ల జీతాల విషయంలో దొంగాట ఆడుతోంది. సీమాంధ్ర ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం సమైక్యాంధ్ర ఉద్యమంలో 2013 ఆగస్టు 22వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సీమాంధ్ర అయ్యవార్లు బడులు మూసివేశారు. మొత్తం 49 రోజుల సమ్మె కాలంలో 33 రోజులు పనిదినాలు కోల్పోయారు. వీటికి బదులు రాబోయే ఆదివారాలు, సంక్రాంతి సెలవుల్లో పనిచేయాలని పేర్కొంటూ ఈనెల 19వ తేదీన ఓ మెమో (ఆర్సి నంబర్ 31) విడుదలైంది. సెలవు రోజుల్లో చదువు చెప్పాలని గట్టి ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం జీతాల జీఓ విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రస్తుతం సమ్మె కాలపు జీతాలకు సంబంధించిన ఫైల్ సాధారణ పరిపాలన విభాగం కూడా దాటలేదు. అటు నుంచి విద్యాశాఖ, ఆర్థిక శాఖలను దాటుకుంటూ ముఖ్యమంత్రి వద్దకెళ్లేసరికి కనీసం ఐదు, ఆరు రోజుల సమయం పడుతుందని విశ్వసనీయ సమాచారం. మాటలు ఘనం.. చేతలు శూన్యం... తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరగదని, సమ్మె వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు గురించి ఆలోచించండంటూ చర్చల సమయంలో తీపి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అవసరం తీరిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ఇక్కడి అయ్యవార్లు మండిపడుతున్నారు. సమ్మె ముగిసి మూడు వారాలు దాటినా జీతాల జీఓ విడుదల కాకపోవడం పట్ల వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉపాధ్యాయులకు ఒక న్యాయం.. మాకొక న్యాయమా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయ్యవార్ల ఎదురుచూపులు... దాదాపు రెండున్నర లక్షల మంది సీమాంధ్ర అయ్యవార్లు గత మూడురోజులుగా జీతాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి ఉద్యమాలు చేసిన ఉపాధ్యాయులు నేడు బడులకు పోతూ కూడా జీతాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది. వాస్తవానికి ఉపాధ్యాయుల జీతాల బిల్లులను సంబంధిత ఎంఈఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రతినెల 25వ తేదీలోపే ఖజానాకు పంపించేవారు. జీఓ త్వరగా వస్తే ఒకేసారి మూడు నెలల జీతాల బిల్లులను పెట్టుకోవచ్చన్న ఆశతో చాలామంది అధికారులు అక్టోబర్ నెల జీతాల బిల్లులను కూడా ఆపి ఉంచారు. అయితే జీఓ రోజురోజుకు ఆలస్యమవుతుండడంతో వీరి ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ద్వంద్వ నీతిని మానుకొని జీతాల జీఓ విడుదలపై దృష్టిసారించాలని సీమాంధ్ర ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
సమైక్య నాదం.. అదే జన గళం
సాక్షి, అనంతపురం : జిల్లా అంతటా సమైక్య నినాదం.. అదే జనగళమైంది. 86 రోజులుగా ఎవరి నోట విన్నా.. సమైక్యాంధ్ర నినాదమే మారుమోగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా నడుస్తున్నా సామాన్య ప్రజలు మాత్రం మొక్కవోని దీక్షతో ఉద్యమం కొనసాగిస్తున్నారు. గురువారం అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయ జాక్టో రిలే దీక్షకు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ మద్దతు తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సమైక్య ఉద్యమం మొదలై 86 రోజులు కావడంతో ఎస్కేయూ వద్ద పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై 86 ఆకారంలో కూర్చుని ఆందోళన చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తనకల్లులో విద్యార్థులు రాస్తారోకో చేశారు. నంబులపూలకుంటలో ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో ప్రభుత్వ నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఓడీ చెరువులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్రెడ్డి, నాయకుడు కొత్తకోట సోమశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లమాడలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్నంగా ర్యాలీ చేశారు. రొద్దంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా నీవైనా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా దీవించు అంటూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కళ్లకు గంతలు కట్టుకుని టవర్క్లాక్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి విన్నవించారు. విశ్వభారతి విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. కనగానపల్లిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాప్తాడులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్ష కొనసాగింది. ఉరవకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రోడ్డుపై మోకాళ్లపై నిలుచుని ఆందోళన చేశారు. -
రాష్ట్రం విడిపోతే చేనేతకు గడ్డుకాలం
ఉరవకొండ, న్యూస్లైన్: సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు తరలిరావాలని ఆల్ ఇండియూ హ్యాండ్లూమ్ డెరైక్టర్ చందావెంకటస్వామి పిలుపు నిచ్చారు. స్థానిక చౌడేశ్వరీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయుంలో బుధవారం జిల్లా చేనేత పారిశ్రామిక నాయుకుల సవూవేశం నిర్వహించారు. ఈ నెల 26న హైదరాబాద్లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు తరలివెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం విలేకరులతో చందావెంకటస్వామి వూట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి ఆశయు సాధన కోసం పాటు పడుతున్నారన్నారు. చేనేత కార్మికుల సవుస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. ధర్మవరంలో ఆవురణ దీక్షతోపాటు, సిరిసిల్లలో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయువ్ము ఆవురణదీక్ష చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించారన్నారు. విభజన అంశంపై ఇతర రాజకీయు పార్టీలు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుండగా, వైఎస్సార్సీపీ వూత్రం స్పష్టమైన సమైక్య నినాదంతో పోరాడుతోందన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దలకు సమైక్య సెగ తగిలేలా హైదరాబాద్లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. -
సమైక్య జడి
సాక్షి, అనంతపురం : జిల్లాలో సమైక్య పోరు ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమకారులు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా జడివాన కురుస్తున్నా... ఉద్యమ హోరు మాత్రం తగ్గలేదు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లెపల్లెకూ విస్తరింపజేయాలన్న లక్ష్యంతో అనంతపురంలోని ఎన్జీఓ హోంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి.. ఉద్యోగులతో సమావేశమై ‘సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వైద్యులు సమావేశమై.. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి కష్టాలు మొదలవుతాయని జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నగరంలో ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు బైక్ ర్యాలీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థి సంఘాల నాయకులు దీక్షలు కొనసాగించారు. దర్మవరం, గుంతకల్లు, పామిడిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడి, బెళుగుప్పలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మానవహారం నిర్మించారు. కుందుర్పిలో విద్యార్థులు, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. గాడిదకు వినతిపత్రం అందజేశారు. మడకశిర మండలం గౌడనహళ్లిలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేత బట్టుకుని ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
నిర్విరామ పోరు
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయాన్ని పాలకులు వెనక్కు తీసుకునే వరకు ఉద్యమ పథం నుంచి వైదొలగబోమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చాటుతున్నారు. జిల్లాలో ప్రతి ఊరూ వాడ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. మంగళవారం అనంతపురం నగరంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థులు, ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి.. మానవహారం నిర్మించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కొనసాగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక కోస్తామని హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వారు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాస్క్ధారికి నాలుక కోస్తున్నట్లు ప్రదర్శన చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. నంబులపూలకుంట, మడకశిరలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం చేపట్టారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విరామ సమయం లో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేశారు. కణేకల్లులో నాలుగవ తరగతి విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. తాడిపత్రిలో నాయీబ్రాహ్మణ సంఘం, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. -
సమైక్యాంధ్ర సాధ నే లక్ష్యం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్: సమైక్యాంధ్రసాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని లాల్బహుదూర్ స్టేడియంలో జరగనున్న సమైక్యశంఖారావం సభను విజయవంతం చేయూలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరుకావాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంను విభజించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతోందన్నారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీగా మొదటి నుంచి మద్దతు ఇస్తున్నది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. జగన్ మోహన్రెడ్డి రెండు సార్లు ఆమరణదీక్ష చేపట్టిన విషయూన్ని గుర్తుచేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో వైఎస్సార్ సీపీ చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్మోహనరెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీనేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమతీరు చూస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు అధికారమే ధ్యేయంగా రాజకీయలబ్ధి పొందేం దుకు ఏమాత్రం వెనుకాడడం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా ఒకేఒక్కరు పోరాడుతున్నారని, జగన్తోనే సమైక్యాంధ్ర సాధన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం ప్రకటిస్తున్నారన్నారు. తెలుగుజాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటమే సమైక్య శంఖారావసభని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. -
పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టుల మధ్య మాటల యుద్ధం అంతూపొంతూ లేకుండా సాగుతూనే ఉంది. లేఖల బాణాలు వేసుకోవడం,ప్రెస్కాన్ఫరెన్సుల్లో దెప్పిపొడుచుకోవడం మానలేదు. కలసి మెలసి ప్రజాసమస్యలపై పని చేస్తామంటూనే పరస్పరం కత్తులు నూరుకోవడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంకో ఐదారు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ ‘పోరేమిటని’ పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలపైన, విధివిధానాలపైన, వ్యూహాత్మక ఎత్తుగడలపైన వాదులాడుకోవడం వీరికి కొత్త కాకున్నా మరీ ఇంత ‘దిగజారి’ దూషించుకోవాలా? అని నివ్వెరపోతున్నాయి. గతంలో పార్టీ ప్రణాళికలపై ఉభయ కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయినప్పుడు సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఆ ఆందోళనకు మద్దతివ్వడం దేనికి సంకేతమంటూ సీపీఎం నేతలు, తెలంగాణలో సీపీఎం గోడమీది పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నదంటూ సీపీఐ నేతలు ఒకరిపై ఒకరు కాలుదువ్వుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సర్దుబాట్లపై బజారున పడ్డాయి. ఎన్నికలొస్తున్న ప్రతిసారీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల వ్యవహారంలో కాట్లాడుకోవడం షరామామూలైందని, పార్టీ నాయకత్వాలే ఇటువంటి దుస్థితిలో ఉంటే కార్యకర్తల మధ్య సయోధ్య ఎలా సాధ్యమని పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం వాపోతోంది. సొంతంగా పోటీ చేసి బలాన్ని పెంచుకోవడానికి బదులు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలనుకోవడమే తమ పార్టీల బలహీనత అని విశ్లేషిస్తున్నాయి. తాము తప్ప మిగతావన్నీ బూర్జువా పార్టీలేనని చెప్పే కమ్యూనిస్టులు సొంతకాళ్లపై నిలబడడానికి ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నిస్తున్నాయి. 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకుని తప్పు చేశామని పార్టీ రాష్ట్ర మహాసభల్లో విశ్లేషించుకున్న ఉభయ కమ్యూనిస్టులు మళ్లీ ఎన్నికలొచ్చే సమయానికి అదే తప్పు చేస్తున్నాయని ఆయా పార్టీల శ్రేణులు వాపోతున్నాయి. హుందాతనానికి మారు పేరుగా ఉండాల్సిన కమ్యూనిస్టు నేతలు బజారున పడి వాగ్వాదాలకు దిగడం, బహిరంగ లేఖలు రాసుకోవడం వల్ల కిందిస్థాయి కార్యకర్తల మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప సాధించేదేమీ లేదన్నది నిర్వివాదాంశం. వాస్తవానికి ఈ రెండు పార్టీల మధ్య పార్టీల విలీనం నుంచి రాష్ట్ర విభజన వరకు అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. అనేక సందర్భాలలో వీటి మధ్య విభేదాలు బయటపడ్డాయి కూడా. విశాల ప్రాతిపదికన ఐక్య వేదికలు నిర్మించాలని రెండు పార్టీలూ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈమేరకు కొన్ని అంశాలపై కలిసి పని చేశాయి. అయినప్పటికీ పరస్పరం విశ్వసించుకోకపోవడంతో ఒకరిపై ఒకరికి ఏర్పడ్డ అపనమ్మకం విపరీత పరిణామాలకు దారితీస్తోంది. -
సడలని దీక్ష
సాక్షి, అనంతపురం : సమైక్యమే లక్ష్యమంటూ ఉద్యమకారులు కదం తొక్కుతున్నారు. లక్ష్యాన్ని చేరుకునే దాకా పోరు ఆపబోమని స్పష్టీకరిస్తున్నారు. 81 రోజులైనా అదే ఉత్సాహం, ఊపుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఉద్యోగులు, ఎన్జీఓలు, ఉపాధ్యాయులు సమ్మె విరమించి విధుల్లో చేరిపోయినా.. ప్రజలు మాత్రం ఉద్యమబాట వీడడం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్నారు. వీరికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుండడంతో మొక్కవోని దీక్షతో సమైక్యాంధ్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాన్ని కొనసాగించారు. అనంతపురం నగరంలో సర్పంచులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీరాజ్, వాణిజ్యపన్నుల శాఖ, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఎస్కేయూలో విద్యార్థి నాయకుడు పరశురాం నాయక్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రిజిస్ట్రార్ గోవిందప్ప సంఘీభావం తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బత్తలపల్లిలో రోడ్డుపై చదువుతూ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ర్యాలీ చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టి.. మానవహారాలు నిర్మిం చారు. రాయదుర్గంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. ‘మహాత్మా.. నీవైనా రాష్ట్రాన్ని కాపాడు’ అంటూ జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, గంట పాటు రాస్తారోకో చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు ఫుట్పాత్పై ఇంటి సామగ్రి అమ్మి నిరసన తెలిపారు. రాప్తాడులో విద్యార్థులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి. -
సమైక్యమే లక్ష్యం
సమైక్యాంధ్రను పరిరక్షిద్దాం.. సర్వతోముఖాభివృద్ధి సాధిద్దాం అంటూ జిల్లాలో సకల జనులు సమైక్య ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. గెలుపు పొందు వ రకు అలుపు లేదు మనకు అంటూ పోరుబాటలో దూసుకెళ్తున్నారు.ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె బాట వీడినా విద్యార్థులు, మిగిలిన వర్గాల వారు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపుతూ సమైక్య ఆందోళనలో వైఎస్సార్సీపీ తనదైన పాత్రను పోషిస్తోంది. ఉద్యోగులు సమ్మెబాట వీడి విధుల్లో చేరినా ఉద్యమం మాత్రం చల్లారలేదు. ప్రొద్దుటూరులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టి పుట్టపర్తి కూడలిలో సింహనాదం సభను నిర్వహించారు. పలుచోట్ల న్యాయవాదుల దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఆందోళనలు ప్రొద్దుటూరులో రాజుపాలెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన గుద్దేటి రాజారామిరెడ్డి ఆధ్వర్యంలో 18 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలు 60వ రోజుకు చేరుకోవడం విశేషం. వీరికి ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్లు నాగేంద్రారెడ్డి, నారాయణరెడ్డిలు సంఘీభావం తెలిపారు. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. చక్రాయపేట మండలానికి చెందిన 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో నందలూరు మండలం ఆడపూరు పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నేత రమేష్నాయుడు, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరు మండలం ఓబన కొత్తపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు లక్కిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో 14మంది, శెట్టిగుంట ఆదాం సాహెబ్, అంబటి మురళి ఆధ్వర్యంలో 16మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపైన నిలబడి నిరసన తెలిపారు. వీరికి ఆ పార్టీ నేతలు సుకుమార్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సాయికిశోర్రెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం మహానందిపల్లె మాజీ సర్పంచు పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ వేల్పుల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో 20మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు చిత్తా విజయప్రతాప్రెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రమణారెడ్డి, ఒ.ప్రభాకర్రెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురంలో వీఎన్పల్లె మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, అలిదెన మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో 50మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గంలో ప్రచార రథం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. రాయచోటిలో రామాపురం మండలానికి చెందిన నల్లగుట్టపల్లె, సరస్వతిపల్లె, చిత్తూరు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మురళీధర్రెడ్డి, నాగభూషణ్రెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో 40మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులురెడ్డి, జాఫర్ అలీఖాన్ సంఘీభావం తెలిపారు. కడపలో 48వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రియాజుద్దీన్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త అంజద్బాష, అఫ్జల్ఖాన్ సంఘీభావం తెలిపారు. కడపలో న్యాయవాదుల, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. ప్రొద్దుటూరులో ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్లో సింహనాదం సభను ఏర్పాటుచేశారు. ఈ సభ మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో కొనసాగింది. రాజంపేటలో భాష్యం స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. బద్వేలులో బోడపాడు గ్రామస్తులు, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. -
ఆగని పోరు
సాక్షి, నెల్లూరు : ఎన్జీఓలు సమ్మె విరమించినా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ మాత్రం ఆగలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు 80వ రోజూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదంటూ నినదించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థులు, వైఎస్సార్సీపీ నేతలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆందోళనలు కొనసాగించారు. వీఆర్సీ సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గాంధీ హానికి వినతి పత్రం సమర్పించారు. కోవూరులో చౌకదుకాణం డీలర్లు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. కోవూరు ఎన్జీఓ హోంలో సమైక్యరాష్ట్రం కోరుతూ చౌకదుకాణాల డీలర్ల ధర్నా నిర్వహించారు. కావలి పట్టణంలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొసాగుతున్నాయి. ఉదయగిరి పట్టణంలోని బస్టాండు సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం కాశీపేట సెంటర్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
పాలనలో పరుగులు
కర్నూలు(విద్య), న్యూస్లైన్: తాను పనిచేస్తూ.. కింది స్థాయి ఉద్యోగులనూ పని చేయించే దిశగా జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలలుగా పాలనలో స్తబ్ధత నెలకొంది. ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్పంచుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అధికారులు మొదలు అన్ని స్థాయిల సిబ్బంది కేంద్ర ప్రభుత్వ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సమ్మెకు తాత్కాలికంగా విరమణ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బరితెగించి సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై గురువారం కలెక్టర్ ప్రత్యక్షంగా దాడులు చేపట్టి ఇసుకాసురుల భరతం పట్టారు. ఇతకపై తరచూ తనిఖీ చేపడతానని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావుతో కలిసి కర్నూలు మండలం మిలటరీ కాలనీలోని జిల్లా పరిషత్ పాఠశాల.. గార్గేయపురం, నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్లను, చివరగా నందికొట్కూరు జిల్లా పరిషత్ బాలికలు, ప్రభుత్వ బాలుర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎం డిప్యూటీ డీఈవో అనుమతి తీసుకోకుండానే సెలవు పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో ప్రార్థనా సమయంలో ఉపాధ్యాయులు వస్తుండటాన్ని గుర్తించి మందలించారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ముందుండాలని సూచించారు. దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 50 శాతం లోపే ఉండటాన్ని కలెక్టర్ గుర్తించారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల నోట్స్ను పరిశీలించారు. వారికి ఎంత వరకు సిలబస్ పూర్తయ్యిందో తెలుసుకుని.. ఇకపై తరచూ కొన్ని పాఠశాలలను సందర్శిస్తానని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి, పబ్లిక్ పరీక్షల్లో ఫలితాల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. -
జనోద్యమం @ 80
సాక్షి, అనంతపురం : ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఉద్యమ బాట వీడుతున్నా సామాన్య జనం మాత్రం సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా పోరు సాగిస్తున్నారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో 80వ రోజైన శుక్రవారం కూడా ‘అనంత’లో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అనంతపురంలో ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్క్లాక్ సర్కిల్లో వందలాది మంది ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ విభాగం వద్ద ఆందళన చేశారు. యువ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ముట్టడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెలు అమ్ముతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మెరుపు సమ్మెకు దిగుతామని గుంతకల్లులో మునిసిపల్ ఉద్యోగులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. గుత్తిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. తోపుడుబండ్లపై పండ్లు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై..సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శెట్టూరులో జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. పెనుకొండలో న్యాయవాదులు, విద్యార్థులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వీరికి ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మద్దతు తెలిపారు. ఏపీ ఎన్జీవోల ఉద్యమంపై విమర్శలు గుప్పించిన మంత్రి కొండ్రు మురళి దిష్టి బొమ్మను జేఏసీ నాయకులు దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి.. అనంతరం రిలే దీక్ష చేపట్టారు. వీరికి కాపు భారతి సంఘీభావం తెలిపారు. కణేకల్లులో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. రాప్తాడులో జేఏసీ కన్వీనర్ ఎంఈఓ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలే దీక్ష కొనసాగింది. వీరికి వైఎస్సార్సీపీ నాయకులు వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు మనోహర్రెడ్డి, రవీంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధ్యాయులు విరామసమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆందోళన చేశారు. బత్తలపల్లిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. -
సడలని పోరు
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలన్న ఆకాంక్షతో జిల్లాలో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. చిన్నా..పెద్దా.. తేడా లేకుండా అందరూ కలసికట్టుగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరు సాగిస్తూనే ఉన్నారు. 79వ రోజు గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. గుంతకల్లు, ధర్మవరంలో ఆ పార్టీ నాయకులు రిలే దీక్షలు కొనసాగించారు. రాప్తాడులో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడలో సమన్వయకర్త కడపల మోహన్రెడ్డి, నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. గుంతకల్లులో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంలో పార్టీ నాయకుడు ఎల్ఎం మోహన్రెడ్డి సమైక్య శంఖారావం పోస్టర్లను విడుదల చేశారు. ఏపీఎన్జీఓ సంఘం నాయకుల పిలుపు మేరకు సమైక్యవాదులు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించారు. అనంతపురంలో పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, వైద్య ఆరోగ్య శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జేఎన్టీయూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కుర్చీలను అడ్డంగా తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూ, ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో సమైక్యవాదులు రహదారిపై మానవహారం నిర్మించారు. రాష్ట్ర విభజన జరిగితే రైతులు పండించిన ఫలసాయానికి మార్కెట్ సౌకర్యం తగ్గిపోయి.. గిట్టుబాటు ధర లభించదని కూరగాయలను అమ్ముతూ నిరసన తెలిపారు. గుత్తిలో జేఏసీ అధ్వర్యంలో రిలే దీక్ష చేయగా.. పామిడిలో మౌన దీక్ష చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సద్భావన సర్కిల్లో మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. కళ్యాణదుర్గంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో టీ సర్కిల్లో సమైక్యాంధ్ర టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి టిఫిన్ విక్రయించి నిరసన తెలిపారు. మడకశిరలో మానవహారం నిర్మించి.. రాస్తారోకో చేశారు. పెనుకొండ, గోరంట్ల, రాయదుర్గంలో రిలే దీక్షలు కొనసాగాయి. మహిళలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో వైద్య సిబ్బంది, ఇంజనీరింగ్ విద్యార్థులు, మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. ఉద్యమకారులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. హంద్రీ-నీవా కాలువలో కేంద్ర మంత్రుల ఫొటోలను నిమజ్జనం చేశారు. బెళుగుప్పలో జేఏసీ ఆధ్వర్యంలో పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. -
అదే పట్టు
సమైక్య ఉద్యమం నేటితో 80వ రోజుకు చేరుకుంది. జిల్లాలో సమైక్య ఉద్యమహోరు జోరుగా సాగుతోంది. ర్యాలీలు, మానవ హారాలతో నిరసన తెలియజేస్తున్నారు. రిలేదీక్షలతో సమైక్యకాంక్షను ఢిల్లీకి తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్రను సాధించి తీరుతామని నినదిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాక్షి, కడప: జిల్లాలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురువారంతో 79రోజులు పూర్తి చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు అలుపెరుగని పోరు సాగిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 66వ రోజుకు చేరాయి. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షాశిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కే సురేష్బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు, వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో రెవెన్యూ ఉద్యోగులు, గ్రామనౌకర్లు, వీఆర్వోలు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, పూల అంగళ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ దీక్షాశిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. రాజంపేటలో బార్అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శరత్కుమార్రాజు ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్జీవోలు చేపట్టిన రిలేదీక్షలు గురువారంతో 60రోజులు పూర్తి చేసుకున్నాయి. రైల్వేకోడూరులో జేఏసీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీతో కలిసి ధర్నా నిర్వహించారు. బద్వేలులో వైద్య, ఆరోగ్య సిబ్బంది జేఏసీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నర్సులు, ఏఎన్ఎంలు రిలేదీక్షలకు కూర్చున్నారు. మైదుకూరులో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రొద్దుటూరులో మునిసిపల్ ఉద్యోగుల దీక్షలు గురువారంతో 60వ రోజుకు చేరాయి. ప్రొద్దుటూరులో చేపట్టదలిచిన విద్యార్థి సింహగర్జన ఏర్పాట్లపై మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సమావేశం నిర్వహించారు. రాయచోటిలో ఏపీ ఎన్జీవోలు, జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం సింహపురి వాసులు 77 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజలను కష్టాల పాలుచేయవద్దని, అందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరు ఎన్జీఓ భవన్లో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్ష చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంలో పూసలకాలనీవాసులు కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. వింజమూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్క్లాక్ సెంటర్లో సమైక్యవాదులు రిలేదీక్ష చేసి, రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన రైతుగర్జన విజయవంతమైంది. రిలేనిరాహార దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ నాయకులు, ప్రజలు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కావలిలో ైవె ఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఉన్న వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో పలుచోట్ల రిలేదీక్షలు జరిగాయి. పొదలకూరులో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పొదలకూరు పోలీసుస్టేషన్ను ముట్టడించి ఆందోళనకు దిగారు. -
ఉద్యమ వ్యవసాయం చేయండి
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: రైతులు పంటలసాగుకు తాత్కాలికంగా విరామం ప్రకటించి సమైక్యాంధ్ర ఉద్యమ వ్యవసాయం చేయాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. రైతులు ఉద్యమపగ్గాలు చేతపట్టాలని, అప్పుడే సమైక్యాంధ్ర అనే ఫలసాయం అందుతుందని ప్రసాదరెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేని నేతలను చెర్నకోలతో అదిలించి, కదిలించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు మిగులుజలాల ఆధారంగానే గాలేరు నగరి, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టులు ఆధారపడ్డాయన్నారు. కర్నాటక నుంచి నదీ జలాలు రానందువల్లే అనంతపురం జిల్లా కరువు కాటకాలకు నిలయమైందని, తుంగభద్ర జలాలు నిబంధనల ప్రకారం వచ్చి ఉంటే వారి పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి విభజన వలన మిగతా వారికంటే పూర్తిగా నష్టపోయేది రైతులేనని తెలిపారు. కృష్ణా నదీజలాలపై అల్మట్టి, నారాయణ కేడ్, జూరాల ప్రాజెక్టులు నిర్మించారని, తెలంగాణ విభజన జరిగి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మనకు సాగునీరు కరువు అవుతుందన్నారు. బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం వల్ల మనకు నష్టం జరిగిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి మిడ్పెన్నార్ ద్వారా కర్నాటక బార్డర్ వరకు తాగునీటిని తీసుకెళ్లడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ మల్లేల లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ ఉద్యమానికి ప్రతి ఇంటి నుంచి రైతులు తరలి రావాలని కోరారు. ఎన్జీఓ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఏ క్షణంలోనైనా ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉద్యమంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం కావాలని కోరారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం విభజన జరిగితే జూరాల ప్రాజెక్టు ఎత్తు పెంచినా, శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ సరఫరాకు ముందుగా నీటిని విడుదల చేసినా మనకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ జేఏసీ నాయకుడు జయరాజ్, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు రషీద్ఖాన్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకరాపురం ప్రసాదరెడ్డి, వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్రెడ్డి, రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు. -
దీక్షా దక్షులు
సాక్షి, కడప : సమైక్యాంధ్రే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అలుపెరగని రీతిలో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షా దక్షతతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు దసరా పండుగ సోమవారం రోజు సాగాయి. మంగళవారం సైతం దీక్షలను కొనసాగించారు. ఈ దీక్షలకు జిల్లా కన్వీనర్ సురేష్బాబుతోపాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సంఘీభావం తెలిపారు. కడప నగరంలో సోమవారం వైఎస్సార్సీపీ నగర ఉపాధ్యక్షుడు మున్నా ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్బాబు, అంజాద్బాషా, మాసీమబాబు సంఘీభావం తెలిపారు. మంగళవారం నగర మాజీ కార్పొరేటర్ నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో 17 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అంజాద్బాషా, అఫ్జల్ఖాన్లు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం రోజు 27వ వార్డుకు చెందిన రామ్మోహన్రెడ్డి, ప్రతాప్రెడ్డి నేతృత్వంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్రెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో సోమవారం ఎస్.కొత్తపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత వేమన రాజా నేతృత్వంలో 20మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్ సీపీ నేతలు బ్రహ్మానందరెడ్డి, సుకుమార్రెడ్డిలు సంఘీభావం తెలిపారు. మంగళవారం ఎస్.ఉప్పరపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 10మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.రాజంపేట పట్టణంలో సోమవారం మైనార్టీ విభాగం వైఎస్సార్సీపీ నాయకుడు జావెద్బాషా ఆధ్వర్యంలో 40 మంది దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం కూచివారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్రెడ్డి ఆధ్వర్యంలో 60మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో సోమవారం రోజు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం గిరినగర్ కాలనీకి చెందిన 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ఒ.ప్రభాకర్రెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురం పట్టణంలో సోమవారం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మస్తానయ్య ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ నాయయకుడు వల్లెల సునీల్రెడ్డి ఆధ్వర్యంలో 40మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి సంఘీభావం తెలిపారు. పులివెందులలో సోమవారం కొత్త బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వాసులు 70 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు వరప్రసాద్, ప్రభాకర్, చిన్నప్ప ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రాయచోటిలో సోమవారం లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం గాలివీడు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత నాగభూషణ్రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
పండుగ పూట.. పోరు బాట
సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో ఉద్యమం జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల వారిని ఉద్యమంలో భాగస్వాములను చేసే బాధ్యతను సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు తమ భుజ స్కందాలపై వేసుకున్నారు. పండుగ రోజుల్లోనూ పోరుకు విరామం ఇవ్వకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రైతులను కార్యోన్ముఖులను చే స్తున్నారు.జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి. సాక్షి, కడప: సమైక్యాంధ్ర ప్రకటన వచ్చిన రోజే నిజమైన పండుగ అని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు పోరు ఆగదని జిల్లా ప్రజలు నినదించారు. దసరా సంబరాల్లోనే సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యమం నడిపిస్తూ సమరోత్సాహంతో ముందుకు సాగారు. విభజనకు నిరసనగా వినూత్న ప్రదర్శనలు, విచిత్ర వేషధారణలు, రిలే దీక్షలతో సకల జనులు పోరును సాగించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సుల్లో సమైక్య ఆకాంక్షను బలంగా వినిపించారు. కడప నగరంలో సోమ,మంగళవారాల్లో సమైక్య వాదుల దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సాగునీటిపారుదల, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సాగాయి. మంగళవారం రిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక శిబిరంలో రైతులు, మైదుకూరు ప్రాంత ఉపాధ్యాయులు, డ్వామా, ఏపీఎంఐపీ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరాన్ని ఉద్దేశించి ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు ప్రసంగించారు. జమ్మలమడుగు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు సాగాయి. మంగళవారం పత్రికా విభాగానికి సంబంధించి హెచ్ఆర్, సర్క్యులేషన్, పేపర్ బాయ్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో క్రైస్తవ జేఏసీ నాయకుడు అగస్తీన్రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిలు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో న్యాయవాదులు, మున్సిపల్ సిబ్బంది దీక్షలు సోమవారం కొనసాగాయి. మంగళవారం ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు పట్టణంలో భారీ రైతు సదస్సును నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలను రైతులకు వివరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నేత రాచమల్లు ప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, టీడీపీ నాయకురాలు లక్ష్మిప్రసన్న సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రైతు సదస్సును నిర్వహించి అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర గీతాలు, విచిత్ర వేషధారణలతో నిరసన వ్యక్తంచేశారు. రాజంపేట పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. జేఏసీ కన్వీనర్ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. దీనికి వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సురేష్బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో సోమ,మంగళవారాల్లో గ్రామ నౌకర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మోకాళ్లపై నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. మంగళవారం పట్టణంలో రైతు సదస్సును నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి జేఏసీ నాయకులు రాష్ర్టం విడిపోతే కలిగే కష్టనష్టాలను వివరించారు. పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి ఎన్జీఓలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం ఎన్జీఓల ఆధ్వర్యంలో కొత్త బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై పడుకొని సమైక్య నినాదాలు చేశారు. మైదుకూరులో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటి పట్టణంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, సమైక్యాంధ్ర జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో సోమ, మంగళ వారాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వ ఏరియా ఆస్ప్రత్రి వైద్యులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించి వైఎస్సార్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఓపీ సేవలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. -
పండగ పూటా పోరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం 75వ రోజుకు చేరుకుంది. విజయదశమి పండగ రోజూ ఉధ్యమం ఉధృతంగా సాగింది. ఆదివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని ఎన్జీఓ భవన్లో ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో ఎస్యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉదయగిరిలోని దీక్షా శిబిరంలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ సెంటర్లో ఒంటికాలుపై నిలుచుని నిరసన తెలియజేశారు. బస్టాండ్ సెంటర్లో జరిగిన రిలేదీక్షలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కావలిలోనూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు దీక్షలు కొనసాగించారు. వెంకటగిరిలోని కాశీపేట సెంటర్లో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట, నాయుడుపేటలో జేఏసీల ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్లోనూ సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్క్లాక్ సెంటర్లో రిలేదీక్షలు కొనసాగాయి. సోనియా, దిగ్విజయ్సింగ్, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలకు గుమ్మడి కాయలకు తగిలించి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పగలగొట్టారు. -
సూక్ష్మ సేద్యానికి బ్రేక్
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మె సూక్ష్మ సేద్యంపై ప్రభావం చూపుతోంది. డ్రిప్ యూనిట్లు కావాలంటే దరఖాస్తుతో పాటు మట్టి, నీటి పరీక్షలకు సంబంధించి నమూనా పత్రాలు జత చేయాల్సిరావడంతో రైతుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డ్రిప్తో పాటు సెమి పర్మనెంట్ స్ప్రింక్లర్ల యూనిట్లకూ అదే పరిస్థితి. దీంతో ఈ ఏడాది సకాలంలో డ్రిప్ యూనిట్లు మంజూరయ్యేలా కనిపించడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి సరిగ్గా ఆరు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)కి కమిషనరేట్ నుంచి టార్గెట్లు ఖరారయ్యాయి. జిల్లా అధికారులు 20 వేల హెక్టార్లకు డ్రిప్ అవసరమని పంపిన ప్రతిపాదనలు పక్కనపెట్టి తొలివిడతగా 5,900 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు కేటాయించారు. 1700 హెక్టార్లకు సెమి పర్మనెంట్ స్ప్రింక్లర్లు కేటాయించినా వాటిపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. గతేడాది కూడా జిల్లాకు 1,100 హెక్టార్లు టార్గెట్ ఇచ్చినా అందులో 100 హెక్టార్లకు కూడా రైతులు వినియోగించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే వీటి అవసరం రైతులకు లేదనే విషయం అర్థమవుతుంది. వాటి ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఈ కారణంగా 90 శాతం మంది రైతులు డ్రిప్ కోసం ఎగబడుతున్నారు. గత జనవరి నుంచి దాదాపు 9 నెలల పాటు డ్రిప్ యూనిట్ల మంజూరు ప్రక్రియను ఆపేశారు. దీంతో 8 నుంచి 9 వేల మంది రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎపుడెపుడా అని ఎదురుచూసే క్రమంలో కమిషనరేట్ నుంచి టార్గెట్లు ఖరారు చేయడంతో రైతులు సంబరపడ్డారు. కానీ... ఈ సారి కొత్త నిబంధన పెట్టడంతో మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా మట్టి, నీటి పరీక్షలు చేయించి వాటి నమూనా పత్రాలు జత చేయాలనే షరతు విధించారు. గతంలో మట్టి, నీటి నమూనాలు ఎప్పుడిచ్చినా దాంతో సంబంధం లేకుండా డ్రిప్ యూనిట్లు మంజూరయ్యేవి. ఇప్పటికే వాటి నమూనాలు లేకుండా వేలాది మంది రైతులు దరఖాస్తులు సమర్పించారు. ఇపుడు వాటిని వెనక్కి తీసుకుని నమూనా పత్రాలు జమ చేయాల్సి ఉంది. ఇప్పటికిపుడు మట్టి, నీటి పరీక్షలు చేయించుకోవాలనే అలాంటి సదుపాయం అందుబాటులో లేదు. అధికారులు సమైక్య సమ్మెలో ఉన్నందున భూసార, నీటి పరీక్ష ప్రయోగాలలు నిరవధికంగా మూతబడ్డాయి. ప్రయోగశాల తెరచినా సిబ్బంది కొరత కారణంగా వేగంగా పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కొత్త నిబంధన వల్ల డ్రిప్ రైతులకు సకాలంలో యూనిట్లు అందడం కష్టంగా మారింది. -
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
కడప అర్బన్, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ఆగస్టు 12 నుంచి ఏన్జీఓ సంఘ నాయకులతోపాటు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. 73 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు శనివారం తెల్లవారుజాము నుంచే బస్ సర్వీసులను ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వం యూనియన్ల నాయకులతో రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎండి ఏకె ఖాన్లు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈనెల 10వ తేదిన 954 జీఓను విడుదల చేశారు. ఆ జీఓలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందన్న విషయంలో స్పష్టత లేదని, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. మరలా ఈనెల 11న జరిగిన చర్చల్లో 961 జీఓను విడుదల చేశారు. దీంతో చర్చలు సఫలమయ్యాయి. కార్మికులంతా ఉత్సాహంగా విధులకు హాజరయ్యారు. -
లక్ష్యం దిశగా..
ఓ వైపు ప్రజల అవసరాలను గుర్తిస్తూ...వారికి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూనే.. మరో వైపు సమైక్యాంధ్ర పరిరక్షణ పోరును సాగిస్తున్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఉపాధ్యాయులు సమ్మె విరమించారు. దసరా నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అయినా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ బాటను మాత్రం వీడలేదు. లక్ష్యం కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రధానంగా ఎన్జీఓలు తమ పోరును విరమించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు శనివారం దీక్ష విరమించారు. ఆర్టీసీ ఆర్ఎం గోపీనాథరెడ్డి దీక్షకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. జిల్లాలో అత్యంత వైభంగా జరిగే దసరా వేడుకల నేపథ్యంలో ప్రజలకు ఆటంకం కలగకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 73రోజుల తర్వాత శనివారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పాయి. ఇన్ని రోజలుగా అధికచార్జీలు చెల్లించి ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు బస్సులను ఆశ్రయించిన ప్రయాణికులు బస్సులు తిరగడంతో ఆనందంగా ఉన్నారు. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు, నగరపాలక సిబ్బంది, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ సిబ్బంది రిలే దీక్షలు నడుస్తున్నాయి. ప్రొద్దుటూరులో ఎన్జీవోలు, న్యాయవాదులు, మునిసిపల్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ ఆధ్వర్యంలో 10మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఉద్యమకాలంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలు 6లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు రిలేదీక్షలు చేపట్టారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శనివారం ఉదయం 10-12గంటల వరకూ వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా, చంద్రబాబుదీక్ష భగ్నానికి నిరసనగా సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజంపేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులు దీక్షలు చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్కుమార్రాజు, జేఏసీ చైర్మన్ రమణ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో తులసీ స్కూలు విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. మైదుకూరులో నందికాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆపై మానవహారం చేసి రిలేదీక్షలకు కూర్చున్నారు. బద్వేలులో మాలమహానాడు నేత ఎస్రోమ్ ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. మహిళలు భారీసంఖ్యలో తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. -
కదిలిన జనరథాలు
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్లైన్ :రోడ్లకు మళ్లీ మునుపటి ‘కళ’ వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండు నెలలుగా కనుమరుగైన ‘జనరథాలు’ మళ్లీ కనిపించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణతో శనివారం రాజమండ్రి రీజియన్లోని 9 డిపోల నుంచీ బస్సులు తిరిగాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నిర్ణయించడంతో ఆగస్టు 13 నుంచి 836 బస్సులు గత 60 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాగా ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో 4,200 మంది విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. శనివా రం మధ్యాహ్నానికి 588 కండక్టర్లకు గాను 442 మంది, 675 మంది డ్రైవర్లకు గాను 442 మంది విధులకు హాజరయ్యారు. మిగతా సిబ్బంది దూరప్రాంత సర్వీసులకు, షిఫ్ట్లకు హాజరవుతున్నారు. చర్చల్లో ఆర్టీసీ కార్మికులందరికీ దసరా బోనస్ ప్రకటించి, తొలిరోజు విధులకు హాజరయ్యే వారందరికీ ఇది వర్తిస్తుందని తెలపడంతో జిల్లాలోనున్న కార్మికులంతా విధులకు ఉత్సాహంగా హాజరయ్యారు. దసరా సందర్భంగా దూరప్రాంతాలు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయనే సమాచారంతో ఉదయం నుంచే బస్టాండ్లకు చేరుకున్నారు. జిల్లా నుంచి ఉదయం హైదరాబాద్కు ఎనిమిది ప్రత్యేక బస్సులను నడపగా రాత్రికి మరికొన్ని అదనపు బస్సులను నడిపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లలో అదనంగా బస్సులు నడిపారు. కాగా ఉదయం నుంచి బస్సులు తిరుగుతున్నా ప్యాసింజర్ సర్వీసుల్లో మాత్రం మధ్యాహ్నం నుంచే రద్దీ కనిపించింది. నష్టం రూ.50 కోట్ల పైనే.. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి 12 వరకు దఫదఫాలుగా బస్సులను ఉద్యమకారులు ఆపేశారు. దీంతో రీజియన్లో రూ.5 కోట్ల వరకు నష్టం వచ్చింది. అనంతరం ఆగస్టు 13 నుంచి 60 రోజుల పాటు సమ్మె కొనసాగడంతో రూ.45 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇన్నిరోజులుగా ఆగిపోవడంతో బస్సుల్లో తలెత్తిన లోపాలకు మరి కొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. కాగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోవాలాలు, ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల వారు ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా చార్జీలు దండుకుని సొమ్ము చేసుకున్నారు. సమ్మె కాలంలో రైళ్లయితే గాలి చొరబడడానికి సందు లేనంత కిక్కిరిసి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు తిరిగి నడవడంతో ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. -
కళతప్పిన దసరా
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: దసరా అంటేనే అందరిలో ఓ ఆనందం. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు, రైతులు..ఇలా అందరిలోనూ విజయదశమి ఉత్సాహం నింపుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ఆనందోత్సవాహాలు కరువయ్యాయి. ఉద్యోగులు, కార్మికులకు రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో పండగపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. సమ్మె కారణంగా అన్ని రకాల వస్తువుల ధరలు నింగినంటుతుండటంతో సామాన్య ప్రజలు సైతం సాదాసీదాగానే పండగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దసరా ఉత్సవాల్లో భాగ మైన విజయదశమి పండగకు ప్రత్యేకత ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించే వారితో పాటు గృహప్రవేశాలు, వివాహాలకు దసరా ముహుర్తాల్లోనే ప్రాధాన్యం ఇస్తారు. సైకిల్ నుంచి భారీ వాహనాల వరకు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్నింటికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. హిందువులతో పాటు మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఈ పండగ నాడు ఆయుధాల పూజ నిర్వహిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దసరాపై ఈ మారు సమైక్య ఉద్యమం తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు నెలలుగా అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కూలీలకు ఉపాధి కరువైంది. వరుస బంద్ల నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక వ్యాపారులు నిత్యావసర సరుకులను పెద్దగా దిగుమతి చేసుకోలేదు. ఈ క్రమంలో అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల చేతిలో నగదు లేకపోవడంతో పండగపై ఆసక్తి కనబచరడం లేదు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పండగకు సరుకులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఎప్పుడూ దసరా సందర్భంగా కొనుగోలుదారులతో కిటకిటలాడే నెల్లూరులోని స్టోన్హౌస్పేట ఈ సారి వెలవెలబోతోంది. సాధారణంగా దసరా సీజన్లో వారం రోజుల వ్యవధిలో రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు వ్యాపారాలు జరిగితే ఇప్పుడు మాత్రం రూ.20 లక్షల కూడా దాటలేదని వ్యాపారులు చెబుతున్నారు. బోసిపోతున్న వస్త్రదుకాణాలు ఏటా దసరా సందర్భంగా పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ అందజేస్తాయి. చిరువ్యాపారులు సైతం తమ వద్ద పనిచేసే కార్మికులు దుస్తులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి మాత్రం వ్యాపారాలు లేకపోవడంతో పరిస్థితి తిరగబడింది. ఇటీవల నాలుగు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆదాయాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఈసారి బోనస్ అందజేసే విషయంలో వెనుకంజ వేశారు. మొత్తం మీద దసరా పండగ కళతప్పింది. -
సమైక్య లక్ష్యం..సడలని సంకల్పం
కర్నూలు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని రగిలిస్తున్నారు. అలాగే ఉద్యమ ఆవశ్యకతపై చైతన్యవంతం చేస్తూ నియోజకవర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో పార్టీ నాయకుడు బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో మందలూరు గ్రామానికి చెందిన రైతులు సమైక్యవాణి వినిపించారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మండల కన్వీనర్ చిన్నవీరన్న ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఆత్మకూరులో ఏరువా రామచంద్రారెడ్డి, డోన్లో ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో నల్లమేకలపల్లె వాసులు కూర్చున్నారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్లలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు ఆపబోమని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కౌతాళం మండలం కంబళనూరు క్యాంప్నకు చెందిన కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు. అలాగే నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. శాతనకోట గ్రామానికి చెందిన 30 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్ని సమైక్య నినాదాలు చేశారు. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. -
ఇడగొడితే..బతికేదెట్లా?
క్రిష్ణగిరి/ కోడుమూరు, న్యూస్లైన్:‘ ఏమొచ్చింది నాయనా... ఈ కాంగిరేసోళ్లకు... ఈ రాష్ట్రాన్ని ఇడగొడుతున్నారంట... పిల్లల బతుకులు ఏంగావాలా? బతికేదెట్లా? ఇడగొడితే ఈ కాలవకి నీళ్ళు రావంటా? మీరే ఏదైనా సేయండయ్యా..’’అంటూ మహబూబ్ బీ (70) అనే వృద్ధురాలు.. వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డికి విన్నవించుకుంది. సమైక్యాంధ్ర కోసం ఆయన చేపట్టిన సమైక్య పోరు పాదయాత్ర నాలుగోరోజు శుక్రవారం లాలుమాను పల్లె నుంచి ప్రారంభమై చుంచుఎరగ్రుడి, ఎరుకలి చెరువు, క్రిష్ణగిరి, చెరుకులపాడు మీదుగా వెల్దుర్తి వరకు దాదాపు 28 కి.మీ.లమేర కొనసాగింది. కె.యి. సోదరులకు కంచుకోటగా ఉన్న క్రిష్ణగిరి మండలంలో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్రను చూసేందుకు పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు వచ్చారు. ప్రయాణికులు తమ వాహనాలను ఆపి ఆయనతో కరచాలనం చేశారు. క్రిష్ణగిరి గ్రామం దగ్గర రాముడు అనే రైతు తన గోడును కోట్ల హరిచక్రపాణిరెడ్డికి విన్నవించాడు. సాగుచేసిన వేరుశనగ పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గురించి ప్రభుత్వానికి చెప్పాలని కోరాడు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నెకల్లు సురేంద్ర రెడ్డి, కరుణాకర్ రెడ్డి, క్రిష్ణగిరి మండల కన్వీనర్ చిట్యాల రాజేశ్వర్ గౌడ్, బీసీసెల్ మండల కన్వీనర్ రామాంజనేయులు, లకిష్మకాంతా రెడ్డి, కోవెలకుంట్ల వెంకటేశ్వర్లు, ఎస్.ఎరగ్రుడి బజారి, మహిళా మండల కన్వీనర్ రాములమ్మ, కోడుమూరు మండల కన్వీనర్ గిరిప్రకాశ్ రెడ్డి, టౌన్ కార్యదర్శి డీలర్ క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కార్యకర్తల్లో నూతన ఉత్తేజం: సమైక్యాంధ్ర కోసం కోట్ల హరిచక్రపాణి రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. క్రిష్ణగిరి మండలంలోని గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు. దారుల వెంట ప్రజలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. -
సమ్మెను ఆపేది లేదు
వైవీయూ, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వెలువడే వరకు ఉద్యమానికి ఆపేది లేదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏజేసీ సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని స్టేట్గెస్ట్హౌస్లో జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సహకరిస్తున్నారంటే ప్రజల్లో సమైక్యాంధ్ర అవసరం ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. ఉద్యమం తీవ్రస్థాయిలో చేయడం వల్లే ఇప్పటికీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొన్ని సంఘాలు మాత్రం విధులకు హాజరవుతున్నాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదని, చాలామంది మధ్యాహ్న భోజనం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఉపాధ్యాయులు సమ్మెబాట వీడారని, అయితే ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారన్నారు. ఎన్జీఓ అధ్యక్షుడు కె.వి. శివారెడ్డి మాట్లాడుతూ అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామన్నారు. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులను కూడా ఉద్యమంలోకి తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నామన్నారు. జెడ్పీ సీఈఓ మాట్లాడతూ విధులకు హాజరవుతూ రోజుకో విభాగం వారితో ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఈశ్వరయ్య, కడప ఆర్డీఓ హరిత, నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి, ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు, పశుసంవర్థకశాఖ జేడీ వెంకట్రావు, మైనార్టీశాఖ ఈడీ శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి ఖాదర్బాషా, జిల్లా అధికారులు అపూర్వసుందరి, ప్రతిభాభారతి, భాస్కర్రెడ్డి, ప్రసాద్, ఎంఈఓ నాగమునిరెడ్డి, మధుసూధన్రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య లక్ష్యం..దీక్షామార్గం
కర్నూలు, న్యూస్లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమకార్యచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి సమైక్య పోరు పాదయాత్ర బుధవారం రెండో రోజు కొనసాగింది. హోసూరు నుంచి ప్రారంభమై పత్తికొండ, రాతన, తుగ్గలి మీదుగా ఎద్దులదొడ్డి వరకు సాగింది. ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు పద్మావతి నగర్లోని ఆర్చి దగ్గర కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల్లో పది మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆదోనిలో స్థానిక నాయకులు చంద్రకాంత్రెడ్డి, ప్రసాదరావు, అబ్దుల్ ఖాదర్ నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డలో బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల్లో 12 మంది పాల్గొన్నారు. మండల కన్వీనర్ చిన్నవీరన్న, ఆలూరు సింగిల్ విండో ఛైర్ పర్సన్ సౌమ్యారెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పాల్గొన్నారు. డోన్లో మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో పట్టణానికి చెందిన పది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో కౌతాళం మండలం కాత్రికి, లింగాలదిన్నె గ్రామానికి చెందిన 15 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో స్థానిక నాయకులు బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరుచరితారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరీశంకర్ కాంప్లెక్స్ దగ్గర రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
సమైక్యాంధ్ర కోసం 71 రోజులుగా అలుపెరగని పోరాటం
సాక్షి ప్రతినిధి, కర్నూలు :ఊరూ.. వాడ, చిన్నా.. పెద్దా తేడా లేకుండా జనం సమైక్యాంధ్ర కోసం 71 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నియోజక వర్గ సమన్వయకర్తలు, మండల నేతలు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం ఉద్యమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రైల్వేశాఖ సహాయం మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి విభజన ప్రకటన వెలువడిన రోజే ఢిల్లీ వెళ్లారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్రెడ్డి అధికంగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఒకటి రెండు సార్లు జిల్లాకు వచ్చినా వారిని సమైక్యవాదులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ వెంకటేష్ తాను సమైక్యవాదినని మీసం మెలేసి తొడగొట్టి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో ఉద్యమం మహోద్యమంగా మారింది. ఉద్యమకారులు తీవ్రస్థాయిలో ఉద్యమాలకు తెరతీశారు. టీజీ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలులో ఇంతపెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మంత్రి కానీ, ఆయన అనుచరులు కానీ ఉద్యమకారులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా ఉద్యమంలో పాల్గొని ఓ రోజు దీక్ష చేసి వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి ఉద్యమం ప్రారంభంలో ఓ రోజు ర్యాలీలో పాల్గొని హైదరాబాద్ వెళ్లిపోయారు. కేబినెట్ ఆమోదం తెలియజేసిన రోజు పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను సమైక్యవాదులు నమ్మటం లేదు. ఇక కోడుమూరు, నందికొట్కూరు, ఆలూరు ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, లబ్బి వెంకటస్వామి, నీరజారెడ్డి పత్తాలేకుండా పోయారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి మాత్రం ఐదురోజులు నిరాహారదీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర శూన్యమేనని సమైక్యవాదుల అభిప్రాయం. రెండు కళ్ల సిద్ధాంతానికే కట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యేలు... అధికార కాంగ్రెస్ నేతలు తీరుకు ఏమాత్రం తీసిపోని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. పొలిట్బ్యూరో సభ్యులు కేఈ కృష్ణమూర్తి డోన్కు వచ్చిన సందర్భంలో ఉద్యమం చేస్తున్నవారికి సంఘీబావం తెలియజేసి వెళ్లిపోయారు. తరువాత అటువైపు తిరిగిచూసిన దాఖలాలు కనిపించలేదని ఉద్యమకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కర్నూలులో దీక్షా శిభిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఆదోనిలో ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కూడా మొదట్లో ఆందోళనలో పాల్గొన్నారు. ఆతరువాత కనిపించకుండాపోయారు. మిగిలిన నియోజక వర్గ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారికేమీ తీసిపోని విధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమం చేయలేకపోయినప్పటికి విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటానికే మొగ్గుచూపుతున్నారని సమైక్యవాదులు విమర్శలు చేస్తున్నారు. ఒకరిని విమర్శించటానికే పరిమితమైన కాంగ్రెస్, టీడీపీ నేతలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై దాడులుకు దిగామని చెపుతున్నారు. అలా దాడులకు దిగిన సమైక్యవాదులపై కొందరు అధికార కాంగ్రెస్ పెద్దలు అక్రమ కేసులు బనాయించటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీరికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పితీరుతామని హెచ్చరిస్తున్నారు. అలుపెరగని పోరుచేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్లగడ్డ శాసనభ్యురాలు, వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆదినుంచీ ఉద్యమంలో దూకుడుగా ఉంటూ కార్యకర్తలను, శ్రేణులను ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కూడా ఉద్యమంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తన అనుయాయులూ పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఆ పార్టీకి చెందిన సమన్వయ కర్తలూ పాదయాత్రలతోనూ, రిలే దీక్షలతోనూ ముందడుగు వేసి ప్రజా మన్ననలు పొందుతున్నారు. -
పోరాటం ఆగదు విద్యుత్ జేఏసీ
అనంతపురం న్యూటౌన్, న్యూస్లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రత్నామ్నాయాలు, ప్యాకేజీలతో తమను మభ్యపెట్టలేరని విద్యుత్ జేఏసీ జిల్లా చైర్మన్ సంపత్కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాతూరు పవర్ ఆఫీస్ నుంచి టవర్క్లాక్ వరకు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సీమాంధ్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం, ప్యాకేజీలిస్తాం, మీ బాధను పంచుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం దారుణమన్నారు. నిజంగా వారికి సీమాంధ్రులపై అంతటి మమకారం ఉంటే, ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సీమాంధ్రుల మనోభావాలను, వారి త్యాగాలను ఏ మాత్రం పట్టించుకోకుండా రాతిబొమ్మలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రజలందరూ మద్దతునివ్వడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకునే ఈ ఉద్యమం చేస్తున్నారని అభినందిస్తున్నారన్నారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్క్లాక్ వద్దకు చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు చంద్రమోహన్, పద్మ, ఎంఎల్ఎన్రెడ్డి, తులసీకృష్ణ, మేఘరాజు, రంగస్వామి, రంగయ్య, నాగరాజు, అక్రం, దాదాపీర్, ముత్తు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
ఉధృతంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
సాక్షి, అనంతపురం :రోజులు గడిచే కొద్దీ సమైక్య ఉద్యమం మరింత బలపడుతోంది. 71వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు కరెంటు సరఫరా నిలిపేశారు. విద్యుత్ కోత, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సమ్మె వల్ల మూడో రోజు కూడా జిల్లా సర్వజనాస్పత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పలేదు. జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులు, ఏటీఎంలను బంద్ చేశారు. అనంతపురం నగరంలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ర్యాలీలు నిర్వహించా రు. కలిసుంటే కలదు సుఖం, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరి జీవితాల్లో వెలుగులు.. అంటూ నినదించారు. సమైక్యవాది మల్లికార్జున నాయక్ మృతికి సంతాపసూచికంగా ఉద్యోగ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించాయి. స్థానిక టవర్ క్లాక్ కూడలిలో ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు కేంద్ర మంత్రులకు పిండప్రదానం చేశారు. ఆర్య వైశ్యులు భారీ ర్యాలీ.. ఆటపాటలతో సమైక్య వాణి వినిపించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి.. సప్తగిరి, టవర్ క్లాక్ కూడళ్లలో మానవహారం నిర్మించారు. పంచాయతీ రాజ్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ శాఖ నాల్గో తరగతి ఉద్యోగులకు దసరా పండుగ సరుకులను ఎస్ఈ అందజేశారు. సమైక్యవాదులు ఎస్కేయూ నుంచి ఆకుతోటపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో జేఏసీ ఆధ్వర్యాన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు సమాధి కట్టి.. పిండప్రదానం చేశారు. రాష్ట్రం విడి పోతే నీటి చుక్క కూడా దొరకదంటూ గుంతకల్లులో జేఏసీ నాయకులు బిందె నీరు రూ.500లకు విక్రయిస్తూ నిరసన తెలిపారు. పామిడిలో జేఏసీ నాయకులు చిరంజీవి, బొత్స, కావూరి వేషధారణలో సోనియాగాంధీ చుట్టూ భజన చేస్తున్నట్లుగా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంత్రుల మాస్కులు ధరించి ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు రోడ్లు ఊడ్చారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో హాస్టల్ వార్డెన్లు ఒక్క రోజు సామూహిక దీక్ష చేపట్టారు. వీరికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మద్దతు తెలిపారు. తలుపులలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. కళ్యాణదుర్గంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలు చేస్తూ.. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. మడకశిరలో జేఏసీ నాయకులు ఇండేన్ గ్యాస్ గోదామును ముట్టడించారు. అమరాపురం, రొళ్లలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ర్యాలీలు, మానవహారం చేపట్టారు. సెల్టవర్ ఎక్కి సమైక్య నినాదాలు చేశారు. పుట్టపర్తిలో విద్యుత్ సరఫరా లేక సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు బంద్ అయ్యాయి. బుక్కపట్నంలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. మల్లికార్జున నాయక్ మృతికి సంతాపంగా పెనుకొండలో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ, భిక్షాటన చేపట్టారు. కేసీఆర్, దిగ్విజయ్, సోనియా దిష్టిబొమ్మలకు సమాధి కట్టి పిండప్రదానం చేశారు. పెనుకొండ, పుట్టపర్తి, శింగనమల, గార్లదిన్నె, ఉరవకొండలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించారు. పరిగిలో భారీ ర్యాలీ చేశారు. తాడిపత్రిలో మానవహారం నిర్మించారు. కణేకల్లులో ముస్లింల సమైక్య గర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కనగానపల్లిలో సమైక్యవాది రామచంద్రారెడ్డి చేపట్టిన 48గంటల దీక్షను విరమించారు. రాప్తాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి.. కార్యాలయాలు బంద్ చేయించారు. వజ్రకరూరులో పందికుంట గ్రామస్తులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కూడేరు, బెళుగుప్పలో రహదారిపై ఆందోళన చేశారు. -
జోరుతగ్గని పోరు
సాక్షి, నెల్లూరు : సమైక్యపోరు మొదలై 70 రోజులు దాటుతున్నా నేటికీ సింహపురిలో హోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ జిల్లావాసులు నినదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య పోరు మంగళవారం ఉధృతంగా సాగింది. విద్యుత్ సిబ్బంది సమ్మెతో మూడో రోజు జిల్లాలో పగటి పూట విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో పొట్టి శ్రీరాములు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చాకిరేవు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గూడూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్కుమార్, పట్టణ కన్వీనర్ నాసిన నాగులను మంగళవారం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా నేదురుమల్లి పద్మనాభరెడ్డి దంపతులు మూడో రోజు మంగళవారం రిలే దీక్షలు కొనసాగించారు. కావలిలో ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పాల్గొన్నారు. బోగోలులో జాతీయ రహదారిపై బో గోలు బ్రహ్మాస్త్రం కార్యక్రమాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీతారాంపురానికి చెందిన పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో జేఏసీ నేతల ఆధ్వర్యంలో బ్యాంకులు, తపాలా, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలు మూయించారు. సూళ్లూరుపేటలో మన్నారుపోలూరు విద్యుత్ సబ్స్టేషన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు పవర్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అయి షార్ కేంద్రానికి, రైల్వే లైనుకు, మాంబట్టు పారిశ్రామికవాడలోని పలు కంపెనీలకు కరెంటు సరఫరా ఆగి పోయింది. -
తెలుగు వారందరూ కలిసే ఉండాలి
గుంతకల్లు, న్యూస్లైన్: తెలుగు వారందరూ కలిసే ఉండాలని, రాష్ట్ర విభజన ప్రక్రియను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గుంతకల్లు రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి సంఘీభావంగా మంగళవారం సాయంత్రం వేలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో తహసీల్దార్ వసంతబాబు, జేఏసీ పట్టణ చైర్మన్ మునివేలు, రైల్వే జేఏసీ సభ్యులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణానికి చెందిన ఓబాలిక భరతమాత వేషధారణలో ర్యాలీ ముందు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైల్వే ఉద్యోగులందరూ ఉద్యమానికి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రెండు నెలలుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు సోదరభావంతో కలిసిమెలసి జీవిస్తుండగా, తెలుగు ప్రజలు ఐక్యంగా జీవించలేరా? అని ప్రశ్నించారు. రైల్వే ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే, రైల్వే ఉద్యోగులందరూ ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. రైల్వేను స్తంభింపజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ ధనరాజ్, నాయకులు ప్రకాష్రెడ్డి, కరీముల్లా, ఆన్వర్, కోటేశ్వరరావు, దొరైరాజ్భూషణం, బాలాజీసింగ్, కేఎండీ గౌస్, జీఎన్ ప్రకాష్బాబు, అశోక్, రమేష్, సత్తార్, రాబర్ట్, డీఆర్ఆర్ పాల్, డి.వెంకటేశ్వర్లు, శివయ్య, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ గాంధీ చౌక్కు చేరుకున్న అనంతరం రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్, వాసవీదేవి ఆలయం, పాతబస్టాండ్, వైఎస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్కు చేరుకుని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. -
తమ్ముళ్ల బెంబేలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందా? ఢిల్లీలో ఏపీ భవన్లో చంద్రబాబు చేపట్టిన దీక్షలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించకపోవడంపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులే జీర్ణించుకోలేకపోతున్నారా? వేర్పాటువాదం చేస్తోన్న టీడీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోండటంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగు బయటపెట్టేందుకే సాహసించడం లేదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు, టీడీపీ శ్రేణులు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నింది. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం కనుసైగల మేరకు రాష్ట్ర విభజనకు అనుకూలంగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఆధారంగా జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం.. ఆ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ఈనెల 3న యధాతథంగా ఆమోదించిన విషయం విదితమే. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదించిన క్షణాల్లో ‘అనంత’లో సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇది దావానంలా సీమాంధ్రకు వ్యాపించింది. పస్తుతం మహోగ్ర రూపం సంతరించుకున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని ప్రజానీకం మండిపడుతోంది. వెల్లువెత్తుతోన్న ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తోండటంతో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. టీడీపీదీ అదే పరిస్థితి. రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తోంది. టీడీపీ ప్రజాప్రతినిధులు కన్పిస్తే చాలు.. వెంటబడి తరముతున్నారు. మూడు రోజుల క్రితం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలను అనంతపురంలో సమైక్యవాదులు వెంటపడి తరమడమే అందుకు తార్కాణం. ప్రజా వ్యతిరేకత దెబ్బకు చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ జెండాను చేబూనలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది టీడీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా రాజీనామా బాట పట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో ఏపీ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షలో సమైక్యవాదం విన్పించకుండా వేర్పాటువాదాన్నే పునరుద్ఘాటించడంపై ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. జిల్లాలో సమైక్యవాదాన్ని గట్టిగా విన్పించే ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంగళవారం ఢిల్లీలో చంద్రబాబుకు మద్దతు పలికి.. ఆయన విధానమే సరైనదని సమర్థించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వేర్పాటువాదాన్ని సమర్థించిన పయ్యావుల కేశవ్కు సమైక్యాంధ్ర ఉద్యమంలో అడుగుపెట్టే అర్హత లేదని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవడం.. సమైక్య సెంటిమెంటు ప్రజల్లో బలీయంగా నాటుకుపోవడం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపట్టి వేర్పాటువాదాన్ని విన్పించడం జిల్లాలో టీడీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షతో టీడీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మంగళవారం తనను కలిసిన కార్యకర్తలతో వ్యాఖ్యానించడం గమనార్హం. అధినేత వేర్పాటువాదం చేస్తూ.. శ్రేణులు సమైక్యవాదం విన్పిస్తే ప్రజల్లో టీడీపీ అపహాస్యం పాలవుతుందని ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన వేర్పాటువాద దీక్షతో టీడీపీ జెండాలతో సమైక్యాంధ్ర ఉద్యమంలో అడుగుపెట్టలేని దుస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎందాకైనా..
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సమైక్యవాదులు 70 రోజులుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. ప్రజలకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నా, వ్యాపారులు నష్టపోతున్నా, వేతనాలు రాక ఉద్యోగులు అవస్థ పడుతున్నా ఉద్యమ పంథాను మాత్రం వీడడం లేదు. కేంద్రం దిగొచ్చేదాకా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఉద్యమ పిడికిలిని దించబోమని స్పష్టం చేస్తున్నారు. వీరికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. మరోవైపు ‘ఎన్ని కుట్రలైనా చేయండి.. ఉద్యమాన్ని నిర్వీర్యపర్చండి’ అంటూ కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు ఆ పార్టీల నాయకులకు నూరిపోస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులను, ఉద్యమకారులను టార్గెట్ చేయాలని, జేఏసీల మధ్య చిచ్చుపెట్టాలని సూచిస్తున్నాయి. ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సైతం తమ అనుచరులను రంగంలోకి దింపి ఉద్యమకారులపై దాడులు చేయిస్తున్నారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాల మధ్య కూడా ఉద్యమకారులు వెనక్కి తగ్గడం లేదు. వైఎస్సార్సీపీ అండతో నిప్పు కణికలై కదం తొక్కుతున్నారు. ఫలితంగా 70వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ‘సమైక్య’ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేశారు. బ్యాంకులు, ఏటీఎంలను మూసి వేయించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జెడ్పీ ఎదుట సోనియా, కేసీఆర్, దిగ్విజయ్, బొత్స దిష్టిబొమ్మలకు సమాధి కట్టి నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి.. బ్యాంకులు, ఏటీఎంలను బంద్ చేయించారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్ఓ హేమసాగర్ మద్దతు తెలిపారు. అనంతరం వారు పాతూరు పవరాఫీసు భవనంపెకైక్కి సమైక్య నినాదాలు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యులు సమ్మెబాట పట్టడంతో రెండవ రోజు కూడా సర్వజనాస్పత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. ఎస్కేయూలో ఎంపీఈడీ కౌన్సెలింగ్కు హాజరైన తెలంగాణ విద్యార్థి రవిని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యాన వర్సిటీ ఎదుట 205 జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో గొబ్బెమ్మలు పెట్టి నిరసన తెలిపారు. ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రిలో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను బంద్ చేశారు. ముదిగుబ్బలో రాస్తారోకో చేశారు. గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్సర్కిల్లో మానవహారం నిర్మించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులు బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తుందంటూ ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు ‘మాక్ ప్రదర్శన’ నిర్వహించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కట్టారు. టీ-నోట్పై జేఏసీ ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు వైకుంఠ సమారాధన, పిండ ప్రదానం చేశారు. సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మానవహారం నిర్మించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. సప్తగిరి డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. ఎన్జీఓలు బైక్ ర్యాలీ చేపట్టి..కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసి వేయించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో పట్టణ ఖాద్రీ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సామూహిక దీక్ష చేశారు. ఈ దీక్షకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గాండ్లపెంటలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డిని అడ్డుకున్నారు. రోడ్డుపై ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. నల్లచెరువులో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంతో పాటు మడకశిరలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు బంద్ చేయించారు. మడకశిరలో జేఏసీ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. విద్యుత్ ఉద్యోగులు ట్రాన్స్ఫార్మర్ పెకైక్కి నిరసన తెలిపారు. రైతులు పొలం పనులు వదిలి ‘సమైక్య’ ఆందోళన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో రొళ్లలో అర్ధనగ్న ప్రదర్శన, అమరాపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం, రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల, గార్లదిన్నె, నార్పలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, సోమందేపల్లిలో భిక్షాటన, కణేకల్లులో ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తిలో వైద్య సిబ్బంది, పరిగి, గోరంట్లలో ట్రాన్స్కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాప్తాడులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్, చెన్నెకొత్తపల్లిలో రాస్తారోకో చేపట్టారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. రాష్ట్రం విడిపోతే ఆకులు తిని బతకాల్సిందేనంటూ ఆకులు తింటూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రులకు మున్సిపల్ ఉద్యోగులు పిండప్రదానం చేశారు. నాన్పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రైల్రోకో చేపట్టారు. -
కరెంటు కట్ కట
రాజధాని నగరానికి సమైక్య సెగ తాగింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సిటీలో చీకట్లు అలముకుంటున్నాయి. కోర్ సిటీలో రెండు, శివారు ప్రాంతాల్లో ఆరు గంటల పాటు అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఉస్మానియాతో పాటు మిగతా ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్స్రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ పనిచేయక రోగులు అవస్థలు పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విజయవాడ, రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పాటు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఆయా కేంద్రాల నుంచి నగరానికి రావాల్సిన కోటాపై కోత పడింది. ప్రస్తుతం గ్రేటర్ అవసరాలు తీర్చాలంటే రోజుకు సుమారు 1800 మెగవాట్ల విద్యుత్ అవసరం కాగా 1400 మెగవాట్లకు మించి సరఫరా కావ డం లేదు. సరఫరాకు డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతోంది. అధికారులు ఈ లోటును పూడ్చేందుకు లోడ్ రిలీఫ్, లైన్ల పునరుద్ధరణ పేరుతో అనధికారిక విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. దీంతో చిన్న చిన్న వ్యాపారులు, ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు, వెల్డింగ్వర్కర్లు, జ్యూస్సెంటర్లు, పిండిగిర్నీల యజమానులు రోజువారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వ స్తోంది. ప్రతి అరగంటకోసారి లైన్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుండటంతో గృహాల్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు తప్పని తిప్పలు అనధికారిక కోతలతో గృహవినియోగదారులు, పరిశ్రమలకే కాదు.. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, గాంధీ, ఫీవర్, సరోజినీదేవి, ఈఎన్టీ, ఛాతీ, ఎంఎన్జే, మానసిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ వార్డుల్లోని కంప్యూటర్లు మూగబోతుండటంతో రోగుల అడ్మిషన్లలో జాప్యం జరుగుతోంది. అంతే కాదు.. ఈసీజీ, టూ డీఎకో, ఎక్స్రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ, ఆల్ట్రాసౌండ్ పనిచేయక పరీక్షలు నిలిచిపోతున్నాయి. లిప్ట్లు పని చేయక పై అంతస్తుల్లోని వార్డులకు చేరుకునేందుకు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక నగరంలోని అర్బన్హెల్త్ సెంటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులకు రేడియేషన్ చికిత్సల్లో తీవ్ర ఆటంకం కలుగుతోంది. కోతలపై సమాచారం ఇవ్వని డిస్కం నగరంలో గత మూడు రోజుల నుంచి ఎడాపెడా కోతలు అమలు జరుగుతున్నా... వీటిపై డిస్కం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపి వేస్తుండటంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచినీరు సరఫరా అవుతున్న సమయంలో ఇంట్లో కరెంట్ లేకపోవడంతో మోటార్లు పని చేయడం లేదు. అపార్ట్మెంట్లకు నీరు అందడం లేదు. సిటీలో కోతల తీరు ఇలా.. చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, ఏజీ వర్సిటీ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి అరగంటకోసారి సుమారు ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, నల్లగండ్ల, హైదరాబాద్ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో మూడుగంటలు చార్మినార్, దారుషిఫా, చంచల్గూడ తదితర ప్రాంతాల్లో ఉదయం 10-30 నుంచి 12 గంటల వరకు కూకట్పల్లిలో ఉదయం గంటన్నర, సాయంత్రం గంట చొప్పున అమీర్పేట, ఎస్సార్నగర్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు చంపాపేట్, కర్మన్ఘాట్, సంతోష్నగర్, ఐఎస్సదన్, బీఎన్రెడ్డి, తదితర ప్రాంతాల్లో సుమారు మూడు గంటలు ఉప్పల్, తార్నాక, నాచారం, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో మూడు గంటలు నిలోఫర్లో విద్యుత్కు అంతరాయం నాంపల్లి : విద్యుత్ అంతరాయంతో నిలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో సోమవారం ఉదయం రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నవజాత శిశువులు ఉక్కపోతతో అలమటించిపోయారు. పనిచేయాల్సిన రెండు జనరేటర్లు మొరాయించినట్లు తెలిసింది. నిలోఫర్లో 100-150 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుంటారు. రోజుకు 15 నుంచి 20 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. వెయ్యికి పైగా ఓపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోతే పనిచేసే రెండు జనరేటర్లు సరపోవని పలువురు వైద్యులు చెబుతున్నారు. 24 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే నవజాత శిశువులకు ప్రమాదకరం. ఎంతోమంది గర్భిణుల సిజేరియన్ ఆపరేషన్లు నిలిచిపోతాయి. కాగా ఈ విషయమై నిలోఫర్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోమవారం రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. గంటా రెండు గంటలు సరఫరా నిలిచిపోతే పెద్ద ప్రమాదం ఏమి ఉండదని, ఎక్కువ సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే మాత్రం చిన్న పిల్లలకు ఇబ్బందవుతుందని అన్నారు. వ్యాపారం లేక విలవిల్లాడుతున్నాం అనధికారికంగా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల వరకు కరెంటు పోతోంది. గత నాలుగు రోజుల నుంచి వ్యాపారం సగానికి పైగా పడిపోయింది. అసలే పండుగ సీజన్. వ్యాపారం లేక ఏడుపొస్తోంది. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అధికారులు కూడా ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే కరెంటు తీసేస్తున్నారు. అదేమని ప్రశ్నించినా సప్లై లేదు మేమేం చేస్తామని సమాధానం ఇస్తున్నారు. - దాసు నవ్య, ఇంటర్నెట్ నిర్వాహకురాలు, తార్నాక ఇబ్బందులు పడుతున్నాం ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కోతలను విధిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో వచ్చే కోతలు సీమాంధ్ర సమ్మె వల్ల వర్షాకాలంలో రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కోతలు లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. - పగిళ్ల భూపాల్రెడ్డి, ఆర్కేపురం -
బంద్ విజయవంతం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు సింహపురిలో ఎగసిపడుతున్నాయి. తెలంగాణ నోట్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మూడో రోజూ బంద్ సంపూర్ణమైంది. ఆదివారం వేకువజాము నుంచే బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్సీపీ శ్రేణులు తెల్లవారుజాము నుంచే రోడ్లను దిగ్బంధించాయి. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. నెల్లూరులో వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కార్యకర్తలు రోడ్లపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్లోని పార్టీ కార్యాలయం నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ భవన్లో ఉద్యోగులు, వీఆర్సీ సెంటర్లో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో, గాంధీబొమ్మ సెంటర్లో ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో అన్నదానం చేశారు. కావలిలో బంద్ను వైఎస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పర్యవేక్షించారు. వైఎస్ఆర్సీపీ, సమైక్యాంధ్ర, ఆర్టీసీ, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అమరా యాదగిరి గుప్తా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్డీఓ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. దీక్షలో అనంతసాగరం నాయకులు చిలకా సుబ్బారెడ్డి తదితరులు కూర్చున్నారు. పట్టణంలోని దుకాణాలన్నింటిని కార్యకర్తలు మూయించారు. గూడూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, సమన్వయకర్త బాలచెన్నయ్య, నాయకులు బత్తిని విజయకుమార్, మల్లు విజయకుమార్రెడ్డి, నాగులు తదితరులు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పొదలకూరులో గిరిగర్జన విజయవంతమైంది. పెద్దసంఖ్యలో గిరిజనులు తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరాహారదీక్ష చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్రెడ్డి సంఘీభావం పలికారు. సోనియా, చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మనుబోలులో గ్రామదేవత మనుబోలమ్మకు విద్యార్థులు పూజలు చేశారు. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో సబ్స్టేషన్ను ముట్టడించారు. అనంతరం రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సైదాపురంలో బైక్ ర్యాలీ చేశారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు నెలవల సుబ్రహ్మణ్యం, కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాండురంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్లతో భారీ ర్యాలీ జరిగింది. దుకాణాలన్నింటని మూయించారు. మానవహారంతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ సరఫరా చేయాలని మన్నారుపోలూరు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సోనియా దిష్టిబొమ్మ, బొత్స, పనబాక లక్ష్మి, ఆనం రామనారాయణరెడ్డి, చింతా మోహన్ చిత్రపటాలను తగలబెట్టారు. ఉదయగిరి బస్టాండ్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, కలిగిరిలో బంద్ విజయవంతమైంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇందుకూరుపేటలో బైక్ ర్యాలీ నిర్వహిచారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. -
విభజన చీకట్లు
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్లైన్: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఆదివారం ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేసిన ఉద్యోగులు సమ్మెకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల 8 గంటలకు నిలిచిపోయింది. రాత్రి వరకు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. అత్యవసర సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వివేకా ఇంటికి కరెంట్ బంద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు. కొత్తూరు సబ్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 2ృ0 కేవీ సబ్స్టేషన్లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడృకు చేరుకున్న సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్స్టేషన్ ఎదుట ధర్నాకు ృగారు. అనంతరం సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని ృ00 కేవీ పవర్గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు. రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సవెృ్మలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గృడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను డీజల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పినాకిని, జనశతాబ్ధి ఎక్స్ప్రెస్లు పూర్తిగా రద్దయ్యాయి. చీకట్లో ఇక్కట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 06ఎన్ఎల్ఆర్91-సబ్స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు 92- సబ్స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సిబ్బంది సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వివేకా ఇంటికి కరెంట్ బంద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు. కొత్తూరు సబ్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 220 కేవీ సబ్స్టేషన్లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్స్టేషన్ ఎదుట ధర్నాకు ది గారు. అనంతరం సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని 400 కేవీ పవర్గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు. రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సమ్మెలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను డీజిల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పలు ఎక్స్ప్రెస్లు పూర్తిగా రద్దయ్యాయి. చీకట్లో ఇక్కట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
రైల్వే శాఖకు సమైక్య సెగ
ఒంగోలు, న్యూస్లైన్: రైల్వే శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలోకి దిగారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. సోమవారమూ మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 5.35 గంటలకు రైల్వేకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ఐదు నిముషాల్లోనే మరో గ్రిడ్తో అనుసంధానం చేశారు. ఆగిన రైళ్లు తిరిగి కదలడానికి అరగంటకుపైగా సమయం పట్టింది. ప్రారంభంలోనే అరగంట ఆలస్యంగా బయల్దేరిన పినాకిని(విజయవాడ- చెన్నై) ఎక్స్ప్రెస్ చీరాల సమీపానికి వచ్చేసరికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఒక డీజిల్ ఇంజన్ను తెప్పించి దాదాపు గంటన్నర ఆలస్యంగా రైలును నడిపారు. రద్దయిన రైళ్లు ఇవే.. ముందస్తుగా గూడ్సు వాహనాలను నిలిపివేయాలని రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా లోడు తగ్గకపోవడంతో పలు ఎక్స్ప్రెస్ రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్కు పలు చోట్ల స్టాపింగ్ కల్పించారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఒంగోలుకు చేరుకోగానే కేవలం విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అయితే కొన్ని రైళ్లు రద్దవడంతో ప్రయాణికుల ఇబ్బందులను ఒంగోలు స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు కోరమాండల్ ఎక్స్ప్రెస్ చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించి ప్రయాణికులు ఎక్కేందుకు వీలుగా పది నిమిషాల వరకు ఒంగోలు స్టేషన్లో ఆపారు. కోరమాండల్తోపాటు నవజీవన్ ఎక్స్ప్రెస్లు మూడు గంటలు ఆలస్యంగా నడిచాయి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి. ప్రయాణికుల తీవ్ర అవస్థలు ఒక్కసారిగా పలు రైళ్ల సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మె నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం రైళ్ల సర్వీసులు కూడా రద్దవడంతో ముందస్తుగా బుక్ చేసుకున్న వారు, చంటి పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రి కుర్చీ కోసమే దీక్షలు : ఎంపీ గుత్తా
మిర్యాలగూడ రూరల్, న్యూస్లైన్ : సీమాంధ్రలో పట్టు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు 2008లో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ముఖర్జీకి లేఖను అందించామని, ఆ లేఖనే పరిగణనలోకి తీసుకోవాలని పలుమార్లు ప్రకటించారని గుర్తు చేశారు. నేడు బాబు మాటమార్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేపడుతానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ప్లీనరీలో తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అడ్డు చెప్పబోదని చెప్పి ఇప్పుడు సమైక్యాంధ్ర అనడం ఏమిటన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కందిమళ్ల లకా్ష్మరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, చౌగాని భిక్షంగౌడ్, తిరునగర్ భార్గవ్, డీసీసీబీ డెరైక్టర్ సజ్జల రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
సురేష్బాబుపై సీఐ జులుం
పెనమలూరు, న్యూస్లైన్ :పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పడమట సురేష్బాబుపై ఆదివారం ఏసీపీ షకీలాభాను ఎదుటే పెనమలూరు సీఐ ధర్మేంద్ర జలుం ప్రదర్శించారు. దీనికి సురేష్బాబు అభ్యంతరం చెప్పగా సీఐ వేలు చూపిస్తూ అంతుచూస్తానని హెచ్చరించారు. దీంతో సురేష్బాబు కూడా ఎదురు తిరగటంతో పోలీసులు జోరు తగ్గించారు. వివరాల్లోకి వెళితే.. పెనమలూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం గంగూరు వద్ద బందరు రోడ్డుపై పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. బందరు రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డు వేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ ధర్మేంద్ర సీఆర్పీఫ్ సిబ్బందితో అక్కడకు వచ్చీ రావడంతోనే సురేష్బాబుపై విరుచుకుపడ్డారు. విజయవాడలో ఎక్కడా బంద్ జరగటం లేదని, ఇక్కడ అడ్డుకుంటారేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తామంతా రోడ్డుపై వంటావార్పు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తామని సురేష్బాబు చెప్పినా సీఐ అంగీకరించలేదు. అడ్డు తీసివేయాలని, లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని వేలుచూపిస్తూ హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో అడ్డు తొలగించే యత్నం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈలోగా తూర్పు డివిజన్ ఏసీపీ షకీలాభాను అక్కడకు వచ్చారు. సీఐ ఆమె ఎదురుగానే సురేష్బాబుతో వాగ్వాదానికి దిగుతూ రెచ్చిపోయారు. సీఐ ప్రవర్తనపై సురేష్బాబు అభ్యంతరం చెబుతూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.సీఐ ఇతర పార్టీలకు కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సీఐ కూడా ఈ విధంగానే వ్యవహరించి బదిలీపై వెళ్లారని, వైఖరి మార్చుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరిం చారు. తాను పరిశీలిస్తానని, వివాదం వద్దని ఏసీపీ చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు. సైకిల్ కాంగ్రెస్కు సీఐ మద్దతు : సురేష్బాబు పెనమలూరు సీఐ ధర్మేంద్రకి సైకిల్ కాంగ్రెస్ నేతలంటే ఎనలేని భక్తని, వారు బందరురోడ్డుపై ఆందోళన చేస్తే వారి వెంటే ఉండి కార్యక్రమం నడిపించారని సురేష్బాబు ఆరోపించారు. పెనమలూరు, పోరంకి గ్రామ టీడీపీ నేతలు బందరు రోడ్డుపై వంటావార్పు చేస్తే సీఐ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సైకిల్ కాంగ్రెస్తో సీఐ మిలాఖత్ అయ్యి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చు విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఐ వైఖరి మార్చుకోక పోతే పోలీస్స్టేషన్ ఎదుటే సమైక్యవాదులతో ధర్నా చేస్తానని హెచ్చరించారు. -
ఆగ్రహ జ్వాల
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. పార్టీ పిలుపు మేరకు 72 గంటల బంద్ను విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ బంద్, ఆందోళనల నేపథ్యంలో మూడో రోజు కూడా ‘అనంత’ జనజీవనం స్తంభించిపోయింది. రైల్రోకోలు, రహదారుల దిగ్బంధం, ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు, వంటా వార్పు తదితర నిరసనలు జిల్లా నలుమూలలా హోరెత్తాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీలు, కుల, ప్రజా సంఘాల జేఏసీల నేతలు, సమైక్యవాదులు, ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నాయకులు బి.ఎర్రిస్వామిరెడ్డి, లింగాల శివశంకర్రెడ్డి, మీసాల రంగన్న, రంగంపేట గోపాల్రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక తపోవనం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుకడ్డంగా పాతటైర్లకు నిప్పంటించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. నగరంలో మెడికల్, యువ జేఏసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. ఎస్కేయూలో ఎడ్సెట్ కౌన్సెలింగ్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మార్కెటింగ్శాఖ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఆదివారం పశువుల సంతను ‘అనంత’ మార్కెట్యార్డు ఎదురుగా రోడ్డుపై నిర్వహించాల్సి వచ్చింది. ధర్మవరం పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుడు రేగాటిపల్లి సురేష్రెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించి... 72 గంటల బంద్ను విజయవంతం చేశారు. దర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో సమైక్యవాదులు వంటా వార్పు చేపట్టారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైల్రోకో చేశారు. కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలును గంటపాటు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు 15 మందిని పోలీసులు అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. పట్టణంలో ఎస్సీ, ఎస్టీలు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు. గుత్తిలో వైఎస్సార్సీపీ నేతలు సోనియా, బొత్స, దిగ్విజయ్, కేసీఆర్, పనబాకలక్ష్మి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీ హర్షకుమార్ తనయుల దౌర్జన్యానికి నిరసనగా గుత్తిలో ఉద్యోగ జేఏసీ నేతలు మౌనదీక్ష చేశారు. అనంతరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పామిడిలో వైఎస్సార్సీపీ నాయకులు వంటా వార్పు చేపట్టారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నేత నవీన్నిశ్చల్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలు రాస్తారోకో చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బొత్సదిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి... రోడ్డుపై సమాధి కట్టి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరి పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బంద్ చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా వజ్ర భాస్కర్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. జేఏసీ నాయకులు నోటికి అడ్డంగా నల్లని రిబ్బన్ కట్టుకొని పట్టణంలో ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేశారు. తలుపుల, తనకల్లు, ఎన్పీ కుంట, నల్లచెరువు మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నేతలు బంద్ చేపట్టారు. కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎల్ఎం మోహన్రెడ్డి, నాయకులు కిరిటీ యాదవ్, రామాచారి, దేవపుత్ర చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పట్టణ బంద్ చేపట్టారు. ఉద్యోగ జేఏసీ నేతలు తెలుగుతల్లి విగ్రహం వద్ద మానవహారం నిర్మించారు. విభజనతో మనస్తాపం చెంది కంబదూరు మండలంలో వైఎస్సార్సీపీ బంద్లో పాల్గొన్న చెన్నంపల్లి వాసి మల్లికార్జున నాయక్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో బంద్ విజయవంతమైంది. మడకశిర లో వైఎస్సార్సీపీ నేతల దీక్షలు రెండో రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్రెడ్డి, పార్టీ నేత వైసీ గోవర్దన్రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. అమరాపురం, రొళ్ల, అగళి, గుడిబండ్ మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా కొనసాగింది. మడకశిరలో జేఏసీ నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ జగన్ ఆమరణదీక్షకు మద్దతుగా సోమవారం పుట్టపర్తిలో 72 గంటల బంద్ను విజయవంతం చేశారు. కొత్తచెరువులో దీక్ష చేస్తున్న సమైక్యవాదులకు కర్ణాటక రాష్ట్ర వైఎస్సార్ వేదిక నాయకులు మద్దతు ప్రకటించారు. బుక్కపట్నం, కొత్తచెరువులో బంద్ విజయవంతమైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని పెనుకొండ వైఎస్సార్సీపీ నేతలు స్థానికంగా ఉన్న కుంభకర్ణుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అలాగే అక్కడే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని ప్రార్థించారు. సమైక్యవాదులు మంత్రి రఘువీరా దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి.. తరువాత ఉరితీసి నిరసన తెలిపారు. ట్రాన్స్కో ఉద్యోగులు ధర్నా చేశారు. సోమందేపల్లిలో విద్యార్థులు సైకిల్ర్యాలీ, రొద్దంలో ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. గోరంట్ల, పరిగిలో వైఎస్సార్సీపీ నేతలు బంద్ చేపట్టారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బంద్ విజయవంతం చేశారు. విద్యార్థుల ర్యాలీలో ఎమ్మెల్యేపాల్గొన్నారు. ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో వైఎస్సార్సీపీ శ్రేణులు రహదారిని దిగ్బంధించారు. రాప్తాడులోని 44వ జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కనగానపల్లిలో పార్టీ కార్యకర్తలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అదే మండలం తగరకుంటలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. చెన్నేకొత్తపల్లిలో బంద్ను తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో శింగనమలలోని తాడిపత్రి-అనంతపురం రహదారిపై రాస్తారోకో చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో బంద్ విజయవంతమైంది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బంద్ చేపట్టారు. ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి జేసీ సోదరులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. పోలీసు బలగాలను భారీగా మోహరించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకు ర్యాలీ చేపట్టి.. బంద్ విజయవంతం చేశారు. ఉరవకొండ, విడపనకల్లులో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉరవకొండలో జేఏసీ రిలే దీక్షలకు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. వజ్రకరూరులో వైఎస్సార్సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. -
జేసీ మూక అరాచకం
తాడిపత్రి/టౌన్/రూరల్, న్యూస్లైన్ : తాడిపత్రి పట్టణంలో జేసీ సోదరుల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ‘ఊరందరిదీ ఒకదారి అయితే... ఉలిపికట్టెది మరోదారి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పైగా అందరూ తమ ‘దారి’లోనే నడవాలంటూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని సైతం అపహాస్యం చేస్తున్నారు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర వస్తుందా అంటూ ఉద్యమకారులను హేళన చేస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు జీవితాలు, జీతాలను త్యాగం చేసి ఉద్యమిస్తుంటే... జేసీ సోదరులు మాత్రం అందుకు భిన్నంగా స్వలాభం, రాజకీయ స్వార్థంతో ‘సమైక్య’ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఆదివారం సమైక్యాంధ్ర బంద్ చేపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై స్వయాన జేసీ ప్రభాకరరెడ్డి దగ్గరుండి తన అనుచరులతో రాళ్ల దాడి చేయించారు. పోలీసుల సమక్షంలోనే వీరంగం చేసి.. భయానక వాతావరణం సృష్టించారు. బంద్లో భాగంగా వ్యాపారులు మూసేసిన దుకాణాలను దౌర్జన్యంగా తెరిపించి... భయబ్రాంతులకు గురి చేశారు. శనివారం జిల్లా అంతటా బంద్ ఉన్నప్పటికీ తాడిపత్రిలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాన్ని మాత్రం తెరిచే ఉంచారు. దాంతో సమైక్యవాదులు కార్యాలయంపై దాడి చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకరరెడ్డి ఆదివారం పట్టణంలో వీరంగం చేశారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు పట్టణవాసులు 72 గంటల బంద్ పాటిస్తుండగా... దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాడు. వ్యాపారులతో బలవంతంగా దుకాణాలను తెరిపించాడు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర రాదంటూ తన లారీలు, బస్సులను కూడా తాడిపత్రిలో యథేచ్ఛగా తిప్పించాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, నాయకులు మున్నా, మనోహర్రెడ్డి, రవీంద్రారెడ్డి, పేరం మహ్వేరరెడ్డి, ప్రకాష్బాబు, శరబారెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి, వెంకటమల్లారెడ్డి, కంచం రామ్మోహన్రెడ్డి, రవీనాథ్రెడ్డి, రఘునాథ్రెడ్డి, భాస్కర్రెడ్డి, పెద్దపేట లక్ష్మిదేవి, లక్ష్మిదేవి తదితరులు కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా తెరిపించిన దుకాణాలను తిరిగి బంద్ చేయిస్తూ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి సీబీ రోడ్డు, పోలీస్స్టేషన్ సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండు సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తన అనుచరులతో కలిసి రాళ్లు, కర్రలు తీసుకుని వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చూస్తుండగానే వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అయితే... వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా అక్కడే నిలబడి జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణ ఒత్తిడి తెచ్చారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమపైకి దౌర్జన్యంగా వస్తున్న వారిని అడ్డుకోవాలని చెప్పినా వినలేదు. కాంగ్రెస్ మూకలు విసిరిన ఓ రాయి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు తగలింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జీ చేశారు. అయినప్పటికీ జేసీ ప్రభాకరరెడ్డి అక్కడ్నుంచి కదలకుండా మరింత రెచ్చగొడుతూ అనుచరులను ఉసిగొల్పాడు. పోలీసులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ వారినే వెళ్లిపోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల రోడ్డుపై బైఠాయించారు. జేసీ ప్రభాకరరెడ్డిని, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి తీరుపై పట్టణ ప్రజలు మండిపడ్డారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం
పులివెందుల అర్బన్/టౌన్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని సమైక్యవాదులు రాజు, తిరుపాల్లు ఆదివారం సాయంత్రం పాత బస్టాండు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ ట్యాంకు ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ సమైక్యవాదులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. గంటసేపు ట్యాంకుపైకి ఎక్కి దూకుతామని పేర్కొనడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం మున్సిపల్ ట్యాంకుపైకి ఎక్కిన రాజు, తిరుపాల్లను దిగాలంటూ సమైక్యవాదులు కోరారు. ఎంతసేపటికి దిగి రాకపోవడంతో డీఎస్పీ హరినాథబాబు, సీఐ భాస్కర్లు జోక్యం చేసుకొని మీ కుటుంబ సభ్యులకోసమైన దిగిరావాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణ త్యాగం చేయవద్దని కోరారు. సమైక్యవాదులు కూడా కిందికి దిగి రావాలంటూ పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరుకొని సమైక్యవాదులు కిందికి దిగిరావాలని మేమంతా సమైక్యాంధ్ర కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తూ సమైక్యాంధ్ర సాధించుకుందామని చెప్పారు. దీంతో సమైక్యవాదులు మున్సిపల్ ట్యాంకు నుంచి కిందికి దిగడంతో సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ఊపిరి పీల్చుకున్నారు. -
ముగ్గురిని మింగిన మద్దిలేరు
గడివేముల, న్యూస్లైన్: సరదాగా పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు చిన్నారులు మృత్యువు బారిన పడ్డారు. ప్రమాదవశాత్తు వాగులో నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన శనివారం గడివేములలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీవీ మెకానిక్ వెంకటరమణ, నాగమణి దంపతులకు కిరణ్(9), విజయ్ (7) సంతానం. వివాహమైన పదేళ్లకు ఇద్దరు కుమారులు జన్మించడంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. వీరిద్దరూ స్థానిక రాజరాజేశ్వరి పాఠశాలలో చదువుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్నారు. వారి ఇంటి పక్కనే ఉంటున్న పెద్దస్వామి సోదరి రమాదేవి (13) మానసిక వికలాంగురాలు. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నా, వదిననే పోషిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పెద్ద స్వామి భార్యాబిడ్డలతో పొలానికి వెళ్లాడు. వారి వెంట రమాదేవి, కిరణ్, విజయ్ సరాదాగా వెళ్లారు. ప్రమాదం ఇలా జరిగింది: మధ్యాహ్నం భోజనం చేసేందుకు అందరూ ఇంటికి బయలుదేరారు. పిల్లలు పరిగెత్తుకుంటూ ముందు వచ్చారు. మార్గమధ్యంలో మద్దిలేరు వాగు దాటే ప్రయత్నంలో విజయ్ అదుపు తప్పి గతంలో మట్టి కోసం తవ్విన గుంతలో పడిపోయాడు. నీట మునుగుతున్న తమ్ముడిని కాపాడేందుకు కిరణ్ దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగిపోయారు. వాగు ఒడ్డున ఉన్న రమాదేవి వారిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. ఈత రాకపోవడంతో బాలిక కూడా నీట మునిగింది. అక్కడే ఉన్న పెద్దస్వామి కుమార్తె వెనుకకు పరిగెత్తి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు రోదిస్తూ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో నీటిలో గాలించారు. సమీపంలోని గుంతలో ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంకటరమణ వాగు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. వాగు దాటే ప్రదేశానికి సమీపంలో మట్టి కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదానికి కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి గ్రామానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపారు. గౌరు పరామర్శ: ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి గడివేముల చేరుకుని మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కాతా రాజేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ వై.శివరామిరెడ్డి, డి.సత్యనారాయణరెడ్డి, తదితరులున్నారు. -
సమైక్యాంధ్ర సాధనకు ఉద్యమం తీవ్రతరం
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో సంఘీభావంగా నెల్లూరులో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు వివరించారు. మైపాడు గేట్, ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, హరనాథపురం, చిల్డ్రన్స పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అన్ని చోట్ల ఒకేసారి రాస్తారోకో నిర్వహించనున్నట్లు వివరించారు. సీఎం పదవి కోసం రామనారాయణరెడ్డి గుంటనక్కలా కాచుకొని ఉద్యమాన్ని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు మండవ రామయ్య, మున్వర్, ధర్మవరపు సుబ్బారావు, బాలకృష్ణచౌదరి, రామకృష్ణారెడ్డి, పడవల కృష్ణమూర్తి, సుబ్బారావు, మురళి, తదితరులు పాల్గొన్నారు.