
వైఎస్ జగన్ యాత్రపై ఎల్లో మీడియా దుష్ప్రచారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది.
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్ను స్థానికులు అడ్డుకున్నారంటూ పచ్చవార్తలు వండాయి. నినాదాలు చేయవద్దన్న వైఎస్ జగన్ సూచనను ఎల్లో మీడియా వక్రీకరించింది.
ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కాగా టీడీపీ నేతల ఇసుక దందా బయటపడకుండా ఎల్లో మీడియా కుట్ర పన్నుతోంది. ఇసుక బకాసురులకు అండగా ఉంటోంది.
ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి మునగలపాలెం వెళ్లి ఏర్పేడు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఏర్పేడు ఘటనలో మునగలపాలెంకు చెందిన 13 మంది మరణించారు. మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సునీల్ కుమార్, ఎంపీ వరప్రసాద్ తదితరులున్నారు.