ఎలాగూ రాష్ట్రం విడిపోతోందన్న కారణంతో తెలంగాణ ప్రాంత ఆస్తులను సీమాంధ్రకు తరలించేందుకు అక్కడి నేతలు ప్రయత్నిస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: ఎలాగూ రాష్ట్రం విడిపోతోందన్న కారణంతో తెలంగాణ ప్రాంత ఆస్తులను సీమాంధ్రకు తరలించేందుకు అక్కడి నేతలు ప్రయత్నిస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రాంత భూభాగాలను కూడా సీమాంధ్రకు చెందినవిగా చూపుతూ జీవోఎంకు తప్పుడు నివేదికలు పంపుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీనివాస్గౌడ్ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రాచీన ఆలయాల విగ్రహాలను, గోల్కొండలోని ఫిరంగులను పర్యాటక శాఖ విజయవాడకు తరలిస్తోందని, దీన్ని వెంటనే ఆపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలిసి కోరినట్టు చెప్పారు. పోలవరం తమదని, హైదరాబాద్పై హక్కుందని ఇన్నాళ్లు వాదించిన ప్రభుత్వంలోని సీమాంధ్ర నేతలు తాజాగా శ్రీశైలం ఎడమ కాలువ ప్రాంతమంతా కర్నూలు జిల్లా పరిధిలోనే ఉందని తప్పుడు నివేదికలు రూపొందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు 47 శాతం మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.