
ప్రత్తిపాటి నోట... ఓటి మాట
రోజురోజుకో నిబంధన
జిల్లాలో బంగారం తాకట్టు రుణాల రైతులు 2,60,737 మంది
రుణాలు రూ. 3,276 కోట్లు
కొలమానంతో కోత
మచిలీపట్నం : ‘బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులెవరూ తిరిగి చెల్లించవద్దు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తరహా రుణాలన్నీ మాఫీ చేసి అక్కచెల్లెమ్మల బంగారు పుస్తెల తాళ్లను ఇంటికే తీసుకువచ్చి ఇస్తా’మంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు హామీలతో ఊదరగొట్టారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో కొర్రీలు పెట్టారు. నగల వేలానికి నోటీసులిచ్చారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ బంగారు రుణాలు పొందినవారెవరికీ నోటీసులు పంపలేదంటూ చెప్పుకొచ్చారు. అవన్నీ పచ్చి అబద్ధాలంటూ పలువురు జిల్లా రైతులు ధ్వజమెత్తారు. కానీ పంట రుణాలు పూర్తిస్థాయిలో రద్దు కాలేదు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణా లకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స (కొల మానం)ను అమలు చేశారు. రైతులు తీసుకున్న రుణానికి, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన నగదు బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న పం ట రుణాలు వడ్డీకే చాలీచాలని పరిస్థితి నెలకొంది. జిల్లాలో బంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్లను 2,60,737 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు.
అధికారం చేపట్టిన తరువాత తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయటంలో ప్రభుత్వం తన పంథాను మార్చడంతో వడ్డీ కొండలా పెరిగింది. దీంతో బ్యాంకు అధికారులు నగలను వేలం పాటలను కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలు వేలం వేయడం లేదని ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రైతు బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటే మొదటి సంవత్సరంలో పావలా వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఈ వడ్డీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో రైతులు రుణాలు చెల్లించకపోవటంతో ఏడాది దాటిన తరువాత 7 శాతం వడ్డీ అనంతరం 14 శాతం వడ్డీ పెరిగింది. 2013 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లు కావటంతో రుణమాఫీలో రూ.50వేల కన్నా పైబడి పంట రుణం తీసుకున్న వారికి 20 వేలు మాత్రమే ప్రభుత్వం జమ చేయడంతో ఈ నగదు వడ్డీకే చాలని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో మూడు విడతల్లో రుణమాఫీ చేశారు.
జిల్లాలో అన్ని రకాల వ్యవసాయ రుణాలకు 4,04 ,402 మంది రైతులకు రూ.1490 కోట్లు మాఫీ జరిగినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇప్పటి వరకు రూ. 573 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తాకట్టు పెట్టి రుణం తీసుకుని ఏడాది గడిస్తే గడువు మీరిందనే కారణంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. రుణం అధికంగా ఉం టే అధికారులు బంగారు నగలు వేలం వేస్తున్నామని పత్రికల్లో ప్రకటనలు ఇస్తుండటంతో పరువు బజారున పడుతోందని రైతులు వాపోతున్నారు.
ఏడాది గడవకముందే నోటీసు
సంవత్సరం కిందట బ్యాంక్లో రూ.35 వేలు రుణం తీసుకున్నాను. ఏడాది కూడా గడవక ముందే బ్యాంక్ అధికారులు అప్పు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
-ఎన్ శివనాగేంద్రం, కొలకలూరు, గుంటూరు జిల్లా