ఈవీఎంల వయసు 37ఏళ్లు  | The Use Of EVMs Became Popular In 1988 | Sakshi
Sakshi News home page

ఈవీఎంల వయసు 37ఏళ్లు 

Published Fri, Mar 15 2019 9:38 AM | Last Updated on Fri, Mar 15 2019 9:38 AM

The Use Of EVMs Became Popular In 1988 - Sakshi

సాక్షి, కర్నూలు(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): స్వతంత్ర భారతావనిలో ఎన్నికలను తొలుత పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా నిర్వహించేవారు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951లో జరుగగా.. ఆ సమయంలో బ్యాలెట్‌ విధానం ఉంది. 1982లో తొలిసారిగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)ను అందుబాటులోకి వచ్చింది. ప్రప్రథమంగా కేరళలో వాటిని వినియోగించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ వీటి నిర్వహణలో లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. 2004 ఎన్నికల నుంచి వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మరింత పారదర్శకత కోసం 2013 నుంచి వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరిఫయిబుల్‌ పేపర్‌ అడిట్‌ ట్రయల్‌)ను ఈవీఎంలకు అనుసంధానం చేశారు.  
- మొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఉత్తర పెర్వూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో  1982 మే 19న వినియోగించారు. 
- ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వీటిని వినియోగించారు. 
- ఈవీఎంలను ఉపయోగించ వద్దని 1984 మే 5వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
- ఈవీఎంల వాడకానికి 1988లో ప్రజామోదం లభించింది. 
- ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్‌లో సెక్షన్‌ 61ఏ ద్వారా కేంద్రం ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చి సవరణ చేశారు. ఆ తర్వాత 1989 మార్చి 15న అమలులోకి రావడంతో సుప్రీంకోర్టు కూడా తర్వాత సమర్థించింది.  
- 1990 జనవరిలో ఎన్నికల సంస్కరణల కమిటీ (ఈఆర్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వినియోగాన్ని సాంకేతిక నిపుణల కమిటీ సమర్థించింది.  
- 1999, 2004లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు.  
- లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన మూడు ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. 
- వీవీ ప్యాట్‌లను  ఈవీఎంలకు అనుసంధానం చేయాలని 2013 ఆగస్టు 14న నిర్ణయించారు.  
- నాగాలాండ్‌ రాష్ట్రంలోని ఆక్సె అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్‌ 4న జరిగిన ఎన్నికల్లో వీవీ ప్యాట్‌లను మొదటి సారిగా వినియోగించారు. 
- దశల వారీగా వీవీ ప్యాట్‌లను వినియోగించాలని 2013 అక్టోబరు 8న  సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి వీవీ ప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. 
- 2017 ఏప్రిల్‌లో రూ. 3173.47 కోట్లతో 16.15లక్షల వీవీ ప్యాట్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్‌లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement