వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి వెంటే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి వెంటే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు అభిప్రాయపడ్డారు. జగన్ జైల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. కొండేపి మండలం కె.ఉప్పలపాడులో వైఎస్ఆర్ వర్ధంతి సభలో జూపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్ లో ఉన్నాయన్నారు.
అసమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రం అల్లకల్లోలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రి పదవుల కోసమే రాష్ట్రాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వైఎజ్ జగన్ను జైలులో పెట్టి రాష్ట్రాన్ని విడగొడితే ప్రజలు ఊరుకోరని జూపూడి అన్నారు.