సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్కు సంబంధించి హైకోర్టులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బస్సులో వెళుతున్న కూలీలను పట్టుకొచ్చి ఎన్కౌంటర్లో కాల్చి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో, బస్సులో మిగిలిన కూలీలతో పాటు ఉండి పోలీసులకు చిక్కకుండా తప్పికుంచుకున్న ముగ్గురు కూలీల వాంగ్మూలాల నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న అధికారికి స్పష్టం చేసింది. తరువాత ఆ వాంగ్మూలాలను తమ ముందుంచాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తమిళనాడు వచ్చే ఈ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు తిరుపతిలో నమోదు చేయాలని, ఈ సందర్భంగా వారికి తగిన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సులో వెళుతున్న వారిని పట్టుకుని వచ్చుంటే ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటరే అవుతుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
బస్సులో వెళుతున్న వారిని పట్టుకొచ్చారా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆ ముగ్గురు వాంగ్మూలాల నమోదుకు ఆదేశాలు ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే మృతులకు రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన ధర్మాసనం, గత విచారణ సమయంలో ఈ కేసు దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని సిట్ను ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారంతో 60 రోజుల గడువు పూర్తయిన నేపథ్యంలో తాజాగా ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. వీటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఏం చేశాం.. ఇక ఏం చేయాలని భావిస్తున్నాం.. తదితర వివరాలను పొందుపరుస్తూ ఓ నివేదికను అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు సమర్పించారు.
వీటిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును పూర్తి చేసేందుకు తమకు మరింత గడువునివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది రఘునాథ్ జోక్యం చేసుకుంటూ, ఎన్కౌంటర్పై ప్రత్యేక ధర్యాప్తు బృందం (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించిన ప్రస్తావనే ఉందే తప్ప, కూలీలను కూల్చి చంపిన ఘటనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించిన ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సిట్ ఏర్పాటు జీవోను పరిశీలించిన ధర్మాసనం, కూలీల ఎన్కౌంటర్పై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అదనపు ఏజీని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేకపోయినా కూడా మూడు కేసుల్లోనూ సిట్ దర్యాప్తు చేస్తుందని శ్రీనివాస్ సమాధానమిచ్చారు. అసలు ఈ ఘటనకు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులున్నారా..? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఎన్కౌంటర్ జరిగినప్పుడు చూసిన వారెవ్వరూ లేరని రఘునాథ్ తెలిపారు.
అయితే ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీలు బస్సులో వెళుతున్నప్పుడు వారిని పోలీసులు పట్టుకుని వచ్చి కాల్చి చంపారని, బస్సులో మిగిలిన కూలీలతో ఉన్న వారిలో ముగ్గురు తప్పించుకున్నారని. వెనుక ఆడవాళ్ల పక్కన కూర్చోవడంతో బతికిపోయారని వివరించారు. అయితే వారి వాంగ్మూలాలను నమోదు చేశారా..? అని ధర్మాసనం అదనపు ఏజీని ప్రశ్నించింది. లేదని, విచారణకు వారు సహకరించడం లేదని చెప్పడంతో, అయితే వారిని వాంగ్మూలాలు ఇవ్వాలని ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. బస్సులో నుంచి పట్టుకొచ్చారన్న ఆరోపణలు నిజమైతే, ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటరే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని, వాంగ్మూలాల నమోదు సమయంలో ఆ న్యాయవాది ఏ విధంగా జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. నమోదు చేసిన వాంగ్మూలాలను తమ ముందుంచాలంటూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
ఆ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను నమోదుచేయండి
Published Mon, Jun 29 2015 10:07 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement
Advertisement