రాళ్ల క్వారీతో తనకు నీడ కరువైందని, పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదని ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించింది.
గుంటూరు జెడ్పీ ఆఫీస్ లో కలకలం
Feb 22 2016 12:35 PM | Updated on Jan 7 2019 8:29 PM
గుంటూరు: రాళ్ల క్వారీతో తనకు నీడ కరువైందని, పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదని ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించింది. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాలివీ.. గుంటూరు నగరం సమీపంలోని మల్లవరం గ్రామానికి చెందిన విజయమ్మ గ్రామంలో గుట్ట సమీపంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. అయితే, ఇటీవల కాంట్రాక్టర్లు రాళ్ల కోసం గుట్టపై పేలుళ్లు జరుపుతున్నారు. తానుండే ప్రాంతంలో పేలుళ్లతో రాళ్లు పడుతున్నాయని, తనకు నీడ కరువవుతోందని కొన్ని రోజులుగా ఆమె స్థానిక అధికారులకు విన్నవించుకుంటోంది.
ఆమె సమస్యను అక్కడి వారు పట్టించుకోకపోవటంతో సోమవారం జిల్లా పరిషత్లో జరిగే గ్రీవెన్స్డేలో అధికారులకు ఫిర్యాదు చేయటానికి వచ్చింది. అయితే, అక్కడి వారు తన అభ్యర్ధనను పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన విజయమ్మ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగింది. గమనించి అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Advertisement
Advertisement