తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) కోరా జయరాజ్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) కోరా జయరాజ్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జెడ్పీ పరిధిలో మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ ఎం.ధర్మారావు ఇటీవల రూ.6.74 లక్షల విలువైన పనులు చేపట్టారు. వీటికి సంబంధించిన బిల్లు మంజూరుకు సీఈవో రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. రూ.40వేలు ఇచ్చేందుకు అంగీకరించిన ధర్మారావు తొలి విడతగా రూ.30 వేలు ఇస్తానన్నారు. అనంతరం ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు సీఈవోకు ఒప్పందం మేరకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం జెడ్పీ కార్యాలయంతో పాటు ఇంద్రపాలెంలోని సీఈవో ఇల్లు, జన్మభూమి పార్కు వద్ద ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.