జిల్లాపరిషత్ స్థాయీ సంఘ సమావేశంలో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ భేటీ అయ్యారు.
సాక్షి, విశాఖపట్నం : జిల్లాపరిషత్ స్థాయీ సంఘ సమావేశంలో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు, జెడ్పీ సభ్యులతో అజెండా అంశాలపై చర్చించారు. ఎవరెవరు ఏయే అంశాలపై మాట్లాడాలి. ఎవరు ఏ స్థాయీ కమిటీల్లో ఉండాలన్నదానిపై సమీక్షించారు. ఇకపై ప్రతి జెడ్పీ సమావేశానికి ముందు పార్టీపరంగా సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.
ప్రజల తరపున పోరాడదాం.. : పార్టీ నేతలనుద్దేశించి అమర్నాథ్ మాట్లాడుతూ అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలో ప్రధాన ప్రతిపక్షంగా గురుతర బాధ్యత నిర్వర్తించాల్సింది మనమేనంటూ జెడ్పీ సభ్యుల్లో ఉత్సాహం నింపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. స్థానికంగా జరుగుతున్న అక్రమాలు, టీడీపీ నేతల దౌర్జన్యాలను స్థాయీ సమావేశాల్లో ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు.
అజెండా అంశాలు ప్రజోపయోగ మా?, కాదా? అన్నదానిపై అజెండా అందిన వెంటనే చర్చించుకోవాలన్నారు. స్వార్థ, రాజకీయ ప్రయోజనా ల కోసం చేర్చే అంశాలపై అధికారపక్షాన్ని ఎండగట్టాలన్నారు. జిల్లాలోని మండలాలవారీ అన్ని అంశాలపై పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నిం చాల్సిందిగా సభ్యుల్ని సూచించారు.
ప్రధాన ప్రతిపక్షం గా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలునాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ నేతలు పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, 14 మంది జెడ్పీ సభ్యులు పాల్గొన్నారు.