
టీసీఎస్ సీఓఓ ఎన్ గణపతి సుబ్రమణియన్
దావోస్ : ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) వల్ల ఉద్యోగాలు కోల్పోతామనడం అవాస్తవమని టీసీఎస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వ్యాపారాలు పెరిగేందుకు ఆటోమేషన్, ఏఐ ఉపకరిస్తాయని..వీటితో ఉద్యోగాలకు ప్రమాదం ఉండబోదని టీసీఎస్ సీఓఓ ఎన్ గణపతి సుబ్రమణియన్ చెప్పారు. నూతన టెక్నాలజీలతో భారీగా ఉద్యోగాలు నష్టపోతామనే భయాందోళనలు అసమంజసమని తోసిపుచ్చారు. అయితే మారతున్న టెక్నాలజీలకు దీటుగా సిబ్బంది నైపుణ్యాలకు పదును పెట్టడం మాత్రం ఆయా సంస్థల బాధ్యతని గుర్తుచేశారు. ఐటీ పరిశ్రమ ప్రతి ఐదేళ్లకూ మార్పులకు లోనవుతుందని..అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనితీరును అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
సాంకేతిక విజ్ఞానాన్ని శిక్షణ ద్వారా అందిపుచ్చుకోవాలని సూచించారు. ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్, ఏఐల రాకతో ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ పోటీకి దీటుగా ఎదిగే యువతకు ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. సవాళ్లకు ఎదురీదే తత్వం భారత యువతకు పుష్కలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.