
దిగివచ్చిన బంగారం ధరలు
ముంబై : రికార్డు ధరలతో మోతెక్కుతున్న బంగారం ధరలు మంగళవారం దిగివచ్చాయి. పలు దేశాలు లాక్డౌన్లను ఎత్తివేసిన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ఊపందుకోవడంతో పసిడి ధరలు శాంతించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో మంగళవారం ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 223 తగ్గి రూ. 46,750 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 0.3 శాతం తగ్గి 1724 డాలర్లుగా నమోదైంది.
మరోవైపు సుదీర్ఘ లాక్డౌన్తో దేశీ మార్కెట్లోనూ బంగారం కొనుగోళ్లు నిలిచిపోవడం పసిడి డిమాండ్ను ప్రభావితం చేసింది. అయితే బంగారం ధరలు కొంతమేర తగ్గుతున్నా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా పసిడి ధరలు స్ధిరంగా ముందుకు కదులుతాయని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ చీఫ్ రవీంద్ర రావు అంచనా వేశారు.