
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టెక్ సేవల సంస్థ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) టెక్నాలజీస్ టెక్ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ ‘‘టెక్ బీ’’ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా టెక్బీ కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం చేపట్టామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ వెల్లడించారు.ఇక్కడ మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. ఈ టెక్బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాల్లో చేరడంతోపాటు, ఆర్థిక స్వావలంబన సాధించాలని, తద్వారా ట్రెండ్ సెట్టర్స్గా నిలవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ కంపెనీలో ఉద్యోగులయ్యారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో దక్షిణాన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోదృష్టిపెట్టనున్నామని, ఉత్తరాన హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రాలలో తమ అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని, అందుకే ఈ టెక్ బీ కేంద్రాలని ప్రారంభించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో చేరాలంటే ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మాథ్స్ ఒక సబ్జెక్టుగా కలిగి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఈ ఎంపిక ఉంటుంది. ఇలా ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.10వేల స్టైపెండ్ ఇస్తామని ఆమె చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కాల పరిమితి ఒక సంవత్సరం. ఫీజు రూ.2లక్షలు. అయితే దీనికి లోన్ సదుపాయం ఉంది. ఉద్యోగం వచ్చిన తరువాత ఈమొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఇక్కడ శిక్షణపూర్తి చేసుకున్న విద్యార్థులకు 2.5 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలుకల్పిస్తామని శివశంకర్ ప్రకటించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, లైఫ్స్కిల్స్ తదితర అంశాలపై ఈ టెక్ బీ ప్రోగ్రాంలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. అలాగే ఈ శిక్షణ అనంతరం బిట్స్ పిలానీ, శస్త్ర (ఎస్ఏఎస్టీఆర్ఏ)లాంటి ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment