![జ్యువెలరీ వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధింపు సబబే: జైట్లీ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41460316910_625x300.jpg.webp?itok=f4Ih8bGN)
జ్యువెలరీ వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధింపు సబబే: జైట్లీ
కోల్కతా: నాన్-సిల్వర్ జ్యువెలరీ వస్తువులపై 1% ఎక్సైజ్ సుంకం విధింపు నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. సిమెంట్, వస్త్ర పరిశ్రమ సహా తదితర రంగాలు తయారీ పన్నును చెల్లిస్తున్నప్పుడు.. లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి ఎందుకు తప్పించాలన్నారు. జీఎస్టీ పరిధిలోకి బంగారు ఆభరణాలను తీసుకురాకపోతే దేశంలోని ఇతర వస్తువులపై పన్నులు పెరిగే అవకాశముందని తెలిపారు.
12న అమెరికాకు...
అరుణ్ జైట్లీ పది రోజుల యూఎస్ పర్యటన ఖరారైంది. ఈ నెల 12 న అమెరికా బయల్దేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్, న్యూయార్క్లలో జరిగే పలు సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటనలో తొలుత అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)-ప్రపంచ బ్యాంకు సంయుక్త సమావేశంలో పాల్గొంటారు.
ఈ సమావేశాల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తారు. ఇదే సందర్భంగా యూఎస్ పరిపాలన ఉన్నతాధికారులతో భేటీ అవుతారని ఆర్థిక శాఖ వెల్లడించింది. సమావేశాలకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ హాజరుకానున్నారు.