
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్మోదీపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫ్యుజిటివ్ వ్యాపారి మోదీకి చెందిన ఖరీదైన పెయింటింగ్లను గత వారం వేలం వేసిన ఈడీ, సిబీఐలు తాజాగా మరో వేలానికి సిద్ధపడ్డాయి.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) ద్వారా 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చే వారం వేలం నిర్వహించనుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమేరా, రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు, మూడు హోండాకార్లు, ఒక టొయాటా ఫార్చునర్, ఇన్నోవా తదితర కార్లను వేలానికి పెట్టింది. ఏప్రిల్ 18న ఆన్లైన్ ద్వారా వీటిని విక్రయించనుంది. వేలం వేయనున్న కార్లకు సంబంధించిన ధర, ఫోటోలు, కంపెనీ తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనుంది. పీఎంఎల్ఏ కోర్టు ప్రత్యేక అనుమతితో ఈడీ వీటిని వేలం వేయనుంది.
మరోవైపు లండన్ వాండ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ మోదీ గత శుక్రవారం పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్మినిస్టర్ కోర్టు నిరాకరించింది. దీంతో ఏప్రిల్ 26 తదుపరి విచారణ వరకు మోదీ జైలు ఊచలు లెక్క బెట్టాల్సిందే.
కాగా 14 వేల కోట్ల రూపాయల పీఎన్బీస్కాం విచారణలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350 సీడీఐలు, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా కారు, పోర్షే పనమేరా, మూడు హోండా కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి : నీరవ్ మోదీ గుండె పగిలే వార్త




Comments
Please login to add a commentAdd a comment