
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల ధరల సూచిక ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 ఫిబ్రవరిలో 6.58 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, ఇతర వంట వస్తువుల ధరలు చల్లబడటంతో ఫిబ్రవరిలో ఆరు నెలల తర్వాత తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం 6.58 శాతానికి తగ్గిందని ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 7.59 శాతం, గత ఏడాది ఫిబ్రవరిలో 2.57 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో మాంసం, చేపల విభాగ ద్రవ్యోల్బణం 10.2 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 10.5 శాతంగా ఉంది.
2019 ఆగస్టు నుండి పెరుగుతూ వస్తున్న సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తొలిసారని తనదిశను మార్చుకుంది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 50.19 శాతం గరిష్ట స్థాయి నుండి 31.61 శాతానికి చల్లబడింది. ప్రోటీన్ అధికంగా ఉండే పప్పుధాన్యాలు గుడ్ల విషయంలో ధరల పెరుగుదల రేటు కూడా నెమ్మదిగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన సీపీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో ఆహారద్రవ్యోల్బణం 10.81 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 13.63 శాతం. అయితే, 'ఇంధన కాంతి' విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దాదాపు 6.36 శాతానికి పెరిగింది.
మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనాకి కరోనా వైరస్ ఆందోళనలు తోడు కావడంతో ఆర్బీఐ ఈసారి భారీగా వడ్డీ రేట్ల కోత పెట్టనుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2020 ఏప్రిల్ 3 నుంచిప్రారంభంకానున్న ఏంపీసీ సమావేశాల్లో ఈసారి 50 బీపీఎస్పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. గత సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఇప్పటికే పలుదేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేటు కోతను ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment