
రాంచీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తప్పుడు, అనధికారిక లావేదేవీలు, వేల రూపాయల గల్లంతుతో ఖాతాదారులు లబోదిబోమంటుండగా స్వయంగా బ్యాంకే డిపాజిట్ విషయంలో తప్పులో కాలేసింది. సంక్షేమ పథకం కోసం కేటాయించిన కోట్ల రూపాయలను ఒక నిర్మాణ కంపెనీ ఖాతాలోకి జమ చేయడం కలకలం రేపింది.
తాజా నివేదికల ప్రకారం.. ఈ నిధులను జమ చేయాల్సిందిగా విద్యాశాఖను ఎస్బీఐ కోరినపుడు ఈ తప్పిదాన్ని బ్యాంకు గుర్తించింది. జార్ఖండ్ రాష్రం మధ్యాహ్న భోజన పథకం కోసం కేటాయించిన రూ.100కోట్ల నిధులను పొరపాటున ఓ నిర్మాణ కంపెనీ ఖాతాలోకి డిపాజిట్ చేసింది.
ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ (రాంచీ జోన్) డీకే పాండా ప్రకారం, ఈ ఘటపై బ్యాంకు అంతర్గత విచారణ చేపట్టింది. అలాగే దీనికి బాధ్యతగా ఓ అధికారిని సస్పెండ్ చేసింది. కంపెని చెందిన సుమారు ఏడు ఎనిమిది ఖాతాల్లో ఈ మొత్తం జమ అయినట్టు తెలిపారు. దీంతోపాటు సీబీఐలోకూడా అధికారిక ఫిర్యాదును సమర్పించామని పాండా చెప్పారు. అయితే ఈ మొత్తం సొమ్ములో 70శాతం రికవరీ చేయగా, ఇంకా రూ.30కోట్లను స్వాధీనం చేసుకునేందుకు ఎస్బీఐ ప్రయత్నిస్తోంది.