
కోల్ ఇండియా – కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ.335
ఎందుకంటే: కోల్ ఇండియా తాజాగా ఒక టన్ను బొగ్గు సరఫరాపై రూ.50 ఇవాక్యుయేషన్ ఫెసిలిటీ చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని సరఫరాలపై ఈ చార్జీపై మినహాయింపులున్నప్పటికీ, మొత్తం సరఫరాల్లో 80 శాతం సరఫరాలకు ఈ చార్జీలు వర్తిస్తాయి. ఈ చార్జీల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్ల అదనపు రాబడి రాగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఎలక్ట్రానిక్ వేలంలో నోటిఫై చేసిన ధర కంటే ప్రీమియమ్ 76 శాతం పెరిగింది. అమ్మకాలు 9 మిలియన్ టన్నులకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో గత కొన్నేళ్లతో పోల్చితే ఈ అక్టోబర్లో ప్రీమియమ్, అమ్మకాలు అధికంగా పెరిగాయి.
వేతనాల భారీగా పెంపు కారణంగా కంపెనీ వ్యయాలు కూడా భారీగా పెరగనున్నాయి. అయినప్పటికీ రెండేళ్లలో ఇబిటా 15 శాతం చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. వార్షిక అమ్మకాలు 7 శాతం వృద్ధి సాధిస్తాయన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 18 శాతం చక్రగతి వృద్ధితో రూ.21కు పెరగగలదని, అలాగే డివిడెండ్ ఈల్డ్ 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం.. బొగ్గు నాణ్యత, ఎలక్ట్రానిక్ వేలంలో ధరలు తగ్గడం, అమ్మకాల వృద్థి తగ్గనుండడం, వేతనాల పెంపు కారణంగా వ్యయాలు అధికంగా ఉండనుండడం...ఇవన్నీ కంపెనీ పనితీరుపై ప్రభావం చూపే అంశాలని గతంలో ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఈ ఆందోళనలన్నీ పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లేనని చెప్పవచ్చు.
అమ్మకాలు పుంజుకుంటుండటంతో నిర్వహణ లాభాలు కూడా మెరుగుపడుతున్నాయి. అండర్గ్రౌండ్ మైన్ల మూసివేత, స్వచ్ఛంద పదవీ విరమణ, ఓవర్టైమ్ కాంపెన్సేషన్ వంటి వివిధ వ్యయ నియంత్రణ పద్ధతులు సత్ఫలితాలనిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవవత్సరం కంపెనీ ఎంటర్ప్రైజ్ (ఇబిటా) మల్టీప్లై అంచనా విలువకు 7 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. అ ఎంటర్ప్రైజ్ (ఇబిటా) మల్టీప్లై విలువకు 8 రెట్ల ధరకు (రూ.335కు) ఈ కంపెనీ ఏడాదిలోగా చేరుకోగలదని అంచనా వేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ వేల్యూను ఇబిటాతో భాగిస్తే వచ్చేదానినే. (ఈవీబైఇబిటా). ఎంటర్ప్రైజ్ లేదా ఇబిటా మల్టీప్లైగా వ్యవహరిస్తారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ. 1,877 టార్గెట్ ధర: రూ.2,300
ఎందుకంటే: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్వరలో రూ.24,000 కోట్లు సమీకరించనున్నది. వీటిల్లో మాతృ కంపెనీ హెచ్డీఎఫ్సీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా రూ.8,500 కోట్లు, మిగిలిన రూ.15,500 కోట్లను క్యూఐపీ(క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్) ద్వారా లేదా ఏడీఆర్(అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్), జీడీఆర్(గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్)తదితర మార్గాల ద్వారా సమీకరిస్తుంది. ఈ రుణ సమీకరణ ద్వారా పుస్తక విలువ 15 శాతం వరకూ పెరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 15.1%గా ఉన్న క్యాపిటల్ అడెక్వసీ రేషియో(సీఏఆర్)మరో2.5–3 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయి.
మూలధన నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ రూ.24,000 కోట్ల అదనపు నిధులు బ్యాంక్ భవిష్యత్తు వృద్ధికి బాగా తోడ్పడుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో వ్యక్తిగత రుణాలు 36 శాతం, క్రెడిట్ కార్డ్ రుణాలు 45 శాతం, గృహ రుణాలు 19 శాతం చొప్పున వృద్ధి చెందాయి. క్రెడిట్ కార్డ్ల మార్కెట్లో అత్యధిక వాటా ఈ బ్యాంక్దే. ఫలితంగా మార్జిన్లు, రాబడులు కూడా ఈ బ్యాంక్కే అధికంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ గ్రామీణ మార్కెట్పై దృష్టి సారిస్తోంది. గత రెండేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన 900 బ్రాంచ్ల్లో 600కు పైగా బ్రాంచ్లు పంజాబ్, గుజరాత్ల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు కావడమే దీనికి నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా బ్రాంచ్లు ఉండడం వల్ల కాసా, ఫీజు ఆదాయాల్లో వృద్ధి చెప్పుకోదగిన స్థాయిల్లో కొనసాగుతోంది.
దీంతో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్)4 శాతంపైగానే కొనసాగుతుంది. మార్జిన్లు అధికంగా వచ్చే రిటైల్ రుణ వృద్ధి బాగా ఉండటంతో రెండేళ్లలో ఎన్ఐఎమ్ 4.2–4.5 శాతం రేంజ్లో ఉండొచ్చని అంచనా. గత కొన్నేళ్లలో మొండి బకాయిలు 1–1.5% రేంజ్లోనే ఉన్నాయి. రెండేళ్లలో స్థూల మొండి బకాయిలు 1.2%, నికర మొండి బకాయిలు 0.3% ఉండగలవని అంచనా. రెండేళ్లలో రుణ వృద్ధి 20%, నికర లాభం 24%, నికర వడ్డీ ఆదాయం 24% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. రుణ నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉండడం, నిర్వహణ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం, మార్జిన్లు, రాబడుల విషయాల్లో ఇతర బ్యాంక్ల కంటే ఉన్నత స్థాయిలో ఉండడం.. ఇవన్నీ కూడా సానుకూలాంశాలు.
Comments
Please login to add a commentAdd a comment