Coal India
-
సింగరేణిని కాపాడుకోవాలి!
కేంద్ర ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75 వేల కోట్లు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్లను దశల వారీగా వేలం వేస్తూ వస్తున్నది. కార్పొరేట్ల చేతుల్లోకి ఇప్పటికే 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. గత పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే పరిస్థితి విపక్షాలకు లేదు. చర్చకు అవకాశమే లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం తీసుకొంది.అది ప్రవేశపెట్టిన బిల్లుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు అందరూ మద్దతు పలికారు. ఇందులో బొగ్గు బ్లాక్ల వేలంతో పాటు కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు. సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు అనుబంధం కాని కారణంగా బతికి పోయింది!ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ )లో 25 శాతం పెట్టుబడి ఉపసహరణకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. కేంద్రం నిర్ణయం కారణంగా మరిన్ని షేర్లు ప్రైవేటుపరం కానున్నాయి. ఇదంతా బీసీసీఎల్ను అమ్మేసే కుట్రలో భాగమే అనక తప్పదు!మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక తాజాగా దేశంలోని 60 బొగ్గు బ్లాక్లకు వేలం వేసే ప్రక్రియ మన తెలంగాణలోనే మొదలు పెట్టారు. గత పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఇప్పుడు బీజేపీకి లేకున్నా, మోదీ తన విధానం మాత్రం మార్చుకోలేదనేది కొత్తగా నిర్వహించిన వేలం వల్ల స్పష్టమవుతోంది. గతంలో రామగుండానికి పీఎం నరేంద్ర మోదీ వచ్చినపుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు.ఇప్పుడు అదే మాట మన బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు బొగ్గు బ్లాక్ల కేటాయించమని డిమాండ్ చేసినా ఏమీ సమాధానం చెప్పలేదు! ‘రైల్వేతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఛాయ్ అమ్మాను! నేను రైల్వేను ప్రైవేట్ పరం చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారు, నేను అలా చేస్తానా?’ అని చెప్పిన పీఎం తర్వాత చేసిన పని ఏమిటో జగమెరిగిన సత్యం! అంతే కాదు అదే పీఎం మోడీ, ‘ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి’ అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఏ మాట నమ్మాలి?కేంద్ర, రాష్ట్రాల వాటాలు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి. ఇందులో కేంద్రం వాటా 49 శాతం ఉంది. రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. గత 20 ఏండ్లకు పైగా లాభాల్లో నడుస్తూ, 2001– 2002 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అనారోగ్యం పాలై దరఖాస్తు చేసుకుంటే ఇన్వాలిడేషన్ చేసి, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే కావడం విశేషం!ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటి విధానాల వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షల పైచిలుకు ఉన్న కార్మికుల సంఖ్య 3 లక్షలకూ, సింగరేణిలో 1991లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకూ పడిపోయాయి. కోల్ ఇండియా కూడా మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది! కోల్ బ్లాక్లను కేటాయించకుండా ఉంటే సింగరేణి నష్టాల్లో పడుతుంది. అప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయవచ్చనేది కేంద్రం యోచన కావచ్చు. అందుకే అది బొగ్గు బ్లాక్లను కేటాయించడంలేదని చెప్పవచ్చు.ఈ విషయం మీద మన తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని మోదీతో మాట్లాడుతామన్నారు. మరో వైపు ‘మా బ్లాకులు మాకు ఇవ్వండి’ అని మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లిఖిత పూర్వకంగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు పీఎం మోదీకి లేఖ రాశారు. ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2015 లోని బొగ్గు బ్లాక్ల వేలం చట్టం లోనే, 17 (ఏ) సెక్షన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాక్లను వేలంలో పాల్గొనకుండానే కేటాయించవచ్చు! ఆ దిశలో కేంద్రం ముందుకు పోతుందని ఆశిద్దాం! అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం! ఛలో ఆజ్ నహీ తో కల్ నహీ! తెలంగాణ గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి హక్కు ఉన్నది! – ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, 9951865223. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
కోల్ ఇండియాలో 16న సమ్మె సైరన్
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా నిలిచిన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒకరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
ఇంధన దిగ్గజం కోల్ ఇండియాకు లాభాల పంట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 6,800 కోట్లను తాకింది. అధిక అమ్మకాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,044 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.25 చొప్పున తొలి మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించింది. కాగా.. మొత్తం అమ్మకాలు సైతం రూ. 27,539 కోట్ల నుంచి రూ. 29,978 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 26,000 కోట్లను దాటాయి. ఈ కాలంలో ఇంధన కొనుగోలు ఒప్పందం(ఎఫ్ఎస్ఏ)లో భాగంగా ఒక్కో టన్ను బొగ్గుకు సగటున దాదాపు రూ. 1,542 చొప్పున లభించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ తాజా సమీక్షా కాలంలో 157.42 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ2లో 139.23 ఎంటీ బొగ్గు మాత్రమే ఉత్పత్తయ్యింది. ఇక అమ్మకాలు సైతం 154.53 ఎంటీ నుంచి 173.73 ఎంటీకి జంప్ చేశాయి. ఈ ఏడాది 780 ఎంటీ విక్రయాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
దీపావళి బోనస్ రూ.85 వేలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్ను కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్ఆర్ బోనస్ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు. -
హరిత ప్రాజెక్టులపై రూ. 25 వేల కోట్లు - కోల్ ఇండియా ప్రణాళికలు
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన విధంగా బొగ్గు రవాణాకు తోడ్పడే దాదాపు 61 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టులపై కోల్ ఇండియా దృష్టి పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో వాటిపై రూ. 24,750 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టులను మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి బొగ్గు హ్యాండ్లింగ్ పాయింట్ల వరకు యాంత్రిక కన్వేయర్ల ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఎఫ్ఎంసీ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. వీటివల్ల ధూళి, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యం, అలాగే రహాదార్లపైనా రవాణా భారం తగ్గుతుందని అధికారి వివరించారు. వీలైనంత తక్కువ మానవ ప్రమేయంతో వినియోగదారులకు అవసరమైన నాణ్యమైన బొగ్గును, కచ్చితమైన పరిమాణంలో అందించవచ్చని పేర్కొన్నారు. తొలి దశలో 414.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండే 35 ఎఫ్ఎంసీ ప్రాజెక్టులను రూ. 10,750 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 112 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ఎనిమిది ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 178 మిలియన్ టన్నుల సామర్థ్యం గల మరో 17 ప్రాజెక్టులను అందుబాటులోకి తేనున్నట్లు అధికారి చెప్పారు. ఇక రెండు, మూడో విడత ప్రాజెక్టుల్లో వరుసగా రూ. 2,500 కోట్లు, రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
కోల్ ఇండియా ఆఫర్కు డిమాండ్
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విండో ఓపెన్ కానుంది. తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్యూలో డిజిన్వెస్ట్మెంట్కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ప్రభుత్వం ఓఎఫ్ఎస్ను ప్రకటించింది. -
కోల్ ఇండియా @ రూ. 225
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. నేడు(జూన్ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్ షూ ఆప్షన్ ఎంచుకుంది. వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో బుధవారం కోల్ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. -
ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్ కీలకం
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ఈ వారం పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఫలితాల సీజన్ ఊపందుకుంది. జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలతోపాటు పూర్తి ఏడాది(2022–23)కి లిస్టెడ్ కంపెనీలు పనితీరును వెల్లడిస్తున్నాయి. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం దేశీయంగా ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం పలు దిగ్గజాలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ సిప్లా, ఐషర్ మోటార్స్, ఎల్అండ్టీ, యూపీఎల్, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. కోల్ ఇండియా వీక్ వారాంతాన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. యూనియన్ బ్యాంక్ లాభం 81 శాతం జంప్చేయగా.. కోల్ ఇండియా లాభం 18 శాతం క్షీణించింది. దీంతో నేడు(సోమవారం) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో కెనరా బ్యాంక్, యూపీఎల్(8న), లుపిన్(9న), బాష్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్అండ్టీ(10న), ఏషియన్ పెయింట్స్, సీమెన్స్(11న), సిప్లా, హెచ్పీసీఎల్, టాటా మోటార్స్(12న) పనితీరు వెల్లడించనున్నాయి. ఆర్థిక గణాంకాలు మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు 12న విడుదలకానున్నాయి. ఏప్రిల్ నెలకు 10న యూఎస్, 11న చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు తెలియరానున్నాయి. కాగా.. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు ప్రధాన పార్టీలు పోటీపడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 58 పాయింట్లు నీరసించి 61,112 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,069 వద్ద ముగిసింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ పుట్టడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.3 శాత చొప్పున బలపడ్డాయి. ఇతర అంశాలు ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 26– మే 5 మధ్య కాలంలో ఎఫ్పీఐలు రూ. 11,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయకుమార్ తెలియజేశారు. దీంతో ఎఫ్పీఐల పెట్టుబడులు ఇకపై కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంటును ప్రభావితంచేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. -
కోల్ ఇండియా చీఫ్గా పీఎం ప్రసాద్!
రాంచీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బాధ్యతలకు తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక వ్యవహారాల బోర్డ్ (పీఈఎస్బీ) ఏడుగురు అధికారులను ఇంటర్వ్యూ చేసి పీఎం ప్రసాద్ పేరును సిఫారసు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రసాద్ ప్రస్తుతం రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) సీఎండీగా పనిచేస్తున్నారు. 2019లో ఆయన భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) సీఎండీగా కూడా ఎంపికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఈ మైనింగ్లో గ్రాడ్యుయేటింగ్ తదుపరి 1984లో ఆయన సీఐఎల్లో తన కెరీర్ను ప్రారంభించారు. అటు తర్వాత అంచెలంచెలుగా విభిన్న హోదాల్లో పనిచేస్తూ, కోల్ ఫీల్డ్స్లోని వివిధ రంగాల్లో అపార అనుభవాన్ని గడించారు. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్కాస్ట్ మైన్స్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
విదేశీ బ్లాక్స్పై కోల్ ఇండియా కన్ను
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు. దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2009లో.. పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే. -
అంచనాలకు మించి.. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెండు రెట్లుపైగా ఎగసి రూ. 8,834 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 32,498 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 23,293 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,985 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 124 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 160 ఎంటీకి పెరిగింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న విషయం విదితమే. థర్మల్ విద్యుత్ రంగం నుంచి భారీ డిమాండ్ నెలకొనడంతో 15.4 కోట్ల టన్నుల బొగ్గును విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం 17.75 ఎంటీ బొగ్గును విక్రయించినట్లు తెలియజేసింది. ఇంధన సరఫరా కాంట్రాక్టుల(ఎఫ్ఎస్ఏ) మార్గంలో టన్నుకి రూ. 1,442 చొప్పున ధర లభించినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023–24)కల్లా బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 70 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 2% వృద్ధితో రూ. 220 వద్ద ముగిసింది. -
దేశంలో విద్యుత్ సంక్షోభం..కోల్ ఇండియాకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: రానున్న కాలంలో విద్యుత్ రంగ యుటిలిటీలకు అవసరమయ్యే బొగ్గును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉండవలసిందిగా ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 13 నెలల్లో 12 మిలియన్ టన్నుల(ఎంటీ) కోకింగ్ కోల్ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందంటూ సూచించింది. ఎంతమొత్తం బొగ్గు కాలవసిందీ వెల్లడించేందుకు రాష్ట్ర జెన్కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు శనివారం మధ్యాహ్నంవరకూ గడువును కోరినట్లు తెలుస్తోంది.తద్వారా కోల్ ఇండియా దిగుమతులకు ఆర్డర్లను పెట్టే వీలుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 2015 తదుపరి మహారత్న కంపెనీ కోల్ ఇండియా తిరిగి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. కాగా..ఈ జులై నుంచి 2023 జులై మధ్య కాలంలో 12 ఎంటీ బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో విద్యుత్ కోతలకు తెరలేచిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో ప్రభుత్వం బొగ్గు నిల్వలు సిద్ధం చేసేందుకు తగిన సన్నాహాలు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
కోల్ ఇండియా లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 46 శాతం జంప్చేసి రూ. 6,693 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 4,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,700 కోట్ల నుంచి రూ. 32,707 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 21,516 కోట్ల నుంచి రూ. 25,161 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 203.4 మిలియన్ టన్నుల నుంచి 209 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు 165 ఎంటీ నుంచి 180 ఎంటీకి ఎగశాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఉత్పత్తి 596.22 ఎంటీ నుంచి 622.63 ఎంటీకి పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు 1% క్షీణించి రూ. 181 వద్ద ముగిసింది. -
బొగ్గు కొరత వెనుక కేంద్రం కుట్ర: ప్రొఫెసర్ నాగేశ్వర్
సీతంపేట (విశాఖ ఉత్తర): బొగ్గు కృత్రిమ కొరత వెనుక కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. స్థానిక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం’ అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో నాగేశ్వర్ జూమ్ ద్వారా ప్రసంగించారు. కోల్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. బొగ్గు సంక్షోభం విద్యుత్ చార్జీలు పెరగడానికి దారి తీస్తుందన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించకపోవడం, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడం వెనుక వాటిని అమ్మాలన్న ఆలోచన దాగుందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న మన దేశంలో బొగ్గు సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోల్ ఇండియా విస్తరణ కంటే దాని నిర్వీర్యానికే చర్యలు చేపడుతున్నట్టు ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి ప్రణాళిక లేకపోవడమే బొగ్గు సమస్యకు కారణమన్నారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ఏపీ జెన్కో సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు. రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్ కేటాయించకుండా.. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా వేయకపోవడం విచారకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రైవేటు కంపెనీలు లాభపడేందుకు బొగ్గు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ పాల్గొన్నారు. -
ఇక మన ఫోకస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే, సీఐఎల్కు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: కాలుష్య రహిత విధానాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ పాడ్లు వంటి వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా (సీఐఎల్)కు కేంద్రం సూచించింది. ‘కోల్ ఇండియా తన వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరించాలి, కొత్త పరిశ్రమలైన ఎలక్ట్రిక్ చార్జింగ్ పాడ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటిల్లో అవకాశాలు అన్వేషించాలి‘ అని 2021–22కి సంబంధించిన అజెండాలో బొగ్గు శాఖ పేర్కొంది. భవిష్యత్తులో కర్బన ఉద్గారాలపై మరిన్ని ఆంక్షలు అనివార్యం కానున్న నేపథ్యంలో సోలార్ వేఫర్ తయారీ, సౌర విద్యుదుత్పత్తి, కోల్ బెడ్ మీథేన్ మొదలైన వాటిని పరిశీలించవచ్చని తెలిపింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో 80% పైగా వాటా కోల్ ఇండియాదే. 2023–24 నాటికి 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి.. -
శెబ్బాష్ ఆకాంక్ష.. అండర్మైన్ తొలి మహిళా ఇంజనీర్గా!
బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్మైన్ ఇంజనీర్గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు? గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి. అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్క్లాస్ మైనింగ్ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్ జింక్లో ఉపరితల మేనేజర్ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి. 50 ఏళ్లలో తొలిసారి కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్’ సెప్టెంబర్ 1న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్’ లో ఆమెను అండర్గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించి మైనింగ్ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్గ్రౌండ్ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా. అంత సులభం కాలేదు భారత గనుల చట్టం 1952లోని సెక్షన్ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్గ్రౌండ్ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది. భిన్న విద్యార్థి జార్ఘండ్లోని హజారీబాగ్కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్) బిట్స్లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్ జింక్ రాజస్థాన్ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్ ఇండియా లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్గ్రౌండ్ మైనింగ్ ఇంజనీరుగా డిజిగ్నేషన్ పొందింది. అయినా జాగ్రత్తలే ఆకాంక్ష కుమారి అండర్గ్రౌండ్ మైనింగ్ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్లైట్ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు. -
కోల్ ఇండియా లాభం రూ. 3,170 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్చేసి రూ. 3,170 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,080 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,487 కోట్ల నుంచి రూ. 25,282 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,471 కోట్ల నుంచి రూ. 21,626 కోట్లకు పెరిగాయి. క్యూ1లో బొగ్గు ఉత్పత్తి 121.04 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 124 ఎంటీకి బలపడింది. ముడిబొగ్గు అమ్మకాలు 120.80 ఎంటీ నుంచి 160.44 ఎంటీకి పెరిగాయి. రానున్న మూడేళ్లలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. బొగ్గు వెలికితీత, తరలింపు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, శుద్ధ ఇంధన సాంకేతికతలు తదితరాలకు ఈ నిధులను వెచ్చించనుంది. తద్వారా 2023–24కల్లా 100 కోట్ల టన్నుల కోల్ ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు వేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 142 వద్ద ముగిసింది. -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
పీఎం కేర్స్కు బజాజ్ ఫిన్సర్వ్ 10 కోట్లు
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ అనే ప్రత్యేక నిధికి బజాజ్ ఫిన్సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంఆర్ఎఫ్ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సైతం కరోనా వైరస్ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది. కోల్ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా కరోనా వైరస్ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది. -
బ్లూచిప్ పీఎస్యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్ఎస్కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
‘నల్లబంగారం’ ఇక జిగేల్!
న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు రంగాన్ని ఇందులోకి అనుమతించాలని కేంద్ర సర్కారు లోగడే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 200 బొగ్గు గనులను (బ్లాకులు) వాణిజ్య ప్రాతిపదికన తవ్వితీసేందుకు వేలం వేయనుంది. గరిష్టంగా 400 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2024 నాటికి విద్యుత్ సంస్థలు బొగ్గు దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నది అంచనా. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలోనే వేలం..: పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు గాను మొదటి విడతగా 40 బొగ్గు బ్లాకులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం వేలానికి తీసుకురానుంది. వీటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1–50 మిలియన్ టన్నుల మధ్య ఉండనుంది. వాణిజ్య బొగ్గు గనుల వేలానికి సంబంధించి బిడ్డింగ్ నిబంధనలను ఈ నెలాఖరుకు విడుదల చేసి, వచ్చే నెలలో భాగస్వాముల అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వేలానికి వచ్చే బ్లాకుల్లో కొన్నింటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 30–50 మిలియన్ టన్నుల మధ్య ఉంటుందని తెలిపారు. కొన్ని బ్లాకుల్లో నిల్వల సమాచారం కచ్చితంగా గుర్తించగా, మరికొన్నింటిలో పాక్షికంగానే అది జరిగిందన్నారు. వీటి వల్ల దేశీయంగా బొగ్గు ఉత్పత్తి లోటు కొంత వరకు తీరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో 235 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులు జరిగాయి. వీటిల్లో 125 మిలియన్ టన్నుల మేర థర్మల్ బొగ్గు (54 శాతం) దిగుమతులే కావడం గమనార్హం. ఐరన్, స్టీల్ తయారీకి కోకింగ్ కోల్ అవసరం అవుతుంది. మన దేశంలో కోకింగ్ కోల్ లభ్యత లేనందున ఐరన్, స్టీల్ కంపెనీలకు దిగుమతే మార్గం. కానీ, విద్యుత్ తయారీకి వినియోగించే థర్మల్ బొగ్గును దిగుమతి చేసుకోకుండా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆదాయంలో వాటా..: వేలానికి పరిగణిస్తున్న వాటిల్లో చెండిపడ–1, 2, మదన్పూర్ నార్త్, ఫతేపూర్, ఫతేపూర్ ఈస్ట్, మహానంది, మచ్చకట బ్లాకులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దేశిత వాటాను లీజుదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ బొగ్గు బ్లాకుల ఉత్పత్తిని త్వరగా ఆరంభించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనుంది. నాలుగు, ఐదో దశ వేలంలో పరిశ్రమల నుంచి స్పందన ఆశించిన మేర లేదు. దీంతో మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా సిఫారసుల మేరకు ఆదాయంలో వాటా ప్రాతిపదికన బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న సంస్థలు, నిర్దేశిత కాల వ్యవధి కంటే ఏడాదిముందే ఉత్పత్తి ప్రారంభిస్తే దానికి ప్రోత్సాహకంగా ఆదాయంలో వాటాను 10% ప్రభుత్వం తగ్గించుకోనుంది. 125 టన్నులకు కోల్ ఇండియా ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా గత ఏడాది కాలంలో 16 బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోగా, వీటి సాయంతో సంస్థ ఉత్పత్తి 125 మిలియన్ టన్నులకు చేరనుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ బ్లాకుల్లో ఉత్పత్తి మూడు నుంచి ఆరేళ్లలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘‘2023–24 నాటికి ఒక బిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు కంపెనీకి సాయపడుతుంది. ఇటీవలి కేటాయించిన వాటిల్లో కొన్నింటిలో 2–3 ఏళ్లు, ఇతర బ్లాకుల్లో ఉత్పత్తికి మరింత సమయం తీసుకుంటుంది’’ అని కోల్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ బ్లాకుల్లో వెలికితీత కార్యకలాపాలను కోల్ ఇండియా త్వరగా ప్రారంభించాలని కేంద్రం కోరుకుంటోంది. -
అయ్యో మేక : కోల్ ఇండియాకు భారీ నష్టం
భువనేశ్వర్: ఓ మూగ జీవి మరణం కోల్ ఇండియాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. భారతదేశంలో అతిపెద్ద సంస్థ కోల్ ఇండియాకు చెందిన మహానంది బొగ్గు క్షేత్రం (ఎంసీఎల్)లోని నిషేధిత మైనింగ్ జోన్లో జరిగిన ప్రమాదంలో మేక చనిపోయింది. దీంతో సమీప గ్రామానికి చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో సంస్థకు 26.8 మిలియన్ల డాలర్ల (రూ.2.7 కోట్ల) నష్టం వాటిల్లింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మేక మరణంతో తమకు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని ఎంసీఎల్ ప్రతినిధి డికెన్ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికుల ఆందోళన కారణంగా ఎంసీఎల్ వద్ద దాదాపు మూడున్నర గంటలు బొగ్గు రవాణా నిలిచిపోయింది. ఉన్నట్టుండి ఆపరేషన్లు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టం వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే పరిస్థితి చక్కబడి, పనులు తిరిగి ప్రారంభమైనట్లు మెహ్రా తెలిపారు. నిరసనకారులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక ప్రజలు బొగ్గు, కట్టెలకోసం, అలాగే వారి పశువులను మేపడానికి బొగ్గు గని నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడతారనీ మెహ్రా చెప్పారు. -
సీపీఎస్ఈ ఈటీఎఫ్కు రూ.27,300 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటా యించిన వాటా 5.5 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ కేటగిరీ ఇన్వెస్ట్రర్ల నుంచి రూ.13,300 కోట్లకు బిడ్లు వచ్చాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ.17,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ప్రావిడెండ్ ఫండ్ సంస్థ, ఈపీఎఫ్ఓ రూ.1,500 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్లో 11 కంపెనీల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఎస్జేవీఎన్, ఎన్ఎల్సీ, ఎన్బీసీసీల షేర్లు ఈ ఈటీఎఫ్లో ఉన్నాయి. -
కోల్ ఇండియా లాభం ఎనిమిది రెట్లు
న్యూఢిల్లీ: కోల్ ఇండియా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఎనిమిది రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.370 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,085 కోట్లకు పెరిగిందని కోల్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.3,786 కోట్ల నికర లాభం వచ్చిందని, సీక్వెన్షియల్గా చూస్తే, 18 శాతం క్షీణత నమోదైందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.19,172 కోట్ల నుంచి రూ.24,209 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.18,148 కోట్ల నుంచి రూ.19,092 కోట్లకు పెరిగాయని వివరించింది. బొగ్గు ఉత్పత్తి గత క్యూ2లో 110 మిలియన్ టన్నులుగా ఉండగా, ఈ క్యూ2లో 120 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేర్ 1.5 శాతం పతనమై రూ.264 వద్ద ముగిసింది. కోల్ ఇండియా ఓఎఫ్ఎస్లో పాల్గొనకండి ఉద్యోగులకు కార్మిక సంఘాల పిలుపు కోల్ ఇండియాలో వాటా విక్రయాన్ని బొగ్గు రంగ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ ఫర్ సేల్లో 5 శాతం వాటాను కోల్ ఇండియా ఉద్యోగులకు కేంద్రం ఆఫర్ చేస్తోంది. ఒక్కో షేర్ను రూ.254.22 ధరకు మొత్తం 99 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఓఎఫ్ఎస్ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. ఈ వాటా విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నామని సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి బి.బి. రామధంధన్ చెప్పారు. ఈ ఓఎఫ్ఎస్లో పాల్గొనవద్దని, ఉద్యోగులెవరూ షేర్లను కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు. ఇటీవలనే కోల్ ఇండియాలో ప్రభుత్వం 3.19 శాతం వాటాను విక్రయించింది. కాగా 2010లో ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రాగా, ఉద్యోగుల నుంచి అంతంత మాత్రం స్పందనే వచ్చింది. -
కోల్ ఇండియా ఓఎఫ్ఎస్ ఓకే!
న్యూఢిల్లీ: కోల్ ఇండియా వాటా విక్రయం విజయవంతంగా ముగిసింది. ఈ కంపెనీలో 3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. బుధవారం ప్రారంభమైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) గురువారం ముగిసింది. ఈ ఓఎఫ్ఎస్లో భాగంగా 3.18 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5,300 కోట్లు సమీకరించింది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్ చేయడానికి కేటాయించారు. ఈ ఆఫర్ ఫర్ సేల్లో భాగంగా 3 శాతం వాటాకు సమానమైన 18.62 కోట్ల షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఒక్కో షేర్ ఫ్లోర్ ధరను రూ.266గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ధరపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 1.56 రెట్లు సబ్స్క్రైబయిన రిటైల్ వాటా.. రిటైల్ ఇన్వెస్టర్లకు 3.96 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు. 6.19 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ వాటా విభాగం 1.56 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా కూడా 1 శాతానికి పైగా ఓవర్ సబ్స్క్రైబయింది. వారికి 14.89 కోట్ల షేర్లను కేటాయించగా, 15.84 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబయితే అదనంగా మరో 6% వాటాను(37.24 కోట్లు) విక్రయించాలని ప్రభుత్వం భావించింది. 3% వాటా విక్రయానికి గాను 3.18% వాటా షేర్ల కోసం బిడ్లు వచ్చాయని, అదనంగా వచ్చిన 0.18% వాటా బిడ్లను కూడా ఆమోదిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. 2015, జవనరిలో ఓఎఫ్ఎస్ ద్వారానే 10% వాటా విక్రయించి ప్రభుత్వం రూ.23,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 78.32% వాటా ఉంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో బీఎస్ఈలో కోల్ ఇండియా షేర్ 1.9% నష్టపోయి రూ.261 వద్ద ముగిసింది. అతి పెద్ద వాటా విక్రయం..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద వాటా విక్రయం ఇదే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకూ రూ.10,028 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్తో పాటు రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వం రాబట్టింది. -
కోల్ ఇండియా వాటా విక్రయం నేడు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 3 శాతం వాటాను బుధవారం ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఒక్కో షేర్ను రూ.266కు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధర మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే 4 శాతం తక్కువ. రెండు రోజుల పాటు జరిగే ఈ వాటా విక్రయంలో బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు గురువారం ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు రూ.5,000 కోట్లు... ఈ మూడు శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,000 కోట్లు సమకూరుతాయని అంచనా. ఓఎఫ్ఎస్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మరో 6 శాతం వాటాను కూడా విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచన. మొత్తం 9 శాతం వాటా విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమీకరిస్తుందని అంచనా. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా 2015, జనవరిలో కేంద్రం కోల్ ఇండియాలో 10 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయం ద్వారా అప్పుడు రూ.23,000 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 78.32% వాటా ఉంది. డిజిన్వెస్ట్మెంట్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కోల్ ఇండియా షేర్ 4% వరకూ పతనమై రూ.277 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా లాభం 52% డౌన్
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద మైనింగ్ కంపెనీ కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) జనవరి – మార్చి క్వార్టర్లో 52 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.2,719 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.1,295 కోట్లకు తగ్గిందని కోల్ ఇండియా తెలిపింది. ఆదాయం మాత్రం రూ.26,634 కోట్ల నుంచి రూ.28,909 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.22,353 కోట్ల నుంచి రూ.27,757 కోట్లకు చేరాయి. ఉద్యోగుల ప్రయోజనాల వ్యయాలు రూ.9,241 కోట్ల నుంచి రూ.16,654 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల అమ్మకాలు 6 శాతం వృద్ధితో రూ.37,495 కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ లాభం రూ.3,461 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.196 కోట్లకు తగ్గిందని తెలిపింది. నిర్వహణ లాభ మార్జిన్ 0.7 శాతం తగ్గి 14.9 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినందున గత ఆర్థిక సంవత్సరం, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరాల ఆదాయం, మొత్తం వ్యయాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. గత ఏడాది మార్చి నాటికి 554 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది మార్చి నాటికి 567 మిలియన్ టన్నులకు పెరిగిందని కోల్ ఇండియా పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 630 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేర్ 1% నష్టంతో రూ.282 వద్ద ముగిసింది. -
బొగ్గుగనులు ప్రైవేటుపరం
గోదావరిఖని(రామగుండం) : బొగ్గుగనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ బొగ్గు ధర నిర్ణయిస్తూ విక్రయించుకునే అధికారం కూడా సంస్థలకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ చర్యపూర్తిగా సింగరేణి, కోల్ఇండియా లాంటి ప్రభుత్వ రంగసంస్థల మూసివేతకు దారి తీస్తుందని ఆయా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరిఖనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయగా, ఈనెల 23న సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు ఏఐటీయూసీ ప్రకటించింది. 1938 నిజాం పాలనలో సింగరేణి బొగ్గుగనులను పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్పుచేశారు. 1973 వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనున్న బొగ్గుగనులను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారు. అప్పటి ఎనిమిది సబ్సిడరీ సంస్థల పరిధిలోని బొగ్గుగనులు కోల్ఇండియా లిమిడెట్ పరిధిలోకి తీసుకువస్తూ పార్లమెంట్లో చట్టం చేశారు. ఇలా సింగరేణి, కోల్ఇండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీలుగా వర్ధిల్లుతున్నాయి. ఆయా సంస్థల్లో కొన్ని గనులను క్యాప్టివ్ మైన్గా గుర్తించి వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించి బొగ్గును వెలికితీసేలా చూశారు. కానీ బొగ్గును విక్రయించే అధికారం మాత్రం పబ్లిక్ సెక్టార్ కంపెనీలకే ఇచ్చారు. ఇలా సాగుతున్న క్రమంలో బొగ్గుగనులను క్యాప్టివ్ మైన్స్గా గుర్తిస్తూ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం.. బొగ్గును విక్రయించే అధికారం కూడా ఆయా ప్రైవేటు సంస్థలకే అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పార్లమెంట్లో చట్టంగా రావడమే తరువాయి. ఉద్యమానికి సిద్ధంగా కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. కోల్ఇండియా పరిధిలో జాతీయ కార్మిక సంఘాలు ఉద్యమానికి సిద్దమవుతున్నాయి. సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ నెల 23న సింగరేణి వ్యాప్తంగా అన్నిగనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తెలిపారు. సింగరేణిలో ఐక్యంగా ఉద్యమం చేసేందుకు గురువారం అన్నికార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్మికలోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, డి.కొమురయ్య, వెంకటేశ్బాబు, సీహెచ్. ఓదెలు, ఉల్లి మొగిలి, జి.గోపాల్, రాములు, గౌస్, పానుగంటి కృష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఇక ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దీంతో బొగ్గు రంగంలో సమర్ధత మరింత పెరుగుతుందని, గుత్తాధిపత్య (కోల్ ఇండియా) ధోరణులకు చెక్ పెట్టినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. బొగ్గు రంగంలో పోటీతత్వం పెరిగేందుకు, చౌక విద్యుత్ టారిఫ్లు సాకారమయ్యేందుకు ఇది దోహదపడగలదని గోయల్ వివరించారు. ‘బొగ్గు రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారీ పెట్టుబడులు రావడం వల్ల బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది‘ అని గోయల్ పేర్కొన్నారు. బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పోటీతో కోల్ ఇండియాకూ ప్రయోజనం.. బొగ్గు రంగాన్ని జాతీయం చేసిన అనంతరం బొగ్గు విక్రయించే అధికారాలు ప్రభుత్వ రంగ కోల్ ఇండియాకి (సీఐఎల్) మాత్రమే కట్టబెట్టారు. దేశీయంగా ఉత్పత్తయ్యే మొత్తం బొగ్గులో సీఐఎల్ వాటా 80 శాతం ఉంటుంది. తాజా సంస్కరణలతో కోల్ ఇండియా గుత్తాధిపత్యం తగ్గినప్పటికీ.. ఈ రంగంలో పోటీతత్వం పెరగడం ద్వారా ఆ సంస్థకూ ప్రయోజనం చేకూరగలదని మంత్రి గోయల్ వ్యాఖ్యానించారు. బొగ్గు ఉత్పత్తి దేశీయంగా పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని.. తద్వారా విలువైన విదేశీ మారక నిల్వలూ కూడా ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు. పారదర్శకతకు పెద్ద పీట.. బొగ్గు తవ్వకాల కోసం చిన్న, మధ్య స్థాయి, భారీ స్థాయి గనులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఆఫర్ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. పారదర్శకతకు, సులభతరంగా వ్యాపారాల నిర్వహణ విధానాలకు పెద్ద పీట వేసేలా వేలం ప్రక్రియ ఉంటుందన్నారు. సహజ వనరులు దేశాభివృద్ధికే ఉపయోగపడేలా చూసేందుకు ఇది ఉపయోగపడగలదన్నారు. ఈ సంస్కరణలు బొగ్గు సరఫరాపై ఖచ్చితత్వం.. కేటాయింపుల్లో జవాబుదారీతనం పెరిగేందుకు, చౌకగా బొగ్గు లభ్యతకు దోహదపడగలవని, ఇంధన భద్రత సాధించేందుకు తోడ్పడగలవని గోయల్ పేర్కొన్నారు. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కంపెనీలు ఎంతెంత అధికంగా చెల్లిస్తాయన్న ప్రాతిపదికన వేలం ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఆయా గనుల నుంచి ఉత్పత్తి చేసే బొగ్గు విక్రయం/వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని వివరించింది. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపింది. అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి .. బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి. పోంజీ స్కీములపై కొరడా ♦ నిషేధానికి సమగ్ర చట్టం ♦ పథకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ♦ ప్రత్యేక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం చిట్టీలు, డిపాజిట్ల పేరుతో సామాన్యులు మోసపోకుండా ఉండేందుకు కేంద్రం రెండు కొత్త బిల్లులు తేనుంది. ఈమేరకు నియంత్రణ లేని డిపాజిట్ల వసూళ్లను నిషేధిస్తూ ప్రతిపాదించిన నూతన బిల్లును కేంద్ర కేబినెట్ మంగళవారం ఇక్కడ ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ‘నియంత్రణ లేని డిపాజిట్ స్కీముల నిషేధ బిల్లు, 2018’, ‘చిట్ఫండ్స్(సవరణ) బిల్లు, 2018’ని ఆమోదించింది. అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ నిషేధ బిల్లు 2018ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ‘కొన్ని సంస్థలు, కంపెనీలు..నియంత్రణ చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ, మోసపూరిత పథకాలతో సామాన్య ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయి. దేశీయంగా ఇలాంటి అక్రమ డిపాజిట్ల సమీకరణ కార్యకలాపాల సమస్యను పరిష్కరించడం ఈ బిల్లు ప్రధానోద్దేశం‘ అని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి స్కీముల వల్ల మోసపోయే వారిలో అత్యధికులు పేదలు ఉంటున్నారు. నియంత్రణ సంస్థల కంటబడకుండా పోంజీ స్కీములు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటున్నాయి. కఠిన శిక్షలు.. జరిమానాలు: తాజాగా రూపొం దించిన బిల్లు ప్రకారం .. ఇలాంటి అనధికారిక డిపాజిట్ల సమీకరణపై పూర్తి నిషేధం అమల్లోకి రావడంతో పాటు, నిధులు సమీకరించే వారిపై కఠిన శిక్షలు ఉంటాయి. ఒకవేళ డిపాజిట్లు సమీకరించిన సంస్థ మూతబడితే.. ఇన్వెస్టర్లకు సక్రమంగా తిరిగి చెల్లింపులు జరిగేలా చూ సేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని నియమించాల్సి ఉంటుంది. ఈ బిల్లు ప్రధానంగా మూడు రకాల నేరాలను ప్రస్తావించింది. అనధికారిక డిపాజిట్ల పథకాల నిర్వహణ, నియంత్రిత డిపాజిట్ స్కీములలో మోసపూరిత డిఫాల్ట్, అనధికారిక డిపాజిట్ పథకాల్లో చేరేలా ప్రేరేపించడం మొదలైన వాటిని నేరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో కఠిన శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉంటాయి. స్కీము నడిపే సంస్థ గానీ మూతబడితే .. దాని ఆస్తులను అటాచ్ చేసి, డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు జరిపేందుకు స్పష్టమైన గడువు ఉం టుంది. దేశం మొత్తం మీద డిపాజిట్స్ సమీకరణ కార్యకలాపాల వివరాలను సమీకరించేందుకు, దర్యాప్తు సంస్థలతో పంచుకునేందుకు ఆన్లైన్ సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది. -
కోల్ ఇండియా ధరల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కోల్ ఇండియా విద్యుత్, విద్యుత్యేతర వినియోగ సంస్థలకు విక్రయించే బొగ్గు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంపు జనవరి 9 నుంచి తక్షణం అమల్లోకి వస్తుందంటూ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన కోల్ ఇండియా.. రేట్ల పెరుగుదల ఎంత ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు. బొగ్గు ధరల పెంపుతో 2017–18లో మిగిలిన వ్యవధిలో కంపెనీకి అదనంగా రూ.1,956 కోట్ల ఆదాయం రావచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఆదాయం రూ. 6,421 కోట్లు ఉండగలదని కోల్ ఇండియా వెల్లడించింది. కోల్ ఇండియా గతేడాది మేలో రేటును సగటున 6.3 శాతం పెంచింది. దీంతో 2016–17లో అదనంగా రూ. 3,234 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక, తాజాగా, రేట్ల పెంపు సుమారు 10 శాతం మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొనగా.. ఈ ప్రభావంతో విద్యుత్ చార్జీలు యూనిట్కు కనీసం రూ. 0.50 మేర పెరిగే అవకాశం ఉందని విద్యుదుత్పత్తి సంస్థలు తెలిపాయి. జీ–11, జీ–14 గ్రేడ్ బొగ్గు రేట్ల పెంపు 15–20% మేర ఉండొచ్చని, ఫలితంగా విద్యుత్ యూనిట్ ధర రూ. 0.30–0.50 మేర పెరగవచ్చని ఇండియన్ క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది. ‘జీ–11, జీ–14 గ్రేడ్ బొగ్గు ధరల పెరుగుదల 15–20 శాతం శ్రేణిలో ఉంది. దీనితో విద్యుత్ చార్జీలు యూనిట్కి 30–50 పైసల మేర పెరిగే అవకాశం ఉంది‘ అని ఐసీపీపీఏ కార్యదర్శి రాజీవ్ అగర్వాల్ వివరించారు. ఎవాక్యుయేషన్ చార్జీలు (టన్నుకు రూ. 50 చొప్పున), ఉపరితల రవాణా చార్జీలు మొదలైన వాటి పేరిట పరోక్షంగా ఇప్పటికే 12–18 శాతం దాకా భారం పడుతుండగా.. తాజా పెంపు మరింత భారం అవుతుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఇంధన ధరలు తగ్గాలని.. కానీ కోల్ ఇండియా, ఆ సంస్థ సిబ్బంది అసమర్ధత, దాని వ్యయాలు, నష్టాల తీరు మొదలైనవన్నీ దేశానికి గుదిబండగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కోల్ ఇండియా ఏకపక్షంగా బొగ్గు రేట్లు పెంచేయడం వల్ల విద్యుత్ చార్జీలు యూనిట్కు 25–30 పైసల మేర పెరుగుతాయని విద్యుత్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ (ఎపీపీ) డైరెక్టర్ జనరల్ అశోక్ ఖురానా చెప్పారు. -
స్టాక్స్ వ్యూ
కోల్ ఇండియా – కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ.335 ఎందుకంటే: కోల్ ఇండియా తాజాగా ఒక టన్ను బొగ్గు సరఫరాపై రూ.50 ఇవాక్యుయేషన్ ఫెసిలిటీ చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని సరఫరాలపై ఈ చార్జీపై మినహాయింపులున్నప్పటికీ, మొత్తం సరఫరాల్లో 80 శాతం సరఫరాలకు ఈ చార్జీలు వర్తిస్తాయి. ఈ చార్జీల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్ల అదనపు రాబడి రాగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఎలక్ట్రానిక్ వేలంలో నోటిఫై చేసిన ధర కంటే ప్రీమియమ్ 76 శాతం పెరిగింది. అమ్మకాలు 9 మిలియన్ టన్నులకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో గత కొన్నేళ్లతో పోల్చితే ఈ అక్టోబర్లో ప్రీమియమ్, అమ్మకాలు అధికంగా పెరిగాయి. వేతనాల భారీగా పెంపు కారణంగా కంపెనీ వ్యయాలు కూడా భారీగా పెరగనున్నాయి. అయినప్పటికీ రెండేళ్లలో ఇబిటా 15 శాతం చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. వార్షిక అమ్మకాలు 7 శాతం వృద్ధి సాధిస్తాయన్న అంచనాలున్నాయి. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 18 శాతం చక్రగతి వృద్ధితో రూ.21కు పెరగగలదని, అలాగే డివిడెండ్ ఈల్డ్ 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం.. బొగ్గు నాణ్యత, ఎలక్ట్రానిక్ వేలంలో ధరలు తగ్గడం, అమ్మకాల వృద్థి తగ్గనుండడం, వేతనాల పెంపు కారణంగా వ్యయాలు అధికంగా ఉండనుండడం...ఇవన్నీ కంపెనీ పనితీరుపై ప్రభావం చూపే అంశాలని గతంలో ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఈ ఆందోళనలన్నీ పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లేనని చెప్పవచ్చు. అమ్మకాలు పుంజుకుంటుండటంతో నిర్వహణ లాభాలు కూడా మెరుగుపడుతున్నాయి. అండర్గ్రౌండ్ మైన్ల మూసివేత, స్వచ్ఛంద పదవీ విరమణ, ఓవర్టైమ్ కాంపెన్సేషన్ వంటి వివిధ వ్యయ నియంత్రణ పద్ధతులు సత్ఫలితాలనిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవవత్సరం కంపెనీ ఎంటర్ప్రైజ్ (ఇబిటా) మల్టీప్లై అంచనా విలువకు 7 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. అ ఎంటర్ప్రైజ్ (ఇబిటా) మల్టీప్లై విలువకు 8 రెట్ల ధరకు (రూ.335కు) ఈ కంపెనీ ఏడాదిలోగా చేరుకోగలదని అంచనా వేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ వేల్యూను ఇబిటాతో భాగిస్తే వచ్చేదానినే. (ఈవీబైఇబిటా). ఎంటర్ప్రైజ్ లేదా ఇబిటా మల్టీప్లైగా వ్యవహరిస్తారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 1,877 టార్గెట్ ధర: రూ.2,300 ఎందుకంటే: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్వరలో రూ.24,000 కోట్లు సమీకరించనున్నది. వీటిల్లో మాతృ కంపెనీ హెచ్డీఎఫ్సీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా రూ.8,500 కోట్లు, మిగిలిన రూ.15,500 కోట్లను క్యూఐపీ(క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్) ద్వారా లేదా ఏడీఆర్(అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్), జీడీఆర్(గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్)తదితర మార్గాల ద్వారా సమీకరిస్తుంది. ఈ రుణ సమీకరణ ద్వారా పుస్తక విలువ 15 శాతం వరకూ పెరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 15.1%గా ఉన్న క్యాపిటల్ అడెక్వసీ రేషియో(సీఏఆర్)మరో2.5–3 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయి. మూలధన నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ రూ.24,000 కోట్ల అదనపు నిధులు బ్యాంక్ భవిష్యత్తు వృద్ధికి బాగా తోడ్పడుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో వ్యక్తిగత రుణాలు 36 శాతం, క్రెడిట్ కార్డ్ రుణాలు 45 శాతం, గృహ రుణాలు 19 శాతం చొప్పున వృద్ధి చెందాయి. క్రెడిట్ కార్డ్ల మార్కెట్లో అత్యధిక వాటా ఈ బ్యాంక్దే. ఫలితంగా మార్జిన్లు, రాబడులు కూడా ఈ బ్యాంక్కే అధికంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ గ్రామీణ మార్కెట్పై దృష్టి సారిస్తోంది. గత రెండేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన 900 బ్రాంచ్ల్లో 600కు పైగా బ్రాంచ్లు పంజాబ్, గుజరాత్ల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు కావడమే దీనికి నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా బ్రాంచ్లు ఉండడం వల్ల కాసా, ఫీజు ఆదాయాల్లో వృద్ధి చెప్పుకోదగిన స్థాయిల్లో కొనసాగుతోంది. దీంతో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్)4 శాతంపైగానే కొనసాగుతుంది. మార్జిన్లు అధికంగా వచ్చే రిటైల్ రుణ వృద్ధి బాగా ఉండటంతో రెండేళ్లలో ఎన్ఐఎమ్ 4.2–4.5 శాతం రేంజ్లో ఉండొచ్చని అంచనా. గత కొన్నేళ్లలో మొండి బకాయిలు 1–1.5% రేంజ్లోనే ఉన్నాయి. రెండేళ్లలో స్థూల మొండి బకాయిలు 1.2%, నికర మొండి బకాయిలు 0.3% ఉండగలవని అంచనా. రెండేళ్లలో రుణ వృద్ధి 20%, నికర లాభం 24%, నికర వడ్డీ ఆదాయం 24% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. రుణ నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉండడం, నిర్వహణ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం, మార్జిన్లు, రాబడుల విషయాల్లో ఇతర బ్యాంక్ల కంటే ఉన్నత స్థాయిలో ఉండడం.. ఇవన్నీ కూడా సానుకూలాంశాలు. -
కోల్ ఇండియా ఉద్యోగులకు దీపావళి బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వన్ టైం అడ్వాన్స్ కింద ప్రతీ ఉద్యోగికి అందించే చెల్లింపును భారీగా (25శాతం) పెంచింది. రూ.40వేలకు బదులుగా తాజాగా రూ.51 వేలను అందించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళికి ముందే ఈ అడ్వాన్స్ను చెల్లించనున్నట్టు బొగ్గు మంత్రి పియూష్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మూడు లక్షల మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీపావళి సందర్భంగా కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం ధంతేరస్ కానుకను ప్రకటించింది. ప్రభుత్వ జారీ చేసిన ప్రకటన ప్రకారం రూ.40 వేలకు బదులుగా రూ.51వేలను అందించనుంది. ముఖ్యంగా దీపావళి పర్వదినానికి ముందే అక్టోబర్ 17 వ తేదీ నాటికి ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. కోల్ ఇండియా మేనేజ్మెంట్, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఆమోదంతో 2016 నుండి ఉద్యోగుల జీతాల్లో 20 శాతం పెంపుదల చేసినట్టు చెప్పింది. అలాగే 2017 సెప్టెంబరులో 10.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2017 అక్టోబర్లో 13 శాతం వృద్ధిని నమోదు చేస్తామని అధికారిక ప్రకటనలో తెలిపింది. -
బోనస్ రూ.57 వేలు
♦ కోల్కత్తా సమావేశంలో నిర్ణయం ♦ గని కార్మికులకు దీపావళి ముందు చెల్లింపు గోదావరిఖని(రామగుండం) : దేశవ్యాప్తంగా కోల్ఇండియా, సింగరేణి సంస్థలలో పనిచేస్తున్న 3.50 లక్షలమంది బొగ్గుగని కార్మికులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) బోనస్ (లాభాల బోనస్)ను రూ.57 వేలు చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. కోల్కత్తాలో మంగళవారం జేబీసీసీఐ అఫెక్స్ కమిటీసమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత ఏడాది పీఆర్ఎల్ బోనస్ రూ.54 వేలుగా ఉండగా, ఈసారి రూ.57 వేలకు పెంచారు. కోల్ఇండియాలోని ఎనిమిది సబ్సిడరీ సంస్థలలో పనిచేసే కార్మికులకు దసరా పండుగకు ముందు అంటే ఈ నెల 26వ తేదీలోపు చెల్లిస్తుండగా...సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళి పండుగకు ముందు యాజమాన్యం చెల్లించనున్నది. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్పై కమిటీ ఏర్పాటు... జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం డిపెండెంట్ ఉద్యోగాలపై యాజమాన్య ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని నియమించారు. గనిలో ప్రమాదంలో మరణించిన, సహజ మరణం పొందినా గతంలో కార్మికుడి వారసుడికి ఉద్యోగ అవకాశం కల్పించేవారు. ఈవిషయమై సుధీర్ఘంగా చర్చించేందుకు యాజమాన్యం తరపున ఎస్ఈసీఎల్ సీఎండీ బీఆర్ రెడ్డి, ఈసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) కేఎస్ పాత్రో, ఎంసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) ఎల్ఎన్ మిశ్రా, సీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) డీకే ఘోష్, యాజమాన్యాల తరపున హెచ్ఎంఎస్ నుంచి నాతూలాల్పాండే, సీఐటీయూ నుంచి డీడీ రామానందన్, బీఎంఎస్ నుంచి వైఎన్ సింగ్, ఏఐటీయూసీ నుంచి లకన్లాల్ మహాతో, సీఎంవోఏఐ నుంచి వీపీ సింగ్ సభ్యులుగా నియమించారు. వీరిని సమన్వయ పరిచేందుకు ఏకే సక్సేనాను కో–ఆర్డినేటర్గా నియమించారు. బొగ్గు పరిశ్రమలో ఏడు రోజుల పని విధానం, ఇతర అంశాలపై వచ్చేనెల 9న డ్రాఫ్ట్ కమిటీ సమావేశం, 10న పూర్తిస్థాయి జేబీసీసీఐ సమావేశం నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్అహ్మద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బి.జనక్ప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తెలిపారు. -
తలసేమియా చిన్నారులకు చేయూత
న్యూఢిల్లీ: తలసేమియాతో బాధపడే దాదాపు 200 మంది చిన్నారులకు ఈ ఏడాది చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా టాటామెడికల్ రీసెర్చ్ సెంటర్(కోల్కతా), సీఎంసీ(వెల్లూర్), రాజీవ్ గాంధీ కేన్సర్ ఇన్స్టిట్యూట్, ఎయిమ్స్(ఢిల్లీ) కేంద్రాల్లో వీరికి చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఖర్చయ్యే రూ.20 కోట్ల మొత్తాన్ని కోల్ ఇండియా(సీఐఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద అందించనుంది. తల్లిదండ్రుల జీతం రూ.20 వేల కంటే తక్కువగా ఉన్న చిన్నారులకే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతిఏటా సుమారు 12,000 మంది చిన్నారులు తలసేమియా సమస్యతో జన్మిస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స అందించడానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో రోగికి రూ.22–25 లక్షల వరకూ ఖర్చవుతోంది. -
సెన్సెక్స్ 184 పాయింట్లు లాస్
ముంబై : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, రుతుపవనాలపై వస్తున్న నిరాశజనకమైన అంచనాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 184.25 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 29,237.15 వద్ద, 62.80 పాయింట్ల నష్టంలో 9045.20 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొద్దామనుకున్న హెల్త్ కేర్ బిల్లుపై ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో డాలర్ ఇండెక్స్ ఢమాల్ మంటోంది. డాలర్ పడిపోతుండటంతో బంగారం పైపైకి ఎగుస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 108.00 పైకి ఎగిసి రూ.28,901 వద్ద ట్రేడయ్యాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఏడాదిన్నర గరిష్ట స్థాయిలకు ఎగిసింది. 34 పైసల లాభంతో 65.08 వద్ద ముగిసింది. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు, నిరాశజనకమైన రుతుపవనాలు అంచనాలకు తోడు లాభాల స్వీకరణ కూడా మార్కెట్లకు దెబ్బకొట్టింది. మెటల్, టెక్, ఐటీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆటో సూచీలు నష్టాల్లో నడిచాయి. కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హీరో మోటార్ కార్పొరేషన్, ఏసియన్ పేయింట్స్, టాటా మోటార్స్, విప్రో, లుపిన్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ నేటి ట్రేడింగ్ మేజర్ లూజర్లుగా 2.37 శాతం వరకు నష్టపోయాయి. -
కోల్ ఇండియాకు సీసీఐ భారీ జరిమానా
న్యూఢిల్లీ: కాంపిటేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియాకు మరోసారి భారీ జరిమానా విధించింది. ఇంధన సరఫరాలో అక్రమాల నేపథ్యంలో రూ. 591 కోట్ల పెనాల్టీ విధించింది. మరోవైపు పోటీ వ్యతిరేక విధానాలనుంచి దూరంగా ఉండాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ ఆదేశించింది. 56 పేజీల ఆదేశాల్లో సీసీఐ కోల్ ఇండియా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్ ఇండియా దాని మూడు అనుబంధ సంస్థలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు సం.రాల (2009-10, 2011-12) కాలానికిగాను సంస్థ సగటు టర్నోవర్ పై 1 శాతం చొప్పున రూ.591.01కోట్ల జరిమానా విధించినట్టు పేర్కొంది. నాన్-కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని సీసీఐ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సీసీఐ ఈ మేరకు తీర్పునిచ్చింది. కోల్ఇండియాతోపాటు దాని అనుబంధ సంస్థలైన మహానది కోల్ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ఫీల్డ్స్, సౌత్ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్... ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) విషయంలో అన్యాయంగా/అసంబద్ధ నిబంధనలను విధిస్తోందనేది సీసీఐ తేల్చింది. ముఖ్యంగా ఇంధన సరఫరాలో న్యాయమైన , సమాన నమూనా, పరీక్ష ప్రక్రియ విధానంలో తగిన మార్పులు చేపట్టాలని కోల్ ఇండియాను ఆదేశించింది. ఇంధన సరఫరా ఒప్పందాల్లో మార్పులు చేయాలని కోరింది. అలాగే పాత, కొత్త పవర్ ప్రొడ్యూసర్స్కి, ప్రైవేట్, ప్రభుత్వ రంగ ప్రొడ్యూసర్స్ మధ్య ఏకరూపత ఉందో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. అంతర్జాతీయ ఉత్తమ విధానాలతో పాటు, సాంప్లింగ్ సాధ్యత పై పవర్ ప్రొడ్యూసర్స్తో సంప్రదించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. -
స్టాక్స్ వ్యూ
కోల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్, ప్రస్తుత ధర: రూ.288 టార్గెట్ ధర: రూ.340 ఎందుకంటే: కోల్ ఇండియా..ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో ఒకటి. అపారంగా బొగ్గు నిల్వలున్నాయి. 88.4 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ప్రస్తుతం 413 గనులను నిర్వహిస్తోంది. విద్యుత్తు, ఉక్కు, సిమెంట్, రక్షణ, ఎరువులు, తదితర రంగాలకు బొగ్గు సరఫరా చేస్తోంది. భారత్లో ఉత్పత్తవుతున్న బొగ్గులో 85 శాతం వాటా, అమ్మకాల్లో 65 శాతం వాటా ఈ కంపెనీదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఉద్యోగుల వ్యయాలు అధికంగా ఉండడం, ఈ–వేలం ఆశించిన స్థాయిలో లేకపోవడం దీనికి కారణాలు. ఈ కంపెనీ రూ.16,212 కోట్ల నికర నిర్వహణ ఆదాయం ఆర్జించింది. ఇబిటా రూ.743 కోట్లుగా ఉంది. రూ.711 కోట్ల ప్రత్యేక కేటాయింపుల కారణంగా ఉద్యోగుల వ్యయాలు పెరిగాయి. నికర లాభం 77 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 80 శాతం)క్షీణించి రూ.600 కోట్లకు తగ్గింది. సాధారణంగా రెండో క్వార్టర్ సీజనల్గా బలహీనంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం, వచ్చే ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు రావచ్చని అంచనా. బొగ్గు దిగుమతులు బాగా తగ్గించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ కారణంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి 6 శాతం చక్రగతి వృద్ధితో 605 మిలియన్ టన్నులకు, బొగ్గు అమ్మకాలు కూడా 6 శాతం చక్రగతి వృద్ధితో 600 మిలియన్ టన్నులకు పెరగవచ్చని అంచనా. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, డివిడెండ్ చెల్లింపులు బాగా ఉండడం, బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండడం, నగదు నిల్వలు పుష్కలంగా ఉండడం తదితర కారణాల వల్ల దీర్ఘకాలానికి ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. జాగరణ్ ప్రకాశన్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్, ప్రస్తుత ధర: రూ.165 టార్గెట్ ధర: రూ.215 ఎందుకంటే: జాగరణ్ ప్రకాశన్..ప్రాంతీయ ప్రింట్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. దైనిక్ జాగరణ్ (భారత్లో అత్యధిక రీడర్షిప్ ఉన్న పత్రిక) నయీ దునియా, (ఈ రెండూ హిందీ వార్తాపత్రికలు)ఇంక్విలాబ్(ఉర్దూ), పంజాబీ జాగరణ్, మిడ్ డే(సాయంకాల ఇంగ్లిష్ పత్రిక) దినపత్రికలు ఈ సంస్థ నుంచే ప్రచురణ అవుతున్నాయి. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. నికర వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండడమే దీనికి కారణం.రాబడి 5 శాతం వృద్ధితో రూ.459 కోట్లకు పెరిగింది. ప్రకటనల ఆదాయం 5 శాతం పెరిగింది. . సర్క్యులేషన్ రాబడి 6 శాతం వృద్ధి చెందింది. ఈ క్యూ2లో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 37% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 35 శాతం పెరగగలదని అంచనా వేస్తున్నాం. వ్యయాలు పెరగడంతో ఇబిటా మార్జిన్లు 230 బేసిస్ పాయింట్లు తగ్గి 26.4 శాతానికి చేరాయి. ఉద్యోగ వ్యయాలు 10 శాతం, ఇతర వ్యయాలు 18 శాతం చొప్పున పెరిగాయి. రెండేళ్లలో ప్రకటనల రాబడి 10%, సరŠుక్యలేషన్ రాబడి 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, దీంతో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. ముడి పదార్థాల వ్యయాలు తగ్గాయి. న్యూస్ప్రింట్ వ్యయాలు టన్నులకు 2–3% రేంజ్లో పెరగవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ఆదాయం 11% వృద్ధి చెందగలదని గతంలో ఆంచనా వేశాం. కానీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటనల ఆదాయం 9% మాత్రమే వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ షేర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్కు 15 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్కు 13 రెట్ల చొప్పున ట్రేడవుతోంది. -
భారీగా తగ్గిన కోల్ ఇండియా లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ, కోల్ ఇండియా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 77 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,654 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.600 కోట్లకు తగ్గిందని కోల్ ఇండియా తెలిపింది. అమ్మకాలు తగ్గడం, వ్యయాలు పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని పేర్కొంది. ఈ క్యూ2లో నికర అమ్మకాలు 8 శాతం తగ్గి రూ.15,645 కోట్లకు పడిపోయాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.17,490 కోట్ల నుంచి రూ.16,213 కోట్లకు తగ్గగా, మొత్తం వ్యయాలు రూ.14,733 కోట్ల నుంచి రూ.16,162 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్టాండోలోన్ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.1,246 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,098 కోట్లకు తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.49 కోట్ల నుంచి రూ.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
-
కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: దేశీయ బొగ్గురంగంలో నెలకొన్నగుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంధన భద్రత సమీక్షించి కోల్ ఇండియా మోనో పలికి చెక్ పెట్టే బాధ్యతను సీనియర్ భారత ప్రభుత్వ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఒక సంవత్సరంలోగా ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద కోల్ మైనర్ కోల్ఇండియా లిమిటెడ్ను విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రంగంలో మోనోపలీ పెరిగిపోయిందని.. దీన్ని తగ్గించేందుకే ఈ చర్య తీసుకోనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పినట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ఇండియాను.. కేంద్రం ఏడు కంపెనీలుగా విభజించాలని భావిస్తోంది. ఈ రంగంలో మరింత పోటీ పెరగాలన్నా, ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నా ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు నవంబరు 30 న ప్రధాని ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రధాని నిర్ణయం ఆధారంగా మంత్రిత్వ శాఖ తన వైఖరిని సమీక్షించనుందని బొగ్గు మంత్రి పియూష్ గోయల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోల్ ఇండియా విభజనను కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధమైనా.. కోల్ఇండియా లాంటి అతి పెద్ద సంస్థను విడదీయడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు కుదింపు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రాధాన్యత లాంటి అంశాలు కార్మికులకు ఆందోళనకరంగా మారనున్నాయన్నారు. అయితే ఈ అంచనాలపై ఆల్ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. చిన్న కంపెనీల నిర్వహణ సులభం అవుతుందని ఫెడరేషన్ ప్రతినిధి డీడీ రామానందన్ వ్యాఖ్యానించారు. కాగా కోల్ఇండియా విభజనపై ప్రధాని పగ్గాలు చేపట్టగానే మోడీ ఆరా తీశారని తెలుస్తోంది. ఈ చర్య ద్వారా మరింత సమర్ధవంతమైన మెరుగైన పని తీరును రాబట్టవచ్చని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 2014 లో కోల్ ఇండియా విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది. ఈ తాజా ప్రతిపాదన 28 బిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కోల్ ఇండియా చీలికకు దారి తీస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. మరోవైపు ఉత్పత్తిని పెంచేందుకు కోల్ ఇండియా కొత్త సాంకేతిక మెషినరీ కొనుగోలుకు బిలియన్ల డాలర్ల రూపాయలను వెచ్చిస్తోంది. -
కోల్ ఇండియా లాభం 14 శాతం డౌన్
న్యూఢిల్లీ: కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేట్) జూన్తో ముగిసిన క్యూ1లో 14.7 శాతం తగ్గుదలతో రూ.3,065 కోట్లకు క్షీణించింది. అమ్మకాల్లో తగ్గుదలే నికర లాభం క్షీణతకు ప్రధాన కారణం. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.3,597 కోట్ల కన్సాలిడేట్ నికర లాభాన్ని ప్రకటించింది. ఇక ఈ క్యూ1లో కంపెనీ నికర అమ్మకాలు 6 శాతం క్షీణతతో రూ.17,796 కోట్లకు తగ్గాయి. కాగా కంపెనీ మొత్తం వ్యయాలు రూ.14,834 కోట్లకు తగ్గాయి. గత క్యూ1లో కంపెనీ వ్యయాలు రూ.15,321 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ1లో 121 మిలియన్ టన్నులుగా ఉన్న కంపెనీ ఉత్పత్తి ఈ క్యూ1లో 4 శాతం వృద్ధితో 126 మిలియన్ టన్నులకు ఎగసింది. స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే.. కంపెనీ నికర లాభం రూ.487 కోట్ల నుంచి రూ.4 కోట్లకు తగ్గింది. నికర అమ్మకాలు రూ.37 కోట్ల నుంచి రూ.23 కోట్లకు పడ్డాయి. గత త్రైమాసికంలో అనుబంధ కంపెనీలు డివిడెండు చెల్లించని కారణంగా మాతృ కంపెనీ అయిన కోల్ ఇండియాకు ఆదాయం పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 598 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతంగా ఉంది. -
విదేశీ బొగ్గు దిగుమతిని నియంత్రించాలి
రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి ఐఎన్టీయూసీ {పధాన కార్యదర్శి జనక్ప్రసాద్ గోదావరిఖని : సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే విదేశాల నుంచి వచ్చే పెట్కోక్ బొగ్గు దిగుమతిని నియంత్రించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు, కోల్ఇండియాకు లేఖ రాయాలని ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.జనక్ప్రసాద్ కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి టన్నుకు రూ.2,700 ధర పలికే బొగ్గు అధికంగా దిగుమతి అవుతున్నా కేంద్రప్రభుత్వం కానీ, కోల్ఇండియా గానీ అడ్డుకోలేకపోతున్నాయని ఆరోపించారు. దీని వల్ల సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 70 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. గత నాలుగు నెలలుగా పెట్కోక్ బొగ్గును సిమెంట్, ఇతర ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయని, దీనివల్ల కాలుష్యం కూడా అధికంగానే వస్తోందని, అయినా పొల్యూషన్ కంట్రోల్బోర్డు అధికారులు కానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బొగ్గు కొనుగోలు చేసిన తెలంగాణ, ఏపీ, మహా జెన్కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ సంస్థలు సింగరేణికి డబ్బులు ఇవ్వడం లేదని, మరోవైపు విదేశీ బొగ్గుతో సంస్థకు గడ్డు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీని కోరినట్టు చెప్పారు. నాయకులు బడికెల రాజలింగం, కుమారస్వామి, పి.ధర్మపురి, రవికుమార్, లక్ష్మణ్బాబు, వెంకటేశ్వర్లు, శేఖర్, కుమార్, ప్రసన్న, యుగంధర్, పోచం తదితరులు ఉన్నారు. -
కోల్ ఇండియా లాభం రూ.4,248 కోట్లు
న్యూఢిల్లీ: కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్)గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి స్వల్పంగానే వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) నాలుగో త్రైమాసిక కాలానికి రూ.4,239 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికి కాలానికి రూ.4,248 కోట్లకు పెరిగిందని కోల్ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.21,340 కోట్ల నుంచి రూ.21,403 కోట్లకు ఎగసింది. ఉత్పత్తి 152 మిలియన్ టన్నుల నుంచి 165 మిలియన్ టన్నులకు పెరిగింది. స్టాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.9,629 కోట్ల నుంచి 45 శాతం పెరిగింది. వృద్ధితో రూ.13,950 కోట్లకు ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం(కన్సాలిడేటెడ్) 4 శాతం వృద్ధితో రూ.14,274 కోట్లకు, ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.రూ.78,010 కోట్లకు పెరిగాయని కోల్ ఇండియా తెలిపింది. -
ఒడిదుడుకుల వారం!
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యం * ఎస్బీఐ, కోల్ ఇండియా దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు * రుతుపవన అంచనాలూ కీలకమే ! * విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ సరళి, ముడి చమురు ధరల, రూపాయి కదలికలు, రుతుపవనాల గమనంపై ప్రకటనలు. తదితర అంశాలూ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణుల ఉవాచ. మరింత బలహీనంగా మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్, రుతుపవనాల రాక, కంపెనీల గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా చెప్పారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ఎక్స్పైర్ అవుతాయని, ట్రేడర్ల పొజిషన్ల రోల్ ఓవర్ కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయని వివరించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మే నెల కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని, స్టాక్ సూచీలు మరింత బలహీనపడవచ్చని యస్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నటాషా శంకర్ అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్లకు సంబంధించి భవిష్యత్ అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్లు గత వారంలో దాదాపు రెండు నెలల కనిష్టానికి పతనమయ్యాయని ట్రేడ్బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాల మధ్య విదేశీ నిధులు భారీగా తరలిపోతాయనే భయాలు నెలకొన్నాయని ఏంజెల్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ వైభవ్ అగర్వాల్ చెప్పారు కీలక కంపెనీల ఫలితాలు..., టాటా పవర్, బీపీసీఎల్ కంపెనీలు ఫలితాలను ఈ నెల 23న (సోమవారం) వెల్లడించనున్నాయి. టెక్ మహీంద్రా, సిప్లా, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), లు ఈ నెల 24న(మంగళవారం), బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీలు ఈ నెల 25(బుధవారం), ఎస్బీఐ, భెల్ ఈనెల 27న(శుక్రవారం), కోల్ ఇండియా ఈ నెల 28న(శనివారం)తమ ఫలితాలను వెల్లడిస్తాయి. ఇవే కాకుండా ఓఎన్జీసీ, ఐఓసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, ఇండియా సిమెంట్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, అబాట్ ఇండియా, అబాట్ ఇండియా, జీఎస్కే ఫార్మా వంటి కంపెనీలు నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అంతా వరుణుడి దయ... వర్షాలు ఎలా కురుస్తాయనేది రానున్న వారాల్లో ఆర్థిక వ్యవస్థకే కాకుండా, స్టాక్ మార్కెట్కు కూడా కీలకమని నిపుణులంటున్నారు. రానున్న 4-6 వారాల్లో రుతుపవనాలపై అంచనాలేనని స్టాక్ మార్కెట్కు కీలకమని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.73%) క్షీణించి, 25,302 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65(0.83 శాతం) పాయింట్లు క్షీణించి 7,750 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు.. గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,064 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారని ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.1,795 కోట్లు ఈక్విటీ మార్కెట్లో నికరంగా ఇన్వెస్ట్ చేయగా, రూ.3,496 కోట్ల పెట్టుబడులను డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన గురువారం రోజు విదేశీ ఇన్వెస్టర్లు రూ.341 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బీజేపీ అస్సాంలో అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్, కేరళలో ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడడంతో సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుందని బీఎన్పీ పారిబా ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ శ్రేయాశ్ దేవాల్కర్ అంచనా వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.29,558 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్పీఐలు ఈక్విటీల్లో రూ.14,706 కోట్ల పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.4,436 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
16 పీఎస్యూల్లో డిజిన్వెస్ట్మెంట్కు రెడీ
♦ ఈ ఏడాది విక్రయ జాబితా సిద్ధం చేసిన ఆర్థిక శాఖ ♦ లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా ♦ ఖజానాకు రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం న్యూఢిల్లీ: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్మెంట్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 16 కంపెనీల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వీటి షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా అమ్మకాల ద్వారా రూ. 40 వేల కోట్లు వస్తుందని అంచనా. లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్హెచ్పీసీ, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో చాలా కంపెనీల్లో డిజిన్వెస్ట్మెంట్ను గత ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టాలని భావించినా.. స్టాక్మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని కంపెనీలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. మరోపక్క, భారీగా నగదు నిల్వలు ఉన్న కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్ ఆప్షన్ను కూడా పరిశీలించే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 10 శాతం చొప్పున వాటా అమ్మకాల ద్వారా కోల్ ఇండియా నుంచి రూ.18,000 కోట్లు, ఎన్ఎం డీసీ నుంచి రూ.3,800 కోట్లు, నాల్కో నుంచి రూ.1,000 కోట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఓఎన్జీసీలో 5% వాటా విక్రయం ద్వారా రూ.9,000 కోట్లు ఖజానాకు సమకూరనుంది. ఈ ఏడాది బడ్జెట్లో 2016-17 డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.56,500 కోట్లుగా నిర్ధేశించుకుంది. పీఎస్యూల్లో మైనారిటీ వాటా అమ్మకంతో రూ. 36,000 కోట్లు.. లాభాల్లో అదేవిధంగా నష్టజాతక కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయాల రూపంలో రూ.20,500 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. -
కోల్ ఇండియా రికార్డు స్థాయి అభివృద్ధి
ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ మైనర్.. కోల్ ఇండియా ఈసారి రికార్డు స్థాయిలో అభివృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తిలో మార్చి 7వ తేదీ నాటికి 9.3 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ ఈ) కు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 41.8 మిలియన్ టన్నుల సంపూర్ణ పెరుగుదలతో 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చి 7 నాటికి కంపెనీ 9.3 శాతం సానుకూల వృద్ధిని సాధించినట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో నివేదించిన లెక్కల ప్రకారం 9.2 శాతం ఉత్పత్తి వృద్ధితో గత సంవత్సరాన్నే పోలి ఉందని.... విద్యుత్ సంస్థల్లో రెగ్యులేటెడ్ లిఫ్టింగ్ కు సమస్య తెస్తున్న కారణంగా కొన్ని మైన్స్ లో ఉత్పత్తిని ప్రారంభించి నిల్వలను పెంచినట్లు కోల్ ఇండియా వివరించింది. అయితే ఒక్కోసారి స్టాక్ నిల్వలు కొన్ని నిర్వహణా సమస్యలను సృష్టిస్తాయని, నాణ్యత క్షీణిస్తుందని, అగ్నిప్రమాదాలు కూడ సంభవించే అవకాశం ఉంటుందని దీంతో కొన్ని గనుల్లో ఉత్పత్తిని నియంత్రించినట్లు సంస్థ తెలిపింది. మరింత అభివృద్ధిని సాధించాలంటే కోల్ మైన్స్ లో ఉత్పత్తిని పెంచడం, విద్యుత్ సంస్థల్లో రెగ్యులేటెడ్ లిఫ్టింగ్ సమస్యలను తీర్చడం అవసరమని కోల్ ఇండియా తెలిపింది. -
స్పీడుగా సంస్కరణలు..
కోల్ ఇండియాలో 10% వాటాల విక్రయం ఐపీవోకి కొచ్చిన్ షిప్యార్డు ఎగుమతిదారులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకం.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చకచకా సంస్కరణల జోరు పెంచుతోంది. ఇటీవలే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుకూలంగా పలు చర్యలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం, కొచ్చిన్ షిప్యార్డు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, నానాటికీ తగ్గుతున్న ఎగుమతులకు ఊతమిచ్చే విధంగా ఎగుమతిదారులకు మూడు శాతం వడ్డీ సబ్సిడీ స్కీమును ప్రకటించింది. జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగం పుంజుకునేలా తగు నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ (సీసీఈఏ) ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియా, కొచ్చిన్ షిప్యార్డ్ .. దాదాపు రూ. 69,500 కోట్ల బృహత్తర డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశగా కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ఉండనుంది. ప్రస్తుతం కోల్ ఇండియా మార్కెట్ విలువ ప్రకారం.. దీని ద్వారా ఖజానాకు కనీసం రూ. 21,138 కోట్లు సమకూరగలవని అంచనా వే స్తున్నట్లు కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. కంపెనీలో ప్రభుత్వానికి 79.65 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో వాటాల విక్రయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు, రూ. 10 ముఖవిలువ గల 3,39,84,000 ఈక్విటీ షేర్లతో కొచ్చిన్ షిప్యార్డు (సీఎస్ఎల్) ఐపీవో ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే చేసింది. ఐపీవో కింద ప్రభుత్వం 1,13,28,000 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా 2,26,56,000 షేర్లను జారీ చేయనున్నారు. ముఖవిలువ ప్రకారం వీటి విలువ రూ. 33.98 కోట్లు కానుంది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్టు ప్రాంతంలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, భారీ డ్రై డాక్యార్డు నిర్మాణ పనులకు ఐపీవో నిధులు కొంత మేర ఉపయోగపడనున్నాయి. గ్యాస్ గరిష్ట మార్కెటింగ్ మార్జిన్ తగ్గింపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు.. ఎరువులు, ఎల్పీజీ ప్లాంట్లకు విక్రయించే గ్యాస్పై మార్కెటింగ్ మార్జిన్ కింద గరిష్టంగా రూ. 200 మాత్రమే వసూలు చేయొచ్చని క్యాబినెట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రతి వెయ్యి ఘనపు మీటర్ల గ్యాస్కు కంపెనీలు వసూలు చేస్తున్న రూ. 225తో పోలిస్తే ఇది 12.5 శాతం తక్కువ. కొన్ని సంస్థలు డాలర్ మారకంలోనూ చార్జీలు విధిస్తున్నాయి. ఇటీవల కరెన్సీ మారకం విలువలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇకపై రూపాయి మారకంలోనే మార్కెటింగ్ మార్జిన్ను పేర్కొనాలని కేంద్రం తెలిపింది. ఇన్ఫ్రాకూ తోడ్పాటు.. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న కేంద్రం ఈ రంగానికి తోడ్పాటునిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైవే ప్రాజెక్టుల్లో జాప్యాలు జరిగితే డెవలపర్లకు పరిహారం ఇవ్వడం ఒకటి కాగా.. దాదాపు రూ. 1,000 కోట్ల దాకా సివిల్ నిర్మాణ వ్యయాలయ్యే ప్రాజెక్టులకు అనుమతులిచ్చేలా రహదారి రవాణా శాఖకు అధికారాలు ఇచ్చింది. దీంతో సుమారు 34 కీలకమైన హైవే ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరనుంది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం.. డెవలపర్ పరిధిలో లేని అంశాల కారణంగా ప్రాజెక్టు జాప్యం జరిగిన పక్షంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) తరహా ప్రాజెక్టయితే ఆయా సందర్భాన్ని బట్టి రహదారి శాఖ టోల్ వ్యవధిని పెంచవచ్చు. అలాగే యాన్యుటీ విధానంలోనైతే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. జాప్యం జరిగిన కాలానికి కూడా నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) యాన్యుటీ పరిహారం ఇస్తుంది. చెల్లించాల్సిన యాన్యుటీల సంఖ్య, పరిహారంపై గరిష్ట పరిమితులు ఉంటాయి. -
కోల్ ఇండియా లాభం 16% అప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గనుల కంపెనీ కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,192 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,544 కోట్లకు పెరిగిందని కోల్ ఇండియా తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటంతో నికర లాభం పెరిగిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.15,678 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.16,958 కోట్లకు పెరిగాయని వివరించింది. అధిక ఉత్పత్తి కారణంగా అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.14,145 కోట్ల నుంచి రూ.15,068 కోట్లకు ఎగిశాయని తెలిపింది. గత క్యూ2లో 102.42 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ క్యూ2లో 108.2 మిలియన్ టన్నులకు చేరిందని కోల్ ఇండియా తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోల్ ఇండియా షేర్ 2.6 శాతం వృద్ధితో రూ.338 వద్ద ముగిసింది. -
ఆరో అతిపెద్ద మైనింగ్ సంస్థగా కోల్ ఇండియా
న్యూఢిల్లీ: కోల్ ఇండియా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద మైనింగ్ కంపెనీగా అవతరించిందని సీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా రూపొందించిన గ్లోబల్ టాప్-40 మైనింగ్ సంస్థల జాబితాలో ఇదివరకు 8వ స్థానంలో ఉన్న కోల్ ఇండియా ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఎన్ఎండీసీ స్థానం కూడా 24 నుంచి 21కి మెరుగుపడింది. 2013లో 947 బిలియన్ డాలర్లుగా ఉన్న టాప్-40 మైనింగ్ సంస్థల మార్కెట్ క్యాపిటల్ గతేడాది చివరకు 16 శాతం క్షీణతతో (156 బిలియన్ డాలర్లు) 791 బిలియన్ డాలర్లకు తగ్గింది. అధిక ఉత్పత్తి, ప్రతికూల డిమాండ్ అంచనాల వల్ల ఐరన్ ఓర్ కంపెనీలు గతేడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాల్లో కోల్ మైనింగ్ సంస్థల మార్కెట్ విలువదాదాపు 19 శాతం పెరిగింది. టాప్-40 సంస్థల్లో 15 సంస్థల షేరు ధరలు పెరిగితే, మిగిలిన 25 సంస్థల షేరు ధరలు తగ్గాయి. చాలా సంస్థల సగటు ఆర్ఓసీఈ (రిటర్న్ ఆన్ క్యాపిట ల్ ఎంప్లాయిడ్) 15 శాతం ఇన్వెస్ట్మెంట్ రేటుకు దిగువునే ఉంది. -
కోల్ ఇండియా లాభం రూ.4,238 కోట్లు
కోల్కతా: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా లాభాలు మందగించాయి. గతేడాది జనవరి-మార్చి నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,238 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.4,434 కోట్లతో పోలిస్తే లాభం 4.4 శాతం తగ్గింది. అధిక వ్యయాలు లాభాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. కాగా, మొత్తం ఆదాయం రూ.20,564 కోట్ల నుంచి రూ.21,340 కోట్లకు పెరిగింది. 3.7% వృద్ధి చెందింది. సంస్థ మొత్తం వ్యయాలు క్యూ4లో రూ.14,850 కోట్ల నుంచి రూ.16,073 కోట్లకు ఎగబాకాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.646 కోట్ల నుంచి రూ.9,629 కోట్లకు ఎగసింది. 15 రెట్లు దూసుకెళ్లింది. సబ్సిడరీ కంపెనీల నుంచి డివిడెండ్ల రూపంలో భారీగా ఇతర ఆదాయం రావడమే దీనికి ప్రధాన కారణం. పూర్తి ఏడాదికి చూస్తే... 2014-15 పూర్తి ఏడాదికి కోల్ ఇండియా రూ.13,727 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాదిలో రూ.15,112 కోట్లతో పోలిస్తే లాభం 9.1 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం రూ.70,608 కోట్ల నుంచి రూ.74,120 కోట్లకు పెరిగింది. 5 శాతం వృద్ధి చెందింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర నామమాత్ర లాభంతో రూ.383 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
విద్యుత్ రంగంలో స్వావలంబనే ధ్యేయం
- కోల్ఇండియాలో భాగస్వామ్యంపై ఆప్ సర్కార్ చర్చలు - ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుతో ప్రభుత్వంపై భారం - 2017 నాటికి డిమాండ్ 8,700 మెగావాట్లకు చేరుతుందని అంచనా సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఢిల్లీ నగరం ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై నిలబడేలా ఆప్ సర్కార్ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ ఒడిశాలోని సుందర్గడ్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న థర్మల్పవర్ ప్లాంటులో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఈ 1,600 మెగావాట్ల ప్లాంటులో భాగస్వామిగా మారడం వల్ల విద్యుత్తు కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని ఆప్ భావిస్తోంది. ఈ విషయమై ఆప్ సర్కారు కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు నిర్ణయం వెలువడలేదు. విద్యుత్ రంగంలో ఢిల్లీకి స్వావలంబన కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే నగర వాసులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆప్ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బొగ్గు బ్లాక్ను సొంతం చేసుకోవడంతో పాటు ఇతరులతో కలిసి విద్యుదుత్పాదన ప్లాంట్లు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపుతోంది. కోల్బ్లాక్ను మంజూరుచేయాలని కోరుతూ ఢిల్లీ సర్కారు కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసింది. దీంతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్తో కలిసి సుందర్గడ్ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయాలనుకుంటోంది. రాజధానిలో విద్యుత్ డిమాండ్ 2017 నాటికి 8,700 మెగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ అంచనా. గతేడాది నమోదైన పీక్ విద్యుత్ డిమాండ్ 5,925 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం అది 6,500 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని విద్యుతుత్పాదన కేంద్రాల ద్వారా 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నగరానికి సరఫరా అయ్యే విద్యుత్లో దాదాపు 70 శాతం బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. -
కోల్ ఇండియా వాటా విక్రయం సక్సెస్
రూ. 22,557 కోట్ల సమీకరణ; కొత్త రికార్డు * ఆఫర్ ఫర్ సేల్కు 1.07 రెట్ల స్పందన * అతిపెద్ద కొనుగోలుదారు ఎల్ఐఎసీ.. న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో (సీఐఎల్) వాటాల విక్రయానికి శుక్రవారం నిర్వహించిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విజయవంతమైంది. 10 శాతం వాటాల డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఖజానాకు రూ. 22,557.3 కోట్లు లభించాయి. ప్రభుత్వ రంగానికే చెందిన మరో దిగ్గజం ఎల్ఐఎసీ ఏకంగా మూడింట ఒక వంతు షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. స్టాక్ ఎక్స్చేంజీల వద్ద గణాంకాల ప్రకారం మొత్తం 63.16 కోట్ల షేర్లకు గాను 67.52 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. తద్వారా ఇష్యూ 1.07 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయినట్లయింది. అత్యంత భారీ ఇష్యూ కింద కోల్ ఇండియా తన రికార్డును తానే మరోసారి బద్దలు కొట్టింది. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగంలో చూసినా ఏ సంస్థా కూడా ఇప్పటిదాకా ఇంత భారీ ఇష్యూ తలపెట్టలేదు. 2010లో పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు సీఐఎల్ ఏకంగా రూ. 15,000 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ సక్సెక్స్తో కాగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు సగభాగం వచ్చినట్లే అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇన్వెస్టర్ల విశ్వాసం వెల్లడైంది..: కోల్ ఇండియా షేర్ల విక్రయానికి లభించిన స్పందనను చూస్తే సంస్కరణల విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసం వెల్లడైనట్లు భావించవచ్చని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఎల్ఐసీ ఏకంగా రూ. 7,000 కోట్ల మేర విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 5% డిస్కౌంటు లభించిన రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 1,852.55 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు వేశారు. మరోవైపు, డిజిన్వెస్ట్మెంట్ను వ్యతిరేకిస్తూ కార్మిక సంస్థలు కంపెనీకి చెందిన కొన్ని యూనిట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. బీఎస్ఈలో శుక్రవారం కోల్ ఇండియా షేరు ధర 3.81 శాతం క్షీణించి రూ. 360.85 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా ఆఫర్ ధర రూ. 358
నేడు ఓఎఫ్ఎస్ ద్వారా 10% వరకూ వాటా విక్రయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో వాటా విక్రయానికి కనీస షేరు ధరను(ఫ్లోర్ ప్రైస్) ప్రభుత్వం రూ.358గా నిర్ణయించింది. శుక్రవారం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో కేంద్రం 10 శాతం వరకూ వాటాను విక్రయించనుంది. గురువారం బీఎస్ఈలో కోల్ ఇండియా షేరు ముగింపు ధర రూ.375.15తో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించిన కనీస షేరు ధర దాదాపు 5% తక్కువ కావడం గమనార్హం. ఈ ఫ్లోర్ ప్రైస్ ప్రకారం చూస్తే.. 10% వాటా విక్రయం ద్వారా ఖజానాకు రూ.22,600 కోట్లు లభించే అవకాశాలున్నాయి. కాగా, ఈ వాటా అమ్మకానికి వ్యతిరేకంగా గురువారం సంస్థ కార్మిక యూనియన్లు సమ్మె హెచ్చరికలు చేసినా.. ప్రభుత్వం మాత్రం వెనక్కితగ్గకపోవడం గమనార్హం. నేడు బైటాయింపులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కార్మిక యూనియన్లు తెలిపాయి. దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటిదాకా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ(2010 అక్టోబర్లో ఐపీఓ ద్వారా రూ.15,199 కోట్ల సమీకరణ) కోల్ ఇండియాదే. ఇప్పుడు ఓఎఫ్ఎస్తో వాటా విక్రయం చేపడుతున్న కోల్ ఇండియా మరో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూతో కొత్త రికార్డును నెలకొల్పనుంది. రిటైలర్లకు 5 శాతం డిస్కౌంట్... మొత్తం విక్రయానికి ఉంచనున్న 63.17 కోట్ల షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లకు 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా రిటైలర్లకు బిడ్డింగ్ ధరలో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది. ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల్లో వాటా విక్రయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.43,425 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి మరో రెండు నెలలే గడువు మిగలగా.. ఇప్పటిదాకా రూ.1,715 కోట్లే(సెయిల్లో గతేడాది డిసెంబర్లో 5 శాతం వాటా అమ్మకం ద్వారా) లభించాయి. -
సర్కారీ షేర్లొస్తున్నాయ్.!
⇒ కోల్ ఇండియాలో రేపు 10% వాటా విక్రయం ⇒ కేంద్ర ప్రభుత్వానికి రూ.24,000 కోట్లు లభించే చాన్స్... ⇒ రిటైలర్లకు 20% షేర్ల కేటాయింపు; బిడ్డింగ్ ధరలో 5% డిస్కౌంట్ కూడా.. ⇒ మార్చిలోపే ఓఎన్జీసీలో డిజిన్వెస్ట్మెంట్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల షేర్లు వెల్లువెత్తనున్నాయి. ఈ ఏడాది పీఎస్యూల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) లక్ష్యానికి మరో 60 రోజులే వ్యవధి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోరు పెంచుతోంది. ప్రధానంగా బడా కంపెనీలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా జనవరి 30న(రేపు) బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూపంలో నేరుగా స్టాక్ మార్కెట్లో షేర్లను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నట్లు కోల్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. 30న స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ(ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30) షేర్ల విక్రయం జరుగుతుందని తెలిపింది. బుధవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ.384 వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే కేంద్ర ఖజానాకు రూ.24,257 కోట్లు లభిస్తాయని అంచనా. అమ్మకానికి 63.17 కోట్ల షేర్లు... ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది. ఓఎఫ్ఎస్ ద్వారా 10 శాతానికి సమానమైన 63.17 కోట్ల షేర్లను విక్రయానికి పెడుతోంది. తొలుత 5 శాతం వాటా, మరో 5 శాతాన్ని అదనంగా విక్రయించే ఆప్షన్తో ఓఎఫ్ఎస్ ఉంటుంది. ఈ మొత్తం షేర్లలో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు... 25 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించనున్నారు. ఇప్పటివరకూ రిటైలర్లకు ఓఎఫ్ఎస్లో కోటా 10 శాతం కాగా, ఈ ఇష్యూలో రెట్టింపు చేస్తున్నారు. అంటే ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.2 లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేయొచ్చు. గురువారం మార్కెట్లు ముగిశాక షేర్ల వేలానికి సంబంధించి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను ప్రకటించనున్నారు. రిటైర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రైస్లో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా నిలుస్తున్న కోల్ ఇండియా... 2010 అక్టోబర్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ ఇష్యూ ద్వారా 10 శాతం వాటా విక్రయించిన కేంద్రానికి రూ.15,199 కోట్లు లభించాయి. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద ఐపీఓగా కూడా ఇది నిలిచింది. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంపై దృష్టి... ఇండియన్ ఆయిల్(ఐఓసీ), బీహెచ్ఈఎల్, నాల్కో, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటాను విక్రయించే అవకాశాలున్నాయి. పీఎస్సీ, ఆర్ఈసీల్లోనూ 5 శాతం చొప్పున వాటా అమ్మకానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఐసీఓలో 10%, నాల్కో, బీహెచ్ఈఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్లలో 5% చొప్పున వాటాలను అమ్మాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ ఏడాది(2014-15)లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.43,425 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో సెయిల్లో 5 శాతం వాటాను అమ్మడం ద్వారా ఇప్పటిదాకా లక్ష్యంలో రూ.1,715 కోట్లు మాత్రమే లభించాయి. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎలాగైనా లక్ష్యాన్ని అందుకునేలా కేంద్రం వేగంగా చర్యలు చేపడుతోంది. మరోపక్క, జీడీపీలో ద్రవ్యలోటును 4.1%కి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలన్నా ఈ డిజిన్వెస్ట్మెంట్ నిధుల చాలా కీలకంగా మారాయి. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ ద్వారానే లక్ష్యంలో సగం నిధులు సమకూరనుండటం గమనార్హం. వరుసలో ఓఎన్జీసీ... ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే(మార్చిలోగా) మరో పీఎస్యూ చమురు అగ్రగామి ఓఎన్జీసీలో కూడా వాటా విక్రయించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం సవాలుగా నిలుస్తున్నప్పటికీ వెనక్కితగ్గబోమని చెప్పారు. కంపెనీలో 5 శాతం వాటాను విక్రయించాలనేది కేంద్రం ప్రణాళిక. ఒకపక్క క్రూడ్ క్షీణత, మరోపక్క పెట్రో సబ్సిడీ భారం కారణంగా ఇటీవలి కాలంలో ఓఎన్జీసీ షేర ధర పడిపోతూ వస్తోంది. గతేడాది జూన్లో రూ.472 స్థాయి నుంచి ప్రస్తుతం(బుధవారం బీఎస్ఈలో) రూ.354 స్థాయికి దిగజారింది. ప్రస్తుత షేరు ధర ప్రకారం చూస్తే ఈ వాటా అమ్మకం ద్వారా ఖజానాకు రూ.15,000 కోట్లు లభించొచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీలో 68.94 శాతం వాటా ఉంది. హెచ్ఏఎల్ లిస్టింగ్కు సన్నాహాలు... ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఈ మహారత్న కంపెనీ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వీలుగా డెరైక్టర్ల బోర్డును ఏప్రిల్ 1కల్లా పునర్వ్యవస్థీకరించనున్నారు. మరోపక్క, కేవలం విమానయాన తయారీ సంస్థగానే కాకుండా ఈ రంగంలోని టెక్నాలజీ విభాగంపై కూడా మరింత దృష్టిసారించనున్నట్లు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న కంపెనీ చైర్మన్ ఆర్కే త్యాగి బుధవారమిక్కడ తెలిపారు. -
'సింగరేణి కార్మికులు సమ్మె విరమించాలి'
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాలా చారి అన్నారు. కోల్ ఇండియా సమస్యలు వేరు, సింగరేణి సమస్యలు వేరని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. సంబంధం లేని కారణాలతో సింగరేణి కార్మికులు సమ్మె చేయడం తగదన్నారు. విద్యుత్ సంక్షోభ సమయంలో సింగరేణి కార్మికుల సమ్మె తగదని వేణుగోపాలాచారి వ్యాఖ్యానించారు. వెంటనే సింగరేణి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన కోరారు. -
కోల్ ఇండియాలో 800 ఎగ్జిక్యూటివ్ కొలువులు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 800 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రయత్నాలు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పా రు. ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్.... ఇలా పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. ఐదే ళ్లలో కోల్ ఇండియా ఉత్పత్తిని రెట్టింపు (వంద కోట్ల టన్నులకు) చేయాలని ప్రభుత్వం భావిస్తోం దని, దీని కోసం దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు కంపెనీగా పేరు గాంచిన కోల్ ఇండియాలో ఇప్పటికే మూడు లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశీయ ఉత్పత్తిలో ఈ కంపెనీ వాటా 80%. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తన వార్షిక ఉత్పత్తి (46.2 కోట్ల టన్నులు) లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50.7 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధింవచ్చు. -
కోల్ ఇండియా చీఫ్గా సుతీర్థ భట్టాచార్య ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాకు కొత్త చైర్మన్, ఎండీగా సుతీర్థ భట్టాచార్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ సంస్థల ఎంపికలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1985 ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన భట్టాచార్య ప్రస్తుతం సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డ్(పీఎస్ఈబీ) గత నెలలోనే కోల్ ఇండియా చైర్మన్ పదవికి భట్టాచార్యను ఎంపిక చేసింది. ఈ పదవిని చేపట్టేందుకు మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీపడ్డ సంగతి తెలిసిందే. -
రెండు విడతలుగా ఓఎన్జీసీ డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, కోల్ ఇండియాలో వాటాల విక్రయాన్ని రెండు విడతలుగా చేపట్టాలని కేంద్రం యోచిస్తోన్నట్లు సమాచారం. సరైన విలువను రాబట్టాలనే ఉద్దేశమే ఇందుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత డిజిన్వెస్ట్మెంట్ తేదీలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఓఎన్జీసీలో 5 శాతం, కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయానికి క్యాబినెట్ ఆమోద ముద్రవేసిన సంగతి తెలిసిందే. ఓఎన్జీసీ ద్వారా రూ. 11,477 కోట్లు, కోల్ ఇండియా ద్వారా రూ. 15,740 కోట్లు రావొచ్చని అంచనా. అయితే డిజిన్వెస్ట్మెంట్ విషయంలో ఇంకా చాలా ఆటంకాలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఓఎన్జీసీకి చెందిన కేజీ-డీ5 బ్లాకులో గ్యాస్ నిక్షేపాల అభివృద్ధిలో జాప్యం వెనుక కారణాలపై విచారణ జరుపుతున్న కమిటీ డిసెంబర్ 24 నాటికి నివేదిక సమర్పించగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పొరుగునే ఉన్న కేజీ-డీ6 బ్లాకులో రిలయన్స్ సంస్థ చమురు, గ్యాస్ ఉత్పత్తి దాదాపు నాలుగయిదేళ్ల క్రితమే ప్రారంభించేసింది. కానీ, కేజీ-డీ5లో ఓఎన్జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ నిక్షేపాల నుంచి ఉత్పత్తి ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. కంపెనీ అంచనాల ప్రకారం 2018 నుంచి గ్యాస్, 2019 నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభం కావొచ్చు. ఈ నేపథ్యంలోనే జాప్యంపై హైడ్రోకార్బన్స్ రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్ సారథ్యంలోని కమిటీ విచారణ చేపట్టింది. -
మందగమనానికి బ్రేక్ పడినట్లే!
న్యూఢిల్లీ: దేశీ స్టీల్ రంగంలో మందగమన పరిస్థితులకు ఫుల్స్టాప్ పడినట్లేనని ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ పేర్కొన్నారు. తయారీ రంగంతోపాటు, స్మార్ట్ సిటీలు, పోర్ట్లు, విద్యుత్ ప్లాంట్లు, పారిశ్రామిక వాడలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టడంతో స్టీల్కు డిమాండ్ పుంజుకోనుందని చెప్పారు. కంపెనీ 42వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా మాట్లాడుతూ వాటాదారులకు భవిష్యత్ వ్యూహాలను వెల్లడించారు. పెరగనున్న స్టీల్ డిమాండ్కు అనుగుణంగా ఆధునీకరణ, నాణ్యత, సాంకేతికత వంటి అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా అదుపును చేపట్టినట్లు వివరించారు. వీటికితోడు ఉత్పత్తులను మెరుగుపరచడం, పనితీరును పటిష్టపరచడం వంటి చర్యలకు తెరలేపినట్లు తెలిపారు. బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తయారీసహా మరిన్ని రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశమివ్వడం ద్వారా ప్రభుత్వం వృద్ధికి బాటలు వేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటపడితే స్టీల్కు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. వెరసి రానున్న కాలంలో దేశీయంగా స్టీల్ వినియోగం ఊపందుకోనుందని అంచనా వేశారు. విజన్ 2025లో భాగంగా... ప్రస్తుతం చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు కాకుండా విజన్ 2025 ప్రణాళిక అమలుకు సిద్ధపడుతున్నట్లు వర్మ చెప్పారు. ప్రణాళికలో భాగంగా రూ. 1,50,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా హాట్మెటల్ సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు వెల్లడించారు. మహారత్న కంపెనీ అయిన సెయిల్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2013-14) 21% అధికంగా రూ. 2,616 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడంతోపాటు, వాటాదారులకు 20.20% డివిడెండ్ను చెల్లించినట్లు వివరించారు. అంతేకాకుండా కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 51,866 కోట్ల టర్నోవర్ను సాధించినట్లు తెలిపారు. ఈ బాటలో 8.6% వృద్ధితో 12.09 మిలియన్ టన్నుల స్టీల్ను విక్రయించినట్లు తెలిపారు. -
ఇక సర్కారీ షేర్ల జాతర..!
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా దిగ్గజ కంపెనీలు ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీలలో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇందుకు ఓకే చెప్పింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ మూడు కంపెనీలలో ప్రతిపాదిత ప్రభుత్వ వాటాలను విక్రయిస్తే రూ. 43,000 కోట్లకుపైగా నిధులు సమకూరనున్నాయి. కోల్ ఇండియాలో ప్రతిపాదిత 10% వాటాకు ప్రస్తుత ధరూ. 374 ప్రకారం రూ. 23,000 కోట్లు లభించనుండగా, ఓఎన్జీసీలో 5% వాటాకు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 445 ప్రకారం రూ. 18,000 కోట్లు, ప్రస్తుత రూ. 22 ధర ప్రకారం ఎన్హెచ్పీసీలో 11.36% వాటాకుగాను రూ. 2,800 కోట్లు చొప్పున ప్రభుత్వానికి లభిస్తాయి. తద్వారా బడ్జెట్లో ప్రతిపాదించినమేరకు ప్రభుత్వం నిధులను సమీకరించగలుగుతుంది. కాగా, ఈ సంస్థలలో వాటాలను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బాటలో ఇప్పటికే ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక ప్రక్రియను సైతం మొదలుపెట్టింది. ఈ నెలలో సెయిల్... డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా స్టీల్ రంగ దిగ్గజం సెయిల్లో 5% వాటాను విక్రయించేందుకు గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సెయిల్ ఇష్యూని ప్రభుత్వం ఈ నెలలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 81 ప్రకారం సెయిల్లో 5% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లవరకూ లభించవచ్చు. కాగా, వరుసగా గత ఐదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరడంలో విఫలమవుతూనే వస్తోంది. నిజానికి ప్రతీ బడ్జెట్లో ప్రభుత్వం రూ. 40,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ 2010-11లో రూ. 22,144 కోట్లు, 2011-12లో రూ. 13,894 కోట్లు చొప్పున మాత్రమే సమీకరించగలిగింది. ఇక 2012-13లో లక్ష్యం రూ. 30,000 కోట్లుకాగా రూ. 23,956 కోట్లు సమకూర్చుకుంది. 2013-14లో రూ. 40,000 కోట్ల ల క్ష్యానికిగాను రూ. 16,027 కోట్లు మాత్రమే సమీకరించింది. -
కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్పై ఈ వారంలో నిర్ణయం!
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 10 శాతం వాటా విక్రయం ప్రతిపాదనకు ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్రవేసే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో కంపెనీ డిజిన్వెస్ట్మెంట్కు ఓకే చెప్పవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 89.65 శాతం వాటా ఉంది. గురువారంనాటి షేరు ముగింపు ధర(రూ.356) ప్రకారం చూస్తే 10 శాతం వాటా(63.16 కోట్ల షేర్లు) అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.22,428 కోట్లు లభించవచ్చని అంచనా. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న రూ.43,425 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ మొత్తంలో ఒక్క కోల్ ఇండియా వాటా విక్రయం ద్వారానే సగానికిపైగా ఖజానాకు సమకూరనుండటం గమనార్హం. ఓఎఫ్ఎస్లలో రిటైలర్లకు 20% కోటా: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల వాటా అమ్మకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఆర్థిక శాఖ లైన్క్లియర్ చేసింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో షేర్ల విక్రయంలో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల కోటాను 20 శాతానికి పెంచినట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టే పీఎస్యూ డిజిన్వెస్ట్మెంట్లకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. -
కోల్ ఇండియా సబ్సిడరీల వికేంద్రీకరణ..!
గోదావరిఖని: కోల్ ఇండియాను వికేంద్రీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దేశంలో బొగ్గు డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో కోల్ ఇండియాలోని ఏడు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకుని వాటిని ఆయా రాష్ట్రాలకే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోల్ ఇండియా పరిధిలో జార్ఖండ్లో బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిడెట్), సీసీఎల్ (సెంట్రల్ కోల్ లిమిటెడ్), పశ్చిమబెంగాల్లో ఈసీఎల్ (ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్), ఒడిశాలో ఎంసీఎల్ (మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్), మధ్యప్రదేశ్లో ఎన్సీఎల్ (నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్), ఛత్తీస్గఢ్లో ఎస్ఈసీఎల్ (సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్), మహారాష్ట్రలోని డబ్ల్యూసీఎల్ (వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్) సంస్థలు బొగ్గు ఉత్పత్తి సాగిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ కోల్కతా కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. దేశంలో బొగ్గు కొరత..: ఆరు రాష్ట్రాల్లో కోల్ ఇండియా ఏడు సబ్సిడరీ సంస్థలకు చెందిన 272 భూగర్భ గనులు, 168 ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా ఏటా 450 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దేశ అవసరాలకు సుమారు 600 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుండగా, 150 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో 119 కోల్బ్లాక్లను క్యాప్టివ్మైన్స్ (ఆయా కంపెనీలు తమ అవసరాల కోసం బొగ్గును వెలికితీయడం)గా మార్పు చేసింది. కానీ, తమకు కేటాయించిన గనుల్లో చాలా కంపెనీలు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేదు. టెండర్లు లేకుండా ప్రైవేట్ కంపెనీలకు కోల్బ్లాక్లను అప్పగించడంపై ఆరోపణలు రావడంతో కొన్ని బ్లాక్లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తి ఆశించిన మేర జరగలేదు. ఆయా రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గనులను ప్రారంభించేందుకు ప్రజలు సహకరించకపోవడం పెద్ద సమస్యగా మారింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రక్రియకు సహకరించ ని పరిస్థితి. దీంతో నరేంద్రమోడీ ప్రభుత్వం కోల్ ఇండియాలోని సబ్సిడరీ సంస్థలను వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త గనుల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి ఇప్పించినప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ వంటి పనులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ కోల్ ఇండియాలోని సంస్థల్లో ఆయా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదే కోవలోకి సింగరేణి..? తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49%వాటా ఉంది. దీనిపై 51% వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కోల్ ఇండియా సబ్సిడరీ సంస్థలకు ఇచ్చిన విధంగానే 49% వాటాలో మరికొంత వాటాను తెలంగాణ రాష్ట్రానికి విక్రయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఈ విషయమై సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద ఈ ప్రతిపాదన తీసుకురాగా, సానుకూలత వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వం వాటాను పూర్తిగా కొనుగోలు చేసి రాష్ట్ర పరిధిలోకి తీసుకురావాలంటూ ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. సింగరేణి సంస్థ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.12,300 కోట్లుగా అంచనా. -
‘పూలు అమ్మిన చోట.. కట్టెలు అమ్మడం..’
40 వేల మంది సింగరేణి రిటైర్డ్ కార్మికుల బతుకులు దుర్భరం కుటుంబ పోషణ గడువక నానా యాతన నా పేరు గోసిక నర్సయ్య. మాది బెల్లంపల్లిలోని టేకులబస్తీ. బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే-1 గనిలో కార్మికుడిగా పనిచేసి 2002లో ఉద్యోగ విరమణ చేశాను. సుమారు 30 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశాను. జీతం డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేవి. మా కుటుంబంలో నేను, నా భార్య, మనుమరాలు ఉంటాము. కంపెనీలో పని చేసి దిగిపోయిన తర్వాత నాకు నెలకు రూ.1,000 పింఛన్ అస్తంది. ఆ డబ్బు మాకు దేనికీ సరిపోతలేదు. కూరగాయలు సుత వస్తలేవు. అందుకనే తో పుడు బండి మీద బజార్ ఏరియాల పండ్లు అమ్ము తున్నా. పొద్దంత కష్టపడితే రోజుకు రూ.100 నుంచి రూ.150 సంపాదిస్తున్న. ఆ సంపదనతోనే మాకు టుంబం గడుస్తున్నది. పింఛన్ సరిపోవడం లేదు. తెలంగాణ సర్కారైనా మా మీద దయ చూపి పింఛన్ పెంచాలి.. ‘పూలు అమ్మిన చోట.. కట్టెలు అమ్మడం..’ అంటే ఇదేనేమో.. ఒకప్పుడు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి దేశానికి వెలుగులు పంచిన సింగరేణి రిటైర్డ్ కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి.. ప్రజలకు వెలుగులు పంచుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుకున్న సింగరేణి కార్మికులు ప్రస్తుతం జీవిత చరమాంకంలో పిడికెడు మెతుకుల కోసం అల్లాడుతున్నారు.. కొందరు భిక్షాటన చేస్తుండటం మరీ దారుణం.. దినసరి కూలీలుగా.. హోటళ్లలో పనివాళ్లుగా.. పండ్లు అమ్ముకుంటూ జానెడు పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.. వృద్ధాశ్రమాల్లో చేరుతూ వ్యథాభరిత జీవితాలు అనుభవిస్తున్నారు. కొందరు బతుకు మీద విరక్తి చెంది మానసిక క్షోభకు గురవుతూ.. మందులు కొనుక్కునే స్థోమత లేక అనారోగ్యం క్షీణించి బతుక లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇంకొందరు బతుకు మీది ఆశతో తెలంగాణ సర్కారు అయినా ఆదుకోదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.. బెల్లంపల్లి : సింగరేణి రిటైర్డ్ కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత సుఖమయ జీవనం సాగించాల్సిన రిటైర్డ్ కార్మికులు జీవిత చరమాంకంలో అవస్థలు పడుతున్నారు.ఏళ్ల తరబడి రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణి పురోభివృద్ధికి దోహదపడిన కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత అందించే అరకొర పింఛన్తో చాలీచాలని బతుకులు వెళ్లదీస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని కోరుతున్నా వీరి మొరను ఎవరు ఆలకించడం లేదు. బొగ్గు గని కార్మికులకు 1998లో పింఛన్ పథకం అమలులోకి వచ్చింది. పింఛన్ అమలు కోసం 1989లోనే జీవో జారీ అయినప్పటికీ అమలు చేయడానికి మాత్రం తొమ్మిదేళ్ల సమయం పట్టింది. ఉద్యోగ విరమణ అనంతరం కార్మికుడికి 25 శాతం పింఛన్ను చెల్లిస్తున్నారు. 1998 నుంచి ఇప్పటి వరకు సింగరేణి కాలరీస్లో సుమారు 40 వేల మందికిపైబడి కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో 2009 సంవత్సరం నుంచి దిగిపోయిన కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్ను వర్తింపజేసిన అంతకుముందు 1998 నుంచి 2008 వరకు రిటైర్డ్ అయిన కార్మికులకు మాత్రం అతిస్వల్పంగా పింఛన్ను అందిస్తున్నారు. ఆ పదేళ్ల కాలంలో ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు సుమారు 30 వేల మంది వరకు ఉన్నారనేది అంచనా. అంత మంది కార్మికులకు ప్రతి నెల రూ.300 నుంచి రూ.1500 వరకు మాత్రమే పింఛన్ అందుతోంది. ఆ పింఛన్ దేనికి సరిపడక రిటైర్డ్ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సతమతమవుతున్నారు. పెరుగుతున్న ధరలు.. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు సరుకుల ధరలు పెరిగిపోతుండటంతో రిటైర్డ్ కార్మికులు పోటీపడలేక పోతున్నారు. వచ్చే అతి కొద్ది పింఛన్తో నెలంతా నెట్టుకురావడం కష్టంగా మారి వీరిలో కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతోంది. ప్రతి మూడేళ్లకోసారి ధరల సూచికకు అనుగుణంగా పింఛన్ను సవరించాల్సి ఉండగా ఆ దిశగా యత్నాలు జరగడం లేదు. రిటైర్డ్ కార్మికుల పింఛన్ను సవరించాలని పాలకులు, కార్మిక సంఘాలు ఏ ఒక్కనాడు కూడా వీరిపక్షాన మాట్లాడటం లేదు. కోల్ ఇండియా యాజమాన్యంతో చర్చించడం లేదు. ప్రస్తుతం చెల్లిస్తున్న 25 శాతం పింఛన్ను 50 శాతానికి పెంచాలని రిటైర్డ్ కార్మికులు కొన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా పట్టింపు చేయడం లేదు. కార్మికుల పక్షాన నిత్యం పోరాటాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే కార్మిక సంఘాల నాయకులు వీరి దుస్థితిని పట్టించుకున్న పాపానపోవడం లేదు. గుర్తింపు ఎన్నికల్లో రిటైర్డ్ కార్మికులకు ఓటు హక్కు లేకపోవడంతో కార్మిక సంఘాలు వీరిపై శ్రద్ధ చూపించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.6 వేలు చెల్లించాలి.. పెరుగుతున్న ధరలు దృష్టిలో పెట్టుకుని రిటైర్డ్ కార్మికుల పింఛన్ను పెంచాల్సిన అవసరం ఉంది. బియ్యం, కూరగాయలు, ఇతరాత్ర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు సమానంగా పింఛన్ పెంచకపోయిన కనీసం నెలకు రూ.6 వేల చొప్పున అందజేయాలని పింఛన్దారులు డిమాండ్ చేస్తున్నారు. పాలక ప్రభుత్వాలు ధరల సూచికను దృష్టిలో పెట్టుకొని వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.1,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అదే మాదిరి రిటైర్డ్ కార్మికుల పింఛన్ను కూడా సవరించి గౌరవ ప్రదంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బొగ్గు గనికార్మికుల పింఛన్ పెంపుదల కోసం ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, ఎంపీలు ఉమ్మడిగా కృషి చేయాలని కార్మికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. -
వెలుగులో చిన్న షేర్లు
మూడు రోజులుగా బలపడ్డ సెంటిమెంట్ చిన్న షేర్లకు టానిక్లా పనిచేస్తోంది. గత రెండు రోజుల్లో మార్కెట్లకు మించి పరుగు తీసిన బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మరోసారి 1.4% ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 1,746 లాభపడితే, 1,188 మాత్రమే నష్టపోయాయి. ఇక మరోవైపు మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకులోనై చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 25,561 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 16 పాయింట్లు పుంజుకుని 7,640 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 554 పాయింట్లు జమ చేసుకుంది. ఎఫ్పీఐల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,912 కోట్లను ఇన్వెస్ట్చేయగా, దేశీ ఫండ్స్ రూ. 1,316 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ట్రేడింగ్లో ప్రధానంగా మెటల్స్, పవర్, వినియోగవస్తు రంగాలు 2%పైగా పురోగమించాయి. మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, సెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పుంజుకోగా, పవర్ షేర్లు సీఈఎస్సీ, టాటా పవర్, అదానీ పవర్, పీటీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ 4-2% మధ్య ఎగశాయి. సెన్సెక్స్లో ఎంఅండ్ఎం 3%, బజాజ్ ఆటో 2% చొప్పున క్షీణించాయి. రెండు సంస్థలుగా క్రాంప్టన్ గ్రీవ్స్ వినియోగ వస్తువుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి లిస్ట్ చేయనుండటంతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 13% జంప్చేసింది. రూ. 211 వద్ద ముగిసింది. 2.3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వినియోగ వస్తు విభాగాన్ని (బీటూసీ) ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బెల్జియం మాతృసంస్థ నిర్ణయించినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ బీఎస్ఈకి తెలిపింది. ప్రధాన కంపెనీ చేతిలో విద్యుత్, పారిశ్రామిక, ఆటోమేషన్ ఉత్పత్తుల బిజినెస్ ఉంటుందని తెలియజేసింది. -
దినదిన గండం
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు సంక్షోభం తీవ్రతరమైంది. ఏడాదిగా ఇదే పరిస్థితి ఉన్నా కోల్ ఇండియా నుంచి ఆశించిన ఫలితం లేదు. సింగరేణి కాలరీస్ సవతి ప్రేమ చూపుతోంది. వెరసి ఆర్టీపీపీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా తయారైంది. 1050 మెగా యూనిట్ల సామర్థ్యం స్థానంలో కేవలం 360 మెగా యూనిట్ల ఉత్పత్తితో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాంతులు వెదజల్లాల్సిన చోట మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయలసీమ ప్రాంతానికి తలమానికంగా నిలుస్తున్న ఆర్టీపీపీలో ఉత్పత్తికి తగ్గట్టు బొగ్గు సరఫరా లేదు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నిరంకుశ వైఖరి కారణంగా రెండు యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి ఏడాదిగా ఇలాగే ఉన్నా జెన్కో యంత్రాంగం చోద్యం చూస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీపీపీ ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, అవసరం మేరకు బొగ్గు నిల్వలు లేని కారణంగా గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. ఐదు యూనిట్ల పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి సాధించాలంటే 15 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం బొగ్గులేని కారణంగా 2, 3 యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రేక్ బొగ్గు మాత్రమే ఆదివారం సాయంత్రం చేరినట్లు సమాచారం. ప్రస్తుతం 1, 4, 5 యూనిట్లు మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. అది కూడా అతి తక్కువ సామర్థ్యంలో నడుస్తున్నాయి. ఏ కారణంతోనైనా ప్రతిరోజు బొగ్గు రేక్లు రాకపోతే ఆర్టీపీపీలో ఆ కాస్త ఉత్పత్తి సైతం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టీపీపీకి బొగ్గు గండం ఏర్పడి దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో జెన్కో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. సింగరేణి నిర్లక్ష్యంపై చర్యలేవి? సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉంది. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆర్టీపీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జెన్కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8 లక్షల టన్నులు బొగ్గు సరఫరా చేయాల్సి ఉంది. ప్రతి నెల సుమారు లక్షల టన్నులు పైబడి కోత విధిస్తున్నారు. ఇప్పుడా పరిస్థితి మరింత అధికమైనట్లు సమాచారం. రాయలసీమకు విద్యుత్ కాంతులు వెదజల్లే ఆర్టీపీపీ సైతం అంధకారంతో మగ్గాల్సిన రోజులు దాపురించాయి. గత నెలరోజులుగా ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి కావడంలేదు. ఆదివారం కేవలం 360 మెగావాట్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యంపై జెన్కో ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. పతిరోజు ఐదు రేక్లు బొగ్గు ఆర్టీపీపీకి దిగుమతి కావాల్సి ఉంది. అంటే ప్రతిరోజు 18వేల టన్నులు సరఫరా కావాలి. అయితే ప్రస్తుతం రెండు రేక్లు మాత్రమే సరఫరా అవుతోంది. అది కాస్తా ఆదివారం ఒక్క రేక్తోనే సరిపెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితులు మునుపెన్నడూ ఎదుర్కోలేదని ఆర్టీపీపీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీపీపీలో బొగ్గు కొరత గత కొన్ని నెలలుగా పట్టిపీడిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. దీంతో ఆర్టీపీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తేనే.... ఆర్టీపీపీకి బొగ్గుకొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పా, బొగ్గు దిగుమతిలో మార్పు కనిపించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోల్ ఇండియా స్పందిస్తేనే థర్మల్ పవర్ ప్లాంట్ల మనుగడ సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తికి క్లిష ్టపరిస్థితులు ఉన్నప్పటికీ, జెన్కో ద్వారా ఉన్న అవకాశాన్ని సైతం వినియోగించుకోలేని దుస్థితి ఆంధ్రప్రదేశ్కు నెలకొంది. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కాలంటే అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించడం అవసరం. -
బొగ్గు ఉత్పత్తి పెంచండి
కోల్ ఇండియాకు కేంద్ర మంత్రి గోయల్ ఆదేశం న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్ కోల్ ఇండియా లిమిటెడ్ను ఆదేశించారు. ‘బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తవ్వకాలు జరుపుతున్న గనుల నుంచి మరింత బొగ్గును వెలికితీసేందుకు అనుమతించాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖను కోరాం. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెరిగే విధంగా ఈ-వేలంలో బొగ్గు పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశించాం..’ అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీలన్నిటికీ సరఫరా చేసేందుకు బొగ్గు ఉత్పత్తిని 50-60 శాతం పెంచాలని కోల్ ఇండియాను కోరినట్లు చెప్పారు. దేశంలో విద్యుత్ కొరతకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రైవేట్ విద్యుత్ దిగ్గజాలు అనిల్ అంబానీ (రిలయన్స్ పవర్), గౌతమ్ ఆదానీ (ఆదానీ గ్రూప్), వినీత్ మిట్టల్ (వెల్స్పన్ ఎనర్జీ), నవీన్ జిందాల్ (జిందాల్ పవర్) తదితరులతో గోయల్ సమావేశం నిర్వహించారు. -
మార్కెట్ కు క్రూడ్ షాక్!
* ఇరాక్ యుద్ధ భయాల ఎఫెక్ట్ *348 పాయింట్లు పతనం 4 నెలల్లోనే అత్యధికం * 25,228కు దిగిన సెన్సెక్స్ 108 పాయింట్లు పడ్డ నిఫ్టీ *దెబ్బతిన్న ఆయిల్ షేర్లు రియల్టీ, మెటల్, బ్యాంకింగ్ డీలా చిన్న షేర్లు విలవిల ఇరాక్లో చెలరేగిన యుద్ధ మేఘాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 113 డాలర్లను అధిగమించగా, నెమైక్స్ సైతం 107 డాలర్లను తాకింది. ఇవి మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు ఆందోళనలకు తెరలేపాయి. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు చమురు భయాలు వ్యాపించాయి. ఫలితంగా యూరప్లోని యూకే, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు 1% నష్టాలతో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో తొలుత లాభాలతో కదిలిన దేశీ మార్కెట్లు సైతం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నష్టాలకు లోనయ్యాయి. ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 25,688 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి మిడ్ సెషన్లో 25,172 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరి వరకూ నష్టాలలోనే కదిలి 348 పాయింట్లు పోగొట్టుకుంది. ఇంతక్రితం జనవరి 27న మాత్రమే ఈ స్థాయిలో 426 పాయింట్లు పతనమైంది. రూపీ ఎఫెక్ట్ కూడా: డాలరుతో మారకంలో రూపాయి నెల రోజుల కనిష్టం 59.68కు చేరడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచిందని విశ్లేషకులు పేర్కొన్నారు.ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) పుంజుకోవడంతోపాటు, మే నెలకు రిటైల్ ద్ర వ్యోల్బణం నీరసించడంతో మార్కెట్లు తొలుత లాభాలతో మొదల య్యాయని తెలిపారు. అయితే ఇరాక్ ఆందోళనలు, యూరప్ మార్కెట్ల నష్టాలు అమ్మకాలకు దారితీశాయని విశ్లేషించారు. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా, రియల్టీ అత్యధికంగా 5% కుప్పకూలింది. ఈ బాటలో పవర్, మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, ఆటో రంగాలు 3.5-1.5% మధ్య క్షీణించాయి. సెన్సెక్స్లో నాలుగే: సెన్సెక్స్లో హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం మాత్రమే నామమాత్రంగా లాభపడ్డాయి. బ్లూచిప్స్ బేర్: మిగిలిన బ్లూచిప్స్లో హీరోమోటో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా పవర్, మారుతీ, భెల్, టాటా మోటార్స్, భారతీ, ఎల్అండ్టీ 4-2% మధ్య నీరసించాయి. బ్యాంకింగ్ డీలా: బ్యాంకింగ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్, కెనరా, బీవోబీ, ఎస్బీఐ, ఫెడరల్, ఇండస్ఇండ్, పీఎన్బీ, ఐసీఐసీఐ 6-2% మధ్య డీలాపడ్డాయి. రియల్టీ బోర్లా: రియల్టీ షేర్లు డీబీ, డీఎల్ఎఫ్, అనంత్రాజ్, శోభా, హెచ్డీఐఎల్, యూనిటెక్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్ 8.5-3.5% మధ్య తిరోగమించాయి. చమురు షేర్లు ఢమాల్: ఆయిల్ మార్కెటింగ్ షేర్లలో హెచ్పీసీఎల్ 8% పడిపోగా, బీపీసీఎల్, ఐవోసీ, ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్, ఆయిల్ఇండియా, కెయిర్న్, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 5-1% మధ్య నష్టపోయాయి. స్మాల్ క్యాప్ 3% డౌన్: మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 3% స్థాయిలో పతనమయ్యాయి. 10-8% మధ్య: మిడ్ క్యాప్స్లో ఎంటీఎన్ఎల్, యూఫ్లెక్స్, హెచ్ఎంటీ, సింటెక్స్, జేపీ, షిప్పింగ్ కార్ప్, ఆర్కిడ్, జీఐసీ, శ్రేయీ ఇన్ఫ్రా, పుంజ్లాయిడ్, నవభారత్, టీబీజెడ్, రుచీ సోయా, ఎస్సార్ పోర్ట్స్ 10-8% మధ్య జారుకున్నాయి. శుక్రవారం 13... బాబోయ్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 13వ తేదీ ఒకే రోజు వచ్చాయంటే ఇన్వెస్టర్లకు ఆందోళనే. ఇది దేశీయంగానూ కనిపిస్తుండటం విశేషం! ఇప్పటివరకూ శుక్రవారం 13వ తేదీ వచ్చిన రోజున దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగుసార్లు పతనమయ్యాయి. తాజాగా ఇరాక్ అంతర్యుద్ధ భయాలతో ఈ సెంటిమెంట్ మరోసారి ప్రభావం చూపింది. వెరసి మార్కెట్లు వరుసగా ఐదు సార్లు 13వ తేదీ శుక్రవారం పతనమైన రికార్డును నెలకొల్పడం గమనార్హం. -
తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్!
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు సృష్టిస్తూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. మే నెల డెరివేటివ్ కాంట్రాక్ట్లు గురువారం(29న) ముగియనున్న నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్లు ఒడిదుడుకులను చవిచూడవచ్చునని అంచనా వేశారు. ఎఫ్అండ్వో విభాగంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకుంటారని చెప్పారు. కాగా, నేడు(26న) దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. మోడీ అధ్యక్షతన ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై ఇటీవల మార్కెట్లు దృష్టిపెట్టాయని నిపుణులు పేర్కొన్నారు. ఇకపై ఎన్డీఏ ప్రభుత్వ పాలసీ ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇప్పటికే గరిష్ట స్థాయిలో కొత్త రికార్డులను నెలకొల్పిన మార్కెట్లు తదుపరి దశలో ప్రభుత్వ విధానాల ఆధారంగా కదిలే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. మార్కెట్ల జోరు గడిచిన శుక్రవారం (23న) మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు ఎగసి 24,693 వద్ద నిలవగా, నిఫ్టీ కూడా 91 పాయింట్లు పుంజుకుని 7,367 వద్ద స్థిరపడింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయి ముగింపులుకాగా, ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలను ప్రకటించనున్న మరికొన్ని బ్లూచిప్స్పై దృష్టిపెడతారని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ వారం ఆటో దిగ్గజం టాటా మోటార్స్, ఔషధ దిగ్గజం సన్ ఫార్మా, ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా క్యూ4తోపాటు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవికాకుండా దేశీ స్టాక్ మార్కెట్ల జోరుకు కారణమవుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయగలవని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ సంకేతాలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. వృద్ధికి ఊతమిచ్చే చర్యలు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించినప్పటినుంచీ మార్కెట్లు నరేంద్ర మోడీ ప్రధానిగా ఏర్పడనున్న మంత్రివర్గంపై అంచనాలు మొదలుపెట్టాయని నిపుణులు చెప్పారు. ఎవరెవరికి కీలక శాఖలు దక్కనున్నాయన్న అంశంపై విభిన్న అంచనాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య, విదేశీ శాఖలకు సంబంధించిన మంత్రి పదవులపై మార్కెట్లలో ఆశావహ అంచనాలున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధి బాటలో పెట్టగల చర్యలను ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. కొత్త ప్రభుత్వం బిజినెస్కు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తుందని, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అనువైన విధానాలను అవలంబిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇవికాకుండా జూన్ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్షను చేపట్టనుండటంతో మంత్రివర్గ ఏర్పాటు తరువాత మార్కెట్లు వడ్డీ రేట్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తాయని వ్యాఖ్యానించారు. -
‘పింఛన్’ పాట
ప్రతి ఎన్నికల వేళ నాయకుల మాట గెలిచాక హామీ హుష్కాకి.. తక్కువ పింఛన్తో అరిగోస పడుతున్న సింగరేణి కార్మికులు పింఛన్ 25 శాతం నుంచి 40 శాతం పెంచాలని డిమాండ్ లాభాలు సాధిస్తున్న కార్మికులకు శూన్య హస్తం హక్కులు సాధించాలంటే పోరాటమే చివరి అస్త్రం మంచిర్యాల సిటీ, న్యూస్లైన్ : ప్రపంచానికి వెలుగునిచ్చేది సూరీడు అయితే.. రాత్రి వెలుగునిచ్చేది నల్లసూరీడు.. నిత్యం బొగ్గు గనుల మధ్య ప్రాణాలతో సహవాసం.. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలి యదు.. రెక్కలు ముక్కలు చేసుకుని.. ప్రాణాలకు త్యజించి.. కోట్లాది ప్రజలకు వెలుగు నిస్తున్నాడు.. వీరి శ్రమ వెల కట్టలేనిది.. అటువంటి సింగరేణి కార్మికులపై పాలకులు చిన్న చూపు చూస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత మాత్రం వచ్చే పింఛన్పై ఆధార పడి అతని కుటుంబం బతకడం కష్టమవుతోంది. ప్రస్తుత ధరలకు అనుగుణంగా పింఛన్ రావడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛన్ ఇవ్వడం లేదు. పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు పదవీ విరమణ చేసిన రోజు నుంచి అతని బేసిక్లో 25 శాతం పింఛన్ చెల్లిస్తున్నారు. సింగరేణిలో పింఛన్ విధానం 1994 నుంచి అమలు అవుతోంది. కార్మికుల హక్కులను కాపాడుతామంటూ కార్మిక సంఘాల నాయకులతోపాటు, కార్మిక సంఘాల మాతృ సంస్థల పార్టీల నాయకులు కూడా ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలుకడం సింగరేణి గనులపై సహజమైంది. పింఛన్ విధానం మారుస్తామంటూ నాయకులు కార్మికల ఓట్లను సొమ్ము చేసుకోవడం ఎన్నికల సమయంలో మామూలై పోయింది. తర్వాత ఈ విషయాన్నే మరచిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మళ్లీ పింఛన్ పాట పాడుతున్నారు. సింగరేణిలో పింఛన్ విధానం సింగరేణి సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు, అధికారులకు తను ఎంత బేసిక్తో పదవీ విరమణ పొందితే ఆ బేసిక్లో 25 శాతం ప్రతి నెల చెల్లిస్తారు. కార్మికుడి తదనంతరం అతని భార్యకు 12.5 శాతం చెల్లిస్తారు. కార్మికుడి జీవితాంతం తన పింఛన్లో ఎలాంటి మార్పులు ఉండవు. పింఛన్ మినహాయిస్తే వైద్య ఖర్చులు, ఇంటి అద్దె, డీఏ అంటూ ఏమీ ఉండవు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ విధానం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారు పదవీ విరమణ పొందిన రోజున ఉన్న బేసిక్లో 50 శాతం పింఛన్ చెల్లిస్తారు. ఉద్యోగి మరణిస్తే తన భార్యకు 25 శాతం వస్తుంది. భార్య తదనంతరం వారిపై ఆధారపడ్డ వితంతువు కూతురు, అంగవైకల్యం, మానసిక వికలాంగులైన పిల్లలకు అదే 25 శాతం చెల్లిస్తారు. పదవీ విరమణ పొందిన తరువాతఉద్యోగి మరణిస్తే అతని దహన సంస్కారాలకు ప్రభుత్వం రూ.10 వేలు అందజేస్తుంది. భార్యాభర్తలు ఇరువురికి మరణించే వరకు వైద్య ఖర్చు లు ప్రభుత్వమే భరిస్తుంది. పనిచేస్తున్న ఉద్యోగులతో సమానంగా పద వీ విరమణ పొందిన వారికి కూడా ప్రతి ఆరు నెలలకోసారి డీఏ పింఛన్లో కలుపుతారు. అదేవిధంగా ఐదేళ్లకోసారి కొత్త వేతనాలు మంజూరు అయినపుడు కూడాపదవీ విరమణ పొందిన వారి పింఛన్ కూడా పెరుగుతుంది. వీటితోపాటు ఇంటి అద్దె జీవితాంతం పింఛన్తో కలిపి చె ల్లిస్తారు. కార్మికుల డిమాండ్ సింగరేణిలో కార్మికులకు పింఛన్లో మార్పులు తీసుకురావాలంటే కోల్ ఇండియాలో సవరించాలి. వేజ్బోర్డు కమిటీ సభ్యులు చర్చలు చేపట్టాలి. సీఎంపీఎఫ్ నుంచి పింఛన్ చెల్లిస్తారు. ప్రస్తుతం కార్మికుల వేతనాల నుంచి 2 శాతం, సింగరేణి సంస్థ ఒక ఇంక్రిమెంటు, ప్రభుత్వం 1.13 శాతం కలుపగా ఏర్పడిన నిధుల నుంచి పింఛన్ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ విధానాన్ని సవరించి 40 శాతం ఇవ్వాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో నుంచి టన్నుకు రూ.5, కార్మికుల వేతనం నుంచి 3 శాతం, సంస్థ ఇంక్రిమెంటు ఒకటి నుంచి 3 శాతం, ప్రభుత్వం 2 శాతం కలుపుతూ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అమలు అయితే కార్మికుల బతుకు బండికి ఆసరా పెరుగుతుంది. పింఛన్ సరిపోత లేదు.. 2002 సంవత్సరంలో సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయిన. రూ.1,600 పింఛన్ వస్తంది. సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచడానికి నాయకులు కృషి చేయాలి. హామీలు ఇచ్చుడే కాదు సాధించి నిరుపించాలి. - కే.శ్యాంసుందర్, కేకే-1గని రిటైడ్ కార్మికుడు,మందమర్రి ప్రభుత్వ ఉద్యోగుల విధానం అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అవుతున్న పింఛన్ విధానాన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న విధానం సరికాదు. ఇంత పెద్దసంస్థలో అంత తక్కవ పింఛన్ విధానం సరి కాదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్ పెండానికి నాయకులు కృషి చేయాలి. - టి.అంజయ్య, కాసిపేట గని, సపోర్ట్మన్, బెల్లంపల్లి -
కొత్త గరిష్టం నుంచి జారుడు...
కొన్ని బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం భారత్ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి కిందకు దిగిపోయాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మంగళవారం ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 22,041 పాయింట్లకు, నిఫ్టీ 70 పాయింట్ల పెరుగుదలతో 6,575 పాయింట్లకు చేరాయి. ఇవి రెండు కొత్త రికార్డుస్థాయిలు. చివరకు సెన్సెక్స్ 23 పాయింట్ల స్వల్పలాభంతో 21,833 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 6,516 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కమిటీ రెండురోజుల సమావేశం మంగళవారం ప్రారంభంకానుండటం, క్రిమియా రష్యాలో విలీనమయ్యే ప్రక్రియ ప్రారంభంకావడం వంటి అంశాలతో గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ఎస్బీఐ నేతృత్వంలో యూనియన్బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు 2-5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మారుతి సుజుకి 7 శాతంపైగా పెరగ్గా, ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్లు 1.5-2.5 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రోలు 1-3 శాతం మధ్య తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,012 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 202 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. ఎస్బీఐ కౌంటర్లో షార్ట్ కవరింగ్..... ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లతో పోలిస్తే వెనుకబడివున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ మంగళవారం స్థిరంగా ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ కవరింగ్ జరగడంతో ఈ కాంట్రాక్టు నుంచి 1.86 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 70.26 లక్షల షేర్లకు తగ్గింది. రూ. 1,700 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ ఫలితంగా ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.40 లక్షల షేర్లు కట్కాగా, పుట్ ఆప్షన్లో 64 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లలో వరుసగా 4,80 లక్షలు, 2.08 లక్షల షేర్ల చొప్పున ఓఐ వుంది. రూ. 1,750 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కారణంగా 3.11 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లో ఓఐ 7.14 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,700పైన స్థిరపడితే రూ. 1,750 స్థాయిని సమీపించవచ్చని, రూ. 1,700 దిగువన క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
నల్ల బంగారం జిగేల్!
కోల్కతా: వాటాదారులకు ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియా డివిడెండ్ బొనాంజా ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ కింద షేరుకి రూ. 29(290%) చెల్లించేందుకు నిర్ణయించింది. దీంతో 100 షేర్లు కలిగిన వాటాదారుడికి రూ. 1,500 అందనుంది. ఇక ప్రభుత్వానికైతే ఏకంగా రూ. 16,485 కోట్లు లభించనున్నాయి. కంపెనీలో ప్రభుత్వానికి 90% వాటా ఉండటమే దీనికి కారణం. వెరసి ఇందుకు కంపెనీ 18,317 కోట్లు వెచ్చించనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2013-14) ప్రభుత్వం పెట్టుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 40,000 కోట్లుకాగా, కోల్ ఇండియా డివిడెండ్ ద్వారా దీనిలో దాదాపు 60% వాటా సమకూరనుండటం గమనించదగ్గ విషయం! భారీ డివిడెండ్ చెల్లింపుపై దృష్టిపెట్టాల్సిందిగా ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖ తీసుకువచ్చిన ఒత్తిడి దీనికి నేపథ్యమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, డివిడెండ్ పంపిణీ పన్ను కింద ప్రభుత్వానికి మరో రూ. 3,113 కోట్లు లభించనున్నాయి. డివిడెండ్తో కలిపి ప్రభుత్వానికి మొత్తంగా రూ. 19,599 కోట్లు దక్కనున్నాయి. 2013 డిసెంబర్కల్లా కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) వాటా 5.47%(34.52 కోట్ల షేర్లు)గా నమోదైంది. దీంతో ఎఫ్ఐఐలకు రూ. 1,001 కోట్లు లభిస్తాయి. ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీకున్న 1.83% వాటాకుగాను రూ. 336 కోట్లు దక్కనున్నాయి. భారీ నగదు నిల్వలు కోల్ ఇండియా వద్ద 2013 మార్చి చివరికల్లా రూ. 62,236 కోట్ల విలువైన నగదు నిల్వలున్నాయి. దీంతో ప్రభుత్వానికి ప్రత్యేక డివిడెండ్ ప్రకటించేం దుకు వీలు కలిగిందని నిపుణులు వ్యాఖ్యానించారు. రూ. 10 ముఖ విలువగల షేరుకి రూ. 29 డివిడెండ్ చెల్లించేందుకు సంస్థ ఆడిట్ కమిటీ ప్రతిపాదించిందని కంపెనీ చైర్మన్ ఎస్.నర్సింగ్రావు చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 25న డివిడెండ్ను చె ల్లించనుంది. గతేడాది మధ్యంతర డివిడెండ్ కింద రూ. 9.7ను చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల షేరు ధర లాభపడుతూ వచ్చింది. ఈ బాటలో తాజాగా బీఎస్ఈలో 1.8% బలపడి రూ. 295 వద్ద ముగిసింది. మరోవైపు డిజిన్వెస్ట్మెంట్కింద తొలుత 10% వాటాను విక్రయిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో 5% డిజిన్వెస్ట్మెంట్కు ప్రణాళిక వేస్తోంది. ప్రస్తుత ధర వద్ద ప్రభుత్వానికి 5% వాటా కు రూ. 9,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది. చిదంబరంతో సమావేశం పీఎస్యూ చైర్మన్లతో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం సమావేశాన్ని నిర్వహించారు. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ తదితర దిగ్గజాల చైర్మన్లు హాజరయ్యారు. ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశలో పీఎస్యూలు ప్రత్యేక డివిడెండ్ను ప్రకటించనున్నాయి. ఇందుకు దారిచూపుతూ తొలుత కోల్ ఇండియా భారీ డివిడెండ్ను ప్రకటించింది. దీంతోపాటు ప్రభుత్వం హిందుస్తాన్ జింక్, బాల్కో, యాక్సిస్ బ్యాంక్ తదితర సంస్థలలో వాటాలను సైతం విక్రయించే యోచనలో ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్మంట్ లక్ష్యం రూ. 40,000 కోట్లుకాగా, ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 3,000 కోట్లను మాత్రమే సమీకరించింది. ఇందుకు ఎంఎంటీసీ, హిందుస్తాన్ కాపర్, నైవేలీ లిగ్నైట్, నేషనల్ ఫెర్టిలైజర్స్లో వాటాలను విక్రయించింది. -
కోల్ఇండియాపై సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న కోల్ ఇండియా.. సరఫరాల విషయంలో గుత్తాధిపత్యానికి పాల్పడుతోందన్న ఆరోపణపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆగ్రహానికి గురైంది. కంపెనీపై రూ.1,773 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఈ నెల 9న ఆదేశాలు జారీచేసినట్లు సీసీఐ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఒక ప్రభుత్వరంగ కంపెనీపై సీసీఐ ఇప్పటిదాకా విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం. నాన్-కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని సీసీఐ నిర్ధారించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సీసీఐ ఈ మేరకు తీర్పునిచ్చింది. కోల్ఇండియాతోపాటు దాని అనుబంధ సంస్థలైన మహానది కోల్ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ఫీల్డ్స్, సౌత్ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్... ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) విషయంలో అన్యాయంగా/అసంబద్ధ నిబంధనలను విధిస్తోందనేది సీసీఐ విచారణలో వెల్లడైంది. ఇటువంటివన్నీ నాయబద్ధమైన వ్యాపార నిబంధనలను ఉల్లంఘించడమేనని సీసీఐ తేల్చింది. జరిమానాతోపాటు అన్ని పక్షాల(విద్యుత్ ఉత్పత్తిదారులు)తో సంప్రదింపుల ద్వారా ఎఫ్ఎస్ఏల్లో తగిన మార్పులు చేయాలని కూడా సీసీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు కోల్ఇండియా ప్రతినిధి నిరాకరించారు. -
కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ కోసం రోడ్షోలు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో దాదాపు రూ. 9,129 కోట్ల మేర వాటాల విక్రయానికి సంబంధించి డిజిన్వెస్ట్మెంట్ విభాగం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడా, నెదర్లాండ్స్ వంటి అయిదు రాష్ట్రాల్లో రోడ్షోలు నిర్వహించనున్నది. అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలో రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు, అటుపైన కెనడాలోని టొరంటో, బ్రిటన్లోని లండన్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిన్వెస్ట్మెంట్ విభాగం (డీవోడీ) అధికారులతోపాటు కోల్ ఇండియా సీఎండీ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 90 శాతం వాటాలు ఉన్నాయి. ముందుగా 10 శాతం వాటాలు విక్రయించాలని భావించినప్పటికీ, కార్మికులు ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గి అయిదు శాతాన్ని విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. గత నెల తలపెట్టిన మూడు రోజుల సమ్మెను కార్మికులు డిసెంబర్ 17కి వాయిదా వేసుకున్నారు. 2010లో కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ద్వారా కేంద్రం రూ. 15,199 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్మెంట్ మార్గంలో రూ. 40,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం ఇప్పటిదాకా రూ. 1,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ అత్యంత భారీది కానుంది.