
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన మీడియా బాస్ ఇంద్రాణి ముఖర్జీ సోమవారం ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర పన్నుతోందని ఈ పిటిషన్లో ఆరోపించిన ఆమె.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమోషనల్గా అభ్యర్థించారు. వీలైనంత త్వరగా తనకు వైద్యం సహాయం అందకపోతే తాను చనిపోతానని, తన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సత్వరమే బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు.
‘దాదాపు ఏడాది కిందట రాహుల్ ముఖర్జీ ఈ కేసులో తదుపరి సాక్షి అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 14 నెలలు అయినా ఇప్పటివరకు అతన్ని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. మరోవైపు అతడు కీలక సాక్షి అంటూ.. అతని సాక్ష్యం ఇవ్వని కారణంగా నాకుబెయిల్ నిరాకరిస్తూ వస్తున్నారు’ అని వాదనల సందర్భంగా ఇంద్రాణి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా సాక్షిని ప్రవేశపెట్టకుండా తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలను వేగవంతం చేయాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లను ఆదేశించిన జడ్జి బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment