
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని బరేల్లీలోని ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక పాము కాటుకు గురైంది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఐసీయూలోకి బాలికను తరలించారు.
అదే రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి, మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఐసీయూలోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ బాలికను జనరల్ వార్డుకి తరలించారు. అనంతరం బాలికి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలికను విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు, మరో నలుగురిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.