
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
భోపాల్: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడు "నేను వికాస్ దూబేను, కాన్పూర్ వాలా" అని గట్టిగా అరవడం గమనార్హం.
కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటివరకు అతని నలుగురి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్కు అత్యంత సన్నిహితుడు, అతని బాడీగార్డు అమర్ దూబేను పోలీసులు మంగళవారం ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. వికాస్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని పోలీసులు గురువారం హతమార్చారు. ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. (వికాస్ దూబేపై నగదు బహుమతి 5 లక్షలకు పెంపు)
దీంతో ఇప్పటివరకు అతని ముగ్గురు అనుచరులు మరణించారు. ఇక హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ హోటల్లో వికాస్ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం రాగా వారు అక్కడికి చేరుకునేసరికి పరారయ్యాడు. తాజాగా అతడు నోయిడాలో ఓ ఆటోలో వెళ్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నోయిడాలో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. అనంతరం వికాస్ దూబే ఉజ్జయినిలో ప్రత్యక్షమయ్యాడని తెలుసుకున్న పోలీసులు ఈసారి అతడు పారిపోవడానికి వీలులేకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ముప్పేట దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. (వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్కౌంటర్!)