
హుస్సేన్(ఫైల్)
పటాన్చెరు టౌన్: పట్టపగలు జాతీయ రహదారిపై ఒక వ్యక్తిని హత్య కేసులో నిందితుడు ఖలీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్య కోసం నిందితుడు రూ.6 లక్షలు సుపారీ తీసుకున్నట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలో గత నెల 31న హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్పూర్కు చెందిన మహబూబ్ హుస్సేన్ (25)ను నడిరోడ్డుపై కొబ్బరి బోండాల కత్తితో హత్య చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా బియ్యం రవాణా చేసే వాళ్లలో ఒక వర్గానికి, మరో వర్గానికి పడకనే లక్డారంలో గత నవంబర్లో జరిగిన హర్షద్ హత్యకు ప్రతీకారంగా అతడి సోదరులు మహబూబ్ను హత్య చేయించినట్లు తెలిసింది.
నిందితులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన వారుగా సమాచారం. ప్రధాన నిందితుడి నుంచి పోలీసులు ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మహబూబ్ హత్య కేసులో 10 మందికిపైగా ఉన్నారని సమాచారం. హత్య చేస్తున్న సమయంలో రోడ్డుకు అవతలి వైపు కారులో కొందరు, మరి కొందరు ద్విచక్ర వాహనాలపై ఉన్నట్లు తెలిసింది. రెండు మూడ్రోజుల్లో నిందితులను రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ రాజేశ్వర్రావును వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందన్నారు. నిం దితుడి అరెస్ట్ను ఆయన ధ్రువీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment