
మాధురి పెళ్లి ఫోటో(ఫైల్)
నేరేడ్మెట్: మూడుముళ్ల బంధంతో ఎన్నో కలలతో జీవించడానికి ఖండాంతారాలు దాటి వెళ్లిన ఆమెకు భర్త నరకాన్ని చూపించాడు. దేశంకాని దేశంలో అండగా ఉండాల్సిన భర్త పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవాలని వేధింపులకు దిగాడు. భర్త వేధింపులతో విసుగు చెందిన ఆమె అమెరికా నుంచి భారత్కు వచ్చేసింది. వచ్చిన రోజుల వ్యవధిలోనే పుట్టింట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈసంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. నేరేడ్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాకతీయనగర్కు చెందిన గంగాదేవి, మల్దారి దంపతుల కూతురు మాధురి(27)తో 2016 నవంబర్లో ఇదే ప్రాంతానికి చెందిన కోటేశ్వర్రావుతో వివాహం జరిపించారు. పెళ్లి తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడికి వెళ్లిన తరువాత వీకెండ్ పార్టీల్లో పాల్గొనాలని, మద్యం తాగాలని, పేకాట ఆడటం, స్నేహితులను ఇంటికి పిలిచి..వారితో డాన్స్ చేయాలని భార్యను వేధింపులకు గురి చేశాడు. భర్త చేష్టలతో విసుగి చెందిన భార్య ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయమై తల్లిదండ్రులు పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 11న మాధురి భారత్కు వచ్చి కాకతీయనగర్లోని పుట్టింట్లో ఉంటుంది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని శవపంచనామ కోసం ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment