మార్పు వెనుక మతులబేమిటో?
-
స్థలాల మార్పుపై అనేక అనుమానాలు
-
చక్రం తిప్పుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు
నిజామాబాద్అర్బన్ :
నగర అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రజాప్రతినిధులు ముడుపుల బాగోతానికి తెరలేపుతున్నారని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 27న నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ఏజెండా అంశాల్లో పారిశ్రామిక ప్రాంతంగా పేర్కొంటున్న స్థలాలను నివాసప్రాంతాలుగా మార్చాలనే అంశాన్ని కేవలం రెండు గంటల ముందు చేర్చడం చర్చనీయాంశమైంది. నగరంలోని నాలుగు డివిజన్లలోని దుబ్బ, అర్సపల్లి, ఆటోనగర్, ఎన్ఆర్ఐ కాలనీల్లో పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించారు. దుబ్బ ప్రాంతంలోని బైపాస్ రోడ్డును ఆనుకుని నగరం వరకు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటికి కార్పొరేషన్ అధికారులు సైతం అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రాంతంలో 3229, 3230, 3231,3232,3233,3193,3194 నెంబర్లతో పాటు 29 సర్వే నెంబర్లలో పారిశ్రామికవాడ పరిధి ఉంది. దీన్ని ఆసరా చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించిన వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న సర్వే నెంబర్లతో పాటు ఇతర సర్వే నెంబర్లను గుర్తించి న్యాల్కల్రోడ్డు, గాయత్రినగర్, ప్రాంతాల్లోని పారిశ్రామివాడ ప్రాంతాన్ని నివాసప్రాంతాలుగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కౌన్సిల్ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చి ఆమోదం పొందితే ఇబ్బందులు ఉండవని ఆలోచించారు. కొందరు కార్పొరేటర్లు ఎజెండాలోని ఈ అంశాన్ని వ్యతిరేకించడంతో విఫలమయ్యారు. గాయత్రినగర్లోని సర్వే నెంబర్813/అ లోని పారిశ్రామికవాడకు చెందిన 0.13 గుంటల భూమిని నివాసయోగ్యంగా మార్చేందుకు స్థానిక కార్పొరేటర్కు సమాచారం లేకుండానే ఏజెండాలో చేర్చారు. న్యాల్కల్ రోడ్డులో 1551 , 1552,1553 సర్వే నెంబర్లను సైతం ఏజెండా అంశంలో చేర్చారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యపాత్ర పోషించినట్లు తెలిసింది.
భారీగా ముడుపులు..
పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చేందుకు భారీగానే ముడుపులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ అధికారులు కొందరు ముఖ్యపాత్రపోషించినట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు కొందరు అధికారులు రూ.లక్ష నుంచి 2లక్షల వరకు, మరో వైపు స్థానిక ప్రజాప్రతినిధులు రూ.2లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేసిన వీరు పారిశ్రామికవాడకు చెందిన ప్రాంతాలను నివాసప్రాంతాలుగా మారిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ మేరకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మాస్టర్ ప్లాన్ కొనసాగుతుండగా ఇండస్ట్రీయల్ ప్రాంతాన్ని నివాస ప్రాంతాలుగా మార్చడానికి అనుమతి లేదని, మాస్టర్ప్లాన్లో అన్ని ప్రాంతాలకు సంబంధించి సరైన ప్రణాళిక వస్తుందని, హుటాహుటిన ఈ తీర్మాణాన్ని సమావేశంలోకి ఎందుకు తీసుకొచ్చారని కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వారిని విచారించి చర్యలు తీసుకుంటే కొత్తగా ఇళ్ల నిర్మాణం జరగదని పేర్కొంటున్నారు.
అనుమతి ఇవ్వం..
పారిశ్రామిక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం కుదరదు. నిబంధనలు ఒప్పుకోవు. మాస్టర్ప్లాన్ రూపుదిద్దుకుంటున్నందున మరికొన్ని రోజుల్లో సరైన ప్రణాళిక వస్తుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
– నాగేశ్వర్, మున్సిపల్ కమిషనర్