బ్లాక్బలి
- రూ. 500 పలికిన బాహుబలి సినిమా టికెట్
– నిబంధనలు పాటించని థియేటర్ల నిర్వాహకులు
– ఆన్లైన్ పేరుతో అడ్డగోలు దోపిడీ
- పడిగాపులు కాసినా ప్రేక్షకుడికి దొరకని టికెట్
- ఆనంద్ థియేటర్ వద్ద అభిమానులు గొడవ
కర్నూలు సీక్యాంప్: బాహుబలి సినిమా థియేటర్ నిర్వాహకులకు కాసులు కురిపించింది. ఈ సినిమాను చూసేందుకు శుక్రవారం తెల్లవారుజామున నుంచే అభిమానులు నగరంలోని వెంకటేష్, రాజ్, శ్రీరామ, ఆనంద్ సినిమా థియేటర్ల వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా కౌంటర్లలో టికెట్లు దొరకని దుస్థితి. ఈ చిత్రం విడుదలైన దాదాపు పది థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం సినిమా టికెట్స్ మొత్తం ఆటకు ముందు రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలి. వారు టికెట్లను పంపిణీ చేయాలి. అందుకు విరుద్ధంగా కొన్ని థియేటర్ల నిరా్వహకులు టికెట్స్ మొత్తం ఆన్లైన్లో బుక్ అయ్యాయని చెప్పి దోపిడీకి దిగాయి. దీంతో ఆగ్రహించిన అభిమానులు ఆనంద్ థియేటర్ ఎదుట ఉదయం గొడవకు దిగారు. క్లాస్ టికెట్ ధర రూ.100 అయితే రూ. 500, ఆపై, మాస్ టికెట్ రూ.60 ఉండగా రూ. 250, ఆపై ధరకు నిర్వాహకులే దగ్గరుండి అమ్మిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే బ్లాక్లో టికెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.