
చలిగుప్పిట్లో మన్యం
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ మన్యంలో చలి గాలుల తీవ్రతకు గిరిజనం వణికిపోతున్నారు. శుక్రవారం రాత్రి మినుములూరులో అత్యంత కనిష్టంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో 7 డిగ్రీలు, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
అలాగే ఆదిలాబాద్ జిల్లా వాసులూ చలికి గజగజ వణుకుతున్నారు. ఇక్కడ 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉట్నూరు ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో చలి విజృంభించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అయితే ఈ ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాల్లోని విద్యార్థులకు వసతులు కరువయ్యాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో ఐదు రోజుల పాటు చలితీవ్రత ఇలానే ఉంటుందని విశాఖ వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో ఈ పరిస్థితి ఉందని పేర్కొంది.