విన్నపాలు వినవలె..!
గుంటూరు వెస్ట్ : జిల్లాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ ప్రజా సమస్యల వేదికలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య, డీఆర్ఓ కె.నాగబాబు, డీఈఓ కేవీ శ్రీనివాసరెడ్డి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ సత్యకుమార్ తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గిరిజన భవన్ను నిర్మించాలి
–కె.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షుడు
నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ ఎదుటగల జెడ్పీ స్థలంలో గిరిజన భవన నిర్మాణం కోసం గతంలో 27 సెంట్ల భూమిని కేటాయించారు. ఆ స్థలంలో ఆగస్టు 9వ తేదీన నిర్వహించే ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున గిరిజన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవానికి నగరంలో విద్యుద్దీపాలతో లైటింగ్ ఏర్పాటు చేయాలి.
నివేశనా స్థలాలు ఇవ్వాలి
– కంభంపాటి ఆనందకుమార్, జిల్లా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)
నగరంలోని తారక రామానగర్, సీతమ్మకాలనీ, కోబాల్డ్పేట, పీఎస్నగర్, శారదాకాలనీ, తుళ్లూరు మండలంలోని పెదపరిమి, అనంతవరం తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇళ్లస్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నివేశన స్థలాల కోసం గతంలో అనేకమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.