బెల్లంపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం
Published Thu, Sep 22 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
బెల్లంపల్లి : పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాకు చెందిన ఓ బాలిక(17) గురువారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... బాలిక పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివి అనుత్తీర్ణత చెందడంతో ఇంటిపట్టున ఉంటోంది. గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో స్థానిక ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న మరుగుదొడ్డికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. మందు తాగిన అనంతరం ఆమె మరుగుదొడ్డి నుంచి అస్వస్థతతో బయటకు రాగా.. అది గమనించిన కొందరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆమె తల్లి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అక్కడి చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై.. వన్టౌన్ ఎస్హెచ్వో ఎల్.రఘును వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
Advertisement
Advertisement