ఇదీ వరుస
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్లు రద్దయి 27 రోజులు దాటింది. అయినా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. బ్యాంకుల ముందు క్యూలు కొనసాగుతున్నాయి. ఏటీఎంలు ఎప్పటిలా మూతపడి ఉంటున్నాయి. నామమాత్రంగా పనిచేస్తున్న ఏటీఎంల ముందు జనం బారులు తీరుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే రోజులో కొంతసేపు పనిచేస్తుండగా, మిగిలిన ఏటీఎంలు దాదాపు మూతపడి ఉంటున్నాయి. దీంతో డబ్బుల కోసం బ్యాంకులను ఆశ్రయించక తప్పడం లేదు. ఉదయం 8గంటల నుంచే వాటి ముందు రద్దీ మొదలవుతోంది. తోపులాటలు, వాగ్వాదాలతో బ్యాంక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం జిల్లాలోని అన్ని బ్యాంకులు జనంతో కిక్కిరిసిపోయాయి. చాలా బ్యాంకులకు నగదు సకాలంలో రాకపోవడంతో.. చెస్ట్ నుంచి నోట్లు వచ్చేవరకు వేచిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నిచోట్ల వచ్చిన కొంత సొమ్ము కూడా కొద్దిసేపట్లోనే అయిపోవడంతో నో క్యాష్ బోర్డులను తగిలించారు. రోజంతా నిలబడ్డా కనీసం రూ.వెయ్యి కూడా బ్యాంకు సిబ్బం ది ఇవ్వడం లేదని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. రిజర్వు బ్యాంకు విధించిన పరిమితి మేరకు కూడా నగదును ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలు బ్యాంకుల వద్ద ఖాతాదారులు సిబ్బం దితో వాగ్వాదానికి దిగుతున్నారు. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వస్తుండటంతో వారిని లోపలికి అనుమతించకుండా గంటల కొద్దీ బయటే వేచివుండేలా చేస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు వంటివి లేక ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఖాతాదారులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా బ్యాంకర్లు కల్పించడం లేదు. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల చొప్పున ఇవ్వడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పింఛన్దారులు రూ.వెయ్యి కోసం మైళ్ల దూరం ప్రయాణం చేసి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి.. తిండితిప్పలూ లేక పడరాని పాట్లు పడుతున్నారు. కొందరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడినా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లేసరికి డబ్బులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
పొదుపు ఖాతాలు
తీసుకోవాల్సిందే !
జన్ధన్ ఖాతాలలో డిపాజిట్లకు, నగదు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంతో ఆ ఖాతాలు ఉన్నవారు కొత్తగా పొదుపు ఖాతాలు తీసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఇప్పటికీ ఖాతాదారులు తమ అకౌంట్ నుంచి కనీసం రూ.4 వేలు తీసుకోవాలన్నా చుక్కలు కనబడుతున్నాయి. రూ.2 వేల నోట్లు తప్ప చిల్లర దొరకని పరిస్థితి ఉంది. రూ.500 నోట్లు వచ్చినా సామాన్యులకు అందటం లేదు. అవన్నీ బడాబాబుల చేతుల్లోకి వెళ్లి నల్లధనంగా మారిపోయాయనే ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. రూ.100 నోట్ల చలామణి కూడా తగ్గిపోయింది. దీంతో రూ.2 వేల నోట్లకు చిల్లర దొరడం కష్టసాధ్యంగా మారిపోయింది.