
నేడు దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మీ యాగం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహాలక్ష్మి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్జున వీధిలోని మహా మండపం సమీపంలో ప్రత్యేక యాగశాల ఏర్పాటుచేశారు. వేద పండితులతో పాటు ఉభయదాతలు కూర్చునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకూ యాగం జరుగుతుంది. రూ.3,116 టికెట్ కొన్న ఉభయదాతలు యాగంలో పాల్గొనవచ్చు. యాగశాల నిర్మాణానికి ఆ ప్రాంతాన్ని మొత్తం చదును చేయడంతో పాటు యాగం నిర్వహించేందుకు రూ.2లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే, సరైన ప్రచారం లేక ఎంతమంది ఉభయదాతలు హాజరవుతారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.