నీ త్యాగం స్ఫూర్తిదాయకం!
-
తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణం పోస్తూ..
-
గుండె, లివర్ ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలింపు
-
కిడ్నీ, నారాయణ, బొల్లినేనికి
-
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
నెల్లూరురూరల్:
తాను మరణిస్తూ కూడా మరో ఐదు మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించిన చిల్లకూరు దినేష్రెడ్డి త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తన అవయవదానంతో దానంతో ధన్యుడయ్యాడు. బ్రెయిన్ డెడ్ అయిన చిల్లకూరు దినేష్రెడ్డి(32) అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. బిడ్డ ఎలాగూ బతకడని తెలుసుకున్న తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా తన బిడ్డ అవయవాలు ఇతరులకు ఊపిరి పోస్తాయనే ఆశతో అంగీకరించారు. ఈ సంఘటన శనివారం నెల్లూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..
విడవలూరు మండలం వావిళ్ల గ్రామానికి చెందిన చిల్లకూరు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మి దంపతులు ఆర్థికంగా ఎదిగేందుకు నెల్లూరు నగరానికి 16 ఏళ్ల క్రితం వచ్చారు. స్థానిక నవాబుపేటలోని పుల్లమ్మ సత్రం దగ్గర కాపురం ఉంటున్నారు. గేదెలు కొనుక్కుని మిని పాలడైరీ నడుపుతూ సంతోషంగా జీవిస్తున్నారు. వారికి ఒక కుమార్తె అనూష. కుమారుడు దినేష్రెడ్డి. కుమారుడు స్థానిక చికెన్స్టాల్లో పనిచేస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న ఆకుటుంబంపై విధి పగబట్టింది. అనుకోకుండా పెళ్లీడు కొచ్చిన కుమారుడు దినేష్రెడ్డి ఈనెల 13న రాత్రి ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన అపోలో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెదడుకి ఆపరేషన్ చేశారు. తరువాత చికిత్స పొందుతుండగానే మరొక సారి ఈనెల 18న తీవ్రమైన ఫిట్స్కు గురయ్యాడు. కోమాలోకి వెళ్లాడు. పరిశీలించిన ౖÐð ద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. కోలుకోలేడని స్పష్టంగా చెప్పారు. పిడుగు లాంటి వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్ప కూలిపోయారు. తన బిడ్డను ఎలాగోలా బతికించాలని డాక్టర్ల కాళ్లా, వేళ్లా పడి బతిమిలాడుకున్నారు. బ్రెయిన్ డెడ్కి గురైన వ్యక్తిని బతికించడం సాధ్యం కాదని డాక్టర్లు వివరించారు. బిడ్డ ఎలాగు బతకడు కాబట్టి అవయవదానం చేస్తే మీ బిడ్డ కనీసం ఐదుమందికి ప్రాణదానం చేసినట్టని తెలిపారు.
దుఃఖాన్ని దిగమించి
తల్లిదండ్రులు కుమారుడు లేడన్న దుఃఖాన్ని పంటి బిగువున దాచుకుని తన బిడ్డ మరణించినప్పటికీ మరో ఐదుమందికి జీవితాన్నిస్తాడనే ఆశతో అవయవదానానికి అంగీకరించారు. జీవన్దాన్ ట్రస్టు అనుమతి పొందిన నారాయణ ఆసుపత్రికి దినేష్రెడ్డిని తరలించారు. శనివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి దినేష్రెడ్డి శరీర భాగాలను వేరు చేశారు. గుండె, లివర్ను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నెల్లూరు పోలీసు ఎస్ఐ సుబ్బారావు పేరడే గ్రౌండ్ వరకు గ్రీన్కారిడార్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక పెట్టెలో గుండె, లివర్ను భద్రపరచిన వైద్యులు తొలుత ప్రత్యేక వాహనంతో జిల్లా పోలీసు కవాతు మైదానం వరకు తీసుకొచ్చి, అక్కడ నుండి హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించారు. ఒక కిడ్నీని నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని కిమ్స్ ఆసుపత్రికి, కళ్లను మోడరన్ ఐ బ్యాంకుకి తరలించనున్నారు.