వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అంగీకారం
Published Fri, Aug 12 2016 5:14 PM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
మురళీనగర్: దేశ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వేతనాల సవరణకు కమిటీ నియామకానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అంగీకరించినట్లు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఏఐఎఫ్పీటీఓ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సవరణ సంఘం సూచనల మేరకు నూతన జీతభత్యాలను అమలు చేస్తున్న నేపథ్యంలో యూజీసీ పరిధిలో పనిచేసే అధ్యాపకుల వేతాల సవరణకు యూజీసీ 7వ వేతన సవరణ సంఘాన్ని నియమించింది. దీంతో పాలిటెక్నిక్ అధ్యాపకుల వేతనాల సవరణకు 7వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏఐసీటీఈ చైర్మన్కు ఇటీవల ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు చంద్రశేఖర్ చెప్పారు. దీనికి స్పందించిన ఏఐసీటీఈ చైర్మన్ వేతన సవరణ సంఘం నియామకానికి సానుకూలంగా ఉన్నట్లు లేఖ పంపినట్టు చంద్రశేఖర్ చెప్పారు. వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి నివేదిక ఇస్తే దేశంలోని 40వేలమంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు లాభం చేకూరుతుందని ఆయన వివరించారు. తమ జీతభత్యాల సవరణకు వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అంగీకరించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏఐసీటీఈ చైర్మన్కు సంఘం తరపున చంద్రశేఖర్ కతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement