wages
-
వలంటీర్లపై ముందడుగా, వెనకడుగా?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిత్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే అలోచనలో ఉందా లేదా అన్న అంశంపై మంగళవారం శాసన సభ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చ జరగనుంది. మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన పది ప్రశ్నల్లో ఈ అంశం మూడోది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి. విరూపాక్షి లేవనెత్తిన ఈ ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్బంగా సభలో జరిగే చర్చలో వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా.. వారి గౌరవ వేతనం పెంపు హామీని నిలబెట్టుకుంటారా అన్న విషయాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.త్రిశంకుస్వర్గంలో వలంటీర్ల వ్యవస్థప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జులై ఒకటి నుంచి చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను తప్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లు ప్రతి నెలా కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ల పంపిణీ ప్రధానమైనది. అటువంటి కార్యక్రమానికే దూరంగా పెట్టడంతో వలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్న విషయంపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదంటే ఇంకేమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే అనుమానాలతో రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ప్రస్తుతం అధికారికంగా విధుల్లో కొనసాగుతున్న పలువురు వలంటీర్లు నిరసన తెలియజేశారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీల్లో వేతన యాతన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి వారికి వేతనాల్లేవు. మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పదో తేదీలోపు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందేవి. కానీ ఏడాది కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 59వేల మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 59వేల మంది టీచర్లు, హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్వాడీ టీచర్కు నెలకు రూ.13650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా... హెల్పర్కు రూ.7800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం మంజూరు చేస్తోంది. ప్రతి నెలా జాప్యమే.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలో లేక ఇతరత్రా కారణాలతో వేతన చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ.. ప్రతి నెలా ఇదే పరిస్థితి తలెత్తుతుండడం పట్ల వారు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలకు ప్రతి నెలా రూ.70 కోట్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవవేతనానికి సంబంధించి ప్రతి నెలా సగటున రూ.70కోట్ల బడ్జెట్ అవసరం. ఈ లెక్కన ఏటా రూ.840 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. గత కొంత కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కమిషనరేట్కు ఫిర్యాదులు వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్కు వే ర్వేరుగా వినతి పత్రాలు సమరి్పంచింది. వేత న చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరింది. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
అంగన్వాడీలకు అడిగినవన్నీ..
సాక్షి, అమరావతి : బడుగు బలహీనవర్గాలకు మేలుచేసే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వాటిలో సేవలందిస్తున్న వర్కర్లు, ఆయాలపట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచీ సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఆ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు అంగన్వాడీలకు మెరుగైన జీతాలిచ్చింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే. చంద్రబాబు జమానాకంటే సీఎం జగన్ పాలనలోనే వీరి వేతనాలు పెరిగాయి. ఎలాగంటే.. 2014 నుంచి 2016 వరకు ఈ వర్కర్లకు కేవలం రూ.4,200 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిన చంద్రబాబు 2016లో కంటితుడుపు చర్యగా రూ.ఏడు వేలకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల మూడు నెలలపాటు అదే అరకొర జీతంతో సరిపెట్టారు. 2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్ ప్రకటించడంతో అప్పుడుగానీ చంద్రబాబుకు వారి జీతాలు గురించి గుర్తురాలేదు. దీంతో ఎన్నికలకు ఆర్నెల్ల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూర్తింగా జీవో ఇచ్చారు కానీ, అమలు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణా కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలు చొప్పున పెంచి అందిస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్వాడీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి నాలుగున్నరేళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది. నీతిఆయోగ్ ప్రశంసలు.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. అంతేకాదు.. అంగన్వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ అని నీతిఆయోగ్ ప్రశంసించింది. అంగన్వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ఆరవ స్థానంలోను, హెల్పర్ల వేతనాల్లో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే అంగన్వాడీలకు అసలైన మేలు జరిగింది. అత్యాధునికంగా అంగన్వాడీ కేంద్రాలు.. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ♦ నాడు–నేడు ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. వీటికి అవసరమైన వస్తువులు, స్టేషనరీకి 48,770 మెయిన్ కేంద్రాలకు రూ.500 చొప్పున.., 6,837 మినీ కేంద్రాలకు రూ.250 చొప్పున మొత్తం 55,607 కేంద్రాలకు రూ.7.81కోట్లు మంజూరు చేసింది. ♦ సొంత భవనాల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులకు 21,206 కేంద్రాలకు (ఒక్కొక్క దానికి రూ.3వేలు చొప్పున) మొత్తం రూ.6.36 కోట్లు విడుదల చేసింది. ♦ అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 16,575, పట్టణాల్లోని 6,705 అంగన్వాడీ కేంద్రాలకు రూ.66.54 కోట్ల అద్దె బకాయిలు చెల్లించింది. ♦ అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తోంది. అంగన్వాడీల మేలు కోరిన ప్రభుత్వం.. వేతనాల పెంపే కాదు.. అంగన్వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో ఆమోదించి అమలుచేస్తున్నారు. అంగన్వాడీల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా (ఈ నెల 20న) మరికొన్ని ఉత్తర్వులు జారీచేసింది. అవేమిటంటే.. ♦అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీఓఎంఎస్–44 జారీచేసింది. ♦ సెక్టార్, యూనిట్ సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు ఇవ్వాలన్న అంగన్వాడీల కోరికపై సానుకూలంగా స్పందించి మెమో నెంబర్.2303564/2023 జారీచేసింది. ♦ అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి టీఏ, డీఏలు చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ♦ వీటితోపాటు అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ♦ అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్టైం బెనిఫిట్ రూ.50 వేలను రూ.1 లక్షకు పెంచింది. ♦ సహాయకుల సర్విసు విరమణ తర్వాత వన్టైం బెనిఫిట్ రూ.20వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారం (ఆరు చీరలు చొప్పున) అందించేందుకు రూ.16 కోట్లను ఖర్చుచేసింది. వారి విధులు సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ఫోన్లు కొని, అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా ఏడాదికి రూ.12కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీల ద్వారా నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్వైజర్లను కూడా నియమించింది. ♦ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలోలా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్హోం రేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గింది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి పదోన్నతులు.. ఇక అంగన్వాడీలకు 2013 నుంచి పదోన్నతులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. మరోవైపు.. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసింది. ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వయో పరిమితి పెంపు చాలా ఉపయోగపడింది. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించింది. ఇక నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి కూడా వర్తింపజేయడం గమనార్హం. -
ఐడీ లేక.. వేతనం రాక..
సాక్షి, కామారెడ్డి: గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. జీతాల కోసం రాష్ట్రంలో 14,954 మంది వీఆర్ఏలు ఎదురు చూస్తున్న దుస్థితి నెల కొంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని భా వించిన గత సర్కారు.. మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తర్వాత వీఆర్ఏలను కూడా వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లు గా సర్దుబాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది గ్రామ సేవకులు (వీఆర్ఏ) ఉండగా వారిలో తొలి విడతలో 14,954 మందిని వివిధ శాఖల్లో స ర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా 2,451 మంది, మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లుగా 1,266 మంది, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మంది, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మంది, నీటి పా రుదల శాఖలో 5వేల మంది, మిషన్ భగీరథలో 3, 372 మందిని సర్దుబాటు చేశారు. మరికొన్ని శాఖ ల్లో మరో 72 మందిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక వృద్ధాప్యంతో ఉన్న వారు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో కొందరి ఉద్యోగా లు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 10న వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ పోస్టింగ్లు కూడా ఇచ్చారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో అక్కడే జాయిన్ కావాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో దూరమైనా సరే వెళ్లి ఉద్యోగాల్లో జాయిన్ అయి పని చేస్తున్నారు. ఇంకా ఎంప్లాయ్ ఐడీ జనరేట్ కాలేదు ఎంప్లాయ్ ఐడీ నమోదైన తర్వాతనే వారిని ప్రభు త్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి వేతనాల ప్రక్రియను మెదలుపెడతారు. వీఆర్ఏలను ఆయా ఉద్యోగాల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన గత ప్రభుత్వం వారికి ఐడీ ఇంకా ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఆ విషయం పక్కకు వెళ్లింది. ఫలితంగా నాలుగు నెలలుగా వేతనాలు అందక వీఆర్ఏలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదీలీలతో ఊరు కాని ఊరు వెళ్లిన తాము అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి వీఆర్ఏలుగా పనిచేస్తున్న మమ్మల్ని వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడంతో ఎంతో సంతోషించాం. అయితే మాకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ముదాం చిరంజీవి, వీఆర్ఏల సంఘం ప్రతినిధి, కామారెడ్డి -
వేతనాలు చెల్లించాలని ముగ్గురు కార్మికుల ఆత్మహత్యాయత్నం
ఎంజీఎం: వేతనాలు చెల్లించాలని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ముగ్గురు ఔట్సోర్సింగ్ కార్మికులు పురుగు మందు తాగారు. ఎంజీఎం ఆస్పత్రికి 20 నెలల కిందట 300 ఓసీఎస్ పద్దు కింద 35 పోస్టులు మంజూర య్యాయి. వీరిని ఔట్సోర్సింగ్ కింద తీసుకున్నారు. అయితే 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో 16 మంది కార్మికులు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం చు ట్టూ రెండు, మూడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. శుక్రవారం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో కార్మికులు చర్చలు జరిపి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో 300 ఓసీఎస్ పద్దులో కాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో కృష్ణ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్ప డంతో ఆవేదనకు గురై న కార్మికుల్లో ముగ్గురు ఆయన చాంబర్ ఎదుట పురుగు మందు తాగారు. వెంటనే సిబ్బంది వారిని చికి త్స నిమిత్తం ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. కాగా, ఈ ఘటనపై సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వీరి వేతనాల సమస్య సచివాలయంలో పెండింగ్ ఉందని తెలిపారు. బెదిరించే ధోరణిలో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. -
జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!
దేశీయ ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయం, ఖర్చులు లాంటి పలు సవాళ్లను ఎదుర్కొంటున్న పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురు కానుంది. ఈమేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం ఇన్ఫోసిస్, HCLTech ఈసారి పెంపును నిలిపివేసినట్టు సమాచారం. సాధారణంగా ఇన్ఫోసిస్ జీతాల పెంపును జూన్/జూలైలో ప్రకటించడం,అవి ఏప్రిల్ నుండి అమలు కావడం జరుగుతూ ఉంటుంది. అయితే హెచ్సిఎల్టెక్ మధ్య నుండి సీనియర్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను దాటవేసిందట.అలాగే జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. ఇన్ఫోసిస్ 023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తన వృద్ధి అంచనాను 4- 7శాతంనుంచి 1-3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) భిన్నంగా టీసీఎస్, విప్రో: ఉద్యోగులకు ఊరట అయితే మరో టెక్ దిగ్గజం విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మునుపటి సంవత్సరం సెప్టెంబర్తో పోల్చితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. టెక్ మహీంద్రా జూనియర్ , మిడ్-లెవల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను ఇచ్చింది. అయితే సీనియర్ల్లో పావు వంతు వాయిదా వేసింది. అటు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా గత ఏడాది మాదిరిగానే తన ఉద్యోగులకు ఊరటనిచ్చింది. వారికి 6-8శాతం వరకు సగటు పెంపును, అత్యుత్తమంగా పనిచేసిన వారికి రెండంకెల పెంపు ప్రకటించింది. టీసీఎస్తో పాటు మధ్యతరహా ఐటి సంస్థలైన కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎల్టిఐ మైండ్ట్రీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
జీతాల్లేవ్... రెన్యువల్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు. డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు. పెండింగ్.. పెండింగ్... ఈ ఏడాది ఏప్రిల్లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏటా ఇదే తంతు... వైద్య విధాన పరిషత్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాలు సమర్పించారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డ్ వేతనాలు నేడు
సింగరేణి (కొత్తగూడెం)/గోదావరిఖని: సింగ రేణి కార్మికులకు 11వ వేజ్బోర్డ్ ప్రకారం కొత్త వేతనాలను సంస్థ సోమవారం చెల్లించనుంది. కోల్ ఇండియా పరిధిలోని సింగరేణితో పాటు మరో 8 బొగ్గు పరిశ్రమలకు చెందిన సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు జూలై నుంచి కొత్త వేతనాలు అందించేందుకు సర్క్యులర్ విడుదల చేసింది. 10వ వేజ్బోర్డ్లో 1వ కేట గిరీ నుంచి ఏ1 గ్రేడ్ కార్మికులు, సూపర్వైజర్లు కలిపి సుమారు 42వేల మంది పనిచేస్తున్నా రు. వీరికి జూన్ వరకు నెలకు రూ.320 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా, 11వ వేతన సవరణలో అదనంగా రూ.70 కోట్ల మేర పెరి గాయి. గతంలో కేటగిరీ–1 కార్మికులకు రోజు కు రూ.1011.27 చెల్లించగా, ఇప్పుడు రూ.1502.66 చెల్లిస్తారు. ఏ1 గ్రేడ్, సూపర్ వైజర్లకు వేతనం గతంలో రూ.47,802.52 ఉండగా, 11వ వేజ్బోర్డు అమలుతో రూ.71, 030.56కు పెరిగింది. ఇంకా వీటికి అలవెన్స్లు అదనంగా లభిస్తాయి. బకాయి వేతనాలు విడుదల.. 10వ వేజ్బోర్డ్ కాల పరిమితి 2021 జూన్ 30 తో ముగిసింది. అంటే 2021 జూలై 1 నుంచి 11వ వేజ్బోర్డు అమలు కానుంది. ఈ నేపథ్యంలో 23 నెలల బకాయిలు కూడా కార్మికుల ఖా తాల్లో జమ కానున్నాయి. 11వ వేజ్బోర్డ్లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీ బీ) జీతం పెరుగుదలతోపాటు 25 శాతం అల వెన్స్లు కలిపి ఒకొక్క కార్మికుడికి వారి వేతన స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉంది. -
AP: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే.. ♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది. ♦ ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది. ♦ 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది. ♦ అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది. ..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది. -
ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్.. కానీ జీతాల్లేవ్!
కోరుట్ల: పేరుకి ప్రభుత్వోద్యోగమే అయినా ఆర్నెల్లుగా నయాపైసా జీతం లేక అల్లాడిపోతున్నారు కొత్త మండలాల్లోని రెవిన్యూ ఉద్యోగులు. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 97 జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత తహసీల్దార్ కార్యాలయాలకు రూపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని వివిధ మండలాల్లో పనిచేసే సిబ్బందికి వాటిలో పోస్టింగ్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. కొత్త మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల మంజూరు కోసం సీసీఎల్ఏ నుంచి ’క్యాడర్ స్ట్రెంత్’సర్కులర్ జారీచేయాల్సి ఉంటుంది. ఈ జీవో జారీ ఆరు నెలలుగా జాప్యమవుతోంది. దీంతో సిబ్బందికి వేతనాలు అందడంలేదు. ♦ 13 మండలాలు.. 240 మంది సిబ్బంది.. ♦ కొత్త మండలాల జీవో జారీ కాగానే తహసీల్దార్ కార్యాయాలు ఏర్పాటు చేశారు. ♦ నిబంధనల ప్రకారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు(ఆర్ఐలు), ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, అటెండర్, చైన్మన్తోపాటు గ్రామాల సంఖ్యను బట్టి 15–25 మంది వీఆర్ఏలను నియమించారు. ♦ జీవో 97 ప్రకారం ఇతర మండలాల్లోని సిబ్బందిని కొత్త మండలాల్లో నియమిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ♦ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 13 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు 240 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఆర్నెల్లుగా అరిగోస.. విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు జీతాలు రాకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ జీవో జారీకోసం కొందరు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు మొరపెడుతూ లేఖలు రాసినా పట్టించుకునే వారులేరు. జీవో జారీ కాకపోవడంతో ఉద్యోగుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, వేతనాల విడుదల వంటి అంశాల వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆరు నెలలుగా జీతాలు లేక కొత్త మండలాల్లో పనిచేస్తున్న సుమారు 240 మంది రెవెన్యూ ఉద్యోగులు నానాతిప్పలు పడుతున్నారు. ఏమిటీ క్యాడర్ స్ట్రెంత్? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాల ప్రకారం ఉండాల్సిన సిబ్బంది, వేతన వివరాలు, ఆర్థికపరమైన అనుమతులను రెవెన్యూ పరిభాషలో క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ జీవో విడుదల అయితేనే కొత్త మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వేతనాలు నేరుగా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవోను సీసీఎల్ఏ జారీ చేయాల్సి ఉంటుంది. -
ప్రకృతి వనం.. కొరవడిన పచ్చదనం.. జీతాలు ఇయ్యకపాయే! ఎట్లా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పలు జిల్లాల్లో గ్రామపంచాయతీల సిబ్బందికి రెండు నుంచి నాలుగు నెలల వేతనాలు రాకపోవడంతో మొక్కల సంరక్షణపై దృష్టి సారించడం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీటి వసతిలేదు. కొన్నిచోట్ల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. వీటికి వేసవి తోడు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. 12,769 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు ఏటా నిర్వహించే హరితహారంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెవాసులకు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచేందుకు పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటారు. అక్కడ సేద తీరేందుకు వీలుగా బెంచీలు కూడా ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం కింద గత రెండేళ్లు వీటి నిర్వహణ బాగానే సాగింది. నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటడం, నీటి వసతి, వన సేవకులకు వేతనం అంతా ఈ పథకం ద్వారా చెల్లించడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీ (జీపీ)లకు అప్పగించడంతో పరిస్థితి మారింది. పలు జిల్లాల్లో పూర్తిగా ఎండిపోయి.. ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ చూసుకునే బాధ్యత గ్రామపంచాయతీ వర్కర్లకు అప్పగించారు. అయితే వీరికి రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వీరు బాధ్యతలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల వనాల్లో బోర్లు లేక కూడా మొక్కలు ఎండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీల ట్యాంకర్లతో నీళ్లు పట్టినా.. ట్యాంకర్ల నిర్వహణ జీపీలకు పెనుభారమైన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతివనాలు ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. మోడువారిన లక్ష్మీపురం వనం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడెం జీపీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పల్లె ప్రకృతి వనం. 2020–21లో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద ఎకరం విస్తీర్ణంలో 913 మొక్కలు నాటారు. రెండేళ్లపాటు నిర్వహణ ఈజీఎస్ చూడటంతో వర్కర్లకు వేతనం అందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత క్రమంగా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక్కడ నీరందించేందుకు బోరు వేసినా మోటారు బిగించలేదు. అసలే ఎదగలేదు.. ఆపై నీరందక.. ఇది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ప్రస్తుతం విపరీతమైన ఎండలతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూమికి బదులుగా చౌడు భూమిలో మొక్కలు నాటారు. దీంతో మొక్కలు మామూలుగానే సరిగా ఎదగలేదు. ప్రస్తుతం వేసవి తాపానికి తోడు తగిన నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి. మూడు నెలల డబ్బులు రావాలి.. ప్రకృతి వనంలో మొక్కలను కాపాడేందుకు ఎండనక, వాననక కష్టపడ్డా. నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలల వేతనం రాలేదు. అధికారులను అడిగితే వస్తుందనే సమాధానం తప్ప బ్యాంకులో జమ అయిందే లేదు. –పార్నంది గౌరమ్మ, శివునిపల్లి, స్టేషన్ఘన్పూర్, జనగామ జిల్లా నెల నెలా ఎదురుచూపులే.. వన సేవకుడిగా పనిచేస్తున్నా. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఈనెల వస్తాయంటూ ఎదురుచూస్తున్నా. చేసిన పనికి ప్రతినెలా డబ్బులిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. – బోసి ధర్మయ్య, బజార్ కొత్తూర్, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా జీతాలు లేక.. పనికి రాక నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని అమ్రాద్ తండాలో నాలుగైదు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికులు పనికి రావడం మానేశారు. ఇక నీళ్ల ట్యాంకర్కు అవసరమైన డీజిల్ డబ్బు కూడా లేకపోవడంతో వనంలో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. అన్నిచోట్లా వేతనాల సమస్యే.. ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 42 మండలాల్లో 1,070 జీపీలు ఉండగా, 3,851 మంది మల్టీ పర్పస్ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సంబంధించి రూ.2 కోట్ల వరకు వేతనాలు అందాల్సి ఉంది. ఈ జిల్లాలో 2,088 వనాలు ఏర్పాటు చేయగా, చాలా చోట్ల బోర్లు వేయకపోవడం, ట్యాంకర్లపైనే ఆధారపడి నీళ్లు పోయాల్సి రావడంతో వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయి. ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,509 జీపీలకు గాను 3,406 వనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న 4,924 మంది వర్కర్లకు 2 నుంచి 4 నెలల వరకు వేతనాలు రూ.10.11 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రూ.6 కోట్ల వేతనాలు అందాలి. ఈ క్రమంలో వేసవిలో నీరు అందకపోవడంతో అధికారుల దృష్టికి వచ్చిన చోట ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినా మిగతా చోట్ల వనాలు ఎండిపోయాయి. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,056 జీపీలకు గాను 1,338 వనాలు ఉన్నాయి. నిధులు లేక వారానికోసారి నీరు పడుతున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా వదిలేశారు. ఐదారు నెలలుగా డబ్బు అందక పోవడంతో వన సేవలు పని మానేశారు. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 963 గ్రామ పంచాయతీలు ఉండగా 965 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నీరు లేక ఇప్పటికే 92 వనాలు ఎండిపోయే స్థితికి చేరాయి. మొత్తం 3,998 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ♦ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్లో రెండు నెలల నుంచి, వనపర్తి, గద్వాల, నారాయణ్పేట జిల్లాల్లో 4 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మొత్తంగా 5,786 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు సంబంధించి సుమారు రూ.13 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 నెలలుగా 5,666 మంది వర్కర్లకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో వారు ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. -
ఏపీలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ వేతనాలు.. కేంద్ర వెల్లడి
సాక్షి,అమరావతి: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆశా వర్కర్లకు అత్యధిక ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఏపీ ఇస్తున్నట్లుగా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఆశా వర్కర్లకు నెలకు రూ. పది వేల ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం లేదని ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహక మొత్తాలను ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణలో నెలకు రూ. 7,500లు ప్రోత్సాహకం అందుతోందని, ఆ తరువాత కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో రూ.6 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని కేంద్రం పేర్కొంది. కమ్యూనిటీ హెల్త్ వలంటీర్లుగా భావించే ఆశా వర్కర్లకు నెలకు రూ. 2 వేలు చొప్పున కేంద్రం ప్రోత్సాహకంగా ఇస్తోందని, అలాగే జాతీయ స్థాయి ఆరోగ్య కార్యకలాపాలు పనితీరు ఆధారంగా కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ప్రణాళికలు అమలు ఆధారంగా ద్రవ్య ప్రోత్సాహకాలు అందించే సౌలభ్యం కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ. 2 వేలకు అదనంగా మరో రూ. 2 వేలు కలిపి నెలకు రూ. 4 వేలు ఇచ్చేది. అది కూడా ఆరు నెలలైనా ఇవ్వని పరిస్థితులు ఉండేవి. వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో ఆశా వర్కర్ల వినతులను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019, ఆగస్టు 17న ఆశా వర్కర్ల వేతనాలను నెలకు రూ. 10,000లకు పెంచుతూ జీవో ఎంఎస్ నం.87 జారీ చేయించారు. దీంతో రాష్ట్రంలోని 43,767 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు నెలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇలా.. -
వేతనం రాక.. వెతలు తీరక
బీబీపేట: నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిన ఓ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో ఆయన భార్య బిడ్డకు జన్మనివ్వనుండగా... ఈలోపే తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట పంచాయతీలో ఆదివా రం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. బీబీపేట గ్రామ పంచాయ తీలో వాటర్మన్గా పని చేస్తోన్న కొంగరి బాబు(32)కు 4 నెలలుగా వేతనం రావ డం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యకు ప్రసవ సమయం సమీపిస్తుండటం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనోవేద నకు గురై న బాబు.. ఆదివారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, కుటుంబ సభ్యు లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. సర్పంచ్తో పాటు పాలకవర్గం సభ్యులు, ప్రజాప్రతి నిధులు అక్కడకు చేరుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి అదే ఉద్యోగాన్ని ఇస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య దేవలక్ష్మి, కుమారుడు భరత్, కూతురు మేఘన ఉన్నారు. దేవలక్ష్మి పురిటి కోసం ముంబయిలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కావడం లేదని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీ నిధులలోంచి రెండు నెలల వేతనాన్ని ఇచ్చామని సర్పంచ్ లక్ష్మి తెలిపారు. -
వేతనజీవులు.. ఆంధ్రాలో అధికం
సాక్షి, అమరావతి: దేశసగటు కన్నా రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాలశాఖ నిర్వహించిన 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది. వేతన మహిళలు దేశంలో సగటున 16.5 శాతం ఉండగా, రాష్ట్రంలో 17.2 శాతం ఉన్నారు. వేతన పురుషులు దేశంలో సగటున 23.6 శాతం ఉండగా, రాష్ట్రంలో 27.6 శాతం ఉన్నారు. రాష్ట్రంలో పట్టణాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా వేతనాలపై జీవిస్తున్నారు. పట్టణాల్లో 48.8శాతం వేతన పురుషులుండగా, 47.8శాతం వేతన మహిళలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో 15.7 శాతం వేతన పురుషులు ఉండగా, 9.7శాతం వేతన మహిళలున్నారు. కోవిడ్ ప్రభావం నేపథ్యంలో లేబర్ ఫోర్స్ సర్వేలో జాప్యం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేతన పురుషులు, మహిళలు, స్వయం ఉపాధిపై ఆధారపడినవారు, సాధారణ కూలీల శాతంపై సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 44 శాతం పురుషులు, 42.4 శాతం మహిళలు స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ కూలీలుగా 40.4 శాతం మహిళలు, 28.4 శాతం పురుషులు ఉపాధి పొందుతున్నారు. ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన మహిళలు అత్యధికం ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన పురుషుల కన్నా వేతన మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో వేతన మహిళలు 83 శాతం కాగా వేతన పురుషులు 63.3 శాతమే. చండీగఢ్లో వేతన మహిళలు 67.7 శాతం కాగా వేతన పురుషులు 61.5 శాతం, కేరళలో వేతన మహిళలు 37.3 శాతం, వేతన పురుషులు 27.5 శాతం ఉన్నారు. బిహార్లో అత్యల్పంగా వేతన పురుషులు 9.9 శాతం ఉండగా వేతన మహిళలు 10.7 శాతం ఉన్నారు. వేతన మహిళల్లో జార్ఖండ్లో అత్యల్పంగా 6.3 శాతం, ఆ తరువాత మధ్యప్రదేశ్లో 7.7 శాతం, రాజస్థాన్లో 7.6 శాతం, ఉత్తరప్రదేశ్లో 6.7 శాతం ఉన్నారు. -
పాక్లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక కష్టాలతో షహబాజ్ షరీఫ్ సర్కారు అతలాకుతలమవుతోంది. ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది వేతనాలు సహా అన్ని బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. తదుపరి ఉత్తర్వుల దాకా శాఖలు, డివిజన్లు అనుబంధ విభాగాల బిల్లులను క్లియర్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైన మందులు కూడా దొరక్క రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నాయి! -
దారుణం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు భీమా నదిలో శవమై కనిపించారు. మృతులు మోహన్ పవార్(45), అతని భార్య సంగీతా మోహన్(40), అతని కుమార్తె రాణి ఫుల్వేర్(24), అల్లుడు శ్యామ్ ఫుల్వేర్(28) వారి ముగ్గురు పిల్లలు(సుమారు 3 నుంచి 7 ఏళ్ల మధ్య)గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన జనవరి 18 నుంచి 24 మధ్య పూణేలో దువాండ్ తహసిల్లోని పర్గావ్ వంతెన వద్ద జరిగిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు మృతుడు మోహాన వార్ బంధువులైన అశోక్ కళ్యాణ్ పవార్, శ్యామ్ కల్యాణ్ పవార్, శంకర్ కల్యాణ్ పవార్, ప్రకాశ్ కల్యాణ్ పవార్, కాంతాబాయి సర్జేరావ్ జాదవ్ అనే ఐదుగురిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో మృతులంతా హత్యకు గురైనట్లు తేలిందిని చెప్పారు పోలీసులు. ఐతే సదరు నిందితుడు అశోక్ పవార్ కుమారుడు ధనుంజయ్ పవార్ కొన్న నెలలు క్రితం ప్రమాదంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిన కేసు పుణె నగరంలో నమోదైనట్లు చెప్పారు. ఐతే ధనుంజయ్ మరణానికి మోహన్ కారణమని దర్యాప్తులో తేలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో వారందర్నీ కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్మార్టంలో మృతులంతా నీట మునిగి చనిపోయినట్లు నివేదిక పేర్కొందని చెప్పారు. మృతులంతా ఉస్మానాబాద్ జిల్లాలోని మరఠ్వాడాలోని బీడ్ ప్రాంతానికి చెందిన వారని, వారంతా కూలీ పనులు చేసుకునేవారని తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో కోత
సికింద్రాబాద్ జోన్లోని అయిదు సర్కిళ్లలో 3,228 మంది కార్మికులున్నారు. వీరిలో 1,683 మంది వేతనాల్లో కోత విధించారు. అంటే దాదాపు సగం మందికి జీతాల్లో కోత పడింది. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70 శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు రూ. 14వేల పైచిలుకు వేతనానికి రూ.1500 నుంచి రూ.8000 వరకు వేతనాల్లో కోత పడింది. నగరాన్ని పరిశుభ్రం చేసే 20వేల మందికి పైగా బల్దియా పారిశుద్ధ్య కార్మికుల కన్నీటి వెతలకు ఇది ఓ ఉదాహరణ. బయోమెట్రిక్ మెషిన్లలో సాంకేతిక లోపాలున్నా, సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకున్నా దానిపై చర్యలు తీసుకోవడం మానిన అధికార యంత్రాంగం కార్మికుల కడుపు కొట్టింది. జీహెచ్ఎంసీలో దాదాపు నాలుగైదేళ్లుగా బయోమెట్రిక్ హాజరు నిర్వహిస్తున్నారు. మెషిన్లు పనిచేయని సందర్బాల్లో మాన్యువల్ హాజరు నమోదు చేసి వేతనాలిచ్చేవారు. మార్చి– ఏప్రిల్ నెలల్లో బయోమెట్రిక్ హాజరున్న రోజులకు మాత్రమే వేతనాలిచ్చారు. సమయంలో తేడా వచ్చినా కోత విధించారు. పారిశుద్ధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని దీన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అమలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విషయం కార్మికులకు ముందస్తుగా తెలియజేయలేదు. ఉదయం 5 నుంచి 6 గంటల లోపున హాజరైన వారికి హాజరు నమోదుచేయాల్సి ఉండగా, 5.30 గంటలు దాటితే వేయడం లేదని కొందరు కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్, యాకుత్పురా, గచ్చిబౌలి, వెంగళ్రావునగర్, అంబర్పేట సాంకేతిక సమస్యలు పరిష్కరించేదెవరు? బయోమెట్రిక్ హాజరు నమోదుకు వేల రూపాయల వ్యయమయ్యే మెషిన్లను కొనుగోలు చేయకుండా జీహెచ్ఎంసీ ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టుకిచ్చి దానికి లక్షల రూపాయలు చెల్లిస్తోంది. సాంకేతిక లోపాలు తలెత్తినా, మెషిన్లు సక్రమంగా పనిచేయకున్నా ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉండగా ఆ పనిచేయడం లేదు. కార్మికుల హాజరు నమోదు చేసే గ్రూప్లోని లీడర్(ఎస్ఎఫ్ఏ) సొంత జేబులోంచి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు.బయోమెట్రిక్ మెషిన్లను సరిగ్గా వినియోగించడం రానందున కూడా ఆబ్సెంట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం .. తలా పిడికెడు ► ఎస్ఎఫ్ఏలకు పైస్థాయిలోని వైద్యాధికారులు, ఇతరత్రా అధికారులకు నడుమ ఉండే అవినాభావ సంబంధాలు సైతం అక్రమాలకు దారి చూపుతున్నాయి. ఫంక్షన్లు చేసినప్పుడు టీలు, బిస్కెట్లు, పూలదండలు, శాలువాల నుంచి ఇతరత్రా వన్నీ తెమ్మని అధికారులు ఎస్ఎఫ్ఏలను పురమాయిస్తారు. వారి ఈ వైఖరి తెలిసిన ఎస్ఎఫ్ఏలు సైతం సమయానికి కార్మికులు రాకున్నా, అసలు రాకున్నా బయోమెట్రిక్ పనిచేయడం లేదని హాజరు నమోదు చేస్తారు. ఆ మేరకు కార్మికుల వేతనాల్లో వాటాలు పొందుతారు. ► దీన్ని ఆసరా చేసుకొని చాలామంది విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నారని తెలుస్తోంది. అలాంటి వారిలో ఎస్ఎఫ్ఏల కుటుంబసభ్యులు సైతం ఉంటారు. దీన్ని సక్రమంగా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అందరినీ ఒకేగాటన కట్టి ఇష్టానుసారం వేతనాల్లో కోత విధించడంపై కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల్లో కోతలపై వివరణ కోసం సంబంధిత అడిషనల్ కమిషనర్కు ఫోన్ చేసినా స్పందన లేదు. పనిచేసిన వారికి వేతనాలివ్వాలని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సంబంధిత అడిషనల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. (క్లిక్: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?) బయోమెట్రిక్ ఓ చీటింగ్ బయోమెట్రిక్లో లోపాలున్నాయని అధికారులు అబద్ధాలు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. అంతా చీటింగ్ నడుస్తుందని అనుమానంగా ఉంది. మూడు రోజులో, నాలుగు రోజులో మెషిన్ పని చేయకుంటే.. ఆలస్యమైతే అన్ని రోజులకు మాత్రమే వేతనాల్లో కోత విధించాలి. కానీ, వేలకు వేలు ఎలా? పూర్తిస్థాయిలో విచారణ జరిపి మా జీతం మొత్తం తిరిగి ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – చెన్నమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు చర్యలు తీసుకుంటాం.. బయోమెట్రిక్ మెషిన్లలో లోపాల కారణంగా జీతాల్లో కోత పడింది. విధులకు హాజరైనప్పటికీ వేతనాలందని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.వి. శివప్రసాద్ మలక్పేట్ సర్కిల్ ఏఎంహెచ్ఓ -
RBI Report: శ్రమజీవికి సంతోషం.. ఏపీలో కూలీల వేతనాలు పెరుగుదల..
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీల వేతనాలు కేరళలో అత్యధికంగా ఉంటే అత్యల్పంగా గుజరాత్లో ఉండటం గమనార్హం. చదవండి: ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఇక రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది. -
నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!
ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్-పూర్ డాడ్ పుస్తకంలో చెప్పినట్లే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఉంది. దేశంలో సుమారు 80 శాతం మంది వైట్కాలర్ ఉద్యోగుల జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయని ఓ సర్వేలో తేలింది. వీరిలో దాదాపు మూడోవంతు మంది జీతాలు నెలలో సగం రోజులు గడవకుండానే ఖర్చవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కన్సల్టింగ్ సంస్థ ఈవై, స్టార్టప్ రిఫైన్లు కలిసి సంయుక్తంగా ఎర్న్డ్వేజ్ యాక్సెస్ మోడల్(ఒక రకంగా రోజువారీ జీతం విధానం) (EWA)పై సర్వే నిర్వహించారు. ‘ఎర్న్డ్ వేజ్ యాక్సెస్ ఇన్ ఇండియా: ద ఫైనల్ ఫ్రంటియర్ ఆఫ్ ఎంప్లాయి వెల్బీయింగ్’ పేరిట ఈ నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఉద్యోగుల జీవన వ్యయం నిరంతరం పెరగడం, జీవనశైలి భయాలు, పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఈఎమ్ఐ ఖర్చులు వంటి కారణాలతో ఉద్యోగులు జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయి. జూలై-ఆగస్టు 2021లో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న భారతదేశంలోని 3,010 వేతన ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నివేదికను తయారు చేశారు. నెల ప్రారంభంలోనే 14 శాతం మంది, నెల మధ్యలో 20 శాతం, నెలాఖరునాటికి 47 శాతం వారి పూర్తిగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఈ ఈడబ్ల్యూఏ సర్వే ప్రకారం కేవలం 38 శాతం మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని, వారి ఆర్థికస్థితి అదుపులో ఉన్నట్లు ఈ అధ్యయనం హైలైట్ చేసింది. (చదవండి: విమానం ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..!) ఐటీ ఉద్యోగుల చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం తక్కువ ఆదాయం గల వారికి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే, నెలకు రూ.1,00,000 కంటే ఎక్కువ సంపాదించే వారిలో 59 శాతం మంది తమ జీతాలు నెలాఖరులోగా ఖర్చు అయిపోతున్నాయి.59 శాతం మందికి జీతాలు వచ్చే సమయానికి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. వీరికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడినట్లు తేలింది. వీరు ఒక మార్కెట్ చక్రంలో ఇరుకున్నారు. వాస్తవానికి భారత్లో అత్యధిక వేతనాలు పొందే ఐటీ సెక్టార్లోని ఉద్యోగుల జీతాలను విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలాఖరులో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. ఇక ఈడబ్ల్యూఏ విధానంలో జీతాలు తీసుకోవడానికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపగా.. మిగిలిన వారు మరింత తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ సరికొత్త మోడల్లో మీరు సంపాదిస్తున్న సమయంలో ఎప్పుడైనా జీతాలను డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా పశ్చిమ దేశాల్లో దీనిని అనుసరిస్తున్నారు. 14 రోజులకు ఒకసారి యుకెజి ఇండియా, రెఫిన్ వంటి సంస్థలు పాశ్చాత్య దేశాలు స్వీకరించిన నమూనాను భారతదేశంలో పరీక్షిస్తున్నాయి. ఇంకా అనేక ఇతర సంస్థలు ప్రతి 14 రోజులకు ఒకసారి జీతాలను ఉద్యోగులకు చెల్లించేందుకు సిద్దం ఆవుతున్నాయి. ఎఫ్ఎంసిజి, తయారీ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రిటైల్, రెస్టారెంట్లు, లాజిస్టిక్స్, పర్యాటకం, రవాణా వంటి రంగాలలో ఈడబ్ల్యుఏ విధానాన్ని అనుసరిస్తున్నాయని తేలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఐటీ, టెలికమ్యూనికేషన్లు కంపెనీలు ఈడబ్ల్యుఏ విధానాన్ని దేశంలో అమలచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరి ఇంతగా ఉందా...!) -
'బయోమెట్రిక్' ఆధారంగానే వేతనాలు
సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వ, లేదా ప్రైవేట్ సంస్థ ఉద్యోగైనా సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకుండా జీతం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. జీతం రావాలంటే సెలవు అయినా పెట్టాలి లేదా కార్యాలయానికైనా రావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదే అమలుచేస్తున్నారు. వారికి గతంలోనే బయోమెట్రిక్ హాజరుతో వేతనాలను అనుసంధానం చేశారు. అయితే, కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆ విధానానికి సడలింపు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించారు. అదే తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పునరుద్ధరించారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే అక్టోబర్ నెల వేతనాలిస్తాం’.. అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతులు, కార్యదర్శులకు ఇదే విధానంలో హాజరును అమలుచేస్తున్నారని.. ప్రభుత్వోద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దీనిని అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత పెడతారని.. ఇందులో తప్పేమీ లేదన్నారు. వారికి సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం కానీ.. విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టకుండా వేతనాలివ్వాలంటే సాధ్యంకాదని జైన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మొత్తం పనిదినాలు.. విధులకు హాజరైన రోజులు, ప్రభుత్వ సెలవులు పరిగణనలోకి తీసుకున్న తరువాత సిబ్బంది విధులకు గైర్హాజరైతేనే ఆ రోజులకు వేతనాల్లో కోత విధించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబర్ వేతనాలను నవంబర్ 1న చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టంచేసింది. హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్, లాగిన్ను అందుబాటులోకి తెచ్చారు. శిక్షణలో ఉన్నా, బయోమెట్రిక్ పనిచేయకపోయినా, విధుల్లో భాగంగా సమావేశాలకు వెళ్లినా, డిప్యుటేషన్పై ఇతర శాఖలకు వెళ్లినా హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. అలాగే, సిబ్బంది రోజువారీ హాజరును తనిఖీ చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వెబ్సైట్లో హాజరు డ్యాష్బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, పాత మునిసిపల్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాల్సిందిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. డ్యాష్బోర్డు హాజరులో సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో సీఎల్, ఐచ్ఛిక సెలవులే ఉన్నందున ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆధికారులు అప్లోడ్ చేసి ట్రెజరీలకు సమర్పించాల్సిందిగా అజయ్జైన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సజావుగా అమలయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాల జేసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఎస్సీ, ఎస్టీ ఉపాధి కూలీలకు వేరుగా వేతనాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. వీరిని ఎస్సీ, ఎస్టీ, ఇతర తరగతుల వారీగా విభజించి, వారు చేసిన పనికి ఎప్పటికప్పుడు వేతనాలను వేర్వేరుగా విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒకేరోజు.. ఓ గ్రూపులో ఉంటూ, ఒకే పనిచేసిన కూలీలందరికీ ఒకేసారి కాకుండా ఎస్సీ కూలీలకు ఒకసారి, ఎస్టీ సామాజికవర్గం వారికి మరోసారి, ఇతరులకు ఇంకో విడతలో కూలీ డబ్బులు విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఇతరుల వారీగా పే ఆర్డర్లను తయారుచేసి కేంద్రానికి పంపుతున్నాయి. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ ఉత్తర్వులు పేదల మధ్య చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, అధ్యక్షులు దడాల సుబ్బారావులు ఓ ప్రకటనలో తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుని పాత పద్ధతిలోనే అందరికీ ఒకేసారి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సంఘం ప్రతినిధులు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు. చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస ‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’ -
దేశీ ఫార్మా పరుగు షురూ!
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా రంగం ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. ఈ రంగంలో మెరుగుపడుతున్న పరిస్థితులను కంపెనీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కరోనా నియంత్రణకు దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఫార్మా రంగం షేర్లు 40 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ అయితే మల్టీబ్యాగర్లుగానూ (రెట్టింపునకు పైగా పెరగడం) మారాయి. 2015లో ఫార్మా షేర్ల ర్యాలీ తర్వాత అవి క్రమంగా ఇన్వెస్టర్ల నిరాదరణకు గురయ్యాయి. దాంతో ఏవో కొన్నింటిని మినహాయిస్తే మెజారిటీ ఫార్మా స్టాక్స్ వాటి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. కానీ, కరోనా రాకతో మార్కెట్ పరిస్థితులు ఫార్మాకు మళ్లీ అనుకూలంగా మారాయి. కంపెనీల మూలాలు కూడా బలపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు తగ్గడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి ఔషధ అనుమతులు పెరగడం దేశీయ కంపెనీలకు కలిసొచ్చాయి. ఫార్మా రంగం ఇక ముందూ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ఎఫ్డీఏ అనుమతులు... ఫార్మా కంపెనీలు ఉత్తమ తయారీ విధానాలను పాటించడం, దిద్దుబాటు చర్యల ద్వారా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నిబంధనల అమలు విషయంలో మెరుగుపడ్డాయి. మరోవైపు కరోనా మహమ్మారి కూడా యూఎస్ఎఫ్డీఏ వైఖరిలో మార్పునకు దారితీసింది. ఏప్రిల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే భారత ఫార్మా కంపెనీలకు చెందిన నాలుగు తయారీ కేంద్రాలకు యూఎస్ఎఫ్డీఏ వేగంగా అనుమతులు జారీ చేయడం ఈ కోణంలోనే చూడాలి. అమెరికా మార్కెట్లో దేశీయ కంపెనీలకు బలమైన వాటాయే ఉంది. కాకపోతే యూఎస్ఎఫ్డీఏ అభ్యంతరాలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక ముందూ యూఎస్ఎఫ్డీఏ భారత ఫార్మా కంపెనీల యూనిట్లకు అనుమతుల జారీ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తుందన్న అంచనాలు ఈ కంపెనీలకు అనుకూలమే. రుణ భారం తగ్గింపు... అనేక కారణాలతో ఫార్మా కంపెనీలకు రుణ భారం సమస్యగా మారిపోయింది. లాభసాటి కాని జపాన్, దక్షిణ అమెరికా మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కొన్ని ఫార్మా కంపెనీలు చేతులు కాల్చుకున్నాయి. వీటికితోడు అమెరికా మార్కెట్లో జనరిక్ ఔషధాల ధరల ఒత్తిళ్లు, నిబంధనల అమలు విషయంలో యూఎస్ఎఫ్డీఏ మరీ కఠిన వైఖరి అనుసరించడంతో కంపెనీలకు రుణ భారం దించుకునే అవకాశం లభించలేదు. కానీ, గత కొంత కాలంగా కంపెనీలు తమ బ్యాలన్స్ షీట్ల బలోపేతంపై దృష్టి పెట్టాయి. అరబిందో ఫార్మా బిలియన్ డాలర్లతో అమెరికాలోని శాండోజ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఇందులో భాగమే. 2022 నాటికి రుణ రహిత కంపెనీగా మారాలన్నది అరబిందో ప్రణాళిక. వ్యయ నియంత్రణలు: అమెరికా వంటి కీలక మార్కెట్లలో ధరలకు సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో కంపెనీలకు మరో మార్గం లేక తమ వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. క్షేత్రస్థాయి సిబ్బందిలో కోత, పరిశోధన, అభివృద్ధి బడ్జెట్ తగ్గించుకోవడం తదితర చర్యల ద్వారా ఔషధ తయారీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉండే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక విధానాలు భారత ఫార్మా కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకుంటున్నాయి. లుపిన్ జపాన్ మార్కెట్ నుంచి తప్పుకోగా, డాక్టర్ రెడ్డీస్ తన యూఎస్ స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాన్ని తగ్గించుకుంది. యూనికెమ్ ల్యాబ్, వోకార్డ్ తమ ఔషధ పోర్ట్ఫోలియోను విక్రయించాయి. డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, గ్లెన్మార్క్ ముఖ్యమైన విభాగాల్లో విదేశీ నిపుణులను నియమించుకున్నాయి. వేల్యూషన్లు తక్కువగానే.. నిబంధనల అమలు, పరిపాలనా, న్యాయ పరమైన వివాదాల సమస్యలు ఫార్మా కంపెనీలను ఇంకా వీడలేదు. అయితే, ఫార్మా స్టాక్స్ ప్రస్తుత ధరలు ఈ అంశాలన్నింటినీ సర్దుబాటు చేసుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సన్ఫార్మా, లుపిన్, గ్లెన్మార్క్ స్టాక్స్ వాటి 2015 గరిష్ట ధరల నుంచి చూస్తే ఇప్పటికీ 50% పైనే తక్కువలో ట్రేడవుతున్నాయనేది నిపుణుల మాట. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అరబిందో ఫార్మా, టోరెంట్ ఫార్మా, క్యాడిలా 2015 గరిష్ట స్థాయిలకు చేరువలో 10–15% తక్కువకు ట్రేడవుతున్నాయి. -
ఉద్యోగం ఒక చోట.. జీతం మరోచోట
ఆదోని: విద్యుత్ సంస్థ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఓ డిప్యుటేషన్ అంశం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పని ఒత్తిడి లేని చోట నుంచి పని ఒత్తిడి ఉన్న ప్రాంతానికి ఉన్నత స్థాయి అధికారులు.. సిబ్బందిని సర్దుబాటు(సర్దుబాటు) చేస్తుంటారు. అయితే ఆదోని విదుŠయ్త్ సంస్థలో మాత్రం విచిత్రం చోటుచేసుకుంది. డి–2 సె„ýక్షన్లో పని చేస్తున్న లైన్ఇన్స్పెక్టర్ను ఎమ్మిగనూరుకు డిప్యుటేషన్పై పంపిన అధికారులు ఆయన స్థానంలో పత్తికొండ లైన్ ఇన్స్పెక్టర్ను డిప్యుటేషన్ వేశారు. దీంతో పత్తికొండ మండలం లైన్ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీ అయింది. ఎమ్మిగనూరులో పని భారం ఉందనుకుంటే పత్తికొండ లైన్ఇన్సెక్టర్ను నేరుగా అక్కడికి పంపొచ్చు. కానీ ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు.. పత్తికొండ నుంచి ఆదోనికి.. ఎవరి కోసం ఇలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు లైన్ ఇన్స్పెక్టర్లు 2018 నుంచి జీతాలు ఒక చోట తీసుకోని మరోచోట సేవలు అందిస్తున్నా రు. నిబంధనల మేరకు ఆరు నెలల దాటితే డిప్యుటేషన్ను ఉన్నతాధికారుల అనుమతితో పొడిగించాలి. ఈ ఇద్దరు ఉద్యోగులు నాలుగేళ్లుగా ఎలా కొనసాగుతున్నారోనని, వా రికి సహకరిస్తున్నదెవరోననే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్ల వెనుక ఏం జరిగిందో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఎన్టీయూసీ డివిజన్ కార్యదర్శి జయన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై డిప్యూటీ ఈఈ పురుషోత్తంను వివరణ కోరగా.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని చెప్పారు. విచారించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.