నగరంలో రోడ్డు నిర్మాణ పనుల నిలిపివేత
ఆర్అండ్బీ, కాంట్రాక్టర్ అలసత్వమే కారణం
అదే పుష్కర యాత్రికులకు శాపం..
ఎటుచూసినా గుంతలు.. రాళ్లు రప్పలు.. పగిలిపోయిన రోడ్లు.. కుంగిపోయిన డ్రైన్లు.. ఇదీ ప్రస్తుతం నగరంలో పరిస్థితి. పుష్కర పనులు మొదలెట్టి మధ్యలోనే చేతులెత్తేయడంతో ఏర్పడిన దుస్థితి. పుష్కరాలతో నగర స్వరూపం మారిపోతుందని ఆశించిన ప్రజలకు నిరాసే మిగిలింది. శాఖల మధ్య సమన్వయలోపం, కాంట్రాక్టర్ల అలసత్వం.. వెరసి పుష్కర భక్తులకు కష్టాలు తెచ్చిపెట్టాయి.
సాక్షి, గుంటూరు: అధికారుల మధ్య సమన్వయ లోపం పుష్కర యాత్రికులకు శాపంగా మారనుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, రోడ్ల విస్తరణ చేపట్టి ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. నగరంలో రూ.20 కోట్లతో రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులు చేపట్టేందుకు ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు ఖరారు చేసి పనులు కూడా మొదలెట్టారు. పుష్కరాలు దగ్గరపడటంతో హఠాత్తుగా పనులు నిలిపేశారు. కార్పొరేషన్ అధికారులు డ్రైన్ నిర్మాణాలు పూర్తిచేసి తమకు అప్పగించాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేశారని ఆరోపిస్తూ రోడ్డు నిర్మాణాలు నిలిపేశారు. పుష్కర యాత్రికులు అధికంగా వచ్చే అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు, నల్లచెరువు రోడ్డులను కొంత మేరకు మొదలెట్టి వదిలేశారు. మిగతా పనులు పుష్కరాలు ముగిశాక చేపడతామని చెబుతుండటం గమనార్హం. రోడ్డు నిర్మాణానికి నెల రోజులకు పైగా పడుతుందని తమకు ఆలోపే క్షేత్ర స్థాయిలోని రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగించి తమకు అందించాలని ఆర్ అండ్ బీ అధికారులు నగరపాలక సంస్థ అధికారులను కోరారు.
అలా అయితే ఎందుకు ప్రారంభించాలి?
నెల రోజులకు పైగా సమయం పడుతుందన్నప్పుడు పది రోజుల కిందట అమరావతిరోడ్డు పనులు ఎందుకు మొదలెట్టారు. సదరు కాంట్రాక్టరు సుమారు 15కు పైగా పనులు తీసుకున్నారని, ఇప్పుడు మెటీరియల్, లేబర్ అందక పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టరుతో ఆర్అంyŠ బీ అధికారులు లాలూచీ పడి పనులు మధ్యలోనే నిలిపివేశారు. నగరపాలక సంస్థ గోరంట్ల శివారు ప్రాంతంలో పుష్కరనగర్ను నిర్మిస్తోంది. ఇక్కడ నుంచే భక్తులకు బస్సు సౌకర్యంతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. లాడ్జిసెంటర్ నుంచి పుష్కరనగర్కు వెళ్లే మార్గంలో గుంతల్లో వర్షం కురిసి నీరు నిల్వ ఉంటే గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రమాదాల బారినపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా రోడ్డుకు సమానంగా మట్టిని తొలితే ప్రమాదాల బారిన పడే అవకాశం తప్పుతోంది.
నాణ్యతా లోపాలు..
గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ నిర్మాణ పనుల్లో జరిగిన నాణ్యత లోపాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నిధులు విడుదల చేయాల్సిన ప్రభుత్వం పుష్కరాలకు రెండు నెలల గడువు ఉందనగా హడావుడి చేసింది. దీంతో అన్ని శాఖల అధికారులు ఒకే సారి పనులు మొదలుపెట్టడం, త్వరిత గతిన పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు హడావుడి చేయడంతో నగరంలో నిర్మించిన డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు లోపించాయి. ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతికి తెరతీశారు. సమయం తక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు సైతం పనుల్లో నాణ్యత కంటే త్వరగా పూర్తి చేయించేందుకే అధిక ప్రాధాన్యమివడం వీరికి వరంగా మారింది. ప్రధానంగా నల్లచెరవు, పొన్నూరు రోడ్డుల్లో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లేవు.
అందుకే ఆపేశాం..
ఆర్అండ్ బీ తరఫున జిల్లాలో 78 పనులు, 460 కిలో మీటర్ల రోడ్లు, డ్రైన్లు, ఇతర పనులను రూ.170 కోట్లతో చేపట్టాం. గుంటూరు నగరంలో తప్ప మిగిలిన అన్ని పనులు పూర్తిచేశాం. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు గడువులోపు వారి పనులు పూర్తిచేయలేదు. మూడు, నాలుగు రోజుల కిందటే మాకు అప్పగించారు. దీంతో ఉన్నతాధికారుల అనుమతితో పనులు నిలిపివేశాం.
రాఘవేంద్రరావు, ఆర్అండ్ బీ ఎస్ఈ
కొన్ని ప్రాంతాల్లోనే పనుల జాప్యం..
నగరంలో ఐదు ప్రాంతాల్లో ఆర్ అండ్ బీ అధికారులు పనులు చేపట్టారు. సమయం తక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నగరపాలక సంస్థ పనుల్లో జాప్యం జరిగింది. అమరావతి రోడ్డుకు సంబంధించి పదిరోజుల కిందటే ఆర్ అండ్ బి అధికారులు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు.
ఎస్.నాగలక్ష్మి, కమిషనర్