భ (ర)క్షక భటులపై ‘నిఘా’ | special enquery on police department | Sakshi
Sakshi News home page

భ (ర)క్షక భటులపై ‘నిఘా’

Published Sun, Jul 3 2016 3:49 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

భ (ర)క్షక భటులపై ‘నిఘా’ - Sakshi

భ (ర)క్షక భటులపై ‘నిఘా’

పోలీసు శాఖలో అవినీతి అధికారుల భరతం  పట్టేందుకు ఎస్పీ వ్యూహం
సివిల్‌తో పాటు, ఏఆర్ విభాగంలోనూ ప్రక్షాళన
తాజాగా ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

కడప అర్బన్: జిల్లాలో పోలీసు యంత్రాంగంపై ‘పోలీస్ బాస్’ నిఘా పెంచారు. సమాజాన్ని సంరక్షించాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడుతూ, ప్రజల సొమ్మును అప్పనంగా కాజేస్తూ , కేసులను తమ స్వార్థం కోసం ఎలాగైనా తారుమారు చేసేవారి తాట తీసేందుకు చర్యలు మొదలయ్యాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి పీహెచ్‌డీ రామకృష్ణ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూనే, మరోవైపు అవినీతి పోలీసుల భరతం పడుతున్నారు.

కేసుల నమోదు వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించినందుకు ఏకంగా ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలకు ఛార్జ్‌మెమోలను జారీ చేశారు.

ఎర్రచందనం వ్యవహారాల్లో సంబంధాలున్నాయనే ఆరోపణలు తన దృష్టికి రావడంతో దువ్వూరు ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డిని వీఆర్‌కు రప్పించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంలో రాత్రి వేళ స్వయంగా ఆయన పర్యవేక్షించి వెంటనే ఐదుగురు ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు.

ఏఆర్ విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా ఆర్‌ఐగా వ్యవహరిస్తున్న అధికారి, మరో ఆర్‌ఐ సిబ్బందిని వేధించడంతోపాటు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో వారిలో ఒకరిని వెంటనే హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగానికి, మరొకరిని అనంతపురానికి బదిలీ చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో ప్రధాన కీలక విభాగం ఎంటీఓ (మోటార్ ట్రాన్స్ పోర్టు). ఈ విభాగానికి చెందిన అధికారి  దాదాపు లక్షల్లో అవినీతికి పాల్పడ్డారని, అతనికి మరో అధికారి అండదండలు ఉండటంతోనే అప్పనంగా దోచుకున్నారని తెలియడంతో సదరు అధికారిని హెచ్చరించారు. తనపై ఎక్కడ వేటు పడుతుందోనని ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అవినీతికి పాల్పడిన అధికారి స్థానంలో మరో ఆర్‌ఎస్‌ఐని నియమించినట్లు తెలిసింది.

ఎంటీఓ సెక్షన్‌లో దాదాపు రూ. 80 లక్షల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మరో ఉన్నతాధికారితో ‘పోలీస్ బాస్’ సమగ్రంగా విచారణ చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాజాగా జిల్లాలో ముగ్గురు కానిస్టేబుళ్లను వివిధ కారణాలతో సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు ఏఆర్ విభాగానికి చెందిన వారు కాగా, మరొకరు సివిల్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.

సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తప్పవని అంటున్నారు.

ఇటీవల సంబేపల్లె ఎస్‌ఐ పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల నమోదు, విచారణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంగా వీఆర్‌కు రప్పించినట్లు సమాచారం.

కడప నగరంలో ఏకంగా ఓ ప్రధాన స్టేషన్ సీఐని, మరో స్టేషన్ ఎస్‌ఐని  ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహించాలని మూడు వారాల నుంచి అటాచ్డ్ విధులకు ఆదేశించినట్లు తెలిసింది.

జిల్లాలో ఇప్పటికే మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్‌లతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న పోలీ సు అధికారులు, సిబ్బంది జాబితాను సిద్ధం చేసి సమగ్ర విచారణ అనంతరం వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. జిల్లాలోని ఆరు సబ్ డివిజన్‌ల పరిధిలో లోతుగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ముగ్గురిని వివిధ కారణాలతో సస్పెండ్ చేస్తూ  శనివారం జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వీరిలో

సంబేపల్లె పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న టి. రాజగోపాల్ (పిసి. 1701) కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 18న జూదమాడుతూ పట్టుబడినట్లు సమాచారం. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు.

గాలివీడు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పెంచలయ్య (ఏఆర్ పిసి: 2217) గత నెల 21న నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా అతన్ని సస్పెండ్ చేశారు.

ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి. నిత్యేశ్వరయ్య (ఏఆర్ పిసి: 689) రాయచోటిలో గత నెల 20న ఓ లాడ్జిలో వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడటంతో అతన్ని సస్పెండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement