
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ రోనాల్డ్రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి తదితరులు
వీడియో కాన్పరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ
సంగారెడ్డి జోన్: కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు ఈ నెల 11న ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ప్రకటించిన 27 జిల్లాలకు తోడుగా ఇటీవల నిర్ణయించిన నాలుగు కొత్త జిల్లాలను కలుపుకోని మొత్తం 31 జిల్లాల తుది నోటిఫికేషన్ ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు జారీ చేస్తామన్నారు. 119 కొత్తమండలాలు, 20 కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా నోటిఫికే షన్ జారీ చేస్తామన్నారు.
జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నియామకానికి సంబంధించిన వర్క్ టూ ఆర్డర్ ఆదేశాలను ఆయా శాఖల అధిపతులు ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటలకే విడుదల చేస్తారన్నారు. అ«ధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేందుకు వీలుగా డ్రాఫ్ట్ ఆర్డర్ టూ సర్వ్ పత్రాలను ఈ నెల 10న తెలియజేస్తామన్నారు.
ఒక్కో శాఖకు సంబంధించి అధికారులు సిబ్బందితో కూడిన వర్క్ టూ ఆర్డర్ తెలియజేసే 31 జీవోలను జారీ చేస్తామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కలెక్టరేట్లలో పని చేసే అధికారులు, సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, డివిజన్ కార్యాలయ సిబ్బంది, మండల అధికారులు, మండల కార్యాలయాల సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలన్నారు.
11వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం నిర్దేశించిన మంత్రులు, జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించాలన్నారు. కలెక్టర్లు తమకు కేటాయించిన కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించాలని, ప్రభుత్వం నిర్ధేశించిన రీతిలో విధులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్య, జిల్లా కోశా«ధికారి వంటికార్యాలయాలను ప్రారంభించాలన్నారు. ప్రారంభ కార్యక్రమాలనీ కేవలం కొత్త జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రముఖులను , మీడియాను భాగస్వామ్యం చేసి పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.
కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ జిల్లాలో సిద్దిపేట, మెదక్లో కలెక్టరేట్లు, కార్యాలయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో కొత్తజిల్లాలో పాలనకు ఏర్పాట్లు చేసి ప్రజలకు సేవలందిస్తామన్నారు. కాన్ఫరెన్స్లో జేసీ వెంకట్రాంరెడ్డి, ఏజేసీ వాసం వెంకటేశ్వర్లు, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.