యాంటీ బయోటిక్స్ వాడితే కొనుగోలు చేయం
Published Mon, Sep 5 2016 1:04 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
భీమవరం : రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ వాడినట్టు గుర్తిస్తే ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోలు నిలిపివేయనున్నట్టు ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రకటించారు. భీమవరంలో ఆదివారం యాంటీ బయోటిక్స్ వాడకంపై ఆక్వా రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు ఆక్వా ఎక్స్పోర్టర్స్ మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం నుంచి యూఎస్ఏకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయన్నారు. మనం ఉత్పత్తి చేసే రొయ్యలు గతంలో 25 శాతం యుఎస్ఏకు ఎగుమతి అయితే ప్రస్తుతం ఆశాతం 45కు పెరిగిందన్నారు. మిగిలిన సరుకు థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. రొయ్యల్లో యాంటిబయోటెక్స్ కనిపిస్తున్నందున మన రొయ్యలను దిగుమతి చేసుకునే దేశాలు అభ్యంతరం చెబుతున్నాయని అక్కడికి వెళ్లిన రొయ్యల కంటైనర్స్ తిరిగి రావడం వల్ల తీవ్రంగా నష్టపోతామని అందువల్ల ఇక్కడే యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించి రొయ్యల కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
సమష్టిగా నిలిపేయాలి
రొయ్యల కొనుగోలుదారుల నేషనల్ కమిటీ సభ్యుడు తోట జగదీష్ మాట్లాడుతూ రొయ్యలసాగులో యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులేనని, అయితే రైతులు నష్టపోతే మొత్తం ఆక్వారంగానికే చేటు కలుగుతుందన్నారు. ఏపీ రీజియన్ ప్రెసిడెంట్ ఎ.ఇంద్రకుమార్ మాట్లాడుతూ రొయ్యలు సాగుచేసే రైతులంతా సమష్టిగా యాంటి బయోటిక్స్ వాడకాన్ని నిలిపివేస్తేనే ఆక్వారంగానికి మనుగడ ఉంటుందన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు మాట్లాడుతూ ఇటీవల రొయ్యల ధర ఆశాజనకంగా ఉండడంతో పెద్దగా ఇబ్బందులు లేవని తక్కువ కౌంట్æరొయ్యలను కూడా అధికధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టాలు లేకుండా బయటపడుతున్నారన్నారు. దిగుమతులు నిలిచిపోతే ఆక్వా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులనే బాధ్యులను
చేయడం సరికాదు
కొణితివాడ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణరాజు మాట్లాడుతూ యాంటిబయోటిక్స్ వాడకంపై కేవలం రైతులను నష్టపర్చే విధంగాకాకుండా హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు. టెక్నీషియన్స్ కూడా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన రైతు ఇంటి శ్రీరాముడు మాట్లాడుతూ యాంటీబయోటెక్స్ వాడకంపై కేవలం రైతులను బాధ్యులను చేయడం భావ్యం కాదని హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వపరంగా దాడులు చేసి యాంటీబయోటిక్స్ను అరికట్టాలన్నారు. దీనికిగాను ఆక్వా ఎక్స్పోర్టర్స్ శ్రద్ధ తీసుకుని హేచరీ యజమానులు, రైతులు, మందులు, మేతల తయారీ కంపెనీలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో ఆక్వాకల్చర్ కమిటీ నాయకులు సి.రాజగోపాలచౌదరి, వి.సత్యనారాయణరాజు, రమేష్వర్మ, జి.పవన్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement