భర్త ఇంటి ముందు వధువు ఆందోళన | wife strikes at husband home | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు వధువు ఆందోళన

May 3 2017 11:32 PM | Updated on Sep 5 2017 10:19 AM

భర్త ఇంటి ముందు వధువు ఆందోళన

భర్త ఇంటి ముందు వధువు ఆందోళన

ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. మంచి సంబంధం అనుకొని వివాహంతో ఒక్కటయ్యారు.

అనంతపురం సెంట్రల్‌ : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. మంచి సంబంధం అనుకొని వివాహంతో ఒక్కటయ్యారు. పెళ్లై పట్టుమని ఐదు నెలలు కూడా గడవలేదు. అప్పుడే మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధిపులు తట్టుకోలేని వధువు భర్త ఇంటి ముందు బుధవారం ఆందోళన దిగింది. న్యాయం కోసం గంటల కొద్దీ బైఠాయించి నిరసన చేస్తున్నా పోలీసు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఘటన అనంతపురం విద్యుత్‌నగర్‌ సర్కిల్‌ సమీపంలోని కృపానందనగర్‌లో బుదవారం జరిగింది. పోలీసు శాఖలో ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వీరన్న కుమారుడు నాగరాజు వివాహం నార్పల మండలానికి చెందిన రంగప్ప కుమార్తె ఉషారాణితో గత ఏడాది డిసెంబర్‌ 11న అయింది.

నాగరాజు మడకశిరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ శాఖలో జేఈగా పని చేస్తున్నారు. ఉషారాణి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ జంట వైవాహిక జీవితం తొలినాళ్లలో ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే నాగరాజు మడకశిరలోనే ఉంటూ వారానికోసారి ఇంటికొచ్చి వెళ్లేవాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అత్త, మామతో పాటు ఆడపడుచులు కూడా ఇంట్లోనే ఉంటుండడంతో ఉషారాణిని సూటిపోటి మాటలతో వేధించేవారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలు పంచాయితీలు కూడా చేశారు. 

భర్తకు చెప్పినా కుటుంబ సభ్యులకే మద్దతు పలుకుతుండడంతో వేధింపులు తాళలేని బాధితురాలు పుట్టింటివారితో కలసి భర్త ఇంటి ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే పోలీసులు అటువైపు కన్నె‍త్తి చూసిన పాపాన పోలేదు. ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కుమారుడు కావడంతోనే పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బా«ధితురాలు ఉషారాణి,  ఆమె తండ్రి రంగప్ప అన్నారు. అనంతరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ యల్లమరాజును కలసి జరిగిన అన్యాయాన్ని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement