
‘సీఐ తన ఇంటికి రమ్మన్నారు’
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి
- న్యాయం జరగకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటున్న మేనమామ
- వివాదంలో ఏలూరు టూ టౌన్ సీఐ
ఏలూరు : కేసు పెడితే న్యాయం చేయకుండా సీఐ తనను ఇంటికి రమ్మంటున్నారని ఒక యువతి జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కి ఫిర్యాదు చేసింది. తన మేనకోడలికి న్యాయం చేయకపోతే బుధవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ఆ యువతి మేనమామ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన ఒక యువతిని ఫత్తేబాద్కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమపేరుతో వలలో వేసుకున్నాడు. అమ్మ, నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ యువతి అమ్మమ్మ, తాత, మేనమామల వద్ద ఉంటోంది.
పదో తరగతి చదివిన ఆ యువకుడు తాను ఎంబీఏనంటూ ఆ యువతిని మోసం చేశాడు. వివిధ కారణాలు చెబుతూ ఆ యువతి నుంచి రూ.మూడు లక్షల వరకూ వసూలు చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఏప్రిల్లో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత యువకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తర్వాత మళ్లీ ఆ యువకుడితో పెళ్లి చేయించాలంటూ స్టేషన్ ముందు ఆందోళన చేసింది.
దీనిపై టూటౌన్ సీఐ బంగార్రాజు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత యువకుడిపై కేసు పెడితే ఉద్యోగం పోతుందని అతని స్నేహితుడు అమ్మాయి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయంపై కూడా ఆ యువతి ఫిర్యాదు చేయడంతోపాటు తనకు న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆ యువకుడిపై ఈవ్టీజింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
అయితే ఈ కేసు విషయంలో సీఐ తనను ఇంటికి పిలిపించి కౌన్సెలింగ్ పేరుతో అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ బంగార్రాజు వివరణ ఇస్తూ ఇప్పటికే ఆ అమ్మాయి మూడుసార్లు ప్రేమించిన యువకుడి కోసం ఆత్మహత్యాయత్నం చేసిందని, అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. తాను అమ్మాయికి ఫోన్ చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.