అండగా ఉంటా.. అధైర్యం వద్దు | YS Jagan Mohan Reddy Raithu Barosa Yatra | Sakshi
Sakshi News home page

అండగా ఉంటా.. అధైర్యం వద్దు

Published Thu, Jan 7 2016 3:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అండగా ఉంటా.. అధైర్యం వద్దు - Sakshi

అండగా ఉంటా.. అధైర్యం వద్దు

♦ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
♦ తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య... అనాథలైన బిడ్డలు
♦ వారి చదువు బాధ్యత తీసుకుంటామని జగన్ హామీ
♦ నాల్గోవిడత రైతు-చేనేత భరోసా యాత్ర ఆరంభం
♦ తొలిరోజు మూడు కుటుంబాలకు పరామర్శ
♦ నేడు ధర్మవరం చేనేత కార్మికులతో ముఖాముఖి
 
 రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘మీకు ఎలాంటి కష్టమొచ్చినా అధైర్యపడకండి. అండగా నేనుంటా. మీకు న్యాయం జరిగే వరకు  ప్రభుత్వంతో పోరాడతా. అయినా స్పందించకపోతే అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తా’అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. వారి కన్నీటి గాథలను విని ఆయన కదిలిపోయారు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలుగా మారిన ఇద్దరు చిన్న పిల్లలను చూసి ఆయన కంటనీరు ఉబికింది. ఆ బిడ్డల చదువుల బాధ్యతలను తాము తీసుకుంటామని బంధువులకు జగన్ హామీ ఇచ్చారు.

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నాల్గో విడత భరోసా యాత్ర బుధవారం ప్రారంభమైంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా ఉదయం 11 గంటలకు కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ జగన్‌కు అనంతపురం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి ధర్మవరం చేరుకున్నారు.

 పరామర్శిస్తూ... ధైర్యం నింపుతూ..
 పట్టణ శివార్లలోని వైఎస్సార్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతులు చట్టా రమేష్, చట్టా రమాదేవి  కుటుంబాన్ని, చేనేత కార్మికుడు కప్పల నారాయణస్వామి కుటుంబాన్ని పరామర్శించారు.  ప్రభుత్వం నుంచి తమకేమీ పరిహారం కానీ, చేయూత కానీ లభించలేదని వారు తెలిపారు. వారి పిల్లలతో, బంధువులతో మాట్లాడి, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువుల బాధ్యత చూస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు..  ఎన్నికల ముందు చేనేత రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేయడం వల్ల కార్మికులంతా బ్యాంకుల దృష్టిలో ఎగవేతదారులు(డిఫాల్టర్లు) అయ్యారని, అందువల్ల కొత్త రుణాలేవీ పుట్టలేదనే విషయం వైఎస్ జగన్ దృష్టికి వారు తీసుకొచ్చారు.

‘భర్త చనిపోవడంతో ఉన్న ఒక్క కొడుకును చదివించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నానని, కూలీ పనులకు వెళ్లినా ఇళ్లు గడవని పరిస్థితి నెలకొందని, మీరే ఆదుకోవాలని’ కన్నీరుమున్నీరైన కప్పల నారాయణస్వామి భార్య ముత్యాలమ్మను వైఎస్ జగన్ ఓదారుస్తూ ‘మీకు అండగా ఉంటాను. మీ కుమారుడిని చదివించే బాధ్యత తీసుకుంటాం’ అని ఆమెకు భరోసా ఇచ్చారు. అనంతరం పట్టణంలోని లోనికోటలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు గవ్వల కుళ్లాయప్ప కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. కుళ్లాయప్ప భార్య తిప్పమ్మ, కుమారులు రాజశేఖర్, మురళీ, ప్రసాద్, కుమార్తెలు ఉమాదేవి, లక్ష్మితో జగన్ మాట్లాడారు. రైతృు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.  మీ కుటుంబానికి అండగా ఉంటానని జగన్ వారికి హామీ ఇచ్చారు. కుళ్లాయప్ప కుమార్తె లక్ష్మీ డిగ్రీ చదువుతుండడంతో ఉన్నత చదువులు లేదా ప్రైవేటు ఉద్యోగం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

 నేతన్నలతో సమావేశం..
 జగన్ గురువారం ఏడు చేనేత కార్మిక కుటుంబాలను పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ధర్మవరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా చేనేత కార్మికులతో సమావేశమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement