
'పయ్యావుల సోదరులవి హత్యా రాజకీయాలు'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు.
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. హత్యారాజకీయాలకు కేంద్ర బిందువులు పయ్యావుల సోదరులు అని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో రైతులను బెదిరించి, మభ్యపెట్టి వారి నుంచి అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులు వేల ఎకరాలను హస్తగతం చేసుకున్నారని తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
రైతులను బెదిరించి నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పయ్యావుల భూములను కూడబెట్టారని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినందునే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి భూకంభకోణంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేత శంకర్ నారాయణ విజ్ఞప్తి చేశారు.